
బీసీల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు
పెనమలూరు : రాష్ట్రంలో బీసీల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆ శాఖ మంత్రి కొల్లురవీంద్ర తెలిపారు. తాడిగడప గ్రామంలో బుధవారం ఏపీ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర బీసీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్ సమన్వయంతో బీసీల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. 8 ఫెడరేషన్లకు పాలకవర్గాలను నియమించామని, వాటి కార్యాలయాలను కూడా 15 రోజుల్లో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది వెనుకబడిన తరగతుల వారికి రూ.400 కోట్లతో 50 వేల మందికి యూనిట్ రూ.2 లక్షలు చొప్పున రుణాలు అందజేస్తామని తెలిపారు. బీసీ వసతి గృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చుతున్నామని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో రూ.5 కోట్లతో బీసీ భవన్లు ఏర్పాటు చేస్తున్నామని, బీసీలకు త్వరలో మేఘా జాబ్మేళా నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ చైర్మన్ పి.రంగనాయకులు, పెనమలూరు ఎమ్మెల్యే బోడెప్రసాద్, ఎంపీపీ బొర్రా కనకదుర్గ, డైరెక్టర్ హర్షవర్థన్, డైరెక్టర్లు బొల్లా వెంకన్న, నిడుమోలు సుబ్రహ్మణ్యం, పి.చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.