ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
ఒంగోలు క్రైం : ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఒంగోలు వన్టౌన్ పోలీస్స్టేషన్లో బుధవారం రాత్రి నమోదు చేసిన ఈ కేసు వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. తెలుగు మాదిగ మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తాడిపర్తి జాన్ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒంగోలు ఒన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏప్రిల్ 14వ తేదీన స్థానిక అంబేద్కర్నగర్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి కార్యక్రమం పలు దళిత సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జనార్దన్ కులం పేరుతో తనను దూషించినట్లు వన్టౌన్ పోలీస్స్టేషన్లో జాన్ప్రకాష్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఒన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును పోలీస్ ఉన్నతాధికారులు ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీల్లో ఒకరికి దర్యాప్తు నిమిత్తం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. జాన్ప్రకాష్కు ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్కు మధ్య కొంతకాలంగా వివాదాలున్నాయి. గతంలో ఎమ్మెల్యే జనార్ధన్పై అసభ్యకరంగా ఫ్లెక్సీలు వేసినందుకుగాను ఒంగోలు టూటౌన్ పోలీస్స్టేషన్లో జాన్ప్రకాష్పై కేసు నమోదైంది.