
'జీరో పాయింట్లుతో హీరోగా ఉండండి'
జీరో పాయింట్లు మెయింటెన్ చేస్తూ హీరోగా ఉండండి...
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా, పోలీసు శాఖలు నెగిటివ్ పాయింట్ల విధానాన్ని మంగళవారం నుంచి అమల్లోకి తీసుకువచ్చాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను ఇక జరిమానాలతో సరిపెట్టరు. ప్రతి తప్పిదానికి నిర్దేశించిన మేరకు నెగిటివ్ పాయింట్లు విధిస్తారు. అలా 12 పాయింట్లు దాటితే లైసెన్సు రద్దే. హైదరాబాద్లో ట్రాఫిక్ వ్యవస్థ కచ్చితమైన నిబంధనల ప్రకారం నడిచేలా చూసేందుకు దేశంలోనే మొదటిసారిగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానం అమలవుతోంది. ఇక్కడా పటిష్టంగా దీనిని అమలు చేయడం ద్వారా ప్రయాణం సాఫీగా సాగేలా చూడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. నెగిటివ్ పాయింట్ల విధానం అమలు నేపథ్యంలో డీజీపీ అనురాగ్ శర్మ ట్విట్టర్లో కామెంట్ చేశారు. 'జీరో పాయింట్లు మెయింటెన్ చేస్తూ హీరోగా ఉండండి. 12 పాయింట్ల పెనాల్టీ వ్యవస్థ ఈ రోజు నుంచి హైదరాబాద్లో అమల్లోకి వస్తుంది' అని తెలంగాణ డీజీపీ అధికారిక ఖాతా ట్వీట్ చేసింది.