
'జన ఔషది' లోపాలు సరిచేయండి
లోక్సభలో ఎంపీ కవిత
నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి జన ఔషధి యోజన పథకం మందుల పంపిణీలో లోపాలను సరిచేయాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కవిత మాట్లాడారు. ఏపీలోని విజయవాడలో డ్రగ్ స్టోర్లు ఉన్నాయని, ఇక్కడ ఆ స్టోర్లు లేక సరఫరాలో లోపాలు వస్తున్నాయన్నారు. కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకం పనితీరు బాగుందని, అయితే క్షేత్రస్థాయిలో ఈ మందులు సరఫరా కావడం లేదని ఆమె పేర్కొన్నారు.
దీంతో నిరుపేదలు ఈ షాపులకు వచ్చి మందులు లేక వెనుదిరుగుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మూడు వేల షాపులు తెరిచిందని, అమృత్ పథకం కింద మరో 300 షాపులు తెరవాలని భావిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ పథకాన్ని అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు.