
సామాజిక ప్రయోజనమే సాహిత్య లక్ష్యం
- కర్నూలు జిల్లా రచయిత జంధ్యాల రఘుబాబు మాట్లాడుతూ లలిత కళాసమితి రచయితల మహాసభలు నిర్వహిస్తూ సాహిత్యంలోని అన్ని ప్రక్రియలపై సమావేశాలు నిర్వహించడం, ఆ సమావేశాలలో అనుభవజ్ఞులైన నిపుణులైన మేధావులతో ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
- ‘స్త్రీవాద సాహిత్యం, సమాలోచనం’ అనే అంశంపై హైదరబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ శరత్ జ్యోత్స్న ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్త్రీవాద రచయిత్రులు చాలా విప్లవాత్మకమైన అంశాలను సాహిత్యంలోనికి తీసుకొచ్చారన్నారు. స్త్రీ స్వేచ్ఛ గురించి చలం అనేక కథలు రాశారన్నారు. ఓల్గా రాజకీయ కథలు, పి.సత్యవతి కథలు, రంగనాయకమ్మ నవలలు, పురుషాధిక్య సమాజంపై అనేక వ్యంగ్యాస్త్రాలను విసిరాయన్నారు. అలనాటి సాంప్రదాయ సాహిత్యంలోనూ స్త్రీలు స్వేచ్ఛను కాంక్షించే విధంగా రచనలు చేశారన్నారు.
- తిరుపతి పద్మావతి యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ రాజేశ్వరమ్మ మాట్లాడుతూ స్త్రీవాద సాహిత్యంలో వచ్చిన కవిత్వం పురుషాధిపత్యాన్ని ధీటుగా ప్రశ్నించిందన్నారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు స్త్రీలను వివక్షకు గురిచేస్తున్న పురుషాధిక్య సమాజంపై స్త్రీ వాదం తిరుగుబాటు చేసిందన్నారు. ఇంకా పదునైన కథలు, కవిత్వం రచించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో రచయిత్రులు దండెబోయిన పార్వతి, కళ్యాణదుర్గం స్వర్ణలత స్త్రీవాద సాహిత్య ప్రయోజనాలను వివరించారు.
- ప్రముఖ కళాకారుడు, ప్రజానాట్యమండలి మాజీ అధ్యక్షుడు శాంతారామ్ మాట్లాడుతూ ఉత్తమ సాహిత్య సృజనకు విమర్శ ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు.
- అనంతపురం వాస్తవ్యులు, సుప్రసిద్ధ కథా రచయిత బండి నారాయణస్వామి రాయలసీమలో వర్ధమాన కథకుల రచనల గురించి ప్రసంగించారు. రాయలసీమ నుంచి ఇటీవల కాలంలో పదునైన కథలు పుట్టుకొచ్చాయన్నారు. విభజన నేపథ్యంలో అన్ని రంగాలలో రాయలసీమ ఎదుర్కొంటున్న వివక్షను, సీమలోని వెనుకబాటుతనాన్ని సాహిత్యంలో ప్రస్ఫుటంగా కనిపించేటట్లు చేయాలన్నారు. ఏ ఉద్యమానికైనా ఊతంగా నిలిచేది కళలు, సాహిత్యమేనన్నారు. రాయలసీమలో కథకు, కవులకు, కళాకారులకు కొదువ లేకున్నా బలమైన సాహిత్యం ఆవిర్భవించాల్సిన ఆవశ్యకత ఇంకా ఉందన్నారు.
- అనంతరం జరిగిన కవి సమ్మేళనం ప్రేక్షకులను ఆకట్టుకున్నది. కార్యక్రమంలో లలిత కళాసమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, మహాసభల కన్వీనర్ ఇనాయతుల్లా, కో–కన్వీనర్ డాక్టర్ విజయ్కుమార్, ఆహ్వానసంఘం సభ్యులు మహమ్మద్ మియా, కెంగార మోహన్, డాక్టర్ జయరాం, ఎస్.డి.వి.అజీజ్, మధుసూదనాచార్యులు, కె.ఎన్.మద్దిలేటి, లలిత కళాసమితి కార్యవర్గ సభ్యులు బాలవెంకటేశ్వర్లు, సంగా ఆంజనేయులు పాల్గొన్నారు.