నారాయణపేటలో గణపతి శోభాయాత్ర
‘సాక్షి’నెట్వర్క్: భక్తుల ఆటాపాటలు, భజన కోలాటాలతో గణేశ్ నిమజ్జనం వైభవంగా సాగింది. ఎటుచూసినా కోలాహలమే కనిపించింది. వర్షం కురుస్తున్నా యువకులు చిందులు వేస్తూ ఉత్సాహంగా ఏకదంతుడికి వీడ్కోలు పలికారు. ఎప్పటిలాగే నారాయణపేటలో శోభాయాత్ర వినూత్నంగా సాగింది. బుధవారం సాయంత్రం ప్రారంభమైన ఊరేగింపు గురువారం అర్ధరాత్రి దాటినా కొనసాగుతూనే ఉంది. నిమజ్జనంలో సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక అంశాలపై ఉత్సవకమిటీలు పోటీ పడి అలంకరణ చేశారు. అయిజ, కొడంగల్, షాద్నగర్, కొల్లాపూర్, ఆత్మకూరు, మక్తల్ పట్టణాలతో పాటు పలు మండలకేంద్రాల్లోనూ ఉత్సాహంగా నిమజ్జనం నిర్వహించారు. బీచుపల్లి, పెబ్బేరు కృష్ణా తీరంలో భారీగా విగ్రహాలను నిమజ్జనం చేశారు.