‘మీ ఇంటికి మీ భూమి’లో మెుదటిస్థానం
15 నాటికి సాధికార సర్వే మెుదటిదశ పూర్తి
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ
గొల్లప్రోలు: ‘మీ ఇంటికి మీభూమి’ కార్యక్రమం నిర్వహణలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానం పొందిందని, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో రెండో స్థానంలో ఉందని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. మండల రెవెన్యూ కార్యాలయ నిర్మాణానికి ఆయన బుధవారం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సిబ్బంది చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. ఆన్లైన్ ద్వారా 1,80,600 దరఖాస్తులు రాగా 73 వేల దరఖాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కృతమయ్యాయన్నారు.
వివిధ కారణాలతో 30,800 దరఖాస్తులను తిరస్కరించినట్టు తెలిపారు. ఆన్లైన్ నమోదు, కుటుంబతగాదాలు, ప్రత్యేక కారణాలతో పలు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఆన్లైన్ పనుల్లో సిబ్బంది ప్రలోభాలకు గురవడం వంటి ఆరోపణలు సత్యదూరమన్నారు. ప్రతి నియోజకవర్గంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి రెవెన్యూపరమైన సమస్యలను పరిష్కరించడానికి అధికారుల బృందం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పిఠాపురం నియోజకరవర్గానికి సంబంధించి గొల్లప్రోలు మండలంలో చెందుర్తి గ్రామాన్ని ఎంపిక చేశామన్నారు.
7, 8, 9 తేదీలలో ఆయా గ్రామాలకు సంబంధించి డెస్క్వర్క్ నిర్వహించడం, 10, 11 తేదీలలో సమస్యలను గుర్తించడం, 13న డిప్యూటీ కలెక్టరు ఆధ్వర్యంలో తహసీల్దార్, మండలసర్వేయర్, వీఆర్ఓలు, మీసేవా ఆపరేటర్లు బృందంగా ఏర్పడి తక్షణం సమస్యలు పరిష్కరించడం జరుగుతాయన్నారు. మొదటి దశ ప్రజాసాధికారసర్వే ఈనెల 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ఇప్పటి వరకూ 12 మండలాల్లో వందశాతం పూర్తయిందన్నారు. ఇంతవరకూ 28,76,093 కుటుంబాలను సర్వే చేసినట్టు చెప్పారు. 11 ఏజెన్సీ మండలాలు, నెట్వర్క్లేని మండలాల్లో సర్వే చేపట్టాల్సి ఉందన్నారు. రెండవ విడతగా కొత్తపల్లి, తాళ్లరేవు, రౌతులపూడితో పాటు కోనసీమలోని 6 మండలాల్లో సర్వే ప్రారంభమైందన్నారు. ఆయన వెంట తహసీల్దార్ వై.జయ, డిప్యూటీ తహసీల్దార్ రామరాజు తదితరులు ఉన్నారు.