
వివాహిత హత్య
♦ చేతి రుమాలుతో మెడకు ఉరి
♦ నర్సాపూర్ మండలంలో ఘటన
నర్సాపూర్ రూరల్: చేతి రుమాలుతో మెడకు ఉరి బిగించి దుండగులు ఓ వివాహితను హతమార్చారు. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి మండలం పోతురెడ్డిపల్లికి చెందిన నీరుడు నవీన అలియాస్ సంతోష (25) శనివారం ఉదయం తుల్జారాంపేట గిరిజన తండా సమీపంలో హత్యకు గురైన స్థితిలో పడి ఉంది. సంఘటన స్థలంలో నీటి ప్యాకెట్లు, మద్యం సీసా ఉన్నాయి. సంతోష శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించడం లేదంటూ ఆమె తండ్రి సంగారెడ్డి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. శనివారం ఉదయం తుల్జారాంపేట తండా సమీపంలో మహిళ మృతదేహం పడి ఉందని నర్సాపూర్ పోలీసులు సంగారెడ్డి ఎస్పీ కార్యలయానికి సమాచారమిచ్చారు.
దీంతో సంగారెడ్డి రూరల్ పోలీసులు వివిధ ఆధారాలు తెలిపి ఆరా తీసిన మీదట సంతోష తండ్రికి తెలిపారు. ఆయనతో పాటు ఇతర కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి వచ్చి సంతోషను గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు నర్సాపూర్ సీఐ తిరుపతిరాజు, ఎస్ఐ వెంటరాజుగౌడ్ తెలిపారు. కాగా, తన కుమార్తె సంతోషను అల్లుడు బాలకృష్ణే హతమార్చాడని హతురాలి తండ్రి జవాన్ నర్సింహ ఆరోపించారు. వీరికి కుమార్తె అక్షయ (3) పుట్టినప్పటి నుంచి కట్నం వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. ప్రస్తుతం సంతోష ఐదు నెలల గర్భవతి అని చెప్పారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.