నేడు 9.30 గంటలకు కౌంట్‌డౌన్ షురూ | PSLV C31 count down begins today | Sakshi
Sakshi News home page

నేడు 9.30 గంటలకు కౌంట్‌డౌన్ షురూ

Published Mon, Jan 18 2016 1:58 AM | Last Updated on Sun, Sep 3 2017 3:48 PM

నేడు 9.30 గంటలకు కౌంట్‌డౌన్ షురూ

నేడు 9.30 గంటలకు కౌంట్‌డౌన్ షురూ

*  పీఎస్‌ఎల్‌వీ సీ-31 రాకెట్ ప్రయోగంపై షార్ నిర్ణయం
* 20న ఉదయం 9.31 గంటలకు ప్రయోగం

 
 శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈ నెల 20న ఉదయం 9.31 గంటలకు ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ-31 రాకెట్‌కు సంబంధించి ఆదివారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో ఎంఆర్‌ఆర్ చైర్మన్ కె.నారాయణ ఆధ్వర్యంలో మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్‌ఆర్) నిర్వహించారు. రాకెట్ అనుసంధానం పనులపై చర్చించారు. అనంతరం ప్రయోగపనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ పి.కున్హికృష్ణన్ ఆధ్వర్యంలో ఆదివారం లాంచ్ రిహార్సల్స్ నిర్వహించి సోమవారం ఉదయం 9.30 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. 48 గంటల కౌంట్‌డౌన్ అనంతరం బుధవారం ఉదయం 9.31 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-31 ఉపగ్రహ వాహకనౌక ద్వారా 1425 కిలోల బరువున్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ ఉపగ్రహాన్ని మోసుకుని వెళ్లి రోదసీలోకి ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.

 ఉపగ్రహంతో ఉపయోగాలివీ..
 భారత క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థ (ఇండియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం) ఉపగ్రహాల శ్రేణిలో ఐదో ఉపగ్రహమైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈను బుధవారం ప్రయోగించనున్నారు. 1,425 కిలోల బరువున్న ఈ ఉపగ్రహంలో రెండు రకాల సాంకేతిక పరికరాలను అమర్చి పంపుతున్నారు. నావిగేషన్ (దిక్సూచి) పేలోడ్స్‌లో ఎల్-5 బ్యాండ్, ఎస్‌బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్స్‌ను పంపుతున్నారు. దీనివల్ల నావిగేషన్ సర్వీస్ సిగ్నల్స్‌ను వేగంగా అందిస్తుంది. రేంజింగ్ పేలోడ్స్‌లో సీ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్స్, రెట్రోరిఫ్లెక్షన్ లేజర్ రేంజింగ్ అనే పరికరాలు పనిచేస్తాయి. ఈ సాంకేతిక పరికరాలన్నీ భారత్‌కు దిక్సూచి వ్యవస్థలను అందిస్తాయి. ఈ ప్రయోగంతో ఐదు ఉపగ్రహాలను పూర్తి చేసుకుని ఫిబ్రవరి, మార్చిలో రెండు ఉపగ్రహాల ప్రయోగాలను పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement