
అమ్మకు ఆగ్రహం తెప్పించరాదు
ఆత్మీయం
మహిషాసుర సంహారం వల్ల శరన్నవరాత్రుల పూజలు ఆరంభమయ్యాయని భావిస్తారందరూ. కాని, వీటికి మూలకారకుడు కృతయుగంలోని దుర్గముడు. హిరణ్యాక్షుని మనుమడుదుర్గముడు. వాడు బ్రహ్మను గురించి తపస్సు చేసి, విప్రులు వేదాలు మరచిపోవాలనీ, అవి తనకే చెందాలనీ వరం కోరాడు. ఆ వరంతో వి్రçపులు వేదాలు మరచిపోయారు, యజ్ఞాలు ఆగిపోయాయి. వర్షాలు కురవక భూలోకవాసులు తల్లడిల్లిపోయారు. వారంతా అమ్మను ప్రార్థించగా, ఆమె వారికి ముందుగా ఆహారాన్ని పెట్టింది. అప్పటినుంచి అమ్మవారిని శాకంభరి అన్నారు. ఆపై దుర్గముడిని చంపివేసింది. వాడి చావుతో బ్రహ్మ ఇచ్చిన వరం తొలగిపోయి యథాస్థితి ఏర్పడింది.
లోకం సుభిక్షమైంది. దుర్గముడిని చంపడం వల్ల అమ్మవారికి దుర్గ అని పేరు వచ్చిందని శ్రీమద్దేవీ భాగవతం చెప్తోంది. తల్లి, తన బిడ్డలు ఆకలితో ఉండటాన్ని చూడలేదు. అదేవిధంగా ఒకరి చెడు ప్రవర్తన మూలంగా మిగిలిన వారు బాధపడటాన్ని కూడా అమ్మ సహించలేదు. తప్పు చేసిన వారికి ఎంతటి శిక్ష అయినా విధిస్తుంది. మిగిలిన అందరికీ సుఖాన్ని, శుభాన్ని ప్రసాదిస్తుంది. అమ్మకు ఆగ్రహం తెప్పించకూడదు. ఆడవారికి కన్నీరు రానివ్వకూడదు. అది అర్ధాంగి అయినా, ఆడబిడ్డ అయినా...