
సిలిం‘డర్’
- పండగ వేళ పెరిగిన డిమాండ్
- లక్షన్నరపైనే పెండింగ్ కాల్స్
- బ్లాక్ మార్కెట్లో యథేచ్ఛగా దొరుకుతున్న వైనం
సాక్షి, సిటీబ్యూరో: పండగ వేళ నగరవాసికి వంట గ్యాస్ గుబులు పట్టుకుంది. బుక్ చేసి వారం రోజులు గడుస్తున్నా గ్యాస్ సిలిండర్ ఇంటికి డెలివరీ కావడం లేదు. వంటగ్యాస్ కొరత వెంటాడుతుండటంతో సంక్రాంతి ఉత్సాహం నీరుగారుతోంది. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల పరిధిలో వంట గ్యాస్ కోసం పది రోజుల్లోనే లక్షన్నరకు పైగా కాల్స్ పెండింగ్లో పడిపోయాయి.
స్టాఫ్వేర్ లోపం కారణంగా ఆయిల్ కంపెనీల నుంచి సిలిండర్ల సరఫరా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. దీంతో గత వారం వ్యవధిలో వంట గ్యాస్ కాల్స్ పెరిగి డిమాండ్ ఒకేసారి రెండితలైంది. మహానగరం పరిధిలో హిందుస్థాన్ పెట్రోలియం(హెచ్పీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీ) కంపెనీల డీలర్ల వద్ద వేలాది పెండింగ్ కాల్స్ మగ్గుతున్నాయి. అయితే ఏజెన్సీల వద్ద లేవంటున్న గ్యాస్ బండలు బ్లాక్ మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుండటం విశేషం.
సింగిల్ సిలిండర్తో పరేషాన్
హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో ప్రస్తుతం 28.21 లక్షల ఎల్పీజీ వినియోగదారులు ఉం డగా.. అందులో 40 శాతం వరకు సింగిల్ సిలిండర్ కనె క్షన్లే. వంటగ్యాస్ కొరతతో సింగిల్ సిలిండర్ వినియోగదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పోనీ బ్లాక్లో కొందామంటే అధికమొత్తం వెచ్చించలేని దుస్థితి. ఈ నేపథ్యంలో పిండివంటలు కాదు కదా కనీసం వంట చేద్దామన్నా ఎటూ పాలుపోని పరిస్థితి. ఫలితంగా మొత్తం కనెక్షన్దారుల్లో లక్షన్నర మంది వినియోగదారులు బుకింగ్ చేసుకొని గ్యాస్ బండ కోసం వేచిచూస్తున్నారు.
వీరిలోనూ ఐవోసీ వినియోగదారులే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఎల్పీజీ గ్యాస్ నిబంధనలను ఏజెన్సీలు ప్రస్తుతం గాలికి వదిలేశాయి. గతంలో గ్యాస్ బండ డెలివరీ అయిన తర్వాత మరో గ్యాస్బండ బుక్ చేసుకునేందుకు 21 రోజులు వ్యవధి ఉండాలన్న నిబంధన ఉండేది. కానీ సబ్సిడీ సిలిండర్లపై పరిమితి విధించినందువల్ల 21 రోజుల వ్యవధిలో డెలివరీ నిబంధనను ఎత్తేశారు. ప్రస్తుతం గ్యాస్ బుక్ చేసిన 24 గంటల్లో డెలివరీ చేయాల్సి ఉంది. ఎందుకంటే వినియోగదారుల పరిమితికి లోబడి సబ్సిడీ సిలిండర్ల సరఫరా ఉంటుంది.
మిగితా సిలిండర్లను వారు నాన్సబ్సిడీపై కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం డీబీటీ అమలవుతున్న కారణంగా సబ్సిడీ నగదు బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నా.. సిలిండర్ను మాత్రం వినియోగదారులు మార్కెట్ ధర చెల్లించే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్యాస్ ఏజెన్సీలు బుక్ చేసిన 24 గంటల్లోనే గ్యాస్ సిలిండర్ను డెలివరీ చేస్తున్నాయి. గత తొమ్మిది మాసాల నుంచి ఇదే పరంపర కొనసాగుతున్నా.. మధ్యమధ్యలో పెండింగ్ కాల్స్ తప్పడం లేదు. తాజాగా పండగ వేళ గ్యాస్ డెలివరీనత్తలకు నడక నేర్పిస్తున్నట్లుంది.
కొరత కృత్రిమమేనా?: డొమెస్టిక్ వంటగ్యాస్ వినియోదారులకు సబ్సిడీపై ఈ ఏడాది మార్చి వరకు తొమ్మిది సిలెండర్లు మాత్రమే సరఫరా కానున్న విషయం తెలిసిందే. ఏడాది అంటే ఆర్థిక సంవత్సరాన్ని (ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి మార్చి 31 వరకు) ప్రాతిపదికగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు గడిచిన తొమ్మిది మాసాల్లో ప్రతి వినియోగదారుడు కనీసం ఆరు నుంచి ఎనిమిది సిలెండర్ల వరకు వినియోగించి ఉంటారన్నది అంచనా. ఫలితంగా కొందరు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు సమీపిస్తుండటంతో చేతివాటం కూడా ప్రదర్శిస్తూ కృతిమ కొరత సృష్టిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.