నగర కార్యవర్గ సమావేశంలో ప్రసంగిస్తున్న పైడి వేణుగోపాలం
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం నగర కార్పొరేషన్ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం అన్నారు. నగర కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా పొత్తుతో సంబంధం లేకుండా బీజేపీ తరఫున అభ్యర్థులను నిలబెడతామని తెలిపారు. బీజేపీ నగర శాఖ అధ్యక్షులు చల్లా వెంకటేశ్వరరావు ఆధ్యక్షతన నగర కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన శ్రీకాకుళం నగర కార్యవర్గ సమావేశంలో వేణుగోపాలం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి టీడీపీతో పొత్తులు పక్కనపెడతామని, వార్డుల్లో సమస్యలను పరిష్కారం చేయటానికి కృషిచేస్తామన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు సహకరించాలని ఆయన కోరారు. కిసాన్ మోర్ఛా రాష్ట్ర అధ్యక్షులు పూడి తిరుపతిరావు, జిల్లా అధ్యక్షులు కోటగిరి నారాయణరావులు మాట్లాడుతూ జిల్లాతోపాటు శ్రీకాకుళం నగరంలో ప్రజలు బీజేపీ పక్షానే ఉన్నారని అన్నారు. ఆన్లైన్ ద్వారా 30వేల వరకు సభ్యత్వం తీసుకోవడమే ఇందుకు ఉదాహరణగా చెప్పారు. చల్లా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం నగరంలో జరుగుతున్న ఏ అభివృద్ధి కార్యక్రమమైనా కేంద్ర నిధులతోనే జరుగుతోందని గుర్తించాలని తెలిపారు. కార్యక్రమంలో దుప్పల రవీంద్రబాబు, పైడి సత్యం, కద్దాల ఈశ్వరమ్మ, ఎస్.నాగేశ్వరరావు, ఎస్.రమణమూర్తి, ఎం.వెంకటరావు, మురళీమోహన్, కృష్ణమూర్తి, రమేష్బాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.