పక్కాగా తాగునీటి లెక్క | "All projects and reservoirs have reserved 10 percent water for drinking water. | Sakshi
Sakshi News home page

పక్కాగా తాగునీటి లెక్క

Published Wed, Aug 30 2017 4:21 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

పక్కాగా తాగునీటి లెక్క - Sakshi

పక్కాగా తాగునీటి లెక్క

ప్రతి పల్లెకూ నీరందించాలి: సీఎం కేసీఆర్‌
సాక్షి, హైదరాబాద్‌: ‘‘అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో 10 శాతం నీటిని మంచినీటికి రిజర్వు చేశాం. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాల వారీగా నీటి అవసరమెంత అన్న లెక్కలేసుకొని తాగునీటిని అందించాలి..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు అందుబాటులోకి వస్తాయని, దీంతో పాత వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలతోపాటు హైదరాబాద్‌కు తాగునీరందుతుందని చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులకు కొత్త ఆపరేషన్‌ మాన్యువల్స్‌ రూపొందించాలని, రాష్ట్ర నీటి అవసరాలను తీర్చేందుకు ‘డ్రింకింగ్‌ వాటర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ తెలంగాణ’ను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్‌ ఉత్పత్తికి సాగునీటి ప్రాజెక్టుల నుంచి ఎన్ని నీళ్లు కావాలో లెక్కలేసి, వాటి వినియోగానికి సంబంధించి ‘పవర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ తెలంగాణ’ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వ్యవసాయ భూముల రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ఉన్నతస్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలని నిర్ణయించారు.

మంగళవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి వ్యవసాయం, నీటి పారుదల, మిషన్‌ భగీరథ, రెవెన్యూ శాఖలపై సంయుక్త సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు హరీశ్‌ రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్‌కే జోషీ, బీఆర్‌ మీనా, ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌రావు, నీటిపారుదల ఈఎన్‌సీ మురళీధర్, మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు.

‘‘మిషన్‌ భగీరథ అధికారులు రెండు రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడున్న నీటి లభ్యత, వనరులను బట్టి వచ్చే ఏడాది జూలై నాటికి ఉండే పరిస్థితిని అంచనా వేసి ఒక ప్రణాళిక వేసుకోవాలి. కాళేశ్వరం నీళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత శాశ్వత ప్రణాళిక తయారు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా నీటి అవసరాలపై లెక్కలేసుకొని తాగునీరు అందించాలి’అని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. హైదరాబాద్‌ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా తలపెట్టిన రెండు రిజర్వాయర్ల నిర్మాణం వేగంగా జరగాలని చెప్పారు.

మండలానికో రిజిస్ట్రార్‌ కార్యాలయం
ప్రతీ మండలానికో రిజిస్ట్రార్‌ కార్యాలయం ఏర్పాటు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శిని సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఉన్న రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, రిజిస్ట్రార్లను యథావిధిగా కొనసాగిస్తూ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు లేని మండలాల్లో కొత్తవి నెలకొల్పాలని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసే రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు రిజిస్ట్రార్లుగా మండల రెవెన్యూ అధికారికే అదనపు బాధ్యతలు అప్పగించాల న్నారు. అవినీతికి, జాప్యానికి ఏమాత్రం అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్‌ విభాగంలో సంస్కరణలు అమలు చేస్తున్నామ న్నారు. మండల స్థాయిలోనే రిజిస్ట్రార్‌ కార్యాలయం ఉండటం వల్ల ప్రజల కు మేలు జరుగుతుం దని పేర్కొన్నారు. రెవెన్యూ కార్యాలయా ల్లో భూ రికార్డుల నిర్వహ ణకు, కోర్‌ బ్యాంకింగ్‌ తరహాలో భూముల క్రయవిక్ర యాల వివరాల నమోదుకు వెయ్యి మంది ఐటీ అధికారులను నియమించాలని సీఎం ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌ అయిన రోజే మ్యుటేషన్‌ కూడా పూర్తి కావాలన్నారు.

పహాణీలు సరళతరం చేయండి
ప్రస్తుతం పహాణీలో ఉన్న 31 కాలమ్స్‌ అవసరమా.. లేదా అన్న అంశంపై ఆలోచన చేసి, వాటిని సరళతరం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ‘‘గతంలో భూమి శిస్తు వసూలు చేసే వారు. దానికి అనుగుణంగా పహాణీలు తయారు చేశారు. కానీ ఇప్పుడు భూమి శిస్తు లేదు. పైగా ప్రభుత్వమే ఎకరాకు రూ. 8 వేల చొప్పున పెట్టుబడి అందించనుంది. అందుకే పహాణీల్లో అక్కర్లేని కాలమ్స్‌ తొలగించాలి. గ్రామాల్లో ప్రభుత్వ భూములు, అసైన్డ్‌ భూములు, అటవీ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్‌ భూములు, ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ఉన్న భూముల రికార్డులు ప్రత్యేకంగా నిర్వహించాలి.

