లారీని ఢీకొన్న ట్రాక్టర్: ఒకరు మృతి
-
ముగ్గురి పరిస్థితి విషమం
-
ఐదుగురికి తీవ్రగాయాలు
చిల్లకూరు : ఉపాధి పనుల కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ లారీని ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఐదుగురు గాయపడ్డారు. పోలీసుల సమాచారం మేరకు చేడిమాల పంచాయతీ నల్లాయగారిపాళెంకు చెందిన ఉపాధి కూలీలు గ్రామంలో కొంత మందికి ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో పనులు చేస్తున్నారు. అక్కడికి వెళ్లేందుకు కూలీలు ట్రాక్టర్లో బయలు దేరారు. చేడిమాలకు సమీపంలోకి వచ్చే సరికే మలుపు వద్ద ముందు వెళుతున్న లారీ ఆకస్మికంగా ఆగింది. దీన్ని తప్పించబోయిన ట్రాక్టర్ డ్రైవర్ ముందు ఇంజను దాటుకున్నప్పటికి ట్రక్కు లారీకి తగిలి పక్కకు ఒరిగి పోయింది. దీంతో ట్రక్కులో కూర్చొన్న 30 మంది కూలీలు ఒకరిపై ఒకరు పడి పోయారు. ఎనిమిది మందికి త్రీవగాయాలు కాగా పలువురికి స్వల్పగాయాలయ్యాయి. వీరిని ఆటోల్లో స్థానికులు గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మందా ఈశ్వరమ్మ (38) మృతి చెందింది. బాణాల చెంగయ్య, తాబాక రమణమ్మ, పారిచెర్ల కృష్ణవేణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై అంకమ్మ, ఏఎస్ఐ నాగేశ్వరరావు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.