లారీ ఢీకొని చిరువ్యాపారి దుర్మరణం
Published Sun, Dec 25 2016 1:59 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
కుమారదేవం (కొవ్వూరు రూరల్) : ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో కుమారదేవం గండిపోచమ్మ ఆలయం వద్ద ఏటిగట్టు రోడ్డుపై ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమండ్రి హుకుంపేట రోడ్డు బాలాజీపేటకు చెందిన కంభం శ్రీనివాసరావు (35) రైల్వేస్టేషన్లో తినుబండారాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం స్కూటర్పై జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో బంధువుల ఇంటికి పలకరింపునకు వెళ్లాడు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో కొవ్వూరు మండలం కుమారదేవం గండిపోచమ్మ ఆలయం మలుపు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న భారీ లారీ ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు ఘటనాస్థలానికి తరలివచ్చారు. కొవ్వూరు రూరల్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు వివరాలు సేకరించి మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement