ఇక ఆన్లైన్ ఎడ్యుకేషన్
డ్రాఫ్టు రెగ్యులేషన్స్ రూపొందించిన యూజీసీ
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా విద్యా సంస్థల్లో ఇక ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ను రూపొందించింది. వాటిపై వచ్చే నెల 18 వరకు ఈ మెయిల్ ugc.online2017@gmail.com ద్వారా అభిప్రాయాలు తెలియజేయాలని పేర్కొంది. ఈ రెగ్యులేషన్స్ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (ఆన్లైన్ ఎడ్యుకేషన్) రెగ్యులేషన్స్– 2017గా పిలుస్తామని తెలిపింది. గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యాక ఈ రెగ్యులేషన్స్ అమల్లోకి వస్తాయని పేర్కొంది.
రెగ్యులేషన్స్లోని ప్రధాన అంశాలు..
► ఐదేళ్లుగా పనిచేస్తున్న చేస్తున్న యూనివర్సిటీ ఆన్లైన్ కోర్సులు నిర్వహించవచ్చు.
► 3.25 నుంచి 4 పాయింట్లతో న్యాక్ అక్రెడిటేషన్ కలిగిన ఉన్నత విద్యా సంస్థలు నిర్వహించవచ్చు.
► ఆయా విద్యా సంస్థలు రెగ్యులర్గా నిర్వహిస్తున్న కోర్సులను మాత్రమే ఆన్లైన్ ద్వారా నిర్వహించవచ్చు.
► విద్యా సంస్థలు ప్రోగ్రాం ప్రాజెక్టు రిపోర్టు (పీపీపీ) సిద్ధం చేసి తమ అకడమిక్ కౌన్సెళ్లలో ఆమోదం తీసుకున్నాకే ఆన్లైన్ ఎడ్యుకేషన్ నిర్వహణకు దరఖాస్తు చేసుకోవాలి.
► ప్రోగ్రాం నిర్వహణకు ఒక డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్/డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ డైరెక్టర్/అసిస్టెంట్ రిజిస్ట్రార్, ప్రోగ్రాం కోఆర్డినేటర్, కోర్సు కోఆర్డినేటర్, ఒక టీచింగ్ అసిస్టెంట్ ఉండాలి. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలను యూజీసీ వెబ్సైట్లో పొందవచ్చు.