
అవిశ్వాసం నోటీసు ఉండగానే కమిటీ వేస్తారా?
ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై తామిచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు ఉండగానే సభలో జరిగిన
దాని ఆంతర్యం ఏమిటి?.. స్పీకర్ను ప్రశ్నించిన గడికోట శ్రీకాంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై తామిచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు ఉండగానే సభలో జరిగిన పరిణామాలపై విచారణకు హడావుడిగా కమిటీని నియమించడం వెనుక అంతర్యం ఏమిటని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల కో-ఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్రెడ్డి ప్రశ్నించా రు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. శాసనసభ శీతాకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై కమిటీ వేస్తానని ప్రకటించిన స్పీకర్ అందుకు భిన్నంగా అసెంబ్లీ బులెటిన్లో విచారణాంశాలను పేర్కొన్నారని విమర్శించారు.
టీడీపీ సభ్యురాలితో స్క్రిప్ట్ చదివించారు
కమిటీ ఏర్పాటుపై స్పీకర్ విలేకరుల సమావేశంలో ఏం చెప్పారో తెలియజేసే వీడియో దృశ్యాలను గడికోట శ్రీకాంత్రెడ్డి టీవీలో ప్రదర్శించారు. ‘‘ సాధారణంగా జీరో అవర్లో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రస్తావించడానికి ఒక నిమిషం సేపు సమయం ఇస్తారు. అలాంటిది ఆ రోజున ఉద్దేశపూర్వకంగా రాసిచ్చిన స్క్రిప్ట్ను టీడీపీ సభ్యురాలితో గంటల తరబడి చదివించి, ఏడుపు రాకపోయినా ఏడ్పించి మాట్లాడించారు. ఈ అంశంపై కమిటీ ఏర్పాటు అంటే దాని ప్రాధాన్యత ఏమిటో ఇట్టే తెలిసిపోతోంది’’ అని ఆయన మండిపడ్డారు.
అవిశ్వాసంపై సమాధానం చెప్పాలి
తామిచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై స్పీకర్ తక్షణమే సమాధానం చెప్పాలని గడికోట డిమాండ్ చేశారు. దానిపై ఎప్పుడేం చేయాలనేది ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కమిటీని తాము బహిష్కరించబోమని తెలిపారు. తాము లేవనెత్తే అన్ని అంశాలపై కమిటీలో చర్చ జరగాలని, సమాధానం రావాలని కోరుతున్నామని పేర్కొన్నారు.