ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గట్టు పర్యటన
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ఈ నెల 22న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. 22న తొలుత మంచిర్యాలలోని శ్రీరాంపూర్లోని సింగరేణి ఓపెన్కాస్ట్ గనులను పరిశీలిస్తారు. అక్కడ కార్మికులతో సమావేశమై సింగరేణి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకొంటారు. ఆ మేరకు రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
అనంతరం మంచిర్యాల జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జరిగే విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. అటు తర్వాత నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సదర్మాట్ ఆనకట్టను సందర్శిస్తారు. అనంతరం నిర్మల్ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి, ఆ తర్వాత విలేకరులతో సమావేశంలో పాల్గొంటారు.