రాష్ట్రంలోనే ఆధునిక మార్చురీ
-
రూ 3.25 కోట్లతో నిర్మాణం.
-
వైద్య విద్యార్థుల పరిశోధనకు విశాలమైన హాలు
-
ఎంబాల్మింగ్ ఏర్పాటు
-
నేడు ప్రారంభించనున్న మంత్రులు
నెల్లూరు(అర్బన్) :
రాష్ట్రంలో తొలిసారిగా రూ 3.25 కోట్లతో నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల బోధనాసుపత్రిలో ఆధునికమైన విశాలమైన మార్చురీ భవనాలను ఏర్పాటు చేశారు. వైద్య విద్యార్థుల పరిశోధనకు అనుకూలంగా నిర్మించారు. ఎలాంటి వాసన లేకుండా క్లీన్ అండ్ గ్రీన్ పద్ధతిలో ఎంబాల్మింగ్ వంటి సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ భవనాలను సోమవారం రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, శిద్దరాఘవరావు, పొంగూరు నారాయణ ప్రారంభించనున్నారు.
అరెకరా స్థలంలో ఏర్పాటు
అర ఎకరా స్థలంలో మార్చురీ భవనాలను ఏర్పాటు చేశారు. భవనాల కోసం రూ 1.25 కోట్లను, వైద్య పరికరాలు, ఫ్రీజర్లు, ఎక్స్రే, ఎంబాల్మింగ్ వంటి పరికరాల కోసం మరో రూ.2 కోట్లు వెచ్చించారు.
ఎంబాల్మింగ్ ప్రత్యేకత
ఇప్పటి వరకు పెద్దాసుపత్రిలో ఎంబాల్మింగ్ పరికరాలు లేవు. ఎవరైనా మరణించి ఇతర దేశాల నుంచి రక్తసంబంధీకులు రావాల్సి ఉండి కొన్ని రోజులు ఆగాల్సి వస్తే శవాలు కుళ్లిపోయేవి. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా ఎంబాల్మింగ్ ప్రక్రియ పరికరాలుండటం వల్ల వారం రోజులైనా శవాలను కుళ్లిపోకుండా ఉండే ఏర్పాట్లు చేశారు.
వైద్య విద్యార్ధులకు ఎంతో ఉపయోగం : డాక్టర్ శశికాంత్, ఫోరెన్సిక్ హెచ్ఓడీ
ఇలాంటి వసతులున్న మార్చురీ భవనాలు రాష్ట్రంలో ఎక్కడా లేవు. ఉమ్మడి రాష్ట్రంలో గాంధీ ఆసుపత్రి తర్వాత నెల్లూరు మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. 150 మంది విద్యార్థులు చొప్పున 2 బ్యాచ్లుగా ఇక్కడ మెడికల్ వైద్యసేవలు నేర్చుకుంటారు. మెడికోలకు ఇది ఎంతో ఉపయోగం