అలా ఆదేశాలివ్వలేం | High Court comments on Indian Science Congress | Sakshi
Sakshi News home page

అలా ఆదేశాలివ్వలేం

Published Wed, Jan 3 2018 3:36 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM

High Court comments on Indian Science Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌’సమావేశాలను నిర్వహిస్తున్న ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌సీఏ) ప్రభుత్వానికి చెందిన సంస్థో?... కాదో?.. తెలియజేయాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. అది ప్రభుత్వానికి చెందిన సంస్థ కాని పక్షంలో తాము ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలను ఫలానా చోటనే నిర్వహించాలనీ ఆదేశాలు ఇవ్వలేమంది. సమావేశాలపై ప్రభుత్వం తప్పు డు నివేదిక ఇచ్చిందని పిటిషనర్లు ఆరోపిస్తున్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వాన్ని వివరణ కోరుతామంది.

తదుపరి విచారణను 23కి వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయ మూర్తి జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలను అంతకు ముందు నిర్ణయించిన విధంగానే ఓయూలో నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వడంతో పాటు, ఈ సమావేశాలకు సహాయ సహకారాలను అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పీహెచ్‌డీ విద్యార్థులు కిరణ్‌కుమార్, విజయకుమార్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయ వాది వాదనలు వినిపిస్తూ, సమావేశాలకు ఓయూ రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వెచ్చించి ఏర్పాట్లు చేసిందన్నారు. భద్రత విషయంలో ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు నివే దిక వల్ల సమావేశాల వేదికను నిర్వాహకులు వేరే చోటికి తరలించారన్నారు. సమావేశాలు నిర్వహిస్తున్న ఐఎస్‌సీఏ ప్రభుత్వానికి చెందిన సంస్థా? కాదా? అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఎవరూ సమాధానం చెప్పకపోవడంతో, ఈ విషయంలో స్పష్టతనివ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదిని ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement