
హోదా గళాలకు సంకెళ్లు
సాక్షి, హైదరాబాద్ : లక్షలాది మంది యువత భవిష్యత్తుకు ఆధారమైన ప్రత్యేక హోదా కోసం శాసనసభలో నినదించిన వైఎస్సార్సీపీ సభ్యులకు అసెంబ్లీ హక్కుల కమిటీ నోటీసులు జారీ చేయడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. పార్లమెంట్ సాక్షిగా సాక్షాత్తూ ప్రధాన మంత్రి ఇచ్చిన హోదా హామీ అమలు కోసం పోరాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం... అందుకోసం అలుపెరుగక ఉద్యమిస్తున్న ప్రతిపక్షానికి అడ్డంకులు సృష్టించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తూ అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేసినా ప్రత్యేక హోదా అంశాన్ని సభలో లేవనెత్తడమే తీవ్రమైన నేరమన్నట్లు నోటీసులు ఇవ్వడం పట్ల వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మనకు హక్కుగా సంక్రమించాల్సిన హోదా కోసం పోరాటం చేయడమే నేరమా? అని ప్రశ్నించింది. ఈ నోటీసుల వెనుక రాజకీయ కోణం ఉందని మాజీ స్పీకర్ సురేశ్రెడ్డి చెప్పారు.
వైఎస్సార్సీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ హక్కుల కమిటీ నోటీసులు జారీ చేసింది. త్వరలో జరగనున్న కమిటీ సమావేశానికి హాజరై అభిప్రాయాలు వెల్లడించాలని ఆదేశించింది. 25 తేదీన ఆరుగురు, 26వ తేదీన మరో ఆరుగురు కమిటీ ముందు హాజరు కావాలని పేర్కొంది. ఈ మేరకు శాసనసభ ఇన్చార్జి కార్యదర్శి 12 ఎమ్మెల్యేలకు లేఖలు రాయడం గమనార్హం. సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో రాష్ట్ర శాసనసభా సమావేశాల్లో తమ వాణి వినిపించేందుకు పట్టుపట్టిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్లో 12 మందికి సభా హక్కుల కమిటీ నోటీసులు జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సభలో నినదించడం కొత్తేమీ కాదు
‘‘భారత పార్లమెంట్ చరిత్ర తీసుకున్నా... రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాలను పరిశీలించినా ప్రతిపక్షాలు చట్టసభల్లో ప్రజాభిప్రాయాన్ని వినిపించేందుకు గట్టిగా ప్రయత్నించడం కొత్తేమీ కాదు. కీలకమైన, ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉన్న అంశాలపై రోజుల తరబడి చట్టసభల్లో తమ వాణిని వినిపించడానికి ప్రయత్నించిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి’’ అని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీపడిపోయి, ప్యాకేజీని స్వాగతించినందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు మూడు రోజులు సభలో నిరసన వ్యక్తం చేశారు.
ప్యాకేజీని అర్ధరాత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించిన తీరును తీవ్రంగా తప్పుపడుతూ... దానిపై కూలంకషంగా చర్చ జరగాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ప్రత్యేక హోదాపై ప్రజా ప్రతినిధులు ఆందోళన చే యడమే నేరమైనట్లుగా ప్రభుత్వం వ్యవహరించడం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 12 మందికి సభా హక్కుల కమిటీ నోటీసులు జారీ చేయడం అనుచితమని విమర్శిస్తున్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గట్టిగా గళమెత్తినప్పుడల్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి, వేధింపులకు గురి చేయడం ఏపీ అసెంబ్లీలో పరిపాటిగా మారిపోయిందని సీనియర్ రాజకీయవేత్త ఒకరు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సింది రాష్ట్ర ప్రభుత్వం మౌనం దాల్చినా ప్రతిపక్షం ఊరుకోదు కదా! అని పేర్కొన్నారు.
ప్రతిపక్షాన్ని బలహీనపర్చే కుట్ర
సభా హక్కుల కమిటీ నోటీసుల జారీ వెనుక అసలు ఉద్దేశం వేరే ఉందన్న అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. 2014 ఎన్నికల అనంతరం రాష్ట్రంలో 67 మంది ఎమ్మెల్యేలతో బలీయంగా ఉన్న వైఎస్సార్సీపీని బలహీనం చేయాలని అధికార పార్టీ ఎన్నో ఎత్తులు వేసింది. వైఎస్సార్సీపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తన వైపునకు లాక్కుంది. ఇప్పుడు సభా హక్కుల ఉల్లంఘనసాకుతో మరో 12 మంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తే ప్రతిపక్ష సభ్యుల సంఖ్యను మరింత తగ్గించవచ్చనే వ్యూహం ఇందులో దాగి ఉన్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్యేల ప్రవర్తన అనుచితంగా ఉందని భావిస్తే ఈ అంశాన్ని తొలుత ఎథిక్స్ కమిటీకి నివేదించి ఉండాలి. అలా కాకుండా ఏకంగా ప్రివిలేజెస్ కమిటీకి నివేదించి హడావుడిగా నోటీసులు జారీ చేయడం వెనుక ఆంతర్యం ఇదేనని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
నోటీసుల వెనుక రాజకీయ కోణం
ప్రత్యేక హోదా కోసం సభలో ఆందోళన చేయడం నేరమవుతుందా? అని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి నిలదీశారు. కీలకమైన అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజీపడిపోవడాన్ని ప్రేక్షకుల్లా చూస్తూ ఊరుకుంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఇక తామెందుకు? అని ప్రశ్నించారు. ఇలా ముందూ వెనుక చూడకుండా నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ కోణమే ఉంది తప్ప మరేమీ లేదని శాసనసభ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్రెడ్డి అభిప్రాయపడ్డారు.
సభ్యులపై వేటుకు హక్కుల కమిటీని వాడుకుంటారా?
వైఎస్సార్సీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలకు శాసనసభ హక్కుల కమిటీ నోటీసులు జారీ చేయడం వెనుక అధికార పార్టీ పెద్ద కుట్రకు తెరలేపిందని గుంటూరు జిల్లాకు చెందిన మాజీ సీనియర్ శాసనసభ్యులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేసిన అధికార పక్షం తాజాగా మరో 12 మందిపై వేటు వేయడానికే హక్కుల కమిటీని వాడుకోబోతోందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబట్టారన్న విస్తృతాంశాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం వాంఛనీయం కాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సభను స్తంభింపజేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమేనని తెలిపారు.
ఇక అసెంబ్లీ ఎందుకు?
ప్రజా సమస్యలపై శాసన సభలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకపోతే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేమిటని సీపీఐ మాజీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ ప్రశ్నించారు. అసెంబ్లీలో విపక్షానికి విలువే లేకుండా చేసిన అధికార పక్షం ఇప్పుడు ఏకంగా 12 మందికి నోటీసులు ఇవ్వడం ఏ తరహా ప్రజాస్వామ్యానికి నిదర్శనమని నిలదీశారు. తాను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో ఇంతకన్నా పెద్దపెద్ద గొడవలే జరిగినా అవి ఏ ఉద్దేశంతో జరిగాయో అప్పటి స్పీకర్లు గమనించి సభా సంప్రదాయాలను కాపాడారని గుర్తుచేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని ఇప్పటికీ తేల్చకుండా నెల రోజుల కిందట జరిగిన వ్యవహారాన్ని ఇంత హడావిడిగా ఎందుకు తెరపైకి తెచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తోందని మండిపడ్డారు.