హితబోధలు వద్దు దాదా! | Shekhar Gupta writes opinion for Pranab mukherjee | Sakshi
Sakshi News home page

హితబోధలు వద్దు దాదా!

Published Sat, Oct 28 2017 1:19 AM | Last Updated on Sat, Oct 28 2017 1:19 AM

 Shekhar Gupta writes opinion for Pranab mukherjee

♦ జాతిహితం
మన రాజకీయాలకు ‘భీష్మ పితామహుడు’ ప్రణబ్‌ ముఖర్జీ జ్ఞాపకాలు 1984 తర్వాతి మన రాజకీయ చరిత్రకు సంబంధించి విలువైనవి. మన∙రాజకీయాలను, పరిపాలనాపరమైన స్థితిగతులను కళ్లకు కడతాయి. అయితే హానికరమైన లోపాలతో కూడినవి. అవి చెప్పిన దానికంటే దాచిపెట్టినదే ఎక్కువ. అధికార యంత్రాంగపు సంకేతాత్మకత, నిగూఢత, సూచనాపరత్వంతో తరచుగా ఆయన తన జ్ఞాపకాలను చెబుతారు. అంతేగానీ కీలకమైన మలుపులు వేటినీ సవివరంగా విశదీకరించడం కనబడదు.

ప్రణబ్‌ ముఖర్జీతో వాదనకు దిగ సాహసించిన వారెవరూ నెగ్గింది లేదని ఆయన ఐదు దశాబ్దాల ప్రజా జీవిత చరిత్ర చెబుతుంది. ఆయన ఎన్నడూ ఓటమిని అంగీకరించకపోవడమే అందుకు కారణం. రాజకీయ చరిత్ర, దాని పరిణామం, రాజ్యాంగపరమైన సూక్ష్మభేదాలలో ఆయనకున్న జ్ఞానం పరి పాలనకు సంబంధించి అద్భుతమైన విషయం. ఆయన నెలకొల్పిన  ‘‘ఉదా హరణ’’ చెప్పుకోదగినది. ఐదు దశాబ్దాలుగా ఆయన ఏర్పరచుకున్న సంబం ధాలు, సంపాదించుకున్న మంచి పేరు మాత్రమే దానికి సాటి. ఇవన్నీ పూర్తిగా తెలిసే నేను ఆయన తాజా పుస్తకం ద కొయలిషన్‌ ఇయర్స్‌ గురించి రాస్తున్నాను. గ్రంథస్తం చేసిన ఆయన రాజకీయ జ్ఞాపకాలకు సంబంధించి ముఖ్యమైనది...

ఆయన వాటిని రాత పూర్వకంగా ఉంచడమే. మన దేశంలో ప్రజా జీవితంలోని ప్రముఖులు పుస్తకాలను రాసే సాంప్రదాయం మనకు లేదు. అతి ఎక్కువగా సాహిత్య వ్యాసంగం సాగించిన నెహ్రూ సైతం అధికా రంలోకి రాక ముందే రాశారు. అధికారంలో ఉండగానే మరణించారు. అప్పటి నుంచి మన అగ్రనేతలలో ఏ ఒక్కరూ కలం, కాగితం పట్టింది లేదు. పీవీ నరసింహారావు, ఐకే గుజ్రాల్‌ అందుకు మినహాయింపు. కొందరికి వయసు పైబడటంతో రాయడానికి సమయం, శక్తి మిగిలలేదు. కొందరికి అందుకు కావల్సిన పాండిత్యం, నోట్సు, లేదా చెప్పాల్సినంతటి కథనమూ లేదు. ఆ మూడూ ఉన్నవారు మన్మోహన్‌సింగ్, కనీసం ఇప్పటికైతే ఆయన ఆ పని జోలికి పోదలుచుకున్నట్టు లేదు. మన ప్రజా జీవితంలోని ప్రముఖులలో చాలామంది... తామో లేక తమ పిల్లలో వారసత్వపరమైన రాజకీయ వృత్తి పోటీలో ఇంకా బరిలో ఉండటమే అందుకు కారణం.

విలువైనవే కానీ...
అందువల్ల ప్రణబ్‌దా లేదా దాదా ఇంత సాహిత్యాన్ని సృష్టించడం గొప్ప విషయమే. ఇప్పటికే ఆయన మూడు సంపుటాలను వెలువరించారు, తను రాష్ట్రపతిగా ఉన్న కాలానికి సంబంధించిన జ్ఞాపకాల నాలుగో సంపుటì  వచ్చే ఏడాది వెలువడవచ్చు. మన రాజకీయ చరిత్రకు, ప్రత్యేకించి 1984 తదుపరి కాలపు రాజకీయ చరిత్రకు సంబంధించి ఇవి విలువైనవి. ఘటనల కాలానుక్ర మణ, వాటికి సంబంధించిన ఆధారాలను సూచించడంలో ఆయన చూపిన శ్రద్ధ అనితర సాధ్యమైనది. కాబట్టే ఆయన జ్ఞాపకాలుæ భారత రాజకీయాలు, పరిపాలనాపర మైన స్థితిగతులకు సంబంధించి ఎవరికైనా అమూల్యమైనవే. అయితే ఈ జ్ఞాపకాలు హానికరమైన లోపాలతో కూడినవి. అవి చెప్పిన దాని కంటే దాచి పెట్టినదే ఎక్కువ. అధికార యంత్రాంగపు సంకేతాత్మకత, నిగూ ఢత, సూచనాపరత్వంతో ఆయన తరచుగా తన జ్ఞాపకాలను చెబుతారు. అంతేగానీ కీలకమైన మలుపులను సవివరంగా విశదీకరించడం కనబడదు. 

మొదటి రెండు సంపుటాలు ఆయన ఇంకా రాష్ట్రపతి భవన్‌లో ఉండగా వెలువడినవి. కాబట్టి అవి ఇలా ఉండటాన్ని అర్థం చేసుకోవచ్చు. అత్యున్న తమైన ఆ లాంఛనప్రాయపు పదవి ‘‘మర్యాద’’ లేదా ప్రమాణాలు... కొన్ని సున్నితమైన అంశాలను దాటవేయడానికి లేదా సూచనాత్మకంగా చెప్పడానికి సమర్థన అయింది. ఇందిర  వారసునిగా తన స్థానంలో రాజీవ్‌ను ఎంపిక చేయడానికి దారితీసిన వంచనాత్మక మంత్రాంగాన్ని అద్భుతమైన రీతిలో సున్నితంగా అభివర్ణించడం ఇందుకు మంచి ఉదాహరణ. అయితే ఈ మూడో సంపుటిలో చెప్పుకోడానికి ఆ సాకు దొరకదు. ఇది, ఆయనతో మన కున్న పేచీల్లో మొదటిది, ఎక్కువ మృదువైనది. మూడో సంపుటిని ఆయన యూపీఏ దశాబ్ద కాలంలోని చాలా వివాదాస్పద విషయాలపై స్వీయ సమ ర్థనకు, తన సహచరులు కొందరిని తప్పుపట్టడానికి, వారిపై మర్మగర్భిత మైన వ్యంగ్యోక్తులు విసరడానికి వాడుకున్నారు. అదే ఆయనతో మనకున్న పెద్ద పేచీ. ఇంతకంటే ఎక్కువ స్పష్టతను, నిష్కపటత్వాన్ని మనం ఆశిస్తాం.

ఏ కీలక మలుపునూ వివరించరెందుకు?
యూపీఏ పదేళ్ల పాలనలో ప్రణా»Œ దా ప్రమేయం ఉన్న మలుపుల జాబితాను ఎంపిక చేసి ఇక్కడ ఇస్తున్నాను. ప్రణబ్‌దా ఈ విషయాల్లో మరింత స్పష్టతను ఇవ్వాలని కోరుకుంటాం: సోనియా, ఆయన కంటే మన్మోహన్‌ సింగే మెరు గని ఎందుకు ఎంచుకున్నారు? ఆ పరిస్థితిని ఆయన ఎలా నిభాయించుకు న్నారు? మొదటి దఫా ఆయన ఆర్థిక మంత్రిత్వ శాఖను ఎందుకు వద్ద న్నారు? ఐదేళ్ల తర్వాత అదే శాఖను ఎందుకు అంగీకరించారు? ఆ శాఖ వ్యవ హారాలను అంతగా ఎందుకు గందరగోళపరచారు? రాష్ట్రపతి పదవికి సోనియా, హమీద్‌ అన్సారీని ఎంపిక చేయాలనుకున్నా, తననే ఆ పదవికి నామినేట్‌ చేయక గత్యంతరం లేని స్థితి కలిగేలా ఎలా చక్రం తిప్పారు? రెట్రా స్పెక్టివ్‌ ట్యాక్స్‌ (వర్తిస్తుందని భావించే ముందటి తేదీ నుంచి వసూలు చేసే పన్ను) సవరణ లాంటి విషపూరితమైన వారసత్వాన్ని ఆర్థికశాఖకు వదిలి వెళ్ల డాన్ని ఆయన ఎలా సమర్థించుకుంటారు? వీటిలో ప్రతి ఒక్కదాన్నీ ఆయన చర్చించారు కానీ చాలా వరకు వాటి అంచుల్లోనే తారాడారు.

