రేపటి నుంచి రాష్ట్రస్థాయి టీటీ పోటీలు
గోపన్నపాలెం (దెందులూరు): అంతర్ జిల్లాల రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు గురువారం నుంచి 6వ తేదీ వరకు ఏలూరు సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తామని టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి పీవీకేడీ ప్రసాద్ చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా టేబుల్టెన్నిస్ అసోసియేషన్, సీఆర్ఆర్ విద్యాసంస్థలు సంయుక్తంగా పోటీలు నిర్వహించనున్నాయని చెప్పారు. 13 జిల్లాల నుంచి 450 మంది క్రీడాకారులు, 10 మంది అఫీషియల్స్, కోచ్లు, మేనేజర్లు పాల్గొంటారన్నారు.
5 కేటగిరీలుగా పోటీలు
మహిళలు, పురుషులు వయో పరిమితి లేదు.
యువజనులు మహిళలు, పురుషులు 21 ఏళ్లలోపు
జూనియర్ బాలబాలికలు 18 ఏళ్లలోపు
సబ్ జూనియర్ బాలబాలికలు 15 ఏళ్లలోపు
క్యాడెట్ బాలబాలికలు 11 ఏళ్లలోపు
పై కేటగిరీల్లో వ్యక్తిగత పోటీలు నిర్వహిస్తారు. టీమ్ చాంపియన్షిప్ పురుషులు, మహిళలు, జూనియర్ బాలుర విభాగంలో పోటీలు జరుగుతాయి.
అన్ని కేటగిరీల్లో మొదటి మూడు స్థానాలు సాధించిన క్రీడాకారులకు మెరిట్ సర్టిఫికెట్లు, మెడల్స్, నగదు బహుమతులు అందిస్తారు. క్రీడాకారులకు ఉచిత భోజన వసతి, బాలురకు వట్లూరు కళాశాల సూర్య హాస్టల్ నందు, బాలికలకు సీఆర్ఆర్ మహిళా కళాశాలలో, టెక్నికల్ అఫిషియల్కు ఏలూరు విద్యానగర్లో, సోషల్ సర్వీస్ సెంటర్ నందు ఏర్పాట్లు చేశారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపికచేస్తారు.
దాతల సాయం
జిల్లా జట్టుకు, టెక్నికల్ అఫిషియల్స్కు యూనిఫాంను కనకమహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ అధినేత కొమ్మారెడ్డి రాంబాబు అందించనున్నారు. విజేతలకు నగదు బహుమతిని ఏలూరు క్లబ్ (టౌన్హాల్) స్పాన్సర్ చేస్తున్నారు. స్టాగ్ కంపెనీ నాలుగు అంతర్జాతీయ టేబుల్స్ను స్పాన్సర్ చేస్తోంది. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొమ్మారెడ్డి రాంబాబు, చీఫ్ ప్యాట్రన్ ఉప్పలపాటి శ్రీరాంప్రసాద్ పోటీలను పర్యవేక్షిస్తారు.