సమూల మార్పులు!
విద్యారంగంపై ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా.. క్షేత్రస్థాయి సమస్యలతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో మెరుగైన ఫలితాలను సాధించడంతోపాటు.. విద్యార్థులను సుశిక్షితులను చేసే లక్ష్యంతో సమూల మార్పులతో నూతన విద్యా విధాన ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. మంత్రి మండలి మాజీ కార్యదర్శి టీఎస్ఆర్ సుబ్రమ్మణ్యన్ నివేదిక ఆధారంగా రూపొందించిన ముసాయిదాను ప్రభుత్వం కొన్ని మార్పుల
ఆంగ్లం, గణితం, సామాన్యశాస్త్రాలపై ప్రత్యేక దృష్టి
నూతన విద్యావిధానం ముసాయిదా రూపొందించిన కేంద్ర ప్రభుత్వం
బాలాజీచెరువు (కాకినాడ) :
విద్యారంగంపై ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా.. క్షేత్రస్థాయి సమస్యలతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో మెరుగైన ఫలితాలను సాధించడంతోపాటు.. విద్యార్థులను సుశిక్షితులను చేసే లక్ష్యంతో సమూల మార్పులతో నూతన విద్యా విధాన ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. మంత్రి మండలి మాజీ కార్యదర్శి టీఎస్ఆర్ సుబ్రమ్మణ్యన్ నివేదిక ఆధారంగా రూపొందించిన ముసాయిదాను ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులతో అమలు చేయనుంది.
ఇవీ ముఖ్యాంశాలు..
-
విద్యాసంస్థల గుర్తింపు, నమోదు కోసం నిర్దేశించిన నిబంధనల్లో విద్యార్థుల భద్రత, సంరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
-
సుశిక్షితులైన బోధకుల నియామకం తప్పనిసరి. దీనివల్ల విద్యార్థులు ఒత్తిడి లేని విద్యను అభ్యసించే వీలు ఉంటుంది.
-
ఉన్నత విద్యాసంస్థల్లో ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడానికి వీలుగా నియామకాలు, బదిలీలవంటి ప్రక్రియల అధ్యయనానికి నిపుణుల కమిటీ ఏర్పాటవుతుంది.
-
నాన్ డిటెన్షన్ విధానంలో నిబంధనలు కూడా మారనున్నాయి. పై తరగతులకు పంపించే ప్రక్రియను ఐదో తరగతి వరకూ మాత్రమే పరిమితం చేస్తారు.
-
ఐదో తరగతి వరకూ స్థానిక లేదా ప్రాంతీయ భాషా మాధ్యమం లేదా మాతృభాషలో బోధన సాగిస్తారు.
-
పాఠశాలల్లో సంస్కృత భాషను ప్రోత్సహించేందుకు సరళ విధానాలు పాటిస్తారు.
-
ఉన్నత విద్యకు సంబంధించి ప్రతి ఐదేళ్లకోసారి నిపుణులతో కమిషన్ ఏర్పాటు చేస్తారు.
-
విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే సామాన్యశాస్త్రం, గణితం, ఆంగ్లానికి జాతీయ స్థాయిలో ఒకే ప్రణాళిక రూపొందిస్తారు.
పదో తరగతి పరీక్షలు ఇలా..
పదో తరగతి విద్యార్థులు ఎక్కువగా గణితం, సామాన్యశాస్త్రం, ఆంగ్ల పరీక్షల్లో తప్పుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. కొత్త విధానం ప్రకారం ఈ మూడు సబ్జెక్టుల్లో రెండు స్థాయిల్లో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పార్ట్–ఏ అత్యుత్తమ ప్రతిభను, పార్ట్–బి తక్కువ ప్రతిభను చూపుతుంది. అయితే ఈ విధానాలపై కొంత మంది ఉపాధ్యాయ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదర్శ పాఠశాలలు సదుపాయాలు లేక సతమతమవుతూంటే.. ప్రస్తుత కొత్త విధానాలు ఎంతవరకూ సత్ఫలితాలు ఇస్తాయని సందేహలు వ్యక్తం చేస్తున్నారు. ఐదో తరగతి వరకే నాన్ డిటెన్షన్ అమలు చేస్తే బడి మానేసేవారి శాతం పెరిగే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు.
విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి
మాతృభాషలో బోధనకు కమిషన్ సిఫారసు చేయడం హర్షణీయం. మరుగున పడిపోతున్న సంస్కృత భాషలో బోధించే విధానం కూడా మంచిదే. ఆంగ్ల, గణిత, సామాన్యశాస్త్రాలకు దేశవ్యాప్తంగా ఒకే ప్రణాళిక ఉండటం కూడా మంచిది. పోటీ పరీక్షల ప్రవేశాలకు ఇది ఎంతో అవసరం. ఈ నూతన విధానం ద్వారా విద్యార్థుల సామర్థ్యాలు మరింత మెరుగుపడతాయి.
– పీవీవీ సత్యనారాయణరాజు, ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు