సత్వర న్యాయమే లోక్ అదాలత్ లక్ష్యం
-
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్
నెల్లూరు(లీగల్): ప్రజలకు సత్వర సమన్యాయం అందించడమే జాతీయ లోక్అదాలత్ లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికారసంస్థ చైర్మన్ మౌలానా జునైద్ అహ్మద్ అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికారసంస్థల ఉత్తర్వుల మేరకు శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాసదన్ భవనంలో జాతీయ లోక్అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ విస్తృతంగా న్యాయసేవలు అందించడంతోపాటు తక్షణ పరిష్కారం లోక్అదాలత్లో జరుగుతుందని తెలిపారు.
85 కేసుల పరిష్కారం..
జాతీయ లోక్అదాలత్ సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణంలో 5 బెంచీలను ఏర్పాటు చేశారు. అదనపు జిల్లా జడ్జిలు పాపిరెడ్డి, శ్రీరామచంద్రమూర్తి, న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సత్యవాణి, జూనియర్ సివిల్ జడ్జిలు పద్మ, హేమలత, ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించి 85 కేసులను పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టులలో నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లో 300 కేసులను పరిష్కరించి మోటారు ప్రమాద కేసులలోని పిటీషనర్లుకు పరిహారంగా రూ.1,86,31,408 చెల్లించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి శ్యామలాదేవి, మేజిస్ట్రేట్లు శోభారాణి, వాసుదేవన్, అరుణశ్రీ, జూనియర్ సివిల్ జడ్జి కేశవ్, బ్యాంక్, అధికారులు, న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.