భూ వివాదాలకు సంబంధించి ఇన్ని కోర్టులు అవసరం లేదు. కలెక్టర్‌ కోర్టు ఒక్కటే ఉండాలి. మిగతావి రద్దు చేయాలి. పట్టాదారు పాస్‌ పుస్తకాల్లో, పహాణీల్లో వాడే భాష సరళంగా, అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. అర్థం కాని పదా ల బదులు అందరికీ అర్థమయ్యే తెలుగు భాషను వాడాలి. పహాణీలను కంప్యూటర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు ఉండాలి. వ్యవసాయ శాఖకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రత్యేకమైన బడ్జెట్‌ రూపొందిస్తున్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర అధికారులతో సమావేశం నిర్వహించి, విధి విధానాలను ఖరారు చేయాలి’’అని సూచించారు.

ప్రతి ప్రాజెక్టుకూ మాన్యువల్‌
‘‘గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టులు కడుతున్నాం. ఏ ప్రాజెక్టు నుంచి సాగునీరు ఎంతివ్వాలి? మంచినీరు ఎంతివ్వాలి? విద్యుత్‌ కేంద్రాలకు ఎంత నీరు ఇవ్వాలి? పరిశ్రమలకు ఎంతివ్వాలి? అనే విషయాల్లో స్పష్టత ఉండాలి’’ అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రాజెక్టుల్లో చేరిన నీరును కూడా ప్రాధాన్యతల వారీగా విడుదల చేయాలని చెప్పారు. అందుకు తగిన ప్రత్యేక విధానం అమలు చేయాలని సూచించారు.

‘‘రాష్ట్ర రాజధాని నుంచి వచ్చే సూచనలు, ఆదే శాలను పరిగణనలోకి తీసుకొని నీటిని విడుదల చేయాలి. సాగునీటి ప్రాజెక్టుల నీటి వినియోగం విషయంలో పరిస్థితులను బట్టి వ్యవహరించేం దుకు ‘డ్రింకింగ్‌ వాటర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ తెలంగాణ’ ను నెలకొల్పాలి. ఇలాగే పవర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ తెలంగాణను ఏర్పాటు చేయాలి. ఏ ప్రాజెక్టు నుంచి ఏ విద్యుత్‌ కేంద్రానికి ఎంత నీరు అవసరం.. వాటినెలా పొందాలో స్పష్టమైన అంచనాకు రావాలి. పరిశ్రమలకు కూడా ఇదే విధమైన ఏర్పాటు ఉండాలి’’అని వివరించారు.

31న వ్యవసాయాధికారుల సమావేశం
ఈ నెల 31న హైదరాబా ద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవ సాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయాధి కారుల సమావేశం జరగనుంది. ఇందులో ముఖ్యమంత్రి ప్రారంభోపన్యాసం చేస్తారు. భూ రికార్డుల ప్రక్షాళన, రైతు సంఘాలు, రైతు సమన్వయ సమితుల నిర్మాణం, రైతు వేదికల ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించి అధికారులు ఈ సమావేశంలో చర్చిస్తారు.
రేపు కలెక్టర్ల సమావేశం
భూ రికార్డుల ప్రక్షాళనకు సంబంధించి క్షేత్రస్థాయిలో జరగాల్సిన కార్యక్రమాలపై మార్గనిర్దేశనం చేసేందుకు గురువారం (ఈ నెల 31న) జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం రోజంతా కొనసాగనుంది. సెప్టెంబర్‌ 1 నుంచి రైతు సమన్వయ కమిటీల నియామకం, సెప్టెంబర్‌ 15 నుంచి రికార్డుల పరిశీలన ప్రారంభమవుతుంది. రికార్డుల ప్రక్షాళన, రికార్డుల నిర్వహణ, పట్టాదారు పాస్‌ పుస్తకాల్లో మార్పులు, పహాణీ పత్రాల్లో మార్పులు, రిజిస్ట్రేషన్‌ విషయంలో సంస్కరణలు తదితర అంశాలపై విధివిధానాలకు తుదిరూపమిచ్చి కలెక్టర్ల సమావేశంలో వెల్లడించాలని సీఎం నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement