
'చంద్రబాబుపై క్రిమినల్ కేసు పెట్టాలి'
హైదరాబాద్ : రాజమండ్రి పుష్కరాల తొక్కిసలాటలో భక్తులు చనిపోవడం బాధాకరమని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ పుష్కర ఏర్పాట్ల వైఫల్యం వల్ల అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలన్నారు.
మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్పై కూడా గండ్ర మండిపడ్డారు. తెలంగాణలో పుష్కర ఏర్పాట్లలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. పుష్కర ఘాట్లలో నీటి కొరతతో భక్తులు ఇబ్బంది పడుతున్నారని, మహారాష్ట్ర సర్కార్ను ఒప్పించి గోదావరి జలాలను రప్పించడంలో కేసీఆర్ విఫలం అయ్యారని ఆయన ఆరోపించారు.
కాగా రాజమండ్రిలోని పుష్కర ఘాట్ వద్ద ఈ రోజు ఉదయం జరిగిన తొక్కిసలాటలో 27మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.