2004లో ఆర్థిక శాఖను  వద్దనడానికి కారణం ‘‘ఆర్థిక సమస్యలపై తానూ, మన్మోహస్‌ సింగ్‌ భిన్నాభిప్రాయాలను కలిగి ఉండటమే’’నని చెప్పినప్పుడు, తర్వాత ఎలా ఆమోదించారు? మన్మోహన్‌ కంటే, అంతకు మించి చిదంబరం కంటే తన ఆర్థిక దృక్పథం ఎంత ఎక్కువ భిన్నమైనదో చేసిన కొన్ని వ్యాఖ్యలు చాలా ముఖ్యమైనవి. ఈ సందర్భంలో ఆయన అత్యంత స్పష్టతను కనబరచారు. చిదంబరానికి సంబంధించిన విభాగంలో ఆర్థిక వ్యవస్థపై ఆయనతో తాను ఎలా విభేదించారో వివరంగా చెప్పారు. 

‘‘మితవాదిగా నేను, సంస్కరణలు నిరంతరం కొనసాగాల్సిన క్రమ మని విశ్వసించాను. ఆర్థిక వ్యవస్థ– నియంత్రణల వ్యవస్థ పరివర్తన సమ్మిళిత మైనదిగా, క్రమక్రమంగా సాగాలని కోరుకున్నాను. కాగా ఆయన ఉదార వాద అనుకూల, మార్కెట్‌ అనుకూల ఆర్థికశాస్త్రవేత్త.’’ వోడాఫోన్‌ కేసులో రెట్రాస్పెక్టివ్‌ ట్యాక్స్‌కు చేసిన సవరణను ప్రణబ్‌ ఈ వైరుధ్యానికి ‘‘మంచి ఉదారణ’’ అన్నారు. మరోచోట, 1997 నాటి చిదంబరం ‘‘డ్రీమ్‌’’ బడ్జెట్‌పై ఆయన్ను చీల్చి చెండారు. అయితే ఇచ్చిన గణాంకాలన్నీ తప్పు.

ఆర్థికమంత్రిగా ఆయన పని చేసిన కాలం అత్యంత ఘోర వైఫల్యాలతో కూడినది. వృద్ధి స్తంభించిపోయింది, తర్వాత క్షీణించింది, అప్పటి నుంచి నిజంగా కోలుకోనే లేదు. ఆయన ప్రారంభించిన లేదా అనుసరించిన కొత్త    పథకాలన్నీ అసంపూర్తిగానే మిగిలాయి. ‘‘తనపై రుద్దిన’’ నాటి ఆర్‌బీఐ గవర్నర్‌ డీ సుబ్బారావుతో తనకున్న విభేదాలు తీవ్రమైనవనే వాస్తవాన్ని ఆయన దాచలేదు.  ప్రణబ్‌ ఆర్థికశాఖలోనే ఒక అత్యున్నత నియంత్రణ వ్యవ స్థను సృష్టించాలని కోరుకున్నారు. తద్వారా భారత ద్రవ్య వ్యవస్థలో, ఆర్థిక నియంత్రణ సంస్థలలో బలాబలాల సమతూకంలో మార్పును తేవాలను కు న్నారు. ఆయన కథనం ప్రకారమే మన్మోహన్‌ దీనితో విభేదించారు. 

ఆ కాలం నాటి కీలక ఘటనల గురించి మాట్లాడకుండా ఆయన  దాట వేశారు. వాటిలోకెల్లా ముఖ్యమైనవి కుంభకోణాలు, 2జీ కుంభకోణం విష యంలో తన కార్యాలయానికి, ప్రధాని కార్యాలయానికి మధ్య జరిగిన హాస్యస్ఫోరక  ఘటనలు. బాబా రామ్‌దేవ్‌ను ఢిల్లీ విమానాశ్రయంలో కలుసు కుని, ఇతర మంత్రుల సమక్షంలో నల్లధనం గురించి ఒప్పందాన్ని కుదుర్చు కోవడం ఆర్థికమంత్రిగా ఆయన వేసిన అతి పెద్ద తప్పుటడుగు. అయినా 278 పేజీల పుస్తకాన్ని రామ్‌దేవ్‌ బాబా పేరును  ప్రస్తావించకుండా రాయడం నమ్మశక్యం కానిది. ఈ విషయంలో ఆయన మన్మోహన్‌ని లేదా చిదంబరాన్ని తప్పు పట్టలేరు.

