
ఓటర్లలో సగం కన్నా ఎక్కువే.. అయినా!
ఈశాన్య రాష్ట్రాల్లో మహిళా జనాభా అధికంగా ఉంటుంది. మణిపూర్, మిజోరం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో అయితే పురుషుల జనాభా కన్న మహిళల జనాభానే అధికం. ఈశాన్య రాష్ట్రాల ఓటర్లలోనూ 50%పైగా మహిళలే ఉన్నారు. అయినా వారికి రాజకీయ ప్రాతినిధ్యం చాలా తక్కువ. ఈశాన్య రాష్ట్రాల మహిళలు రాజకీయంగానూ, సామాజికంగానూ చురుకైన పాత్రే పోషిస్తున్నప్పటికీ.. ఎన్నికలో పోటీ చేసే అవకాశం రాజకీయ పార్టీలు ఇవ్వలేదు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఏడు ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం(14 లోక్సభ స్థానాలు), అరుణాచల్ ప్రదేశ్(2), మేఘాలయ(2), మణిపూర్(2), త్రిపుర(2), నాగాలాండ్(1), మిజోరం(1)లలో మొత్తం 235 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా, వారిలో 22 మంది మాత్రమే మహిళలు. అంటే కేవలం 9.36%. అరుణాచల్ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్లలో అయితే ఒక్క మహిళా అభ్యర్థి కూడా పోటీలో లేరు.