పాతవంతెనపై విధ్యుత్లైట్లు ఏర్పాటు చేయని దృశ్యం.
నగరం నడిబొడ్డున నిర్మించిన రెండు భారీ వంతెనలను ఇటీవల ఆర్భాటంగా ప్రారంభించారు. అయితే, వంతెనలపై పగటి పూట ప్రయాణం సౌకర్యంగా ఉన్నా రాత్రి ప్రయాణించాలంటే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందు చూపుతో గత ప్రభుత్వ హయాంలో అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కృషి ఫలితంగా వంతెనలు మంజూరు చేసిన విషయం విధితమే. వంతెనలపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయకపోవడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. వంతెనల నిర్మాణం ఎప్పుడో పూర్తయినా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయలేదని సాకుతో ప్రారంభించడంలో తీవ్ర జాప్యం చేసిన పాలకులు, ఇప్పుడు ఆ పనులు చేయకుండానే ప్రారంభించారు. ఇదే పని రెండు నెలల క్రితమే చేసి ఉంటే ప్రజలకు కొంత కష్టాలు తప్పేవని పలువురు చెబుతున్నారు. గుజరాతిపేటలో ఇటీవల నిర్వహించిన జగన్నాథ ఉత్సవాలకు సైతం నదిలో నుంచి నడుచుకొని వెళ్లవలసి వచ్చిందని, కొంత కాలం వంతెనపై అడ్డుగా ఇనుప రాడ్లు వేసి రాకపోకలను అడ్డుకున్నారని, ఇవన్నీ ఎందుకు చేసినట్టని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి వంతెనలపై విద్యుత్ దీపాలు వేయించేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.