
బ్యాంకులకు సెలవులు.. డబ్బులకు ఇబ్బందే..?
♦ రేపటి నుంచి బ్యాంకులకు 4 రోజులు సెలవు
♦ గురువారం మిలాద్ ఉన్ నబీ
♦ శుక్రవారం క్రిస్మస్
♦ శని, ఆది సాధారణ సెలవులు
♦ కోట్ల లావాదేవీలకు ఇబ్బందే
కొరిటెపాడు(గుంటూరు) : బ్యాంకులకు రేపటి నుంచి వరుసగా నాలుగు రోజులు సెలవులు. గురువారం మిలాద్ ఉన్ నబీ, శుక్రవారం క్రిస్మస్, నెలలో 4వ శనివారం సెలవు, ఆదివారం సాధారణ సెలవు. నాలుగు రోజులు వరుసగా బ్యాంకులు మూతపడే పరిస్థితి. రిజర్వు బ్యాంక్ నియమావళి ప్రకారం వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవు ప్రకటించిన సందర్భాలున్నాయి. నాలుగు రోజులు సెలవు అనేది సాధ్యపడే విషయం కాదు. ఇటీవల నెలలో రెండు శనివారాలు బ్యాంకులకు సెలవు, మరో రెండు శనివారాలు పూర్తి పని వేళలకు ఒప్పందం కుదిరింది. దీంతో రెండు, నాల్గవ శనివారం బ్యాంకులకు పూర్తి సెలవు ఇస్తున్నారు.
వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడితే ఆర్ధిక లావాదేవీలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోతాయని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో వారం రోజుల్లో మూడు త్రైమాసికాలు ముగుస్తాయి. 9 నెలల కాలంలో ఆర్ధిక లావాదేవీలలో పురోభివృద్ధి కనిపించలేదు. మూడో త్రైమాసికాంతంలో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడితే ఆర్ధిక అసమతుల్యత తప్పదు.
గురు, శుక్రవారం బ్యాంకులకు సెలవు అనివార్యమైతే రిజర్వుబ్యాంక్ నిర్ణయం మేరకు శనివారం బ్యాంకులు తెరిచే అవకాశం ఉందని, సంబంధిత ఉద్యోగులకు అదనపు భత్యం ఇచ్చి శనివారం బ్యాంకులు తెరిచే అవకాశాలు ఉంటాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు భావిస్తున్నారు. మొబైల్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సదుపాయం ఉన్న కారణంగా రిజర్వుబ్యాంక్ వరుస సెలవులపై పెద్దగా స్పందించక పోవచ్చని మరో వర్గం ఉద్యోగులు భావిస్తున్నారు.
ఏటీఎం క్యాష్ అడ్మినిస్ట్రేషన్ సెల్ సదుపాయం ఉన్న అన్ని బ్యాంకుల ఏటీఎంలలో శనివారం నగదు నిల్వలు నింపుతామని అధికారులు పేర్కొంటున్నారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను పురష్కరించుకొని బ్యాంకులలో నగదు చలామణి ఉంటుంది. గురు, శుక్రవారాలు బ్యాంకులు మూతపడితే శనివారం పనిదినంగా ప్రకటించాలని వ్యాపార వర్గాలు కోరుతున్నాయి.