ఈ కథనాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ప్రణబ్‌ రాజకీయ జీవితం చూడటానికి పైకి గొప్పగా సఫలమైనదిగా అనిపించినా, వాస్తవంగా అందుకు పూర్తి భిన్నమైనదిగా కనిపిస్తుంది. తనకు న్యాయంగా ఇవ్వాల్సిన పదవిని చాలా సార్లు నిరాకరించారని ఆయన భావిస్తారు. ఇందిర హత్య తర్వాత గాంధీ కుటుంబంలో అంతర్గతంగా చక్రం తిప్పేవారూ, తిరిగి 2004లో సోనియా ప్రధాని మంత్రి పదవిని నిరాకరించారని ఆయన అభి ప్రాయం. కానీ హోంశాఖను అప్పగించడానికి సైతం ఆమె ఆయనను విశ్వ సించలేదు.

ఆమె ఆ తర్వాత 2007లో రాష్ట్రపతి పదవినీ నిరాకరించారు. 2012లో కూడా దాదాపు అంత పని చేశారు. అయినా దాదా వీటిలో దేన్నీ స్పష్టంగా చెప్పలేదు. అయితే దాదా కూడా ఒక మనిషేనని తెలిపే ఒక మాణిక్యం దీనిలో దాగి ఉంది. 2012 జూన్‌ 2న సోనియాతో జరిపిన భేటీ నుంచి వెళుతుండగా ఆయనకు.. ఆమె మన్మోహన్‌సింగ్‌కు రాష్ట్రపతి పదవి కట్టబెట్టి, తనను  ప్రధానిని చేస్తారనే ‘‘అస్పష్ట అభిప్రాయం’’ కలిగింది.  కానీ ప్రణబ్‌ ‘‘లోక్‌సభలో కాస్త మానసిక స్వస్థతను పునరుద్ధరించ’’మని సుష్మా స్వరాజ్‌ను చీవాట్లు పెట్టాక... సోనియా ‘‘ఇందుకే మీరు రాష్ట్రపతి కాలేరు’’ అంటూ మరింత ఆగ్రహాన్ని ప్రదర్శించారు.

వైఫల్యాలకే గర్విస్తారా?
ఈ పుస్తకంలో అక్కడక్కడా పాతిపెట్టిన బంగారు కణికలున్నాయి. ఎమ్‌జే ఆక్బర్‌ ‘‘నా రాష్ట్రపతి అభ్యర్థిత్వం గురించి మరింత గట్టిగా కృషి చేçస్తున్నారు’’ (బీజేపీలోనే) అని పేర్కొన్నారు. మద్దతు కోసం బీజేపీతో మంత నాలు సాగిస్తున్న సంగతిని తన పార్టీకి చెప్పారో లేదో ఎవరికీ తెలియదు. ఆ తర్వాత తను మద్దతు కోసం బాలాసాహెబ్‌ ఠాక్రేను కలుసుకున్నందుకు సోనియా ఎంత పట్టలేని ఆగ్రహాన్ని ప్రదర్శించారో ప్రణబ్‌æ చెప్పారు. దాన్ని బట్టి బీజేపీ  మద్దతును కోరడం పట్ల ఆమె ఎలా ప్రతిస్పందించేవారో ఊహించుకోవచ్చు. దాదా నిలకడగా హితబోధను చేస్తూ, పదే పదే తనను తాను ‘‘పార్టీ నిర్మా ణపు మనిషిని’’ అని అభివర్ణించుకున్నారు. కాబట్టి 2012 నాటి ఆయన ప్రవ ర్తన పూర్తిగా కాం్రVð స్‌ తరహాదేనా? అని అడగడం సమంజసమే. 

రెట్రాస్పెక్టివ్‌ ట్యాక్స్‌ సవరణను తేవడం చిరకాలం నిలిచిపోయే దుర దృష్టకరమైన ప్రతికూలాత్మక వారసత్వం. అయినా ఐదేళ్లుగా ఏ ఆర్థికమంత్రీ ఆ సవరణను వెనక్కు మళ్లించలేకపోయారని గర్వంగా చెబుతారు. పాత ప్రభుత్వ నియంత్రణవాదం తప్ప, ఈ చర్య వల్ల అంతా నష్టపోయిన వారే. తాను ‘‘నియంత్రణాయుత వ్యవస్థ’’ను కోరుకుంటానని మనకు తగినంతగా ముందుగా ఆయన చెప్పారా? మన్మోహన్‌ 1991లోనే బద్ధలు కొట్టిన వ్యవ స్థనే ఆయన ప్రధాని ఉండగా సృష్టించాలని ప్రణబ్‌ ఎందుకు  ప్రయత్నించి నట్టు? అది చెప్పాలంటే మనకు మరింత తక్కువ పక్షపాతి అయిన జీవిత చరిత్రకారుడు కావాలి.

శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement