కర్రపెత్తనంపై కస్సుబుస్సులు | tdp internal problems | Sakshi
Sakshi News home page

కర్రపెత్తనంపై కస్సుబుస్సులు

Published Sun, Sep 25 2016 11:14 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

కర్రపెత్తనంపై కస్సుబుస్సులు - Sakshi

కర్రపెత్తనంపై కస్సుబుస్సులు

  • రాజమహేంద్రి ‘దేశం’లో ఆధిపత్య పోరు
  • సిటీలో గోరంట్ల జోక్యం
  • మండిపడుతున్న మేయర్‌ వర్గం
  • నానాటికీ తీవ్రమవుతున్న విభేదాలు
  •  
    రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ ఆధిపత్య పోరుతో సతమతమవుతోంది. కొంత కాలంగా పార్టీలో రగులుతున్న వర్గవిభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. రూరల్‌ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. నగరంలో కర్రపెత్తనం చేస్తూండడం.. ఆయన తీరుపై మేయర్‌ వర్గం మండిపడుతూండడంతో.. ఇరు పక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి నెలకొంది.
     
    సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం :
    రాజమహేంద్రవరంలో టీడీపీ నేతల వర్గపోరు తారస్థాయికి చేరింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్‌ నియోజకవర్గాన్ని వదిలేసి సిటీపై ఆధిపత్యం కోసం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రయత్నాలు సాగించడాన్ని పార్టీలోని మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఒకప్పుడు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల ఇప్పుడు కూడా అక్కడ తన ప్రాబల్యమే ఉండాలనుకుంటే ఎలా అని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు రాజమహేంద్రవరం టీడీపీలో గోరంట్ల, పార్టీ సీనియర్‌ నాయకుడు గన్ని కృష్ణ మధ్య తీవ్ర విభేదాలు ఉండేవి. గోరంట్ల రూరల్‌కు వెళ్లిపోవడంతో ఈ విభేదాలకు ఫుల్‌స్టాప్‌ పడిందని అందరూ అనుకున్నారు. కానీ పార్టీలో వర్గపోరు తగ్గలేదని ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి.
    అన్నింటికీ ఆయన అడ్డమేమిటి?
    తాజాగా గోరంట్ల, మేయర్‌ పంతం రజనీ శేషసాయి వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. సొంత పార్టీ మేయర్, అందునా మహిళ అని కూడా చూడకుండా ప్రతి విషయంలో గోరంట్ల అడ్డు తగులుతున్నారని రజనీ శేషసాయి వర్గం మండిపడుతోంది. వీరిద్దరి మధ్య గోదావరి పుష్కరాల సందర్భంగా మొదలైన వైరం కాస్తా ఇప్పుడు ముదురు పాకాన పడింది. గోదావరి పుష్కరాల సమయంలో భోజనాల బిల్లు మంజూరుకు గోరంట్ల పట్టుదల పట్టగా, మేయర్‌ అభ్యంతరం చెప్పారు. దీంతో మొదలైన విభేదాలు చినికిచినికి గాలివానగా మారాయి. 
    పుష్కరాల బిల్లులతో ఆరంభం
    తన అనుచరులకు అడ్డగోలుగా భోజనాల బిల్లు ఇప్పించుకునేందుకు గోరంట్ల చేసిన ప్రయత్నాలను టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సహా పలువురు అప్పట్లో అడ్డుకున్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశంలో కూడా ఈ భోజనాల బిల్లుపై అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో మేయర్‌ ఈ బిల్లును పక్కన పెట్టి ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. అయినప్పటికీ మేయర్‌ను బైపాస్‌ చేసి అప్పటి కమిషనర్‌ సకలారెడ్డితో తన అనుచరులకు గోరంట్ల బిల్లులు మంజూరు చేయించుకున్నారు. ఇది మేయర్‌ వర్గం ఆగ్రహానికి కారణమైంది. సకలారెడ్డి తరువాత కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి విజయరామరాజు బాధ్యతలు స్వీకరించారు. పుష్కర ఏర్పాట్లలో వైఫల్యం చెందారంటూ అధికార పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయననే తిరిగి కమిషనర్‌గా తీసుకురావడంలో గోరంట్ల పాత్ర లేకపోలేదని పలువురు అంటున్నారు.
