హలో అంటూ దోచేస్తారు !
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సైబర్ నేరగాళ్లు అనుకూలంగా మలుచుకుని మోసాలకు పాల్పడుతున్నారు.
► సైబర్ నేరగాళ్ల జోరు
►ఏటీఎం పిన్ చెబితే ఖాతాలో నగదు ఖాళీ
►నిందితులు జిమ్తార వాసులుగా అనుమానం
సైదాపురం మండలం మర్లపూడికి చెందిన వరదబండి శ్రీనివాసులరెడ్డికి ఇటీవల ఫోను వచ్చింది. హైదరాబాద్ ఎస్బీఐ ప్రధాన బ్రాంచ్ నుంచి ఫోనుచేస్తున్నాని ఓ వ్యక్తి మాట కలిపాడు. మీ ఏటిఎం కార్డు బ్లాక్ అయిందని వివరాలు చెబితే తిరిగి వినియోగంలోకి తెస్తామని నమ్మబలికాడు. నమ్మిన శ్రీనివాసులురెడ్డి అన్ని వివరాలు తెలిపాడు. అరగంట తర్వాత ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ. 23వేలు డ్రాచేసినట్లు ఫోనుకు సమాచారం వచ్చింది.
బుజబుజనెల్లూరులో నసీర్ అహ్మద్కు స్థానిక సిండికేటు బ్యాంకులో ఖాతా ఉంది. ఓ అపరిచిత వ్యక్తి బ్యాంకు నుంచి అంటూ ఫోన్ చేశాడు. ఏటీఎం ఖాతాను అప్డేట్ చేస్తున్నామని వివరాలు, పిన్ నంబర్ తెలుసుకున్నాడు. తర్వాత రోజు నసీర్అహ్మద్ ఖాతా నుంచి రూ. 10వేలతో ఆన్లైన్లో గృహోపకరణాలు కొన్నట్లు మెసేజ్ వచ్చింది.
నెల్లూరు ప్రశాంతినగర్కు చెందిన కె. శ్రీనివాసులుకు రెండు రోజుల క్రితం ఓ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. తాను బ్యాంకు ఉద్యోగినంటూ ఓ వ్యక్తి మాట కలిపాడు. అప్డేట్, ఆధార్ లింకేజ్ చేయాలని చెప్పి బ్యాంకుఖాతా, క్రెడిట్, డెబిట్ నంబర్లు చెప్పమన్నాడు. అనుమానంతో శ్రీనివాస్ అతనిని గట్టిగా నిలదీయడంతో ఫోను స్విచ్ఛాఫ్ చేశాడు. ఇలా ఇలా సైబర్ నేరగాళ్లు ఎందరినో మోసం చేస్తున్నారు. శ్రీనివాసులు లాంటి వారు అప్రమత్తమైతే తప్ప మిగిలిన వారు నిలువునా మోసపోయి పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
నెల్లూరు(క్రైమ్): అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సైబర్ నేరగాళ్లు అనుకూలంగా మలుచుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా బ్యాంకు ఖాతాదారులపై దృష్టిసారించారు. బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి ఫోనుచేస్తున్నామని మాటలు కలిపి క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు సేకరించి క్షణాల్లో నగదు కాజేస్తున్నారు. ప్రతి వ్యక్తికి బ్యాంకు ఖాతా తప్పనిసరి కావడంతో బ్యాంకు ఖాతాదారుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. దీంతో ఏటీఎంలు, మొబైల్, నెట్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటì పై సరైన అవగాహన లేక తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో ంతోమంది సైబర్ నేరగాళ్ల చే తుల్లో చిక్కి మోసపోతున్నారు. ఇక ఎటిఎం సెంటర్లలో సహాయం చేస్తున్నట్లు నటిస్తూ....దృష్టిమరల్చి నగదు కాజేసే వారి సంఖ్య ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
అప్డేట్, ఆధార్లింకేజ్ పేర్లతో వల....
క్రెడిట్, డెబిట్ కార్డులు కల్గిన వారికి ఫోన్లు చేస్తారు. ఖాతాదారుని పేరు, ఏ బ్యాంకు కార్డు వినియోగిస్తున్నారో చెప్పి...బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకుంటున్నారు. డెబిట్ కార్డును ఆధార్తో లింక్ చేయాలనో, కెడ్రిట్ కార్డు వివరాలను అప్లోడ్ చేయాలనో చెబుతున్నారు. బ్యాంకులు జారీచేసే కార్డులపై ఉండే నెంబర్లలో మొదటి నాలుగైదు అంకెలు ఒకే సిరీస్వి కావడంతో వాటిని ముందుగా చెప్పి మిగతా అంకెలు అడుగుతున్నారు. ఆపై సీవీవీ కోడ్ తెలుసుకొని కొద్దిసేపట్లో మీకు వన్టైమ్ పాస్వర్డు వస్తుందనీ, అది కూడా చెప్తెనే లింకేజ్, అప్గ్రేడ్ పూర్తవుతుందని నమ్మిస్తున్నారు. ఇలా అన్ని వివరాలు తెలుసుకొన్నాక వారి ఖాతాలోని నగదును తమ ఖాతాల్లోకి మార్చుకోవడం, ఆన్లైన్లో కొనుగోలు చేయడం చేస్తూ టోకరా వేస్తున్నారు. బ్యాంకు ఖాతా ఉన్నట్లు నేరగాళ్లకు ఎలా తెలుçస్తున్నదనేది అందరికి వచ్చే అనుమానం. బ్యాంకు సిబ్బందిలో కొందరితో సైబర్ నేరగాళ్లు సంబంధాలు పెట్టుకుని పనికానించేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వివిధ బ్యాంకులకు చెందిన కాల్సెంటర్లలో పనిచేసిన వారు ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.
జమ్తారా వాసులు...?
ఈ తరహా నేరాలకు పాల్పడే వారు జార్ఖండ్ నుంచి పశ్చిమబెంగాల్ వెళ్లే మార్గంలో ఉన్న జిమ్తారా వాసులుగా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇక్కడికి చెందిన అనేకమంది దేశవ్యాప్తంగా పలు బ్యాంకుల్లోని కస్టమర్ కేర్ సెంటర్లలో పనిచేసి మానివేశారు. వారు ఆయా బ్యాంకుల్లోనుంచి ఖాతాదారుల వివరాలను సేకరించి సైబర్ నేరాలకు నాందిపలికినట్లు సమాచారం. బ్యాంకుల్లోని కిందిస్థాయి, ఔట్సోర్సింగ్ సిబ్బందితో పాటు అనేక మార్గాల్లో డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు సేకరించి ఈ తరహానేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల కాలంలో అందరి ఫోన్లలోనూ ట్రూకాలర్ తరహా యాప్స్ ఉంటున్నాయి. దీంతో నిందితులు బోగస్ పేర్లు, చిరునామాలతో సిమ్కార్డులు తీసుకొని బ్యాంకు అధికారులంటమూ ఫోన్లుచేసి బురిడీ కొట్టిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తమవ్వాలని, బ్యాంకు అధికారులు ఎవరూ ఫోన్ చేయరనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.