    మరెన్నో వివాదాలు
    • కమిషనర్‌గా విజయకుమార్‌రాజు బాధ్యతలు స్వీకరించాక గోరంట్ల, మేయర్‌ వర్గాల మధ్య విభేదాలు మరింతగా రచ్చకెక్కాయి.
    • పుష్కరాల్లో సుమారు కోటిన్నర రూపాయలతో మూడు జనరేటర్లు కొనుగోలు చేశారు. వాటిని పరిశీలించేందుకు వెళ్లిన మేయర్‌ ఒక జనరేటర్‌ పని చేయలేదని గుర్తించారు. జనరేటర్‌కు ఎంత ఎక్కువ లెక్కేసినా రూ.30 లక్షలకు మించి ఉండదని టీడీపీ నేతలే అంటున్నారు. అటువంటిది మూడింటిని అంత ఎక్కువ మొత్తంతో కొనుగోలు చేయడం వెనుక గోరంట్ల పాత్ర ఉందన్న విమర్శలున్నాయి.
    • రాజమహేంద్రవరంలో 130 సెల్లార్లకు కార్పొరేషన్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు. యజమానుల విజ్ఞప్తుల మేరకు కొంత గడువు ఇద్దామని మేయర్‌ సూచన చేశారు. కానీ దానిని అధికారులు పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వెనుక గోరంట్ల ముఖ్య అనుచరుల పాత్ర ఉందని అంటున్నారు.
    • ఇటీవల 42వ వార్డులో క్రీడా మైదానానికి నిధులు మంజూరు చేయాలని మేయర్‌ ఆదేశించారు. అప్పట్లో ఆ స్థలం కోర్టు వివాదంలో ఉందని చెప్పిన అధికారులు తాజాగా రూ.28.50 లక్షలు మంజూరు చేశారు. దీనికి మేయర్‌ అభ్యంతరం చెప్పారు. ఆ వ్యవహారం ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది.
    • కార్పొరేషన్‌లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదంటూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై మేయర్‌ తనిఖీలు చేశారు. ఆ సందర్భంగా 17 మంది శానిటేషన్‌ సిబ్బంది గైర్హాజరయ్యారని గుర్తించి, చర్యలకు ఆదేశించారు. అయితే గైర్హాజరైనవారిపై చర్యలు తీసుకోకుండా గోరంట్ల అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని.. ఇలా మేయర్‌ను అడుగడుగునా అవమానిస్తున్నారని ఆమె సన్నిహితులు చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నారు.
    • చివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 39వ వార్డు, కంబాలచెరువు పార్కుల అభివృద్ధికి మేయర్‌ ఆదేశాలు జారీ చేసినా అధికారులు పట్టించుకోకపోవడం ఆమెను అవమానించడం కాక మరేమిటని సహచర మహిళా కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. కంబాలచెరువు పార్కు అభివృద్ధికి తమ నేత విజ్ఞప్తి చేసినందువల్లనే గోరంట్ల అడ్డుపడి ఉంటారని గన్ని కృష్ణ వర్గీయులు మండిపడుతున్నారు.
    • ఒకపక్క మేయర్, మరోపక్క గన్ని చెప్పినా పట్టించుకోని అధికారులు.. గోరంట్ల అనుచరుడైన డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు వార్డులో పార్కు, రోడ్డు, డ్రైన్‌ పనులు చేపట్టడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.
    • గోరంట్ల అనుయాయులైన వాసిరెడ్డి రాంబాబు, పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ వర్రే శ్రీనివాసరావుల ద్వారా కార్పొరేషన్‌పై గోరంట్ల పెత్తనం చెలాయిస్తున్నారని మేయర్‌ వర్గీయులు గుర్రుగా ఉన్నారు.
    • గోరంట్ల ఇంట్లో ఇటీవల జరిగిన టీడీపీ కార్పొరేటర్ల సమన్వయ సమావేశంలో మేయర్‌ను అవమానపరిచే రీతిలో పలువురు మాట్లాడటంతో ఆమె కన్నీటిపర్యంతమై బయటకు వచ్చేశారు. వ్యూహాత్మకంగానే మేయర్‌ను ఆహ్వానించి ఇలా వ్యవహరించడం.. తాజాగా చంద్రన్న బీసీ రుణాల పంపిణీ కార్యక్రమ ఆహ్వాన పత్రికలో పేరే లేకుండా చేయడం కూడా ఆమెను అవమానించేందుకేనని అంటున్నారు. ‘మేయర్‌కు అవమానం’ శీర్షికన ‘సాక్షి’ వార్త ప్రచురించడంతో అధికారులు ఆగమేఘాలపై మేయర్‌ పేరుతో మరో ఆహ్వాన పత్రిక తయారుచేసి అందజేశారు. తెరవెనుక గోరంట్ల ఉండి మేయర్‌ను అడుగడుగునా అవమానించే ఉద్దేశంతోనే అలా చేశారని ఆమె వర్గం మండిపడుతోంది. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement