University Grants Commission
-
వర్సిటీలపై ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని రుద్దే కుట్ర
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) విడుదల చేసిన నూతన మార్గదర్శకాలు దేశ సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేలా ఉన్నాయని మేధావులు ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వర్సిటీలపై రుద్దే కుట్రలో భాగంగానే ఈ మార్గదర్శకాలను రూపొందించారని ఆరోపించారు. రాష్ట్ర విద్యా కమిషన్ నేతృత్వంలో ‘యూనివర్సిటీ రెగ్యులేషన్స్ – రాష్ట్ర యూనివర్సిటీల్లో జోక్యం’ అనే అంశంపై గురువారం హైదరాబాద్లో నిర్వహించిన సదస్సులో విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, జస్టిస్ సుదర్శన్రెడ్డి, ప్రొఫెసర్లు హరగోపాల్, శాంతాసిన్హా, రాం మెల్కొటే, డి.నర్సింహారెడ్డి, తిరుపతిరావు, మురళీ మనోహర్, ఎస్.సత్యనారాయణ, అమీర్ ఉల్లాఖాన్, కె.లక్ష్మీనారాయణ, పద్మాషా, డాక్టర్ చరకొండ వెంకటేశ్ తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. యూజీసీ మార్గదర్శకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాల వ్యాప్తికే: మురళి విశ్వవిద్యాలయాల అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకోవడానికే యూజీసీ కొత్త మార్గదర్శకాలను తెచ్చిందని ఆకునూరి మురళి విమర్శించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. బోదన, బోధనేతర సిబ్బంది నియామకాలన్నీ కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తోందని ఆరోపించారు. యూనివర్సిటీకి వైస్ చాన్స్లర్గా నియమించాలంటే పీహెచ్డీ చేసి, పదేళ్లు ప్రొఫెసర్గా పనిచేసి ఉండాలనే నిబంధనను యూజీసీ ముసాయిదా మార్గదర్శకాల్లో పూర్తిగా మార్చేశారని తెలిపారు. పరిశ్రమలు, అకడమిక్ అడ్మినిస్ట్రేటర్ , పబ్లిక్ సెక్టార్లో.. ఇలా నచ్చిన వారిని ఎలాంటి నిబంధనలు లేకుండా నియమించుకునే అధికారం కేంద్రం తన చేతుల్లోకి తీసుకునేలా మార్గదర్శకాలు ఉన్నా యని చెప్పారు. మితిమీరిన జోక్యం: ప్రొఫెసర్ కోదండరాం విశ్వవిద్యాలయాలపై కేంద్రం మితిమీరిన జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. రాజకీయాలకు అతీతంగా యూనివర్సిటీలు ఉండేలా చూ సేందుకు ఏర్పాటుచేసిన యూజీసీనే ఇప్పుడు రాజకీయం చేయడం దారుణమన్నారు. జస్టిస్ సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. వర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడేందుకు అన్నివర్గాలు సమైక్యంగా గళమెత్తాలన్నారు. వీసీలను నియమించే అధికారం ఇప్పటికే గవర్నర్ చేతుల్లో ఉందని, ఆ గవర్నర్ను కేంద్రమే తన ప్రతినిధిగా నియమిస్తుందని గుర్తుచేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై కూడా ఈ తరహా చర్చలు ఎందుకు పెట్టడం లేదని ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్స్ అసోసియేషన్ నేత ఆజాద్ సదస్సులో ప్రశ్నించారు. -
పడిపోతున్న వర్సిటీల ప్రమాణాలు
రాష్ట్రాల జాబితాలోని అంశాలు కొన్నింటిని, ఉమ్మడి జాబితాలోని అంశాల్లో మరి కొన్నింటిని క్రమంగా దొడ్డిదారిన తన ఖాతా ల్లోకి మళ్లించుకొంటూ ఇప్పటికే కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని అపహాస్యం చేస్తోంది. తాజాగా విశ్వవిద్యాలయాల్లో సంస్కరణల పేరుతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ద్వారా రూపొందించిన ముసా యిదాను బలవంతంగా రాష్ట్రాలపై రుద్ది, యూనివర్సిటీలపై పూర్తి స్థాయి పట్టుసాధించడానికి కేంద్రం అడుగులు వేయడంతో మరో కొత్త వివాదం మొగ్గ తొడిగింది.యూజీసీ ప్రతిపాదించిన సంస్కరణలు అమలులోకి వస్తే...ఎంతో కీలకమైన వైస్ ఛాన్స్లర్ల నియామకాల్లో రాష్ట్రాలకున్న హక్కు లుప్తమైపోతుంది. ఇప్పటివరకు ఉపకులపతులుగా అర్హులైన వారిని నియమించడానికి సెర్చ్ కమిటీ వేయడం ఆనవాయితీగా ఉంది. సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రతినిధి ఒకరు ఉంటారు. సెర్చ్ కమిటీ ఎంతో కసరత్తు జరిపి 5 పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపితే... దానిని పరిశీలించి ఒక అభ్యర్థిని ఎంపిక చేసి గవర్నర్ ఆమోదానికి పంపుతుంది. కానీ, కొత్తగా వచ్చే సంస్కరణల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయానికి కత్తిరింపు వేశారు. నిజానికి, రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల్ని హరించే సంస్కరణలు చాలానే యూజీసీ ప్రతిపాదించింది. ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతాయా అన్న అంశం పక్కన పెడితే... అసలు యూనివర్సిటీల్లో చేపట్టాల్సిన సంస్కరణలు ఏమిటి? నాణ్యతా ప్రమాణాలు పెంచే సంస్కరణలు కాకుండా పెత్తనం కోసం కేంద్రం వెంపర్లాడటం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.సంస్కరణలు ఏ రంగంలో చేపట్టాలి?మన దేశంలోని పలు యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళా శాలల విద్యా ప్రగతి ప్రమాణాలు పాతాళానికి పడిపోయాయన్నది నిర్వివాదాంశం. ఆర్థిక, సాంకేతిక అభివృద్ధికి బంగారు బాటలు వేయ డంలో ఉన్నత విద్య, పరిశోధన కీలకమైనవి. ఆరోగ్యం, ఆహారం, ఉపాధి తదితర రంగాలలో ఎదురయ్యే సవాళ్లకు తగిన పరిష్కారం అందించే పరిశోధనలు పురుడుపోసుకొనేది యూనివర్సిటీ ప్రాంగణాలలోనే. వివిధ దేశాలలో జరుగుతున్న పరిశోధనలు, ఆవిష్కరణలతో పోలిస్తే భారత్ ఎంతో వెనుకబడి ఉంది. ఒకప్పుడు దేశానికి గర్వకారణంగా నిలిచిన యూనివర్సిటీలు పలు రుగ్మతలతో కునారి ల్లుతున్నాయి. నిధుల లేమి, రాజకీయ జోక్యం, బోధనా సిబ్బంది కొరత, అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం తదితర కారణాలతో యూనివర్సిటీల ప్రమాణాలు గణనీయంగా పడి పోయాయి. గతేడాది ‘క్యూఎస్’ అనే ప్రఖ్యాత సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 107 దేశాల్లోని 1,740 యూనివర్సిటీలను అధ్యయనం చేసి ర్యాంకులు ఇవ్వగా అందులో భారత్కు చెందిన 78 యూనివర్సి టీలు మాత్రమే ఆ ప్రమాణాలు అందుకోగలిగాయి.ఒకప్పుడు ప్రపంచానికి దిశానిర్దేశనం చేసి, వేల సంఖ్యలో గొప్ప విద్యావేత్తలను అందించిన నలంద, తక్షశిల, విశ్వభారతి, శాంతిని కేతన్ వంటి అత్యున్నత విద్యా పీఠాలు గలిగిన భారతదేశంలో నేడు అనేక యూనివర్సిటీలలో విద్యా ప్రమాణాలు అడుగంటాయి. ఆవిష్కరణలకు మాతృమూర్తి వంటి విశ్వవిద్యాలయాలు విజ్ఞాన వెలుగులు ప్రసరించాలంటే అందుకు అనుగుణంగా మౌలిక సదు పాయాలు, నిష్ణాతులైన బోధనా సిబ్బంది ఉండాలి. రాజకీయ జోక్యానికి తావులేకుండా సమర్థత, అంకితభావం కలిగిన వ్యక్తులకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. విశ్వగురువు ఎలా అవుతాం?2047 నాటికి మన దేశం ‘విశ్వగురువు’గా అవతరించాలని ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పంగా పెట్టుకొన్నారు. ఈ లక్ష్యం గొప్పదే. అందుకు తగిన కార్యాచరణ అన్ని రంగాలలో కనపడాలిగా! ప్రత్యేకించి ఉన్నత విద్యారంగంలో, పరిశోధనా రంగంలో అభివృద్ధి పథంవైపు అడుగులు పడాలి. అందుకు భిన్నంగా ఈ రంగంలో అడు గులు తడబడుతున్నాయి. అందుకు ఉదాహరణ దేశం నుంచి సుమారు 13 లక్షల మంది విద్యార్థులు నాణ్యమైన విద్య కోసం విదే శాల బాట పట్టడం. నాణ్యమైన ఉన్నత విద్యకు చిరునామాగా నేటికీ అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలే నిలుస్తు న్నాయి. వైద్య విద్య కోసం ఒకప్పటి కమ్యూనిస్టు దేశాలైన రష్యా, అజర్జైబాన్, ఉక్రెయిన్ తదితర దేశాలకు భారతీయ విద్యార్థులు వేల సంఖ్యలో ‘క్యూ’ కడుతూనే ఉన్నారు. జబ్బు ఒకటయితే, మందు మరొకటి వేసినట్లుగా... దేశంలోని విశ్వవిద్యాలయాలను అన్ని విధాలా బలోపేతం చేసే చర్యలను తీసు కోకుండా, దేశంలో విదేశీ యూనివర్సిటీలకు ద్వారాలు తెరిచేందుకు రంగం సిద్ధం చేయడం, యూనివర్సిటీలపై రాష్ట్రాల హక్కుల్ని హరించి వేయడం విద్యావేత్తలను కలవరపరుస్తోంది. మరోవైపు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన స్వదేశీ విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేస్తున్నారు.దేశంలో విదేశీ యూనివర్సిటీల ఏర్పాటుకు మార్గాన్ని ఏర్ప రిస్తే... ఎటువంటి విదేశీ యూనివర్సిటీలు ఇక్కడకు వస్తాయి? ప్రపంచంలో పేరు బడిన తొలి 50 యూనివర్సిటీలు భారత్ కొస్తాయా? అని ప్రశ్నించుకొంటే స్పష్టమైన సమాధానం దొరకదు. పైగా ఇక్క డకు వచ్చే విదేశీ యూనివర్సిటీలపై తమ నియంత్రణ ఏదీ ఉండదనీ, కానీ పారదర్శకతతో ఉండాలని మాత్రమే కోరతామనీ యూజీసీ స్పష్టం చేసింది. అంటే... ఫీజుల వసూళ్ల విషయంలో విదేశీ వర్సిటీ లకు స్వేచ్ఛ ఉంటుంది. అయితే అవి ప్రదానం చేసే డిగ్రీలకు, విదేశాలలో ఇచ్చే పట్టాలకు సమానమైన విలువ ఉంటాయన్నది ఒక్కటే విద్యార్థులను ఆకర్షిస్తోంది. విదేశీ యూనివర్సిటీలు ఇక్కడ ఎంత పెట్టుబడి పెట్టాలో ముసాయిదా పత్రంలో నిర్దేశించకపోవడంతో అవి మన బ్యాంకుల నుంచే రుణాలు పొంది, వాటితోనే మౌలిక సదుపా యాలు ఏర్పాటు చేసి, లాభాల్ని మాత్రం తమ దేశానికి తీసుకెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. పైగా విదేశీ యూనివర్సీటీలలో సంపన్నుల పిల్లలు మాత్రమే చదువు‘కొనే’ అవకాశం ఉన్నందువల్ల... దేశంలో ‘సంపన్న విద్యార్థి శ్రేణి’ మరొకటి నూతనంగా తయారవుతుంది.బోధన–పరిశోధనఒకప్పుడు దేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో జరిపిన పరి శోధనలకు అంతర్జాతీయంగా పేటెంట్లు లభించాయి. ఒక అంచనా ప్రకారం... దేశంలోని మన వర్సిటీలు ఏటా 24,000 డాక్టరేట్ పట్టాల్ని ప్రదానం చేస్తున్నాయి. అంటే ఏటా వేల సంఖ్యలో పరిశో ధనా పత్రాలు వెలువడుతున్నాయి. కానీ... వాటిని దేశాభివృద్ధి కోసం ఏ మేరకు ఉపయోగించుకోగలుగుతున్నారనేదే ప్రశ్నార్థకం. అసలు రీసెర్చ్ ఈ అంశం మీద జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా... స్వదేశీ విశ్వవిద్యాలయాలకు రెండు కళ్లుగా భావించే బోధన, పరిశోధనలను పటిష్ఠం చేయాలి. విదేశీ విశ్వ విద్యాలయాల మోజులో స్వదేశీ విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేయడం ఎంతమాత్రం తగదు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను, సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు ఉన్నత విద్యా వ్యవస్థను మెరుగ్గా తీర్చిదిద్దాలి. విశ్వ విద్యాలయాలపై రాష్ట్రాల హక్కుల్ని కొనసాగించాలి. ఉపకులపతుల నియామకం పూర్తిగా రాజకీయమై పోయింది. రాజకీయాలకు అతీతంగా విశ్వ విద్యాలయాలు పని చేయగలిగే సంస్కరణలు తేవాలి తప్ప కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడిన చందంగా కేంద్రం వ్యవహరించడం సమ్మతం కాదు.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి -
కేంద్రం చేతి కీలుబొమ్మ యూజీసీ!
దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల ఆచార్యుల నియామకాలు, పదోన్నతి కోసం కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల పరిరక్షణ పేరిట యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జనవరి 6న ముసాయిదా డ్రాఫ్ట్ను విడుదల చేసింది. దీనిపై ఫిబ్రవరి 5 లోగా ప్రజాభిప్రాయం సేకరించి, నూతన మార్గదర్శకాలు (guildelines) వెల్లడించనున్నట్లు తెలిపింది. అయితే ఈ ముసాయిదా (Draft) పూర్తిగా యూనివర్సిటీలను కేంద్రీకరించడానికి, ప్రయివేటీకరణకు మరో ప్రయత్నంగా మాత్రమే కనిపిస్తోంది. ఈ ప్రతిపాదనలు విద్యలో రాష్ట్రాల హక్కులను, నిర్ణయాధికారాన్ని బలహీనపరుస్తాయి. ఇవి మొత్తంగా ఫెడరల్ స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ రాజ్యాంగ మూల సూత్రాలను బలహీన పరుస్తు న్నాయి.ఇప్పటి వరకూ వైస్ ఛాన్సలర్ (వీసీ)ల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ (Search Committee) వేస్తూ వస్తోంది. కమిటీలో ముగ్గురు సభ్యులు – యూజీసీ ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదించిన సభ్యుడు, యూని వర్సిటీ కౌన్సిల్ ప్రతినిధి ఉంటు న్నారు. ఈ సెర్చ్ కమిటీ సీనియారిటీ, అర్హతలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ముగ్గురు పేర్లను సూచిస్తుంది. ఆ ముగ్గురు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు పంపుతుంది. ఆ ముగ్గురిలో ఒకరిని గవర్నర్ ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడు సవరించిన నియమాలు వైస్–ఛాన్సలర్ల ఎంపికలో రాష్ట్ర గవర్నర్లకు ఎక్కువ అధికారాన్ని ఇస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు, కేరళ (Kerala) వంటి అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వాలు వీసీల నియామకంపై గవర్నర్లతో విభేదిస్తున్నాయి. పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే వరుసలో ఉన్నాయి.మొదటిసారిగా వీసీల నియామకాల్లో నాన్ అకడమిక్ వ్యక్తులను నియమించాలని తాజా ముసాయిదా సిఫార్సులు చేసింది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమితులు కావాలంటే ప్రొఫెసర్గా లేదా కీలకమైన పరిశోధనలో లేదా అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో కనీసం పది సంవత్సరాల పాటు పనిచేసి ఉండాలి. అయితే తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం పరిశ్రమలలో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో, ప్రభుత్వ లేదా కనీసం ప్రభుత్వరంగ సంస్థలో కనీసం పది సంవత్సరాల సీనియర్ స్థాయి అనుభవం గడించి ఉంటే సరిపోతుంది.ముసాయిదాలో రిజర్వేషన్లను మరిచారు. ఇది ఉన్నత విద్యలో పూర్తిస్థాయి కార్పొరేట్ సంస్కృతిని చొప్పిస్తుంది. అలాగే ఉపాధ్యాయులకు నిర్దిష్ట బోధన సమయం ప్రస్తావించలేదు. ‘నెట్’ అవసరం లేకుండా ‘మాస్టర్స్ డిగ్రీ’ ఉంటే చాలు అనే విషయమైతే జీర్ణించుకోవటానికే కష్టంగా ఉంటుంది. 55 శాతం మార్కులతో మాస్టర్స్ సాధించిన వారిని యూజీసీ–నెట్లో అర్హత సాధించకపోయినా అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేరుగా నియమించుకోవచ్చని పేర్కొన్నారు. యూజీసీ (UGC) చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థ. ఇది ఉన్నత విద్యా ప్రమాణాలు, సమన్వయం, నిర్ణయం, నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తుంది. విశ్వవిద్యాలయాలకు డిగ్రీ కళాశాలలో బోధించే అధ్యా పకుల అర్హతలు ఏమి ఉండాలో నిర్ణయిస్తుంది. ఇంత స్వతంత్ర సంస్థగా ఉండాల్సిన యూజీసీని కేంద్రం తన సొంత ఎజెండా అమలుపరిచేందుకు కీలు బొమ్మలా ఆడిస్తోంది.చదవండి: బౌద్ధ సంస్కృతితోనే వికాసం, ప్రకాశంకరిక్యులమ్, బోధనపరమైన అంశాలలో రాష్ట్రాల నియంత్రణ చాలా ముఖ్యమైనది. రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతుల నేపథ్యానికి అనుగుణంగా విద్యావిధానాన్ని రూపొందించు కోవాలి. కానీ ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేంద్రం ఒకొక్కటిగా తన అధీనంలోకి తీసుకుంటూ రాష్ట్రాలపై తన విధానాలను బలవంతంగా రుద్దుతోంది. వాటిని కాదని ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. కేరళ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. మన దగ్గర కూడా మేధావులు, విద్యావేత్తలు యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా నడుం బిగించాలి. రాష్ట్రంలో ఉన్న అధికార, ప్రతిపక్ష ప్రభుత్వాలు దీనిపై నోరు మెదపాలి. – కె. ప్రసన్న కుమార్,ఆంధ్రప్రదేశ్ ఎస్.ఎఫ్.ఐ. రాష్ట్ర అధ్యక్షులు -
సబ్జెక్ట్తో పనిలేకుండా డిగ్రీ, పీజీల్లో ఏ కోర్సులో అయినా చేరొచ్చు
న్యూఢిల్లీ: ఇంటర్మీడియట్లో చదువుకున్న సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఇకపై నచ్చిన గ్రూప్లో డిగ్రీ, అలాగే డిగ్రీ పట్టభద్రులు నచ్చిన కోర్సులో పీజీ చేసేందుకు అవకాశం కల్పిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) వినూత్న నిర్ణయం తీసుకోనుంది. జాతీయ లేదా యూనివర్సిటీ స్థాయి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఈ వెసులుబాటు కల్పించాలని యూజీసీ యోచిస్తోంది. డిగ్రీ, పోస్ట్గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కొత్త ముసాయిదా నిబంధనావళిని యూజీసీ గురువారం వెలువరించింది. ఆయా వివరాలను యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ వివరించారు. ‘‘ లెవల్ 4 లేదా 12వ తరగతి పూర్తిచేసుకున్న విద్యార్థి ఇకపై తనకు నచ్చిన కోర్సు అంటే బీఎస్సీ, బీఏ, ఇలా ఇంటర్మీడియట్ సబ్జెక్టులతో సంబంధంలేకుండా భిన్నమైన కోర్సుల్లో డిగ్రీలో చేరొచ్చు. డిగ్రీ పట్టభద్రులు.. పోస్ట్గ్రాడ్యుయేట్ కోసం తమకు నచ్చిన భిన్నమైన కోర్సుల్లో చేరొచ్చు. నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్కు అనుగుణంగా ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా డిగ్రీ రెండో ఏడాది, మూడో ఏడాది, నాలుగో ఏడాదిలోనూ చేరొచ్చు. ఎంత మందిని చేర్చుకోవాలనేది ఖాళీలను బట్టి ఆయా యూనివర్సిటీలు నిర్ణయం తీసుకుంటాయి. ఇకపై ప్రధాన సబ్జెక్ట్ నుంచి 50 శాతం క్రెడిట్స్, మిగతా క్రెడిట్స్ను నైపుణ్యాభివృద్ధి, అప్రెంటిస్షిప్, సబ్జెక్టుల ద్వారా పొందొచ్చు’’ అని జగదీశ్ చెప్పారు. -
అనుమతిచ్చే ముందు అడగండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలకు అటానమస్, డీమ్డ్ హోదా ఇచ్చేప్పుడు తమను సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ను కోరింది. ఇష్టానుసారం అనుమతులిస్తే స్థానికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో కాలేజీలకు భద్రతాపరమైన సమస్యలు ఎదురైనా, ఇతరత్రా సమస్యలు వచ్చినా పరిష్కరించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని స్పష్టం చేసింది. కొన్ని ప్రైవేటు కాలేజీలు అడ్డగోలుగా అనుమతులు పొందుతుంటే, రాష్ట్రంలోని ఇతర కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి ప్రశ్నార్థకంగా తయారైందని పేర్కొంది. మల్లారెడ్డి సంస్థలకు ఇటీవల కేంద్రం డీమ్డ్ హోదా ఇచ్చింది. మహేంద్ర యూనివర్సిటీకి కూడా ఇచ్చే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో యూజీసీతో పాటు ఏఐసీటీఈకి రాష్ట్ర విద్యాశాఖ లేఖ రాసింది. చిన్న కాలేజీలు విలవిల డీమ్డ్, అటానమ్ కాలేజీలు పెద్దఎత్తున ప్రచారం చే సుకుంటున్న నేపథ్యంలో చిన్న ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి దయనీయంగా తయారైందని ఉన్నత విద్యా మండలి గుర్తించింది. 2016 నాటికి రాష్ట్రంలో 248 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, ప్రస్తుతం వాటి సంఖ్య 159కి తగ్గింది. గ్రామీణ ప్రాంతాలకు చేరువగా ఉండే కాలేజీలే ఎక్కువగా మూతపడుతున్నా యి. ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 48 కాలేజీలుంటే, ఇప్పుడు వాటి సంఖ్య 11కు తగ్గింది. ఖమ్మం జిల్లాలో 28 ఉంటే, ఇప్పుడు 8 మాత్రమే ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 11 ఉంటే, ప్రస్తుతం రెండు మాత్రమే మిగిలాయి. ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కని్పస్తోంది. చివరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ 2015లో 74 కాలేజీలుంటే, 20 కాలేజీలు మాయమై 54 మిగిలాయి. ఇటీవల ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అందించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరికొన్ని కాలేజీలు కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదని ఉన్నత విద్యా మండలి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అటానమస్, డీమ్డ్ వర్సిటీలు వస్తే మరికొన్ని కాలేజీలు మూతపడే అవకాశం ఉందని, దీనివల్ల పేద వర్గాలకు ఇంజనీరింగ్ విద్య మరింత ఖరీదయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నాయి. ప్రస్తుతం సీఎస్ఈ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి కోర్సుల వైపే విద్యార్థులు వెళ్తున్నారు. కొత్తగా వచ్చే కాలేజీలు ఈ కోర్సులనే ఆఫర్ చేయడం, భారీగా సీట్లు అమ్ముకునేందుకు డీమ్డ్ హోదా తెచ్చుకోవడం సరైన విధానం కాదని మండలి పేర్కొంటోంది. విదేశీ వర్సిటీలొస్తే మరింత ముప్పు! దేశంలో యూనివర్సిటీల ఏర్పాటుకు అమెరికా, ఆ్రస్టేలియా, ఇటలీలోని వర్సిటీలు ముందుకొస్తున్నాయి. వాటి బ్రాంచీలను భారత్లో ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతున్నాయి. విదేశాల్లో విద్యపై ఆసక్తి చూపించే విద్యార్థులను ఇవి ఆకట్టుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీలు తట్టుకునే అవకాశం తక్కువని, కొన్ని కాలేజీల మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందనే వాదన విన్పిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 80 శాతం ఇంజనీరింగ్ కాలేజీల నాణ్యత పెంచాలని ఏఐసీటీఈ.. రాష్ట్రానికి సూచించింది. మరోవైపు ఇంజనీరింగ్ విద్యలో మార్పులు వస్తున్నాయి. బోధన ప్రణాళికను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ భవిష్యత్తులో మరికొన్ని కాలేజీలు మూతపడేందుకు కారణాలవుతాయని అంటున్నారు. ముందే తెలియజేస్తే బాగుంటుంది డీమ్డ్, అటానమస్ హోదా ఇచ్చేప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని, ముందే తెలియజేయాలని కోరుతూ యూజీసీకి లేఖ రాశాం. మా విజ్ఞప్తిని యూజీసీ పరిగణనలోనికి తీసుకుంటుందని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రమేయం లేకుండా అనుమతి ఇవ్వడం వల్ల అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. –ప్రొఫెసర్ వి.బాలకిష్ణారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
ఉత్తమ పరిశోధనలకు ఉన్నత పురస్కారాలు
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో ఉత్తమ పరిశోధనలను ప్రోత్సహించి, నాణ్యతను పెంపొందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉన్నత స్థాయి అవార్డులను ప్రవేశపెడుతోంది. ఏటా దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పీహెచ్డీ పరిశోధనలు అందించిన వారిని ‘పీహెచ్డీ ఎక్సలెన్స్ సైటేషన్’తో సత్కరించనుంది. నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యాల్లో భాగంగా ఏటా వివిధ విభాగాల్లో అత్యుత్తమమైన పది పీహెచ్డీ థీసిస్లకు ఈ అవార్డు అందిస్తుంది. వ్యవసాయ శాస్త్రాల దగ్గర నుంచి వైద్య శాస్త్రాలతో సహా ఐదు విభాగాల్లో రెండు చొప్పున ఉత్తమ థీసిస్లకు సైటేషన్ అవార్డులు ప్రదానం చేస్తారు. దీనిపై అభిప్రాయ సేకరణ కోసం యూజీసీ సోమవారం మార్గదర్శకాలను విడుదల చేసింది.ఏటా సెప్టెంబర్ 5న ప్రదానంప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కాన్వకేషన్ ద్వారా పీహెచ్డీలు పొందిన రీసెర్చ్ స్కాలర్లు తదుపరి ఏడాదిలో ‘సైటేషన్’ అవార్డుకు అర్హులుగా పేర్కొంది. రాష్ట్ర, కేంద్ర, ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీల నుంచి పీహెచ్డీలు పొందిన వారు వర్సిటీల ద్వారా నామినేట్ అవ్వొచ్చు. ఇందుకోసం ప్రతి విశ్వవిద్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ విశ్వవిద్యాలయం నుంచి ఏటా ఐదు థీసిస్లను నామినేట్ చేస్తుంది. ఏటా జనవరి నుంచి మార్చి 31 వరకు ఆన్లైన్ పోర్టల్ ద్వారా వర్సిటీల నుంచి నామినేషన్లు యూజీసీ స్వీకరిస్తుంది. ఆగస్టు 1న విజేతలను ప్రకటిస్తారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం రోజు ‘పీహెచ్డీ ఎక్సలెన్స్ సైటేషన్’తో విజేతలను యూజీసీ సత్కరిస్తుంది.యూజీసీ అధ్యయనం ప్రకారం దేశంలో పీహెచ్డీలో ప్రవేశాలు భారీగా పెరుగుతున్నాయి. 2010–11లో దేశవ్యాప్తంగా 77,798 పీహెచ్డీ ప్రవేశాలు నమోదవగా, 2017–18లో ఈ సంఖ్య 1,61,412కు పెరిగింది. ఏటా సగటున 10 శాతం వృద్ధి రేటు నమోదవుతోంది.కొత్త ఆవిష్కరణలు అవసరంకొత్త ఆవిష్కరణలు దేశ అభివృద్ధికి చాలా అవసరం. ఉన్నత విద్యా సంస్థలు కొత్త విజ్ఞానాన్ని సమాజానికి అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది డాక్టోరల్ డిగ్రీల నాణ్యతపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. భారతీయ విశ్వవిద్యాలయాలలో మంచి నాణ్యమైన పరిశోధనలను ప్రోత్సహించే ప్రయత్నంలో యూజీసీ ఏటా ‘పీహెచ్డీ ఎక్సలెన్స్ సైటేషన్’ను ప్రదానం చేయాలని నిర్ణయించింది. ప్రజాభిప్రాయం కోసం మార్గదర్శకాలను విడుదల చేశాం. – మామిడాల జగదీశ్ కుమార్, యూజీసీ చైర్మన్ -
గుడ్ న్యూస్.. ఇకపై యూనివర్సిటీల్లో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో ఏడాదికి రెండు సార్లు ప్రవేశాలు నిర్వహించేందుకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) అనుమతించింది. ఈ విషయాన్ని కమిషన్ చైర్పర్సన్ ఎమ్ జగదీష్ కుమార్ మంగళవారం వెల్లడించారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి సంవత్సరానికి రెండుసార్లు అంటే జులై-ఆగస్టు, జనవరి-ఫిబ్రవరిలలో ప్రవేశాలు కల్పించేందుకు అనుమతించనున్నట్లు తెలిపారు. మే 5న జరిగిన యూజీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.కాగా ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ప్రతి సంవత్సరం జూలై-ఆగస్టులో విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. దీనివల్ల భారతదేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలు జూలై-ఆగస్టులో ప్రారంభమై మే-జూన్లో అకడమిక్ సెషన్ను ముగిస్తున్నాయి.గత ఏడాది ఒక అకాడమిక్ సంవత్సరంలో దూరవిద్యలో(ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్) విద్యార్థులు జనవరి, జూలైలో రెండుసార్లు ప్రవేశం పొందేందుకు యూజీసీ అనుమతించింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు అయిదు లక్షల మంది విద్యార్థులు మరో విద్యా సంవత్సరం వరకు వేచి ఉండకుండా అదే ఏడాది డిగ్రీలొ చేరడానికి సహాయపడిందని కుమార్ పేర్కొన్నారు. ‘‘మన దేశంలోని యూనివర్సిటీలు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్ కల్పించినట్లయితే అది ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ముఖ్యంగా బోర్డు ఫలితాల్లో ఆలస్యం, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాల వల్ల జులై-ఆగస్టులో ప్రవేశం పొందలేకపోయిన వారికి ఎంతో దోహదపడుతుంది. రెండుసార్లు అడ్మిషన్ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు ఏడాది సమయం వృథా కాకుండా ఉంటుంది. అటు కంపెనీలు కూడా రెండుసార్లు క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహించుకోవచ్చు. తద్వారా పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి’ అని యూజీసీ చీఫ్ వెల్లడించారు.రెండుసార్లు ప్రవేశాలు కల్పించడం వల్ల ఉన్నత విద్యా సంస్థలు తమ ఫ్యాకల్టీ, ల్యాబ్, క్లాస్రూమ్, ఇతర సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయని వెల్లడించారు. భారతీయ విద్యా సంస్థలు ఈ విధానం పాటించడం వల్ల అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు దోహదపడుతుందన్నారు. తద్వారా పోటీ ప్రపంచంలో మనం మరింత మెరుగుకావచ్చని, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరించినట్టు ఉంటుందన్నారు.దేశంలోని అన్ని యూనివర్సిటీలు ఈ విధానాన్ని పాటించడం తప్పనిసరి కాదన్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది కలిగిన ఉన్నత విద్యా సంస్థలు మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. రెండుసార్లు ప్రవేశాలు కల్పించేందుకు వీలుగా విద్యాసంస్థల అంతర్గత నిబంధనలను మార్చుకోవాలని సూచించారు. -
అభ్యర్థులు దొరక్కుంటే అన్ రిజర్వుడే
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు రిజర్వు చేసిన పోస్టుల్లో సంబంధిత కేటగిరీల అభ్యర్థులు దొరకని సందర్భాల్లో ఆయా పోస్టులను అన్ రిజర్వుడుగా ప్రకటించాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)తాజా ప్రతిపాదిత మార్గదర్శకాలల్లో పేర్కొంది. ఈ మేరకు రూపొందించిన మార్గదర్శకాలను అభిప్రాయ సేకరణ కోసం ఆన్లైన్లో ఉంచింది. అయితే, యూజీసీ ప్రతిపాదించిన మేరకు ఉన్నత విద్యాసంస్థల్లోని రిజర్వుడు పోస్టులు వేటినీ కూడా డీ రిజర్వుడుగా మార్చడం లేదని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ స్పందిస్తూ ‘ఉన్నత విద్యా సంస్థల్లోని రిజర్వుడు పోస్టులను అన్ రిజర్వుడుగా ప్రకటించడమనే విధానం గతంలో లేదు, ఇకపై అమలు కాబోదు. రిజర్వుడు కేటగిరీలోని అన్ని బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ అయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నత విద్యాసంస్థలదే’అని స్పష్టం చేశారు. -
ఆన్లైన్ డిగ్రీ కోర్సులతో జాగ్రత్త: యూజీసీ
న్యూఢిల్లీ: విదేశీ యూనివర్సిటీల సహకారంతో కాలేజీలు, ఎడ్టెక్ కంపెనీలు అందించే డిగ్రీల కు తమ గుర్తింపు లేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) స్పష్టం చేసింది. ఇటువంటి డిగ్రీలకు ఏమాత్రం విలువ లేదని, ఆయా కోర్సుల్లో చేరవద్దని విద్యార్థులను హెచ్చరించింది. విదేశీ వర్సిటీలు, విద్యా సంస్థలతో కొన్ని ఉన్నత విద్యా సంస్థలు, కాలేజీలు పొందే అనుబంధ గుర్తింపు, ఒప్పందాలను తాము అనుమతించడం లేదని యూజీసీ సెక్రటరీ మనీశ్ జోషి చెప్పారు. ఆయా సంస్థలు ఇచ్చే డిగ్రీలు, డిప్లొమాలకు ఎటువంటి విలువా ఉండదని వివరించారు. -
విదేశీ విద్యను ఇక్కడే కల్పించేలా...
భారతదేశంలో విదేశీ ఉన్నత విద్యా సంస్థల (ఎఫ్హెచ్ఇఐ) క్యాంపస్ల ఏర్పాటు, నిర్వహణ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్రమబద్ధీకరణను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొన్ని రోజుల క్రితం విడుదల చేసింది. ఈ క్రమబద్ధీకరణ ఉదారంగానూ, సమర్థంగానూ ఉందని చెప్పాలి. ఇది నూతన విద్యా విధానపు సిఫార్సులను అనుసరిస్తోంది. అయితే, ఇది ఇప్పటికే ఉన్న దేశంలోని విద్యా వ్యవస్థలను సవాలు చేయడానికి ప్రయత్నించడం అనేది ఒక అవకాశంతోపాటు ఆందోళన కరమైన విషయం కూడా! ఇంకా, విదేశీ ఉన్నత విద్యా సంస్థ తన భారతీయ క్యాంపస్లోని విద్యాపరమైన నాణ్యతను తమ దేశంలోని ప్రధాన క్యాంపస్తో సమానంగా ఉండేలా చూసుకోవాలి. చాలా గొప్ప ఆలోచనే అయినప్పటికీ, క్రమబద్ధీకరణ యంత్రాంగం దీన్ని ఎలా అనువర్తించగలుగుతుంది? యూజీసీ క్రమబద్ధీకరణ విదేశీ ఉన్నత విద్యాసంస్థలకు పాలన పరంగా ప్రత్యేక అధికారాలకు అనుమతిస్తోంది. అన్ని విభాగాలలో యూజీ/ పీజీ/ డాక్టోరల్/ పోస్ట్డాక్టోరల్ అధ్యయనాలు, డిగ్రీల ప్రదానం, డిప్లొమాలు, సర్టిఫికేట్లను ఇచ్చే వీలు కల్పిస్తోంది. ఈ విదేశీ విద్యా సంస్థలు మొత్తం సబ్జెక్ట్వారీగా, ప్రపంచ ర్యాంకింగ్స్లో 500 లోపు ఉంటే అది నిజంగా గొప్ప అడుగే. కాకపోతే, ప్రపంచంలో కనీసం 20 ప్రముఖ ర్యాంకింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అనేక సంస్థలు వివిధ కారణాల వల్ల ఈ ర్యాంకింగ్ సంస్థల చర్యలలో పాల్గొనడం లేదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ ర్యాంకింగ్లను ఎలా ప్రామాణీ కరిస్తారనేది ప్రశ్న. కాకపోతే భారతీయ, విదేశీ ఉన్నత విద్యాసంస్థల మధ్య సహకారం కోసం 2022లో జరిగిన విద్యా సంబంధ సహకార నియంత్రణ నేపథ్యంలో చూస్తే, ఉమ్మడి డిగ్రీ, ద్వంద్వ డిగ్రీ కార్య క్రమాలకు ఉత్తేజకరమైన కాలం ముందుందని చెప్పొచ్చు. దేశంలో అడుగుపెట్టే విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, ఈ క్రమ బద్ధీకరణ ద్వారా, భారతీయ ఉన్నత విద్యా సంస్థలు లేదా భారతీయ కంపెనీలతో జాయింట్ వెంచర్లోకి ప్రవేశించవచ్చు. జాయింట్ వెంచర్లు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పక్షాలు తమ వనరులతో ఒక నిర్దిష్ట పనిని పూర్తి చేయడానికి అంగీక రించే వ్యాపార పరమైన ఏర్పాటు అని మనం అర్థం చేసుకున్నప్పటికీ – విదేశీ ఉన్నత విద్యా సంస్థ భౌతిక, విద్యా, పరిశోధనా మౌలిక సదుపాయాలతో కూడిన స్వతంత్ర క్యాంపస్ను కలిగి ఉండాలని ఈ నిబంధన ఎందుకు నొక్కి చెబుతోంది? దాని విద్యాపరమైన, పరిశోధనా కార్యక్రమాలను సీరి యస్గా నిర్వహించడానికి ఏ విదేశీ ఉన్నత విద్యా సంస్థ అయినా భారతదేశంలో ఉండటం కోసం భూమిపై, వనరులపై పెట్టుబడి పెడుతుందా? దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్న భారతీయ క్యాంపస్ లతో వనరులను పంచుకునే సహకార క్యాంపస్ నమూనా మరింత ఆచరణీయంగా ఉంటుంది. ఇప్పుడు ‘కంపెనీ’ పాత్రను చూద్దాం. నిర్దేశిత లక్ష్యాల కోసం, సెక్షన్ 8 కింద నమోదు అయిన కంపెనీ, లాభాలు ఏవైనా ఉంటే, వాటిని ఆ నిర్దేశిత లక్ష్యాల కోసమే ఉపయోగించాలి. లాభాలను దాని సభ్యులకు చెల్లించకూడదు. ఇంకా, ఇండియన్ ట్రస్ట్ చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం, ఒక విదేశీయుడు లేదా ఎన్నారై, భారతీయ ట్రస్ట్కు ట్రస్టీగా ఉండకూడదు. అయితే ఫెమా చట్టం, 1999 నిబంధనలకు అనుగుణంగా ఉండే పక్షంలో నిధులను సరిహద్దులు దాటించడానికీ, విదేశీ కరెన్సీ ఖాతాల నిర్వహణకూ, చెల్లింపులకూ, అమ్మకాలకూ అను మతిస్తోందని తెలుస్తున్నప్పుడు ఇక్కడ ఏదో లోపం ఉందని గమనించాలి. నిధులను స్వదేశానికి పంపగలిగే వీలు ఉన్నట్లయితే, సంబంధిత విదేశీ ఉన్నత విద్యా సంస్థ లాభాలను పొందగలదని దీని అర్థమా? అంటే ఇప్పుడు విద్య ‘లాభార్జన’ కోసమా? భవిష్యత్తులో భారతదేశం ఆకర్షణీయమైన ప్రపంచ అధ్యయన గమ్యస్థానంగా మారుతుందని ఈ క్రమబద్ధీకరణ ఆశిస్తోంది. ఏ విదేశీ ఉన్నత విద్యాసంస్థలు, ఏయే కార్యక్రమాలతో తమ క్యాంపస్లను మన దేశంలో ఏర్పరుస్తాయి; వారు స్థానిక అధ్యాపకులను తీసుకుంటారా, అంతర్జాతీయంగానా; విద్యార్థుల ప్రవేశం కోసం వారు ఉప యోగించే కొలమానాలు ఏవి అనే అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. సాంప్రదాయకంగా, అక్రిడిటేషన్ అనేది భారతదేశంతో పాటు చాలా దేశాలలో నాణ్యతా తనిఖీ విధానం. విదేశీ ఉన్నత విద్యా సంస్థ నాణ్యతాపరమైన హామీ, ఆడిట్కు లోనవుతుందనీ, యూజీసీకి తన నివేదికను సమర్పించాలనీ ఈ క్రమబద్ధీకరణ నిర్దేశిస్తోంది. ఏదైనా నెరవేరదగిన హామీ నెరవేర్చని పక్షంలో వినియోగదారు న్యాయస్థానంలో పరిష్కారాన్ని కోరవచ్చు. ఒక విదేశీ ఉన్నత విద్యా సంస్థ తన రుసుముల చట్రాన్ని నిర్ణ యించుకోవడానికి ఈ క్రమబద్ధీకరణ అనుమతించడం నిజానికి ప్రగతి శీలమైనది. భారతదేశంలోని విద్యాసంస్థలు మాత్రం ఫీజు నిర్ణా యక కమిటీల ఇష్టాలకు లోబడుతున్నప్పుడు, విదేశీ ఉన్నత విద్యాసంస్థలకు ఈ ప్రత్యేక గౌరవం ఎందుకు? ఫెమా నిబంధనలు ఉన్నప్ప టికీ, పరిమాణాత్మకం కాని మొత్తాలను ఎల్లప్పుడూ సర్దుబాటు చేయ వచ్చు. అలాంటప్పుడు, అకడమిక్ పరపతి ఆధారితమైన రుసుము చట్రాన్ని తప్పనిసరి చేయడం మరింత విశ్వసనీయమైన ఎంపిక. విదేశీ ఉన్నత విద్యా సంస్థ అందించే కార్యక్రమాలు ఆన్లైన్ , బహిరంగ మరియు దూరవిద్యా (ఓడీఎల్) విధానంలో అనుమతించ బడవు అనే షరతు నిర్బంధపూరితంగా ఉంది. ఎమ్ఐటి, స్టాన్ ఫోర్డ్, హార్వర్డ్ వంటి అ్రగ్రశ్రేణి విద్యాసంస్థలు అద్భుతమైన ఆన్లైన్ ప్రోగ్రామ్లను కలిగి ఉన్నాయి. ఇటీవలి కాలంలో యూజీసీ అనేక ఓపెన్, దూరవిద్యా నిబంధనలను సడలించినప్పుడు, వాటిని మన విద్యార్థులకు ఎందుకు దూరంచేయాలి? విశ్వవిద్యాలయాల ప్రపంచ ర్యాంకింగ్లను గుర్తించడానికి రెండు ముఖ్యమైన కొలమానాలు ఏవంటే... అంతర్జాతీయీకరణ, పరిశో ధన. భారతీయ క్యాంపస్లలో విదేశీ విద్యార్థులు, అధ్యాపకులు వర్ధిల్ల డాన్ని అంతర్జాతీయీకరణ అంటారు. ఒక ప్రముఖ ఫ్యాకల్టీ ఎక్కువ డబ్బు సంపాదించడం లేదా మెరుగైన పరిశోధనా సౌకర్యాల కోసం, లేదా తన పరిధిలోని అత్యుత్తమ వ్యక్తులతో పరస్పర సంభాషణ కోసం; అవకాశాలను అన్వేషించడం లేదా కొత్త ఉత్పత్తులు, ప్రక్రియలకు దారితీసే పేటెంట్లను, ఐపీఆర్లను తమ హోదాకు జతచేసు కోవడం కోసం పనిచేస్తారు. అవి సాధ్యం కాదని తెలిసినప్పుడు, మహా అయితే ఏదో ఒక వారం సందర్శన కోసం తప్ప, ఎవరూ బయ టకు రారు. అప్పుడు విదేశీ ఉన్నత విద్యా సంస్థ ఎలా పని చేస్తుంది? అధ్యాపకులు, సిబ్బంది నియామకంలో పూర్తి స్వయంప్రతిపత్తి ఈ క్రమబద్ధీకరణలో అత్యంత ముఖ్యమైన భాగం. మన సంస్థలలోని అత్యుత్తమ అధ్యాపకులు విదేశీ ఉన్నత విద్యా సంస్థలకు వలసవెళ్లే అవకాశం ఉండటం ఈ నిబంధనకు రెండో కోణం. బహుశా, చివరికి ఒక కొత్త సాధారణ స్థితి ఏర్పడవచ్చు. ఆ స్థితి మన విద్యా సంస్థలలో నాణ్యతను పెంచినట్లయితే, దానిని స్వాగతించాలి. మన విద్యా సంస్థల ఫీజు కమిటీ సిఫార్సులు, అడ్మిషన్ల కోసం రాష్ట్ర లేదా కేంద్ర నిబంధనలు మొదలైన వాటికి కట్టుబడి ఉండాలి. అధ్యాపకు లను ఎన్నుకోవడంలో, ఫీజులను నిర్ణయించడంలో ప్రవేశ నిబంధనలను ఏర్పర్చడంలో మన సంస్థలకు స్వయంప్రతిపత్తిని ఎందుకు పొడిగించకూడదు? అవన్నీ అంతర్జాతీయ ర్యాంకింగ్ సంస్థలకు చెందిన అవే కొలమానాలపై పోటీ పడాలని భావిస్తున్నాం కదా! ఏదైనా ప్రయోగం విషయంలో దాని విమర్శకులు దానికి ఉంటారు. విదేశాల్లోని మాతృసంస్థల్లో అయ్యేదానితో పోల్చినప్పుడు తక్కువ ఖర్చుతో, విదేశీ విద్యార్హతలతో భారతీయ విద్యార్థులు నాణ్యమైన విద్యను ఇక్కడే పొందేందుకు ఈ క్రమబద్ధీకరణ వీలు కల్పిస్తే, ఇది స్వాగతించాల్సిన విషయమే. అయితే ఐఐటీల వంటి మన ప్రథమశ్రేణి విద్యాసంస్థలను సాధారణంగా ఎంపిక చేసుకునే విద్యార్థులు కూడా ఈ కొత్త క్యాంపస్లలో చేరేలా ప్రభావితం అయితే, అది ఆందోళన కలిగించే అంశం అవుతుంది. అందుకే, నాణ్యతా ప్రమాణాలు ఎన్నో రెట్లు పెరిగినందున విద్యారంగానికి భారీ పెట్టుబడులు అవసరం. పరిశోధనా సౌకర్యాల్లో భారీ స్థాయి వృద్ధి అవసరం. ప్రభుత్వ నిధులను అలా ఉంచుతూనే, విదేశీ నిధులను అనుమతించడం, విజయవంతమైన వ్యవస్థలను అనుసరించడం మేలు. ఎస్ఎస్ మంథా, ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) మాజీ ఛైర్మన్; అశోక్ ఠాకూర్, కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖ మాజీ కార్యదర్శి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
తస్మాత్ జాగ్రత్త! ఈ 20 యూనివర్సిటీలు నకిలీవి.. 8 రాజధానిలోనే..
న్యూఢిల్లీ: దేశంలో మరో 20 సంస్థలు విశ్వవిద్యాలయాలుగా చెలామణి అవుతున్నాయని, అవన్నీ నకిలీవని యునివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) బుధవారం ప్రకటించింది. ఈ 20 సంస్థల్లో ఎనిమిది ఢిల్లీలోనే ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఉత్తరప్రదేశ్లో గాంధీ హిందీ విద్యాపీఠ్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, నేతాజీ సుభాష్చంద్రబోస్ (ఓపెన్) యూనివర్సిటీ, భారతీయ శిక్షా పరిషత్ అనే నాలుగు నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి. పశ్చిమబెంగాల్, ఏపీల్లో రెండేసి నకిలీ వర్సిటీలున్నాయి. కర్ణాటకలో బదగాన్వీ సర్కార్ వరల్డ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్, కేరళలో సెయింట్ జాన్స్ వర్సిటీ, మహారాష్ట్రలో రాజా అరబిక్ యూనివర్సిటీ, పుదుచ్చెరిలో శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నకిలీవే’’ అని యూజీసీ కార్యదర్శి మనీశ్ జోషి స్పష్టంచేశారు. ఢిల్లీలోని 8 నకిలీ వర్సిటీలు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్; కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దరియాగంజ్; యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఒకేషనల్ యూనివర్సిటీ; ఏడీఆర్–సెంట్రిక్ జ్యుడీషియల్ యూనివర్సిటీ; ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్; విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్–ఎంప్లాయిమెంట్; ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ. -
ఇక స్థానిక భాషల్లోనే ఉన్నత విద్య
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యతనివ్వాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్ణయించింది. ఈ ప్రక్రియను వేగంగా ముందుకు తీసు కెళ్ళేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రాల పరిధి లోని ఉన్నత విద్య పాఠ్య పుస్తకాలను ప్రాంతీయ భాషల్లో తర్జుమా చేయాలని రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ళకు సూచించింది. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా ఈ నిర్ణ యం తీసుకున్నట్టు పేర్కొంది. కీలక మైన ఉన్నత విద్య లో ప్రమాణాలు మెరుగవ్వాలంటే, బోధన, పాఠ్య పుస్తకాలు స్థానిక భాషల్లోనే ఉండాలని కేంద్రం జరిపిన అధ్యయ నాల్లో వెల్లడైంది. దీనివల్ల సబ్జెక్టుపై విద్యా ర్థులకు పట్టు లభిస్తుందని, పలితంగా విద్యార్థి ఉన్నత విద్యను పూర్తి చేసేలోగా మార్కెట్ అవసరాలకు అనువైన నైపుణ్యాన్ని సంపాదిస్తాడని ఎన్ఈపీ–2020లో పేర్కొన్నారు. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందుగా పాఠ్య పుస్తకాలను స్థానిక భాషల్లో తర్జుమా చేయా లని భావించారు. దీనికోసం అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీ) ఆర్టిఫీషి యల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా ‘అనువాదిని’ అనే ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించింది. దీన్ని అన్ని రాష్ట్రాలూ ఉపయోగించుకుని డిగ్రీ, ఇంజనీరింగ్తో పాటు అన్ని రకాల ఉన్నత విద్య పాఠ్యపుస్తకాలను ఆయా రాష్ట్రాల మాతృభాషల్లో తర్జుమా చేయాలని సూచించింది. అయితే, ఇంగ్లిష్, స్థానిక భాషను ఎంచుకోవడం విద్యార్థి ఐచ్ఛికమే. తెలుగు మీడియం ఉంటే ప్రత్యేక తరగతి బోధన చేపట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పాఠ్యపుస్తకాల తర్జుమాకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటూ యూజీసీ మార్గదర్శకాలు విడుదల చేసింది. డిగ్రీలో మొదలైంది... ఇంజనీరింగ్పై త్వరలో నిర్ణయం ఎన్ఈపీ–2020లో భాగంగా స్థానిక భాషల్లో పుస్తకాల ప్రచురణపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి దృష్టి పెట్టింది. తెలుగు అకాడమి ద్వారా పుస్తకాల తర్జుమా చేయిస్తున్నాం. సాంకే తిక విద్యకు సంబంధించిన పుస్తకాలపై త్వరలో ఉన్నత స్థాయి సమీక్ష జరిపి, నిర్ణయం తీసుకుంటాం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యామండలి చైర్మన్) ప్రత్యేక బోధకులుండేలా చూడాలి.. స్థానిక భాషలో బోధన అంశాన్ని ముందుకు తెచ్చేటప్పుడు కాలేజీల్లో బోధకుల సంఖ్య పెంచాలి. ఇంగ్లిష్, తెలుగు మీడియాలను వేర్వేరుగా బోధించడం ఒకే అధ్యాపకుడికి సాధ్యం కాదు. దాని వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. – డాక్టర్ వి బాలకృష్ణ, సాంకేతిక, వృత్తి విద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) -
వాటిల్లో కుల వివక్ష తీవ్రమైన అంశం
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై కుల వివక్షను ప్రదర్శించడం అత్యంత సీరియస్గా తీసుకోవాల్సిన అంశమని సుప్రీం కోర్టు పేర్కొంది. కుల వివక్షను రూపుమాపడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో , ఏయే చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారో తెలపాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని ఆదేశించింది. కులపరమైన వివక్షను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చిన హైదరాబాద్కు చెందిన రోహిత్ వేముల, ముంబైకు చెందిన పాయల్ తాడ్విల తల్లులు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఎ.ఎస్. బొపన్న, ఎంఎం. సంద్రేశ్లతో కూడిన సుప్రీం డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు ఈ వివక్షను పారద్రోలడానికి చేపట్టిన చర్యలేంటో వెల్లడించాలని యూజీసీకి ఆదేశాలు జారీ చేసింది. ‘‘ఇది తీవ్రమైన అంశం. వారి ఆందోళల్ని మీరు ఎలా చూస్తున్నారు ? కులవివక్షకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టారు ? ఈ సమస్య పరిష్కారానికి యూజీసీ నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వారి తల్లిదండ్రుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలి. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి’ కోర్టు∙యూజీసీ తరఫు∙లాయర్కు చెప్పింది. రోహిత్ వేముల, తాడ్వి తల్లుల తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ ఇందిర కొడుకు, కూతురిని పోగొట్టుకున్న వారి మనోవేదన తీర్చలేదని అన్నారు. వీరిద్దరే కాకుండా గత ఏడాది కాలంలో మరో ముగ్గురు విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో కులవివక్షను తట్టుకోలేక నిండు ప్రాణాలను బలి తీసుకున్నారని సుప్రీం దృష్టికి తీసుకువెళ్లారు. -
ఒకే విద్యా విధానం.. మార్కుల స్థానంలో క్రెడిట్స్.. ఏమిటిది?
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఒకే విద్యా విధానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా జాతీయ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ను రూపొందించామని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ జగదీష్కుమార్ స్పష్టం చేశారు. జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా పాఠశాల విద్య నుంచే క్రెడిట్స్ ఇవ్వడం దీని ఉద్దేశమని చెప్పారు. నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ (ఎన్సీఆర్ఎఫ్)ను యూజీసీ సోమవారం విడుదల చేసింది. దీనిపై వస్తున్న సందేహాలపై యూజీసీ ఛైర్మన్ సమగ్ర వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఏకీకృత విధానాన్ని అనుసరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఏమిటీ ఎన్సీఆర్ఎఫ్? విద్యావిధానానికి జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వడం దీని ఉద్దేశం. దీనికోసం సమీకృత క్రెడిట్ విధానాన్ని అన్ని విద్యా సంస్థలు అనుసరిస్తాయి. పాఠశాల, ఉన్నత విద్య, ఒకేషనల్, స్కిల్ ఎడ్యుకేషన్.. ఏదైనా మార్కులతో పనిలేకుండా క్రెడిట్స్గానే పరిగణిస్తారు. దీనికోసం జాతీయ స్థాయిలో పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్య విద్యలకు ప్రత్యేక క్రెడిట్ విధానంతో మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. క్రెడిట్ విధానం అంటే..? వివిధ స్థాయిల్లో మార్కుల స్థానంలో క్రెడిట్స్ ఇస్తారు. ఒక విద్యార్థి సంవత్సరంలో రెండు సెమిస్టర్లలో 30 గంటల బోధన (ఏదైనా సబ్జెక్టులో) తరగతులకు హాజరవ్వాలి. ప్రతీ సెమిస్టర్కు 20 క్రెడిట్స్ ఉంటాయి. ఏడాదికి 40 క్రెడిట్స్ వస్తాయి. అన్ని సబ్జెక్టులు కలిపి 1200 గంటల బోధన సమయంలో విద్యార్థి 40 క్రెడిట్స్ పొందే వీలుంటుంది. విద్యార్థి 5వ తరగతి పూర్తి చేసిన తర్వాత దీన్ని లెవర్–1గా భావిస్తారు. 6–8 తరగతులు పూర్తి చేస్తే లెవల్–2, తర్వాత 9, 10 తరగతులు పూర్తి చేస్తే లెవల్–3గా, 11, 12 పూర్తి చేస్తే లెవల్–4గా గుర్తిస్తారు. స్కూల్ విద్య మొత్తంగా 160 క్రెడిట్స్ ఉంటాయి. మూడేళ్ళ బ్యాచిలర్ డిగ్రీలో ప్రతి సంవత్సరం 40 క్రెడిట్స్ చొప్పున మొత్తం 120 క్రెడిట్స్ ఉంటాయి. నాలుగేళ్ళ డిగ్రీని 6.5 లెవల్గా, మూడేళ్ళ డిగ్రీ తర్వాత మాస్టర్ డిగ్రీని లెవల్ 7గా, నాలుగేళ్ళ ఇంజనీరింగ్ డిగ్రీ, పీహెచ్డీని కలిపి 8 లెవల్గా చూస్తారు. పీహెచ్డీ పూర్తిచేసిన విద్యారి్థకి మొత్తం 320 క్రెడిట్స్ ఇస్తారు. ఒకేషనల్, స్కిల్ ఎడ్యుకేషన్కు కూడా వివిధ స్థాయిలో (4.5 నుంచి 8 లెవల్స్) క్రెడిట్స్ ఉంటాయి. క్రెడిట్స్ నిల్వ ఇలా... ప్రతీ లెవల్లో విద్యార్థి సాధించిన క్రెడిట్స్ అన్నీ అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఎబీసీ) టెక్నాలజీ ప్లాట్ఫాంలో నిక్షిప్తమై ఉంటాయి. ప్రతి విద్యా సంస్థ ఈ ప్లాట్ఫాం కిందకు వస్తుంది. క్రెడిట్స్ ఆధారంగానే విద్యార్థి స్థాయిని ఎన్సీఆర్ఎఫ్ నిర్ణయిస్తుంది. ఉదాహరణకు టెన్త్ తర్వాత ఐటీఐ పాస్ అయిన విద్యార్థి అదనంగా లాంగ్వేజ్ కోర్సు చేస్తే ఇది 12వ క్లాసుకు సమానం అవుతుంది. అతను యూనివర్సిటీలో చేరేందుకు వీలు కల్పిస్తుంది. అదే విధంగా 5వ స్థాయి విద్యార్థి బ్రిడ్జ్ కోర్సులు అదనంగా చేస్తే అదనపు క్రెడిట్స్ వస్తాయి. అతను నేరుగా 8వ క్లాసు పరీక్షకు హాజరవ్వొచ్చు. విద్యార్థి ఆన్లైన్ కోర్సులు చేసినా ఆ క్రెడిట్స్ను కూడా లెక్కలోకి తీసుకుంటారు. క్రెడిట్స్ను లెక్కగట్టడానికి ప్రత్యేక మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. ఇవి అకడమిక్, స్కిల్, అనుభవం ద్వారా పొందే విద్యను బట్టి ఉంటాయి. ఇవి కూడా క్రెడిట్సే.. అకడమిక్ విద్యే కాదు... క్రీడలు, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, మ్యూజిక్, హెరిటేజ్, ట్రెడిషనల్ స్కిల్స్, ఫైన్ ఆర్ట్స్ వంటి ప్రత్యేక కళలకూ క్రెడిట్స్ ఇస్తారు. ఇవి కూడా క్రెడిట్ బ్యాంకులో చేరతాయి. క్రెడిట్ సిస్టమ్ను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అనుసరిస్తున్నారు. కొన్ని క్రెడిట్స్ను అన్స్కిల్డ్, కొన్ని క్రెడిట్స్ను స్కిల్ అని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే మన దేశమూ అంతర్జాతీయ స్థాయిలో క్రెడిట్ విధానం ఇచ్చేందుకు ప్రయతి్నస్తోంది. -
ఉన్నత విద్యలో ‘షేరింగ్’
సాక్షి, అమరావతి: సెంట్రల్ వర్సిటీలు సహా దేశంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లోని వనరులను సద్వినియోగం చేయడం, సమీపంలోని ఇతర ఉన్నత విద్యాసంస్థలు కూడా వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి వీలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ‘షేరింగ్’ విధానానికి శ్రీకారం చుట్టింది. వివిధ సదుపాయాలతో పాటు అత్యున్నత ప్రమాణాలతో కూడిన బోధన ఇతర అంశాల్లో విద్యా సంస్థల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణికి తెరతీసింది. నాలెడ్జ్ షేరింగ్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్కి వీలుగా టెక్నాలజీని, ఇతర వనరులను ఆయా సంస్థలు ఉమ్మడిగా వినియోగించుకునేందుకు ఈ విధానం దోహదపడనుంది. సెంట్రల్ వర్సిటీలు సహా అన్ని ఉన్నత విద్యా సంస్థలకు యూజీసీ ఆదేశాలిచ్చింది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్–గ్రాడ్యుయేట్ కోర్సులతో పాటు పరిశోధన కోర్సుల్లోనూ దీన్ని అమలుచేయాలని సూచించింది. వనరులు లేని విద్యాసంస్థలు వాటిని ఏర్పాటు చేసుకునేందుకు అదనపు పెట్టుబడి పెట్టాల్సిన అవసరంలేకుండా దగ్గర్లోని విద్యా సంస్థల వనరులను వినియోగిస్తూ తమ విద్యార్థులను ఆయా సంస్థలు తీర్చిదిద్దడానికి ఈ విధానంతో వీలుపడుతుంది. రెట్టింపు ఫలితాలు ఈ విధానంవల్ల రెట్టింపు ఫలితాలు వస్తాయని యూజీసీ భావిస్తోంది. అకడమిక్ అంశాలు సహా ఏదైనా అభివృద్ధి కార్యకలాపాలను సమగ్రంగా అమలుచేయాలంటే అదనపు సదుపాయాలు అవసరమవుతుంటాయి. ఇందుకోసం ఆయా సంస్థలు అదనపు పెట్టుబడి పెట్టాలి. అలా కాకుండా.. ఇప్పటికే ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించడంవల్ల రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఉన్నత విద్యాసంస్థలు పరస్పర సహకారంతో విద్యాపరమైన మౌలిక వనరులను పంచుకోవడం వల్ల విద్యార్థులకు సమానమైన విద్య అందుతుంది. ప్రస్తుతం ల్యాబ్లు, లైబ్రరీలు, ఇతర వనరులున్న సంస్థల్లో చదివే వారికి ఆ వనరుల ద్వారా ఉత్తమ బోధన లభిస్తుంది. కానీ, అలాంటివిలేని సంస్థల విద్యార్థులకు ఉన్నత బోధన దూరమవుతోంది. వనరులను పంచుకునేలా ఆయా సంస్థల మధ్య జరిగేఒప్పందాలతో విద్యార్థులందరికీ మేలు చేకూరుతుంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్–గ్రాడ్యుయేట్, పీహెచ్డీ కోర్సులన్నిటికీ ఈ విధానాన్ని అమలుచేయాలని యూజీసీ సూచించింది. ఆయా విద్యాసంస్థలన్నీ తమ సంస్థలోని తరగతి గదులు, ల్యాబ్లు ఇతర వనరుల సమాచారాన్ని సమీపంలోని ఇతర ఉన్నత విద్యాసంస్థలన్నిటికీ తెలిసేలా వెబ్సైట్ ద్వారా తక్షణమే అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. వీటిని వినియోగించుకోవాలనుకునే ఇతర ఉన్నత విద్యా సంస్థల నుంచి నిర్దిష్ట వనరులకు సాధారణ కనీస ఛార్జీలు నిర్ణయించి వసూలుచేయవచ్చని సూచించింది. ఆ కనీస ఛార్జీల వివరాలూ అందుబాటులో ఉంచాలని పేర్కొంది. సంస్థల మధ్య ఒప్పందాలు ఇక ఉన్నత విద్యా సంస్థల్లోని వనరులను పరస్పర భాగస్వామ్యంతో వినియోగించుకునేందుకు వీలుగా ఆయా సంస్థలు ఎంఓయూ కుదుర్చుకోవాలని యూజీసీ పేర్కొంది. ఏ సమయంలో ఏ సంస్థ విద్యార్థులు వనరులు వినియోగించుకోవాలో సమగ్ర టైమ్టేబుల్ను రూపొందించి ఆ ప్రకారం కార్యక్రమాలకు కమిటీలను ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంది. తరగతి గదులు, ల్యాబ్లు, ఇతర వనరులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా సంస్థలు చర్యలు చేపట్టాలని, ఏ ఒక్క తరగతి ఖాళీగా ఉండకుండా చూసుకోవాలని యూజీసీ సూచించింది. ఈ విధానంతో విద్యార్థులకు మేలు.. తరగతి గదులు, మౌలిక సదుపాయాలు పంచుకోవడం ద్వారా విద్యార్థులకు మేలు చేకూరుతుంది. క్రీడా మైదానాలు, స్టేడియం, సమావేశ మందిరాలను కూడా అవసరాలను అనుసరించి పంచుకోవచ్చు. సైన్సేతర అంశాలకు సంబంధించిన వనరుల విషయంలో కూడా సంస్థలు పూర్తిస్థాయిలో తమ వద్ద ఉన్న అన్ని సదుపాయాలను ఇతర సంస్థలకు అందుబాటులో ఉంచాలని యూజీసీ పేర్కొంది. పరికరాలు దెబ్బతినే విషయంలోనూ వాటిని తిరిగి ఏర్పాటుచేయడంపైనా ఒప్పందంలో పేర్కొనాలి. అకడమిక్ అంశాలకు సంబంధించి ఆన్లైన్ లెక్చర్లు, వీడియోలు, లెర్నింగ్ మెటీరియల్లు, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లలోనూ ఇచ్చిపుచ్చుకోవచ్చు. విద్యార్థుల నమోదు ప్రక్రియ మొత్తం ముందుగా ఆన్లైన్ ప్లాట్ఫారమ్ ద్వారా పూర్తిచేయాలి. ఉపాధ్యాయుల శిక్షణ, ఫ్యాకల్టీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించవచ్చు. ఖర్చులపై ముందుగానే ప్రణాళిక వనరులను పంచుకోవడానికి ముందు వ్యయ విశ్లేషణ, ఖర్చును నిర్ణయించే పద్ధతులపై ప్రణాళిక రూపొందించుకోవాలి. లాభనష్టాలకు తావులేని రీతిలో వనరుల వినియోగంపై ఛార్జీలు వసూలుచేయాలి. ప్రయోగాల వినియోగం ఆధారంగా, నిర్వహణ వ్యయం ప్రకారం పరికరాలు ఛార్జీలు నిర్ణయించాలి. ఉన్నత విద్యాసంస్థల మధ్యే కాకుండా కాలేజీలు, పరిశ్రమల మధ్య కూడా ఒప్పందాలు చేసుకోవాలని యూజీసీ సూచించింది. -
ఇక ఎంసీఏ రెండేళ్లే...కొత్త డిగ్రీ కోర్సులకు శ్రీకారం
సాక్షి, అమరావతి: దేశంలో కొత్తగా కొన్ని డిగ్రీ కోర్సులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ శ్రీకారం చుట్టింది. కొన్ని ప్రోగ్రామ్ల కోర్సు వ్యవధిని సవరించింది. అలాగే వివిధ డిగ్రీ ప్రోగ్రామ్ల అర్హతల్లో మార్పులు చేసింది. ఇందుకు సంబంధించి నూతన విధివిధానాలు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీన్ని www.ugc.ac.in లో పొందుపరిచింది. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల కోసం.. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, డిజైన్ విభాగాల్లో తొమ్మిది కొత్త కోర్సులను యూజీసీ ప్రకటించింది. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణుల కోసం బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ అర్బన్ డిజైన్ (వ్యవధి: నాలుగేళ్లు), బ్యాచిలర్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్, బ్యాచిలర్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్సెస్ (వ్యవధి: మూడేళ్లు) కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ డిగ్రీలు పూర్తి చేసిన వారి కోసం ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ మేనేజ్మెంట్, అర్బన్ డిజైన్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ సైన్స్లో రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్లను కూడా ప్రకటించింది. ఈ కోర్సులను ఎప్పటి నుంచి అమలు చేయాలనేదాన్ని యూనివర్సిటీల ఇష్టానికి వదిలేసింది. కొత్త మార్పులు ఇలా.. యూజీసీ తాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఇప్పటిదాకా మూడేళ్లుగా ఉన్న మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సు వ్యవధిని రెండేళ్లకు తగ్గించారు. అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ (బీవోటీ) కోర్సు వ్యవధిని నాలుగేళ్ల నుంచి నాలుగున్నరేళ్లకు పెంచారు. 12వ తరగతి ఉత్తీర్ణులై వైద్య రంగంలోకి రావాలనుకునే విద్యార్థుల కోసం కొత్తగా బ్యాచిలర్ ఆఫ్ సోవా రిగ్పా మెడిసిన్ అండ్ సర్జరీ (బీఎస్ఆర్ఎంఎస్) కోర్సును యూజీసీ ప్రవేశపెడుతోంది. ఈ కోర్సు కాలవ్యవధి.. ఐదున్నరేళ్లు. మెడిసిన్, సర్జరీ, ఆయుర్వేద, యునాని, హోమియోపతి, హెల్త్ అనుబంధ సైన్సెస్, ఫార్మసీ, పారామెడికల్, నర్సింగ్ తదితర విభాగాల్లో ఈ బీఎస్ఆర్ఎంఎస్ కోర్సును అందిస్తారు. (చదవండి: ఏపీ పథకాలు బాగున్నాయ్..) -
పరిశోధనా? ఉపరితల శోధనా?
కార్యకారణాలేమైనా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇన్నాళ్ళకు కళ్ళు తెరిచినట్టుంది. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్పేందుకు ఆయా రంగాల నిపుణులను వినియోగించుకోవాలని నిర్ణయించడం మంచిదే. ఎంత అనుభవం, నైపుణ్యం ఉన్నా – పీహెచ్డీ పట్టా కానీ, జాతీయ అర్హతా పరీక్ష (నెట్)లో కృతార్థులై కానీ ఉంటే తప్ప అధ్యాపకులుగా పనిచేయడానికి వీలు లేదన్న షరతుకు వెసులుబాటు లభించింది. సివిల్ సర్వీసులలో లాగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఫుల్టైమ్, పార్ట్టైమ్ ఆచార్య పదవుల్లోకి లేటరల్ ఎంట్రీ వచ్చినట్టయింది. ఈ కొత్త విధానంతో పాటు, కొంతకాలంగా ఉద్యోగానికీ – పీహెచ్డీకీ ముడిపెట్టిన ప్రహసనంపై ఇప్పుడు చర్చ రేగింది. నిజానికి డాక్టోరల్ థీసిస్ (పీహెచ్డీ) అనేది నిర్ణీత అంశాన్ని లోతుగా తెలుసుకోవాలనే ఆసక్తితో, మనసు పెట్టి చేయాల్సిన పని. ఉద్యోగార్హత కోసం చేసే మొక్కుబడి వ్యవహారం కాదు. అలాగే, నాణ్యమైన బోధన చేయాలంటే పీహెచ్డీ చేసి తీరాలని అనుకోవడం బోడిగుండుకూ, మోకాలికీ ముడిపెట్టడమే! అద్భుతంగా పాఠం చెప్పగలిగినవాళ్ళందరూ పరిశోధకులై ఉంటారనుకున్నా, ఉత్తమ పరిశోధకులైనంత మాత్రాన అర్థమయ్యేలా పాఠం చెప్పే నేర్పు ఉంటుందనుకున్నా పొరపాటు. విధాన నిర్ణేతలు ఈ చిన్న తర్కం మర్చిపోయారు. పీహెచ్డీ చేయకున్నా, దాదాపు 40 గౌరవ డాక్టరేట్లొచ్చిన అబ్దుల్ కలామ్ ఎంత అద్భుత బోధకులో గుర్తు చేసుకోవాలి. అధ్యాపకులుగా ఎంపిక కావాలన్నా, ఇప్పటికే అధ్యాపక వృత్తిలో ఉన్నవారు ఆ పనిలోనే కొనసాగాలన్నా పీహెచ్డీ చేసి తీరాల్సిందే అని కొన్నేళ్ళ క్రితం పెట్టిన నిబంధన నిర్హేతుకమనేది అందుకే! ఒకప్పుడు ఉద్యోగానికి పీహెచ్డీ తప్పనిసరి కాదు. 2021 జూలై నుంచి యూనివర్సిటీ బోధనకు పీహెచ్డీ తప్పనిసరి చేసింది యూజీసీ. కరోనాతో తేదీని 2023 వరకు పొడిగించారు. కానీ, ఉన్నత విద్యాబోధనలో ఉండాలంటే పీహెచ్డీ సాధించాల్సిందేనని మెడ మీద కత్తి పెడితే ప్రయోజనం ఉంటుందా? ఒకప్పుడు డాక్టరేట్ అంటే అదో విశిష్ట సాధన. గౌరవ డాక్టరేట్లు, కష్టపడి పరిశోధన చేసి పీహెచ్డీ పట్టాతో పేరు ముందు వచ్చే డాక్టర్ అనే మూడక్షరాలు సమాజంలో విశేష గౌరవం. ఆ మోజు పెరిగేసరికి పేరు లేని విదేశీ సంస్థల మొదలు ప్రైవేట్ విద్యా లయాల దాకా అనేకుల గౌరవ డాక్టరేట్లు ఇవాళ అంగడి సరుకయ్యాయి. గౌరవ డాక్టరేట్లను పేరు ముందు ఇంటి పేరులా వాడరాదన్నది విస్మరించిన వేళ అసలు డాక్టరేట్కే గౌరవం లేకుండా పోయే ప్రమాదం వచ్చింది. 1920లలో మన దగ్గర కొన్ని డజన్ల మందే పీహెచ్డీ స్కాలర్లుండేవారు. ఇవాళ అమెరికాలో ఏటా 64 వేలకు పైగా డాక్టరేట్లు వస్తుంటే, 24 వేల మంది పీహెచ్డీ స్కాలర్లతో మనం ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నాం. 2010తో పోలిస్తే 2017లో పీహెచ్డీలో చేరేవారి సంఖ్య రెట్టింపు దాటింది. 2000 నాటికి దేశంలో డాక్టరేట్ ప్రదానం చేసే సంస్థలు 326. కానీ, 2017 కల్లా వాటి సంఖ్య 912 అయిందంటే పీహెచ్డీ ఎంత వేలంవెర్రిగా మారిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి, నిరంతర అధ్యయనం, క్షేత్రస్థాయి పర్యటనలు, ప్రొఫెసర్ల మార్గదర్శనం, విశ్వవిద్యాలయాల్లో పరిశోధన పత్రాల సమర్పణ – అంతా ఒక సీరియస్ జ్ఞానార్జన. కానీ, ఇవాళ పరిశోధకులకే కాదు... వారికి దిశా నిర్దేశ విధుల్లో ఉన్న చాలామందిలోనూ విషయ పరిజ్ఞానం హుళక్కి. ఇప్పటికే పలు విశ్వవిద్యాలయ శాఖలు పీహెచ్డీ స్కాలర్లను టోకున బయటకు పంపే కర్మాగారాలయ్యాయి. అనేకచోట్ల అజ్ఞాత రచయితల సహకారం, గ్రంథ చౌర్యం, నాసిరకం పరిశోధనాంశాలు, పత్రాలతో ప్రమాణాలు నానాటికీ తీసికట్టు అయ్యాయి. నాలుగు వాక్యాలు రాయలేనివాళ్ళు, నాలుగు మాటలు సదస్సులో మాట్లాడలేనివాళ్ళూ నేడు పీహెచ్డీ పట్టాదారుల్లో ఉంటున్నారన్నది నిష్ఠురమైన నిజం. ఉద్యోగానికీ, ఉద్యమంగా చేయాల్సిన పరిశోధనకూ లింకు పెట్టడం మన విధాన నిర్ణేతల ఘోర తప్పిదం. దానివల్లే పీహెచ్డీ ప్రవేశాలు 50 శాతం పెరిగాయి. ప్రమాణాలు పాతాళానికి చేరాయి. కనీసం మూడు నుంచి అయిదేళ్ళ కఠోర శ్రమతో తపించి చేయాల్సిన పరిశోధనపై తపన లేనివాళ్ళు కూడా ఉద్యోగం కోసం వట్టి ఉపరితల శోధకులవుతున్న దౌర్భాగ్యం. ఆర్ట్స్ మొదలు సైన్స్ దాకా అనేకచోట్ల ఇదే పరిస్థితి. ఏటా 60 లక్షల మంది గ్రాడ్యుయేట్లు, 15 లక్షల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు వస్తున్న దేశంలో నిఖార్సయిన పరిశోధక విద్యార్థుల శాతం ప్రశ్నార్థకమే. విశ్లేషణాత్మక శోధన, వర్తమాన ప్రాసంగికత లోపించి, పునరుక్తులతో, సర్వే ఆధారిత సిద్ధాంతాలుగా తూతూ మంత్రపు ఉపరిశోధనలు పెరిగిపోయాయని తాజా నివేదికల మాట. వెరసి, జ్ఞానార్జనలో సరికొత్త అంశాలు వెలికి తీయాల్సిన పరిశోధన మౌలిక లక్ష్యం, లక్షణం నిర్వీర్యమైపోతున్నాయి. మౌలిక పరిశోధన మృగ్యమై, ఎంతసేపటికీ చూచిరాతలు, ఎత్తిపోతలతోనే వివిధ శాఖల్లో పీహెచ్డీ సిద్ధాంత గ్రంథాలు సిద్ధమవుతున్నట్టు ఆరోపణ. గ్రంథ చౌర్యాన్ని కనిపెట్టే సాఫ్ట్వేర్ను కొన్నేళ్ళ క్రితం ప్రవేశపెట్టారు. కానీ, ఆ ఒక్క పనితో పీహెచ్డీల నాణ్యత పెరుగుతుందా? చిత్తశుద్ధి లేని పీహెచ్డీతో నిర్ణీత విద్యాశాఖకు కలిగే ప్రయోజనం ఏమిటి? అలాంటి వారు బోధకులైతే విద్యా ర్థులకు వచ్చిపడే విజ్ఞానం ఏముంటుంది? ఇప్పటికైనా నిష్ప్రయోజనమైన ఈ డిగ్రీల తంతును వదిలించుకొని, నిఖార్సయిన పరిశోధనలను యూజీసీ, మానవ వనరుల అభివృద్ధిశాఖ ప్రోత్సహిస్తే మేలు. ప్రహసనప్రాయంగా మారిన ‘నెట్’ లాంటి వాటి పైనా పునఃసమీక్ష అవసరం. పీహెచ్డీ లేకున్నా, అనుభవజ్ఞులైన వారి సేవలు తీసుకోవాలన్న తాజా నిర్ణయం అందుకే స్వాగతనీయం. -
యూజీసీ చైర్మన్గా తెలుగు తేజం జగదీశ్
న్యూఢిల్లీ/సాక్షి, నల్లగొండ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)గా ప్రొఫెసర్ మామిడాల జగదీశ్కుమార్ నియమితులయ్యారు. ఐదేళ్లపాటు ఈ పదవిలో ఆయన కొనసాగనున్నారు. కమిషన్కు ఛైర్మన్గా పనిచేసిన ప్రొఫెసర్ డిపి సింగ్ పదవీకాలం ముగియడంతో డిసెంబర్ 7న పదవీ విరమణ చేశారు. అప్పటినుంచి ఖాళీగా ఉన్న పోస్టుకు ప్రకటన ఇవ్వడంతో, 55 మంది దరఖాస్తు చేసుకోగా జగదీశ్ ఎంపికయ్యారు. యూజీసీకి చైర్మన్గా నియమితులైన మూడో తెలుగు వ్యక్తి జగదీశ్ కుమార్. 1961లో డాక్టర్ వాసిరెడ్డి శ్రీకృష్ణ, 1991 నుంచి 1995 వరకు జి.రామిరెడ్డి యూజీసీ చైర్మన్లుగా పనిచేయగా, ఇప్పుడు ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ నియమితులయ్యారు. 60 ఏళ్ల జగదీశ్ కుమార్ ప్రస్తుతం జేఎన్యూ వైస్చాన్స్లర్గా పనిచేస్తున్నారు. వీసీగా పదవీకాలం గతేడాదే ముగిసినా ఆయనను కొనసాగించారు. జేఎన్యూలో ఆయన వీసీగా ఉన్నప్పుడు 2016లో విద్యార్థులపై దేశద్రోహం కేసులు నమోదు కావడం, అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహించదలిచిన కార్యక్రమాన్ని వీసీ వద్దనడం, విద్యార్థులు వీసీ కార్యాలయాలనికి తాళాలేయడం, 2019లో జరిగిన స్నాతకోత్సవ వేదికపై దాదాపు ఆరు గంటలపాటు మానవవనరుల శాఖ మంత్రిని నిర్బంధించడం వంటి అనేక వివాదాస్పద సంఘటనలు జరిగాయి. నల్లగొండ వాసి... తెలుగువాడైన జగదీశ్ కుమార్ స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తిమండలం మామిడాల గ్రామం. పాఠశాల విద్యను స్వగ్రామంలో, ఏడవ తరగతి నుంచి ఇంటర్ వరకు మిర్యాలగూడలో చదివారు. డిగ్రీతో పాటు ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ హైదరాబాద్లో చదివారు. ఆ తరువాత ఐఐటీ మద్రాసులో ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తరువాత పోస్ట్ డాక్టో్టరల్ రీసెర్చ్ కోసం కెనడా వెళ్లి 1994లో స్వదేశానికి తిరిగి వచ్చారు. 1995లో ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్గా ఉద్యోగంలో చేరారు. 2013లో ఐఐటీ ఢిల్లీ నుంచి ‘అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్’ అందుకున్నారు. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో నిష్ణాతుడైన ఆయన 2016 ఢిల్లీ జేఎన్యూ వైస్ చాన్స్లర్గా నియమితులయ్యారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ సాంçస్కృతిక మంత్రిత్వ శాఖలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ పాలకమండలి చైర్మన్గా, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా, యూజీసీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సభ్యునిగా ఉన్నారు. ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్, ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ ఫెలో అందుకున్నారు. సెమీకండక్టర్ డివైజ్ డిజైన్, మోడలింగ్ రంగంలో విశేష కృషికి గాను ఆయనకు 29వ ఐఈటీఈ రామ్లాల్ వాధ్వా గోల్డ్ మెడల్ లభించింది. భారతదేశ ఎలక్ట్రానిక్స్ – సెమీకండక్టర్ అసోసియేషన్ అందించే మొట్టమొదటి ఐఎస్ఏ అండ్ వీఎస్ఐ టెక్నోమెంటర్ అవార్డును కూడా అందుకున్నారు. ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2008 ఐబీఎం ఫ్యాకల్టీ అవార్డును పొందారు. నూతన బాధ్యతలు చాలెంజింగ్గా ఉంటాయని భావిస్తున్నా. నూతన జాతీయ విద్యా విధానం ఎంత తొందరగా అమల్లోకి వస్తే దేశానికి అంత మేలు జరుగుతుంది. ఇదే విషయమై త్వరలో అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో సమావేశమవుతాను. మల్టీడిసిప్లినరీ కోర్సుల విషయమై చర్చిస్తాం. ప్రభుత్వం ఇటీవలే బడ్జెట్లో డిజిటల్ యూనివర్సిటీని ప్రకటించింది. విద్యను మరింత సులభతరం చేసే డిజిటల్ సాంకేతికత కూడా ప్రాధాన్య జాబితాలో ఉంటుంది. -
నవంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు
సాక్షి, హైదరాబాద్ : సంప్రదాయ డిగ్రీ కోర్సులు, ఇంజనీరింగ్ వంటి వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల ప్రథమ సంవత్సర మొదటి సెమిస్టర్ తరగతులను నవంబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోనూ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా డిగ్రీ, పీజీ తరగతులను అదే రోజు నుంచి ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ అదే విధానాన్ని అనుసరించేందుకు చర్యలు చేపట్టా లనుకుంటోంది. ఇందులో భాగంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల ప్రవేశాలను వచ్చే నెల 31లోగా పూర్తి చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా ఈ నెల 21న డిగ్రీ మొదటి దశ సీట్ల కేటాయింపును ప్రకటించింది. రెండు, మూడు దశల కౌన్సెలింగ్ను కూడా వచ్చే నెల 10లోగా నిర్వహించి 15వ తేదీలోగా విద్యార్థులంతా కాలేజీల్లో చేరేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెల 9, 10, 11, 14 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వం... ఫలితాలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఈ నెల 28, 29 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్ను నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. అవి పూర్తయి, ఫలితాలు ప్రకటించగానే ప్రవేశాల కౌన్సెలింగ్ను నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పీజీ ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి 19 రకాల పీజీ కోర్సులకూ ఈ నెల 21 నుంచి 24 నుంచి ప్రవేశపరీక్షలను నిర్వహిస్తోంది. అవి పూర్తవగానే పీజీ ప్రవేశాలను కూడా వచ్చే నెలలో చేపట్టి పూర్తి చేయనుంది. ఇప్పటికే సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ను జారీ చేసింది. వాటికి సంబంధించిన పరీక్షల నిర్వహణను నవంబర్ 9 వరకు పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే వాటి ప్రవేశాలు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే ఇంజనీరింగ్ పీజీ ప్రవేశాలు మాత్రం పూర్తి కానున్నాయి. యూజీసీ షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలోనూ అకడమిక్ కేలండర్ను అమలు చేస్తామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. 3లోగా ఎంసెట్ ఫలితాలు! సాక్షి, హైదరాబాద్: ఈ నెల 9, 10, 11, 14 తేదీల్లో నిర్వహించిన ఇంజనీరింగ్ ఎంసెట్ ఫలితాలు వచ్చే నెల 3వ తేదీలోగా విడుదల కానున్నాయి. అందుకు అనుగుణంగా ప్రవేశాల కమిటీ కసరత్తు ప్రారంభిం చింది. వీలైతే ఈ నెల 30న ఫలితాలను విడుదల చేసే అవకాశాలనూ కమిటీ పరిశీలిస్తోంది. ఒకవేళ కుదరకపోతే వచ్చే నెల 1న లేదా 3న విడుదల చేయనుంది. ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించే అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షల ఫలితాలను కూడా వచ్చే నెల మొదటి వారంలోనే ప్రకటించేలా ప్రవేశాల కమిటీ కసరత్తు చేస్తోంది. -
ఐఐటీలు, ఐఐఎంలపై కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల నూతన విద్యా విధానాన్ని ఆవిష్కరించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉన్నత విద్యా రంగంలోనూ పెనుమార్పులకు శ్రీకారం చుడుతోంది. ఐఐటీలు, ఐఐఎంలను ఆన్లైన్ విద్యా వ్యవస్ధ కిందకు తీసుకురావాలని యోచిస్తోన్న ప్రభుత్వం ఈ దిశగా యూజీసీ, ఏఐసీటీఈ నుంచి సూచనలను కోరుతోంది. విద్యార్ధులకు భౌతికంగా క్లాసులను నిర్వహించే భారాన్ని విద్యా సంస్ధలకు తగ్గించే దిశగా మొత్తం విద్యా వ్యవస్ధను ఆన్లైన్ విద్యా వ్యవస్థగా మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. తొలుత ఉన్నత విద్యాసంస్ధలైన ఐఐటీలు, ఐఐఎంలను ఆన్లైన్ విద్యా వ్యవస్ధ కిందకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి బ్లూప్రింట్ను తయారుచేసేందుకు ఏఐసీటీఈ చీఫ్ అనిల్ సహస్రబుధే, యూజీసీ వైస్ చైర్మన్ డాక్టర్ ఎంపి పునియాల నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. భారత విద్యార్ధులకు నాణ్యతతో కూడిన ఆన్లైన్ విద్యను అందించేందుకు అవసరమైన డిజిటల్ వేదికను ఏర్పాటు చేసే గురుతర బాధ్యతలను ఈ ఇద్దరు దిగ్గజాలకు ప్రభుత్వం కట్టబెట్టింది. ఆన్లైన్ విద్యకు అవసరమైన పటిష్ట మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపైనా వీరు కసరత్తు సాగిస్తారు. మరోవైపు చైనా యాప్లకు దీటుగా యాప్స్ను తయారుచేయాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఇటీవల ఐఐటీలను కోరారు. చదవండి : ఇంట్లోనే కరోనా టెస్టులు -
నా పరిస్థితి ఏమిటి?
సాక్షి, హైదరాబాద్ : క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా కొలువులకు ఎంపిౖకైన 14 వేల మంది ఇంజనీరింగ్ కాలేజీల ఫైనలియర్ విద్యార్థులు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీరుతో ఉసూరు మంటున్నారు. కరోనా మహ మ్మారి విజృంభణతో ఓవైపు లక్ష లాది మంది ఉపాధి కోల్పోతున్న వేళ అందివచ్చిన ఉద్యోగాల్లో చేరేందుకు డిగ్రీ పట్టా లేకపోవ డం అడ్డంకిగా మారడంతో ఆవే దన చెందుతున్నారు. ఐఐటీ, ఎన్ఐటీ, బిట్స్ పిలానీ, డీమ్డ్ వర్సిటీల్లో చదివి క్యాంపస్ కొలువులకు ఎంపికైన బీటెక్ ఫైనలియర్ విద్యార్థులు ఇప్పటికే ఉద్యోగాల్లో చేరి పోగా యూజీసీ పరిధిలోని ఇంజ నీరింగ్ కాలేజీలకు చెందిన వేలాది మంది విద్యార్థులు మాత్రం క్యాంపస్ ప్లేస్మెంట్లు పొందినా ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. డిగ్రీ సర్టిఫికెట్లు సమర్పించా లంటూ ఉద్యోగాలిచ్చిన కంపెనీలు పంపుతున్న లేఖలకు బదులివ్వలేక తలపట్టుకుంటున్నారు. యూజీసీకి ఎందుకీ మొండిపట్టు.. కరోనా విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, డీమ్డ్ వర్సిటీలు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించి ఇంజనీరింగ్ ఫైనలియర్ విద్యార్థులకు సర్టిఫి కెట్లు ఇచ్చేశాయి. కొన్ని కాలేజీలు అయితే ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చి విద్యా ర్థులను ప్రమోట్ చేసి పాస్ సర్టిఫికెట్లు ఇచ్చేశాయి. మరోవైపు కరోనా తీవ్రంగా ఉన్నప్పటికీ విశ్వవిద్యాలయాలు, వాటి పరిధి లోని ఇంజనీరింగ్ కాలేజీల ఫైనలియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సిందేనని యూజీసీ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అయితే యూజీసీ వైఖరిని తప్పుపడుతూ పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభు త్వానికి లేఖలు రాశాయి. యూజీసీ నిర్ణయం అసం బద్ధమంటూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఏపీ, తెలంగాణ ప్రభు త్వాలు మాత్రం వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వ హిస్తామని ప్రకటిం చాయి. కానీ కరోనా ఉధృతమైతే పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని, తమకు వచ్చిన ఉద్యోగాలు పోతాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. స్పష్టత కరువు... రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇంజనీరింగ్ కాలేజీలు ఇంటర్నల్ మార్కులు లేదా ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేస్తే వారు ఇప్పటికే ఉద్యోగాల్లో చేరిపోయేవారని, యూజీసీ మొండి పట్టుదల కారణంగా విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని ఓ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ వ్యాఖ్యానించారు. ‘ఎన్ఐటీలు నామమాత్రంగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాయి. డీమ్డ్ వర్సిటీలు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులను ప్రమోట్ చేశాయి. వాళ్లకు లేని నిబంధన ఇంజనీరింగ్ కాలేజీలకు ఎందుకు? ఒకవేళ పరీక్షలు నిర్వహించాల్సి వస్తే ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై స్పష్టత లేదు. కరోనా తగ్గుముఖం పడితే గానీ సాధ్యం కాదు. పరీక్షలు నిర్వహించాక వ్యాల్యుయేషన్, ట్యాబులేషన్ వంటి వాటికి చాలా సమయం పడుతుంది. అప్పటిదాకా విద్యార్థుల ఉద్యోగాలకు యూజీసీ గ్యారంటీ ఇస్తుందా? అని ఆ ప్రిన్సిపల్ ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణ, విద్యా సంవత్సరం కేలండర్ విషయంలో యూజీసీ విధానాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని విద్యావేత్తలు మండిపడుతున్నారు. ‘ఫైనలియర్ విద్యార్థులకు మూడు సబ్జెక్టులే ఉంటాయి. అప్పటికే వారు ఏడు సెమిస్టర్లలో 35–40 సబ్జెకుŠట్లు చదివి పాసైన వారే. నా ఉద్దేశంలో ఇంటర్నల్ మార్కుల ఆధారంగా వారిని పాస్ చేయవచ్చు’ అని మాజీ వైస్ చాన్స్లర్ అభిప్రాయపడ్డారు. నా పరిస్థితి ఏమిటి? ‘నన్ను ఓ కార్పొరేట్ కంపెనీ రూ. 28 లక్షల వార్షిక వేతనానికి నియమించుకుంది. డిగ్రీ సర్టిఫికెట్ కాపీలు పంపాలని ఇప్పటికే పలుమార్లు మెయిల్ పంపింది. తాజాగా అక్టోబర్ 31 వరకు డెడ్లైన్ పెట్టింది. అప్పటికీ నా చేతికి సర్టిఫికెట్ రాకపోతే నేను మళ్లీ ఆ ఉద్యోగం సాధిస్తానా? కరోనా నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని కంపెనీలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే నాకు నిద్రపట్టట్లేదు’ అని ఓ ప్రతిష్టాత్మక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఫైనలియర్ ఇంజనీరింగ్ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. యీజీసీ ఇప్పటికైనా పరీక్షల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలివేయాలని లేకుంటే పరీక్షల నిర్వహణ మరింత ఆలస్యమై విద్యార్థులు నస్టపోతారని ఓ ప్రైవేట్ కాలేజీ ప్లేస్మెంట్ డైరెక్టర్ పేర్కొన్నారు. -
వర్సిటీల్లో పరీక్షలు రద్దు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో జూలైలో జరగాల్సిన ఫైనల్ ఇయర్ పరీక్షలన్నీ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభాన్ని అక్టోబర్ వరకు వాయిదా వేయనున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఇంటర్మీడియెట్, టెర్మినల్ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాలను తిరిగి రూపొందించి, కొత్త విద్యా సంవత్సరం కేలండర్ను తయారు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని హెచ్ఆర్డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గతంలో ఆదేశించారు. కొత్త మార్గదర్శకాలను రూపొందించడానికి హరియాణా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఆర్సీ కుహాద్ ఆధ్వర్యంలో యూజీసీ ప్యానెల్ను ఏర్పాటు చేశారు. కొత్త ఎకడమిక్ కేలండర్పై కసరత్తు చేస్తున్న ఈ ప్యానెల్ మరో వారం రోజుల్లో కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తుందని హెచ్ఆర్డీ అధికారులు తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో ఉంచుకొని కొత్త విధానాన్ని రూపొందిస్తారు. ఫైనల్ ఇయర్ పరీక్షలు రద్దు చేసి, విద్యార్థులు పూర్వ ప్రతిభ ఆధారంగా మార్కులు నిర్ణయించేలా కసరత్తు జరుగుతోంది. అయితే ఆ మార్కుల పట్ల విద్యార్థులెవరైనా అసంతృప్తిగా ఉంటే, కోవిడ్ తగ్గుముఖం పట్టాక జరిగే పరీక్షల్లో పాల్గొనే అవకాశం ఇస్తారని అధికారులు వివరించారు. ఆగస్టు, సెప్టెంబర్లో ప్రారంభం కావల్సి ఉన్న విద్యా సంవత్సరాన్ని అక్టోబర్ వరకు వాయిదా వేసే అవకాశాలున్నాయి. ఎన్సీఈఆర్టీకి కొత్త మార్గదర్శకాలు 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)కి పలు మార్గదర్శకాలు జారీ చేసింది. 1–5 క్లాస్ల వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించడానికి వీలుగా ఇన్ఫోగ్రాఫిక్స్, పోస్టర్ ప్రజెంటేషన్స్ వంటివి అక్టోబర్ నాటికల్లా రూపొందించాలి. 6–12తరగతుల వారికి మార్చికల్లా సిద్ధంచేయాలి. ఆన్లైన్ తరగతుల్లో పాల్గొనేలా టీచర్లకు శిక్షణతరగతుల్ని డిసెంబర్నాటికి పూర్తి చేయాలి. 6–12తరగతుల విద్యార్థులకి ఆన్లైన్ బోధనకు టీచర్లకు శిక్షణ వచ్చే ఏడాది జూన్ నాటికల్లా పూర్తి కావాలి. ఆన్లైన్ తరగతుల్లో పాల్గొనే సదుపాయాలు లేని విద్యార్థులకు చదువు చెప్పడానికి సిలబస్ను, పుస్తకాల తయారీ పని డిసెంబర్కల్లా పూర్తి కావాలని కేంద్రం స్పష్టం చేసింది. -
త్వరలో ఏకకాలంలో రెండు డిగ్రీలు
న్యూఢిల్లీ: ఒకే సమయంలో రెండు డిగ్రీలను పూర్తి చేసే అవకాశం త్వరలో అమలయ్యేలా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆమోదం తెలిపిందని అధికారులు తెలిపారు. అయితే ఇందులో ఒక డిగ్రీని రెగ్యులర్ మోడ్లోనూ, మరోటి ఆన్లైన్ డిస్టెన్స్ లెర్నింగ్(ఓడీఎల్) ద్వారా చేయాల్సి ఉంటుందని యూజీసీ కార్యదర్శి రజనీశ్ జైన్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడించే అవకాశం ఉందన్నారు. ఈ వ్యవహారంపై గతేడాది యూజీసీ వైస్ చైర్మన్ భూషన్ పట్వర్థన్ ఆధ్వర్యంలో కమిటీ వేయడం తెల్సిందే. -
కరోనా: ఇంటి నుంచి ఈ పనులు చేయండి
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నివారణలో భాగంగా దేశంలోని అన్ని యూనివర్సిటీలు, వాటి పరిధిలోని అన్ని విద్యా సంస్థలను మూసేసి ఇంటి నుంచే పని విధానాన్ని ఈ నెల 31 వరకు అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఫ్యాకల్టీ మెంబర్లు, టీచర్లు, రీసెర్చి స్కాలర్లు, కాంట్రాక్టు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది మొత్తం ఇంటి నుంచే విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఆన్లైన్ కంటెంట్, ఆన్లైన్ బోధన, ఆన్లైన్ మూల్యాంకనం కార్యక్రమాలను అభివృద్ధి చేయాలని పేర్కొంది. (కరోనా: చప్పట్లు కాదు అవి ఇవ్వండి!) వర్క్ ఫ్రమ్ హోమ్ సందర్భంగా ఫ్యాకల్టీ సభ్యులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు వివిధ విద్యా కార్యకలాపాల కోసం ఈ కాలాన్ని ఉపయోగించుకోవాలి. ► వచ్చే విద్యా సంవత్సరం లేదా తదుపరి సెమిస్టర్లో అందించే కోర్సులకు పాఠ్య ప్రణాళికను సిద్ధం చేయాలి. ► బోధనా సామగ్రిని అభివృద్ధి పరచాలి. ► పరిశోధకులు ఇంటి నుంచే పరిశోధనలు కొనసాగించాలి. ► వివిధ అంతర్జాతీయ జర్నల్స్కు, ఇతర మ్యాగజైన్లకు వ్యాసాలు, పేపర్లు మొదలైనవి ఇంటి నుంచే రాసి పంపించాలి. ► విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రశ్నలను సిద్ధం చేయాలి. ► ‘ఏక్ భారత్ శ్రేష్ట భారత్’ తదితర అంశాలపై వినూత్న ప్రాజెక్టులను సిద్ధం చేయాలి. ► ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాలాన్ని విధుల్లో ఉన్నట్లు పరిగణిస్తారు. ► హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు ముఖ్యంగా విదేశీ విద్యార్థులుంటే వారిని హాస్టళ్లలో కొనసాగడానికి అనుమతించాలి. వారికి అవసరమైన ఏర్పాట్లు, ఇతర భద్రతా చర్యలు తీసుకోవాలి. ► ఫ్యాకల్టీ సభ్యులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, బోధనేతర సిబ్బందిని సంప్రదించేందుకు మొబైల్ నంబర్లు, ఈ–మెయిల్ ఐడీ తదితర సమాచారాన్ని తమ సంస్థలకు పంపించాలి. -
కరోనా ఎఫెక్ట్: కంటెంట్, బోధన.. ఆన్లైన్లోనే
సాక్షి, అమరావతి: కోవిడ్ వైరస్ నివారణలో భాగంగా దేశంలోని అన్ని యూనివర్సిటీలు, వాటి పరిధిలోని అన్ని విద్యా సంస్థలను మూసేసి ఇంటి నుంచే పని విధానాన్ని ఈ నెల 31 వరకు అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఫ్యాకల్టీ మెంబర్లు, టీచర్లు, రీసెర్చి స్కాలర్లు, కాంట్రాక్టు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది మొత్తం ఇంటి నుంచే విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఆన్లైన్ కంటెంట్, ఆన్లైన్ బోధన, ఆన్లైన్ మూల్యాంకనం కార్యక్రమాలను అభివృద్ధి చేయాలని పేర్కొంది. వర్క్ ఫ్రమ్ హోమ్ సందర్భంగా ఫ్యాకల్టీ సభ్యులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు వివిధ విద్యా కార్యకలాపాల కోసం ఈ కాలాన్ని ఉపయోగించుకోవాలి. వచ్చే విద్యా సంవత్సరం లేదా తదుపరి సెమిస్టర్లో అందించే కోర్సులకు పాఠ్య ప్రణాళికను సిద్ధం చేయాలి. బోధనా సామగ్రిని అభివృద్ధి పరచాలి. పరిశోధకులు ఇంటి నుంచే పరిశోధనలు కొనసాగించాలి. వివిధ అంతర్జాతీయ జర్నల్స్కు, ఇతర మ్యాగజైన్లకు వ్యాసాలు, పేపర్లు మొదలైనవి ఇంటి నుంచే రాసి పంపించాలి. విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రశ్నలను సిద్ధం చేయాలి. ‘ఏక్ భారత్ శ్రేష్ట భారత్’ తదితర అంశాలపై వినూత్న ప్రాజెక్టులను సిద్ధం చేయాలి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాలాన్ని విధుల్లో ఉన్నట్లు పరిగణిస్తారు. హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు ముఖ్యంగా విదేశీ విద్యార్థులుంటే వారిని హాస్టళ్లలో కొనసాగడానికి అనుమతించాలి. వారికి అవసరమైన ఏర్పాట్లు, ఇతర భద్రతా చర్యలు తీసుకోవాలి. ఫ్యాకల్టీ సభ్యులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, బోధనేతర సిబ్బందిని సంప్రదించేందుకు మొబైల్ నంబర్లు, ఈ–మెయిల్ ఐడీ తదితర సమాచారాన్ని తమ సంస్థలకు పంపించాలి. -
కేంద్ర ఉద్యోగులకూ వర్క్ ఫ్రమ్ హోం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడే లక్ష్యంగా భారత ప్రభుత్వ సంస్థలు, వేర్వేరు మంత్రిత్వ శాఖలు మరిన్ని చర్యలకు శ్రీకారం చుట్టాయి. ప్రజలు గుమికూడేందుకు ఉన్న అన్ని అవకాశాలను వీలైనంత వరకూ తగ్గించే దిశగా పలు చర్యలు చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మంది ఇంటి నుంచే పని చేయవచ్చునని ఆదేశించడం మాత్రమే కాకుండా... రైలు ప్రయాణాలను తగ్గించేందుకు రైల్వే శాఖ రోగులకు మినహా మిగిలిన వారందరికీ రాయితీలు తొలగించగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్ని రకాల పరీక్షలను ఈ నెలాఖరు వరకూ వాయిదా వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వైరస్ తీవ్రత దృష్ట్యా పదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి ఐసీఎస్ఈ బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ‘ద కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్’ప్రకటించింది. సగం మంది ఇంటి నుంచే.. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే దేశంలోని పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా ఆదేశించగా కేంద్ర ప్రభుత్వం గురువారం నుంచి సగం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేయవచ్చునని ప్రకటించింది. మిగిలిన సగం మంది మాత్రం ఆఫీసులకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ఉద్యోగులకు వేర్వేరు పనిగంటలను కేటాయించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. సిబ్బంది మంత్రిత్వ శాఖ విభాగాధిపతులకు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఆఫీసుల్లో కనీసం యాభై శాతం మంది గ్రూప్ బీ, సీ ఉద్యోగులు కచ్చితంగా ఉండాలి. మిగిలిన వారు ఇంటి నుంచి పనిచేయవచ్చు. ఈ రెండు వర్గాల ఉద్యోగులు వారానికి ఒకసారి ఎక్కడి నుంచి పనిచేస్తారన్నది మార్చుకుంటారు. తొలి వారం ఎవరు ఆఫీసుకు రావాలన్న అంశంలో ఆఫీసుకు దగ్గరగా ఉన్న వారు...సొంత వాహనాలు వాడేవారికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఉద్యోగులందరినీ మూడు వర్గాలుగా విభజించి ఒకరికి 9 – 5 గంటలు, ఇంకొకరికి 9.30 –5.30, మరొకరికి 10 – 6 గంటల పనివేళలు నిర్ణయించాలని కూడా సూచించారు. ఇళ్ల నుంచి పనిచేసే ఉద్యోగులు టెలిఫోన్ ద్వారా, ఎలక్ట్రానిక్ పద్ధతుల్లోనూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రైల్వే రాయితీలు కట్ రైళ్లలో జనసమ్మర్ధాన్ని నివారించే ఉద్దేశంతో కేంద్ర రైల్వే శాఖ ఇస్తున్న పలు రాయితీలను నిలిపివేస్తూ గురువారం ఆదేశాలు జారీ అయ్యాయి. రోగులు, విద్యార్థులు, దివ్యాంగుల కేటగిరీలో కొందరికి మాత్రం మినహాయింపు ఉంటుంది. మార్చి 20వ తేదీ అర్ధరాత్రి నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఈ ఆదేశాలు కొనసాగుతాయి. ఇప్పటివరకూ దాదాపు 53 వర్గాల వారికి రాయితీలు లభిస్తూండగా ఇక ఇవి 15కు మాత్రమే పరిమితమవుతాయి. వయోవృద్ధులు అనవసర ప్రయాణాలను నివారించేందుకు ఈ ఆదేశాలు ఉపయోగపడ తాయని అంచనా. ఈ నెల 20వ తేదీ ఆ తరువాత బుక్ చేసుకున్న టికెట్లకు ఈ షరతులు వర్తిస్తాయి. ఇప్పటికే బుక్ చేసుకున్న రాయితీ టికెట్లను ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే వారి నుంచి క్యాన్సలేషన్ ఛార్జీలు వసూలు చేయమని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఐసీఎస్ఈ పరీక్షలువాయిదా ఐసీఎస్ఈ సిలబస్లో 10, 12వ తరగతుల పరీక్షలను వాయిదావేస్తూ కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ నెలాఖరు వరకూ పరీక్షలను వాయిదా వేసుకోవాలని మానవ వనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పరీక్షలను యూజీసీ వాయిదావేసింది. స్టాఫ్ సెలక్షన్ పరీక్షలు సైతం కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యగా ఉద్యోగ నియామక పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిటీ (ఎస్ఎస్సీ)గురువారం ప్రకటించింది. వాయిదా వేసిన పరీక్షల్లో మార్చి 20న జరగాల్సిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్తోపాటు మార్చి 30న జరగాల్సిన జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ కాంట్రాక్ట్) పరీక్షలు ఉన్నాయి. వృద్ధులు, పిల్లలు ఇళ్లకే పరిమితం వైరస్ విస్తృతి నేపథ్యంలో దేశంలో 65 ఏళ్ల పైబడ్డ వృద్ధులు, పదేళ్ల లోపు వయసున్న వారు ఇళ్లకే పరిమితం కావాలని కేంద్ర ఆరోగ్య శాఖ సలహా ఇచ్చింది. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యనిపుణులకు మాత్రం ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఉంటుందని విదేశీ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ రవి తెలిపారు. మాస్కులు, శానిటైజర్ల వంటివాటిని అధిక ధరలకు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫార్మాస్యూటికల్ డిపార్ట్మెంట్, వినియోగదారుల శాఖలను కోరినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో వైరస్ సామూహికంగా వ్యాప్తి చెందడం లేదని ఆరోగ్యశాఖ తెలిపింది. పంజాబ్లో మరణించిన వ్యక్తి వృద్ధుడే కాకుండా మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు కూడా ఉన్న వారని తెలిపారు. మార్చి 22వ తేదీ నుంచి మార్చి 29 వరకూ అన్ని అంతర్జాతీయ విమానాలు భారత్లో అడుగుపెట్టకుండా నిషేధం విధించినట్లు భారత్ ప్రకటించింది. -
నిఖార్సుగా కోర్సు..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా డిగ్రీ, పీజీ కోర్సుల్లో సమూల మార్పులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) శ్రీకారం చుట్టింది. ఈ మేరకు లెర్నింగ్ ఔట్కమ్స్ బేస్డ్ కరిక్యులమ్ ఫ్రేమ్వర్క్ను (ఎల్వోసీఎఫ్) రూపొందించింది. అందుకు అనుగుణంగా సిద్ధం చేసిన మోడల్ కరిక్యులమ్ను అందుబాటులోకి తెచ్చింది. డిగ్రీ, పీజీలో వివిధ కోర్సుల కాంబినేషన్లలో మార్పులు తీసుకువచ్చింది. విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఈ కరిక్యులమ్ను సిద్ధం చేసింది. ప్రతి విద్యా సంస్థ సమాజం, పరిశ్రమలతో కచ్చితంగా అనుసంధానమై ఉండేలా ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశంలోని అన్ని యూనివర్సిటీల నుంచి అభిప్రాయాలను స్వీకరించి దీనిని రూపొందించింది. వాస్తవానికి 2019–20 విద్యా సంవత్సరం నుంచే దీనిని అమల్లోకి తేవాలని భావించినా సాధ్యం కాకపోవడంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసే అవకాశం ఉంది. అయితే ఈ కరిక్యులమ్ను అన్ని రాష్ట్రాలు కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధన లేదు. తమ రాష్ట్రాల్లో అందిస్తున్న కోర్సుల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు బాగున్నాయనుకుంటే వాటినే కొనసాగించే సదుపాయం ఉంది. ఒకవేళ మార్పులు చేసుకోవాలనుకుంటే ఈ మోడల్ కరిక్యులమ్కు అనుగుణంగా మార్పులు చేసుకోవాలని యూజీసీ స్పష్టం చేసింది. 50% మందికి ఉపాధి లక్ష్యంగా.. దేశంలో 2022 నాటికి డిగ్రీ, పీజీ కోర్సులు చేసే విద్యార్థుల్లో కనీసంగా 50% మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా చేయడమే లక్ష్యంగా ఈ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో ముఖ్యంగా విద్యార్థుల చదువులకు పారిశ్రామిక రం గంతో అనుసంధానం చేసేలా వాటిని రూపొందించింది. తద్వారా చదువుకునే సమయాల్లో మూడింట రెండొంతుల మంది విద్యార్థులు ఉపాధి, స్వయం ఉపాధిని పొందేలా చూసే లక్ష్యంతో కరిక్యులమ్ను రూపొందించింది. విద్యార్థులకు తప్పనిసరిగా అవసరమైన వృత్తిపరమైన నైపుణ్యాలు, టీమ్వర్క్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ను నేర్పించేలా ఈ మార్పులు తీసుకువచి్చంది. వీటితోపాటు మానవ విలువలు, ప్రొఫెషనల్ ఎథిక్స్ కూడా నేర్చుకోవడాన్ని కోర్సుల్లో భాగం చేసింది. మరోవైపు ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడేలా కోర్సుల్లో మార్పులు చేసినట్లు వెల్లడించింది. ప్రతి అంశానికీ నిర్ణీత క్రెడిట్స్.. లెరి్నంగ్ ఔట్కమ్స్ బేస్డ్ కరిక్యులమ్ ఫ్రేమ్వర్క్ను డిగ్రీ, పీజీల్లో 16 రకాల కోర్సుల్లో రూపొందించింది. ఫిజిక్స్, ఇంగ్లి‹Ù, మ్యాథమెటిక్స్, బోటనీ, ఆంత్రోపాలజీ, హ్యూమన్ రైట్స్, క్రిమినాలజీ, సైకాలజీ, లైబ్రరీ సైన్స్, ఎల్రక్టానిక్ సైన్స్, హిందీ, స్టాటిస్టిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బయోకెమిస్ట్రీ సబ్జెక్టుల్లో మార్పులు చేసింది. అలాగే పోస్టు గ్రాడ్యుకేషన్లోనూ ఆయా కోర్సులకు సంబంధించిన కరిక్యులమ్లో మార్పులు చేసింది. ఉదాహరణకు పోస్టు గ్రాడ్యుయేషన్ ఆంత్రోపాలజీలో విద్యార్థులకు పక్కాగా బేసిక్ కాన్సెప్్ట, ప్రొసీజరల్ నాలెడ్జ్, స్పెషలైజ్డ్ స్కిల్స్ కచి్చతంగా ఉండేలా దీనిని రూపొందించింది. వాటితోపాటు ఐడెంటిఫికేషన్ ఆఫ్ అప్రాప్రియేట్ ఇష్యూస్, ప్రాబ్లం సాలి్వంగ్ స్కిల్స్, ఇన్వెస్టిగేషన్ స్కిల్స్, ఐసీటీ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రొఫెషనల్, ఎథికల్ బిహేవియర్, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కూడా నేర్చుకునేలా దీనిని రూపొందించింది. అందుకు అనుగుణంగా క్రెడిట్స్ ఇవ్వాలని పేర్కొంది. మొత్తంగా డిగ్రీలో 148 క్రెడిట్స్ ఉండేలా చర్యలు చేపట్టాలని, అందులో ప్రధాన సబ్జెక్టులతోపాటు ప్రతి అంశానికీ నిరీ్ణత క్రెడిట్స్ ఇచ్చేలా కోర్సుల వారీగా పరీక్షల విధానాన్ని పొందుపరిచింది. ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి సూచన.. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపునకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ప్రతి విద్యా సంస్థలో విద్యార్థులకు బోధించే అధ్యాపకుల ఖాళీలు 10 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని పేర్కొంది. సమాజంలో వస్తున్న మార్పులు, పారిశ్రామిక రంగంలో పురోగతిని అధ్యాపకులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ విద్యార్థులకు అందించాలని వెల్లడించింది. 2022 నాటికి దేశంలోని ప్రతి విద్యా సంస్థ కనీసం 2.5 స్కోర్తో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ గుర్తింపు పొంది ఉండాలని పేర్కొంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం... యూజీసీ జారీ చేసిన మోడల్ కరిక్యులమ్ను పరిశీలించాక ఉన్నత స్థాయిలో చర్చించి ముందుకు సాగుతాం. మోడల్ కరిక్యులమ్లో పేర్కొన్న కోర్సులు, మార్పులు, తెలంగాణలో ఉన్న కోర్సులను పరిశీలించి అవసరమైన వాటిని పరిశీలిస్తాం. అవసరం అనుకుంటే తగిన మార్పులు చేసే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. –-ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్, డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి -
జామర్ల నిబంధనలను పాటించాల్సిందే: యూజీసీ
న్యూఢిల్లీ: పరీక్షా కేంద్రాల్లో జామర్లు ఏర్పాటు చేసేటప్పుడు ప్రభుత్వ విధి విధానాలను తప్పనిసరిగా అనుసరించాల్సిందేనని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలకు సూచించింది. ప్రభుత్వ జామర్ విధానం ప్రకారం జామర్లు ఏర్పాటు చేయాలనుకుంటే భద్రతా కార్యదర్శి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని యూనివర్సిటీలు, విద్యాసంస్థలకు రాసిన లేఖలో యూజీసీ తెలిపింది. అలాగే ప్రతీ కేంద్రంలో జామర్ల పనితీరును పరీక్ష ప్రారంభానికి ముందే పరీక్షించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఎటువంటి మాల్ప్రాక్టీస్కు పాల్పడకుండా నిరోధించేందుకు పరీక్షా కేంద్రాల్లో తక్కు వ సామర్థ్యం గల జామర్లు ఏర్పాటు చేసేందుకు 2016లో కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. -
‘ఉన్నత’ పాఠాలు ఇక సమున్నతం
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యారంగాన్ని మరింత పటిష్టపర్చి.. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆయా కోర్సుల్లోని పాఠ్యాంశాలకు మరింత పదునుపెడుతోంది. అన్ని రంగాల్లో మార్పులు శరవేగంగా జరుగుతుండటంతో అందుకు తగ్గట్టుగా యువతనూ సిద్ధం చేసేలా పలు డిగ్రీ కోర్సుల పాఠ్యాంశాలకు కొత్త రూపునిచ్చింది. నిపుణుల కమిటీ సూచనలతో కొత్త అంశాలను ప్రకటించింది. ఆయా కోర్సుల్లో చదివే వారికి భవిష్యత్తులో ఏయే నైపుణ్యాలు అలవడాలి, కోర్సుల లక్ష్యం ఏమిటన్న వాటిని ముందుగానే నిర్దేశించుకుని ఆ ఫలితాలు వచ్చేలా పాఠ్యాంశాలను కూర్చి.. అభ్యాస ఫలిత ఆధారిత పాఠ్యప్రణాళిక’లు విడుదల చేసింది. 2019–20 విద్యా సంవత్సరం నుంచే కొత్త పాఠ్యాంశాలు అమల్లోకి తెస్తోంది. మహత్తర లక్ష్యం విద్యార్థుల్లో నైపుణ్యాలు, సృజనాత్మకతను పెంచి వారు చదువులు ముగించి విద్యాసంస్థల నుంచి బయటకు వచ్చేసరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా కోర్సులను తీర్చిదిద్దింది. ఉన్నత విద్య పూర్తిచేసిన యువత సమాజాభివృద్ధిలో భాగస్వాములయ్యేలా కోర్సుల సిలబస్లలో మార్పులు చేసింది. గత ఏడాది జూలై 26 నుంచి మూడు రోజుల పాటు దేశంలోని అన్ని యూనివర్సిటీల ఉప కులపతులతో ఉన్నత విద్యాకోర్సుల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై యూజీసీ జాతీయస్థాయి సదస్సు నిర్వహించింది. అభ్యాస ఫలిత ఆధారిత పాఠ్య ప్రణాళికలను డిగ్రీ స్థాయిలో అమలు చేయించాలని ఈ సదస్సులో తీర్మానించారు. పాఠ్య ప్రణాళికలను, మెరుగైన విధానాలను ప్రవేశపెట్టేలా సబ్జెక్టుల వారీగా నిపుణులతో కమిటీలను నియమించి కసరత్తు చేయించింది. ఈ కమిటీలు జాతీయ స్థాయిలో విస్తృతమైన చర్చా గోషు్టలు నిర్వహించి, పలు వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించి సబ్జెక్టుల వారీగా పాఠ్యాంశాల్లో చేయాల్సిన మార్పులు, చేర్పులను యూజీసీకి నివేదించాయి. వెబ్సైట్లో పాఠ్య ప్రణాళికలు నిపుణుల కమిటీలిచ్చిన నివేదికల ఆధారంగా యూజీసీ పలు డిగ్రీకోర్సుల్లో అభ్యాస ఫలిత ఆధారిత పాఠ్య ప్రణాళికలు విడుదల చేసింది. ఫిజిక్స్, ఇంగ్లి‹Ù, మేథమేటిక్స్, బోటనీ, ఆంథ్రోపాలజీ, హ్యూమన్ రైట్స్, క్రిమినాలజీ, సైకాలజీ, లైబ్రరీ సైన్స్ కోర్సులకు సంబంధించిన కొత్త పాఠ్య ప్రణాళికలను యూజీసీ ప్రకటించింది. తాజాగా ఎల్రక్టానిక్ సైన్స్, హిందీ, స్టాటిస్టిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బయోకెమిస్ట్రీ అంశాలపై పాఠ్యప్రణాళికలను తన వెబ్సైట్లో పొందుపరిచింది. వీటిని‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.యూజీసీ.ఏసీ.ఐఎన్’ వెబ్సైట్లో యూనివర్సిటీలు సందర్శించవచ్చని యూజీసీ కార్యదర్శి ప్రొఫెసర్ రజనీష్ జైన్ ఒక వెబ్ నోట్ విడుదల చేశారు. అభ్యాస ఫలిత ఆధారిత పాఠ్య ప్రణాళికలను అనుసరించి ఆయా వర్సిటీలు తమ పాఠ్యాంశాలను సవరించుకోవాలని యూనివర్సిటీల ఉప కులపతులకు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదికను ‘ఎల్ఓసీఎఫ్యూజీసీఎట్దరేటాఫ్జీమెయిల్.కామ్’కు లేదా ‘నీతుతులసీ.యూజీసీ.జీఓవీ.ఐఎన్’కు మెయిల్ చేయాలని సూచించింది. వర్సిటీలలో సబ్జెక్టుల వారీగా సమీక్షలు యూజీసీ ప్రకటించిన ‘లెర్నింగ్ అవుట్ కమ్ బేస్డ్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్’ను అనుసరించి రాష్ట్రంలోని ఆయా సబ్జెక్టుల పాఠ్యాంశాలపై సమీక్ష జరిగేలా చర్యలు చేపడుతున్నాం. మన రాష్ట్రంలో ఇప్పటికే డిగ్రీ కోర్సుల్లో పలు సంస్కరణల దిశగా ఉన్నత విద్యామండలి ద్వారా ముందుకు వెళ్తున్నాం. వీటిపై నిపుణుల కమిటీని నియమించాం. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) విధానాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నాం. విద్యార్థులు తమకు నచి్చన కోర్సులు చేస్తూనే.. మరికొన్ని కోర్సులను ఇతర విద్యాసంస్థల ద్వారా అభ్యసించేలా కొత్త విధానాలకు శ్రీకారం చుట్టనున్నాం. – ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యామండలి -
వర్సిటీల్లో కులవివక్ష నిర్మూలించండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని వర్సిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో కులవివక్ష ఆరోపణలపై స్పందించాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కుల వివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్న రోహిత్ వేముల, పాయల్ తాడ్విల మాతృమూర్తులు రాధిక, అబేదా దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు శుక్రవారం జస్టిస్ ఎన్.వి.రమణ, అజయ్ రస్తోగిలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. కుల వివక్ష నివారణకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను వర్సిటీలు అమలు చేయడం లేదని ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున న్యాయవాది ఇందిరా జైసింగ్ పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు, జీవించే హక్కు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 2004 నుంచి దాదాపు 20 మంది విద్యార్థుల ఆత్మహత్యలు ఈ కోవలోనివే అని న్యాయవాది వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల (2016), ముంబైకి చెందిన వైద్య విద్యార్థిని పాయల్ తాడ్వి(2019, మే) ఆత్మహత్యలకు కులవివక్షే కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయోధ్యపై వాదనలకు మరో గంట బాబ్రీ మసీదు భూవివాద కేసుకు సంబంధించి ఈనెల 23న వాదనలు వినడానికి అదనంగా గంట సమయం కేటాయిస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. కాగా, కేసుల భారాన్ని తగ్గించడానికి సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఇకపై అప్పీళ్లు, బెయిళ్లు, యాంటిసిపేటరీ బెయిళ్లకు సంబంధించిన 7ఏళ్ల వరకు జైలు శిక్ష విధించగలిగే కేసులను ఒకే న్యాయమూర్తి విచారించేలా నిబంధనలను సవరించింది. -
డిగ్రీ సిలబస్లో మార్పులకు శ్రీకారం
సాక్షి, అమరావతి: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) మార్గదర్శకాల మేరకు డిగ్రీ కోర్సుల్లో అమలవుతున్న చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్(సీబీసీఎస్) పటిష్టత, ప్రమాణాలు మెరుగుపడే రీతిలో సిలబస్లో మార్పులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రెండు రోజులుగా సమావేశమై చర్చలు సాగించింది. ఆయా వర్సిటీల డీన్ల అభిప్రాయాలను తెలుసుకుంది. కాలేజీల లెక్చరర్లు, విద్యార్థులు, ఇతర విద్యారంగ నిపుణులతోనూ చర్చించి సిలబస్లో మార్పులు చేయడంతోపాటు ప్రస్తుత సీబీసీఎస్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయడానికి సూచనలు చేయనుంది. కమిటీ తొలి భేటీ ఇలా..: డిగ్రీ కోర్సుల్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ విధానాన్ని యూజీసీ 2015–16 నుంచి అమల్లోకి తెచ్చింది. దీనిపై మార్గదర్శకాలు విడుదల చేసి ఐదేళ్లపాటు అమలయ్యేలా గడువు నిర్దేశించింది. ఈ గడువు 2020 మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీబీసీఎస్ విధానాన్ని సమగ్రంగా సమీక్షించి వాటిలోని లోటుపాట్లను సవరించి మరింతగా పటిష్టం చేసేందుకు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (నెల్లూరు) మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ జి.రాజారామిరెడ్డి చైర్మన్గా ఏడుగురు ఉన్నత విద్యారంగ నిపుణులతో ఉన్నత విద్యామండలి కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ తొలి భేటీ మంగళ, బుధవారాల్లో విజయవాడలోని మండలి కార్యాలయంలో జరిగింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, కమిటీ చైర్మన్ జి.రాజారామిరెడ్డి, ప్రొఫెసర్ ఎన్.కిషోర్బాబు(ఆంధ్రావర్సిటీ), ప్రొఫెసర్ కె.త్యాగరాజు(ఎస్వీ వర్సిటీ), డాక్టర్ జి.శ్రీరంగం మాథ్యూ(ఆంధ్రాలయోలా కాలేజీ, విజయవాడ), డాక్టర్ బీ.ఆర్.ప్రసాదరెడ్డి (అసోసియేట్ ప్రొఫెసర్, ధర్మవరం), మెంబర్ కన్వీనర్లు డాక్టర్ కె.వి.రమణారావు(రిటైర్డ్ ప్రిన్సిపాల్), బి.ఎస్.సెలీనా(లెక్చరర్, అకడమిక్ సెల్, ఏపీఎస్సీహెచ్ఈ) పాల్గొన్నారు. అమలు తీరుపై డీన్లతో చర్చ..: ఆయా వర్సిటీలలోని అకడమిక్ అఫైర్స్ డీన్లతో కమిటీ చర్చించింది. ఐదేళ్లక్రితం సీబీసీఎస్ విధానం ఎలా ప్రారంభించారు? ఇప్పుడెలా అమలవుతోంది? అన్న అంశాల్ని తెలుసుకుంది. ప్రస్తుత సీబీసీఎస్ విధానంలో మార్పులుచేర్పులు అవసరమా? అడ్వాన్సు చేయాలా? కొత్తగా వస్తున్న పరిణామాలకు అనుగుణంగా ఏయే నూతన అంశాల్ని సిలబస్లో చేర్చాల్సి ఉంటుందో నివేదించారు. కాగా, బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల సిలబస్లో మార్పులు, చేర్పులు చేసేందుకు సబ్జెక్టు కమిటీల్ని ఏర్పాటు చేయనున్నారు. -
హెచ్సీయూకు ఎమినెన్స్ హోదా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతోపాటు ఐదు ప్రభుత్వ విద్యా సంస్థలకు ఎమినెన్స్(ఐవోఈ) హోదా కల్పిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ హోదా దక్కిన మిగతా విద్యా సంస్థల్లో మద్రాస్ ఐఐటీ, ఖరగ్పూర్ ఐఐటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ వర్సిటీలున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గత నెలలో చేసిన ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. దీంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చే ఐదేళ్లలో కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్లు నిధులు అందనున్నాయి. వీటితోపాటు ప్రైవేట్ రంగంలోని తమిళనాడుకు చెందిన అమృత విద్యాపీఠమ్, వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఒడిశాలోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ, ఢిల్లీకి చెందిన జామియా హమ్దర్ద్ యూనివర్సిటీ, మొహాలీలోని సత్య భారతి ఫౌండేషన్ భారతి ఇన్స్టిట్యూట్లకు కూడా ఎమినెన్స్ హోదా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆయా సంస్థల అంగీకారం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఇంకా..నోయిడాలోని శివ్నాడార్ వర్సిటీ, సోనెపట్లోని ఓపీ జిందాల్ యూనివర్సిటీలకు ఎమినెన్స్ హోదా ఇవ్వాలని ఎంపిక కమిటీ సిఫారసు చేసిందన్నారు. జాదవ్పూర్ యూనివర్సిటీ, అన్నా వర్సిటీల ఎమినెన్స్ హోదాకు సంబంధించి తమ వంతు నిధులు కేటాయించేందుకు బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలు అంగీకారం తెలపాల్సి ఉందన్నారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, అశోకా యూనివర్సిటీ, అజీంప్రేమ్జీ యూనివర్సిటీ, తేజ్పూర్ యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, గాంధీనగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రమాణాలు అందుకోవడంలో విఫలమైన వాటిలో ఉన్నాయి. ఎమినెన్స్ హోదా ప్రకటించాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతోపాటు తమ వంతుగా కనీసం 50 శాతం నిధులను సమకూర్చాల్సి ఉంటుందని మంత్రి నిశాంక్ తెలిపారు. దేశంలో పలు విద్యా సంస్థలను ప్రపంచ స్థాయి బోధన, పరిశోధన సామర్ధ్యం కలిగినవిగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు 2016లో కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా 10 ప్రభుత్వ, 10 ప్రైవేటు విద్యార్థులను తీర్చిదిద్దుతామని ప్రకటించింది. ‘ఇప్పటివరకు 16 సంస్థలకు ఎమినెన్స్ హోదా ఇచ్చాం. మరో నాలుగు సంస్థలకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి కోసం ఎదురుచూస్తున్నాం’అని నిశాంక్ తెలిపారు. ఎమినెన్స్ హోదా కల్పించిన ప్రభుత్వ విద్యాసంస్థలైతే ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల వరకు సాయం అందజేస్తుంది. అదే ప్రైవేట్ సంస్థలకైతే ప్రభుత్వ నిధులు అందవు కానీ, మరింత స్వతంత్ర ప్రతిపత్తితోపాటు ప్రత్యేక కేటగిరీ డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభిస్తుంది. -
తస్మాత్ జాగ్రత్త.. ఫేక్ యూనివర్సిటీలివే..!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో 23 ఫేక్ యూనివర్సిటీలు కొనసాగుతున్నాయని ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వెల్లడించింది. ఆ జాబితాను మంగళవారం విడుదల చేసింది. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఇలాంటి విద్యాసంస్థల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. డిగ్రీ కాలేజీలుగా గుర్తింపు పొందిన ఆయా సంస్థలు అక్రమంగా విశ్వవిద్యాలయాలుగా చలామణి అవుతున్నాయని వివరించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 8, ఢిల్లీలో 7 నకిలీ విశ్వవిద్యాలయాలున్నట్టు తెలిపింది. రాష్ట్రాల వారీగా ఫేక్ యూనివర్సిటీల జాబితా.. ఢిల్లీ: 1. కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దర్యాగంజ్ 2. ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం 3. ఒకేషనల్ యూనివర్శిటీ 4. ఏడీఆర్-సెంట్రిక్ జురిడికల్ విశ్వవిద్యాలయం, ఏడీఆర్ హౌస్, 8 జె, గోపాల్ టవర్, 25 రాజేంద్ర ప్లేస్, న్యూఢిల్లీ -110008. 5. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, న్యూఢిల్లీ 6.విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్. ఇండియా రోజ్గార్ సేవాసదన్, 672, సంజయ్ ఎన్క్లేవ్ ఎదురుగా. జీటీకే డిపో, న్యూ న్యూఢిల్లీ -110033. 7. ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ (స్పిరిచ్చువల్ యూనివర్సిటీ), 351-352, ఫేజ్-1, బ్లాక్-ఎ, విజయ్ విహార్, రిథాలా, రోహిణి, న్యూఢిల్లీ -110085. కర్ణాటక : 8. బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, గోకాక్, బెల్గాం (కర్ణాటక) కేరళ 9. సెయింట్ జాన్స్ విశ్వవిద్యాలయం, కిషానట్టం మహారాష్ట్ర : 10. రాజా అరబిక్ విశ్వవిద్యాలయం, నాగ్పూర్. పశ్చిమ బెంగాల్ : 11. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, 80, చౌరింఘీ రోడ్, కోల్కతా -20. 12. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, 8-ఎ, డైమండ్ హార్బర్ రోడ్, బిల్టెక్ ఇన్ 2 వ అంతస్తు, కుర్పుకుర్, కోల్కతా -700063. ఉత్తర్ప్రదేశ్ : 13. వారణాసియా సంస్కృత విశ్వవిద్యాలయ, వారణాసి(యూపీ)/జగత్పురి, ఢిల్లీ. 14. మహిళాగ్రామ్ విద్యాపీఠ్/విశ్వవిద్యాలయ,(మహిళా) యూనివర్సిటీ, ప్రయాగ్రాజ్ 15. గాంధీ హిందీ విద్యాపీఠ్, ప్రయాగ్రాజ్, ఉత్తర్ప్రదేశ్. 16. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, కాన్పూర్, ఉత్తర్ప్రదేశ్. 17. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విశ్వవిద్యాలయం (ఓపెన్ విశ్వవిద్యాలయం), అచల్తాల్, అలీఘర్ 18. ఉత్తర్ప్రదేశ్ విశ్వవిద్యాలయ, కోషి కలాన్, మధుర 19. మహారాణా ప్రతాప్ శిక్షా నికేతన్ విశ్వవిద్యాలయ, ప్రతాప్ఘర్ 20. ఇంద్రప్రస్థ శిక్షా పరిషత్, ఇన్స్టిట్యూషనల్ ఏరియా, కోహోడా, మకాన్పూర్, నోయిడా ఫేజ్ -2. ఒడిశా : 21. నవభారత్ శిక్షా పరిషత్, అనుపూమా భవన్, ప్లాట్ నెంబర్ 242, పానీ టాంకి రోడ్, శక్తినగర్, రూర్కెలా -769014. 22. నార్త్ ఒరిస్సా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ, యూనివర్సిటీ రోడ్ బారిపాడ, మయూరభంజ్ జిల్లా, ఒడిశా -757003. పుదుచ్చేరి.. 23. శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, నెం. 186, తిలాస్పేట్, వజుతావూర్ రోడ్, పుదుచ్చేరి -605009. -
వివక్షకు కేరాఫ్ ‘మాన్సాస్’
రాజరికాలు పోయినా... వారి సంస్థలో మాత్రం ఆ పోకడలు కొనసాగుతున్నాయి. అక్కడ వారి మాటే వేదం... వారు చెప్పిందే శాసనం. కాదని ఎవరైనా ఎదురు తిరిగితే వారి బతుకు బస్టాండే. ఏళ్ల తరబడి ఉద్యోగాలు చేస్తున్నా... దయనీయమైన వేతనాలే అందుతున్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే... వారి విభాగానికి ఎసరు పెడుతున్నారు. ఉన్న ఉద్యోగం కాస్తా తీసేసి నడిరోడ్డుకు నెట్టేస్తున్నారు. దళితులకు ఎక్కడ కీలకపదవులు ఇవ్వాల్సి వస్తుందోనని వారి ఆధ్వర్యంలోని కోర్సును రద్దు చేసేస్తున్నారు. ప్రజల దృష్టిలో సేవ చేస్తున్నామని చెప్పుకోవడానికి... ప్రభుత్వానికి తమ ఆస్తులు అందనీయకుండా చేయడానికి... జయనగరం రాజులు నడుపుతున్న మాన్సాస్లో ఈ విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. సాక్షి , విజయనగరం : విజయనగరంలోని మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న అనేక విద్యాసంస్థల్లో మహారాజా పోస్టు గ్యాడ్యుయేట్ కళాశాల ఒకటి. దానిలో 14 విభాగాలు ఉన్నాయి. అందులో బోధన, బోధనేతర సిబ్బంది మొత్తం 50 మంది వరకు ఉన్నారు. మహారాజా పోస్టు గ్రాడ్యూయేట్ కళాశాల పేరుతో 1996 జూన్ 30న ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి మాన్సాస్ ట్రస్ట్ శాశ్వత అనుబంధ పత్రం పొందింది. దీని ప్రకారం యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం బోధన సిబ్బందికి వేతనాలు అమలు చేయాలి. అధ్యాపకేతర సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం జీతభత్యాలు చెల్లించాలి. కానీ వాటిని ఏమాత్రం పాటించకుండా 20 ఏళ్లుగా అన్యాయం చేస్తోంది. ఎన్ని సార్లు రాతపూర్వకంగా వినతులు సమర్పించినా... మాన్సాస్ ట్రస్ట్ పట్టించుకోవడం లేదు. అధ్యాపక అర్హతతో విధులు నిర్వర్తిస్తున్న వారికి యూజీసీ నిబంధనల ప్రకారం రూ.లక్ష నుంచి రూ.లక్షా యాభైవేల వరకు వేతనాలు ఇవ్వాల్సి ఉన్నా... 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న సీనియర్ అధ్యాపకునికి ప్రస్తుతం కేవలం రూ.25 వేల వేతనం మాత్రమే ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వేతన నిబంధనల మేరకు బోధనేతర సిబ్బందికి రూ.18 వేల వేతనాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.5 నుంచి 10 వేల లోపు మాత్రమే ఇస్తున్నారు. పదవీ విరమణ ఉద్యోగులకు భోగాలు ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నవారికి పదోన్నతులు కల్పించాల్సి వస్తుందని... అప్పటికే తమకు నమ్మకంగా ఉండి పదవీ విరమణ చేసినవారిని ఉన్నత పదవుల్లో నిలబెట్టి రూ.85 వేల నుంచి రూ.లక్ష వరకు గౌరవ వేతనాలు ముట్టజెబుతోంది. ఓ వైపు ప్రభుత్వ పింఛన్ పొందుతున్న వారికి మరోవైపు సంస్థ భారీ వేతనాలు ఇవ్వడంపై అనేక అరోపణలు వస్తున్నా సంస్థ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కానీ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల ప్రకారం జీతాలు చెల్లించమని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్న అధ్యాపకులపై కఠినంగా వ్యవహరిస్తోంది. నచ్చితే పనిచేయండి లేకపోతే మానేయండని హెచ్చరికలిస్తూ పరోక్షంగా భయపెడుతోంది. మొండిగా పోరాడే అధ్యాపకులను ఏమీ చేయలేక వారిని వదిలించుకోవడానికి సంబంధిత విభాగాన్ని రద్దు చేసి తమ వైఖరిని చాటుకుంటోంది. సీనియారిటీ ఉన్నా.. దళితులకు దక్కని పదవులు మరోవైపు సీనియార్టీ ప్రకారం ఉన్నత పదవులు దక్కాల్సిన దళిత అధ్యాపకులకు అన్యాయం జరుగుతోంది. విద్యార్థుల డిమాండ్ ఉన్నప్పటికీ ఆ విభాగాన్ని రద్దు చేసి పదవులకు అర్హత లేకుండా చేస్తోంది. ఉదాహరణకు కళాశాల స్థాపించినప్పటి నుంచి ఉన్న హిస్టరీ విభాగంలో డాక్టర్ అంబేడ్కర్ అశోక్ అనే అధ్యాపకుడు పనిచేస్తున్నారు. పలు విద్యాధిక అర్హతలతో ఉన్న ఆయన సీనియార్టీకి కళాశాల డైరెక్టర్ పదవి ఇవ్వాలి. ఆయన తన సీనియార్టీని గుర్తించి యూజీసీ వేతనం ఇవ్వాలని పలుమార్లు సంస్థను కోరారు. కానీ దళితుడైన ఆయనకు డైరెక్టర్ పదవి ఇవ్వడానికి ఇష్టం లేక చివరికి ఆయన పనిచేస్తున్న హిస్టరీ విభాగాన్ని గత ఏడాది రద్దు చేశారు. సోషల్ వర్క్ విభాగం కూడా అదేమాదిరిగా రద్దు చేశారు. నిజానికి ప్రతి ఏడాది విద్యార్థుల డిమాండ్ అధికంగా ఉన్న కోర్సుల్లో ఈ రెండూ నిలుస్తున్నా... కేవలం దళితులకు ఉన్నత పదవులు ఇవ్వడానికి ఇష్టం లేకే రద్దు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. దళితునికి డైరెక్టర్ ఇవ్వాల్సి వస్తుందనే... కళాశాలలో 20 ఏళ్ల సీనియార్టీతో హిస్టరీ విభాగంలో అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు రూ.25 వేలు వేతనం దాటడం లేదు. యూజీసీ వేతనాలు అమలు చేస్తే రూ.1.5 లక్షల నెలవారీ వేతనం వస్తుంది. కొన్నేళ్లుగా వేతనాలు ఇవ్వకుండా మాన్సాస్ సంస్థ దోచుకుంటోంది. సీనియార్టీ ప్రకారం నాకు డైరెక్టర్ పదవి రావాల్సి ఉంది. దళితుడినైన నాకు ఆ పదవి ఇవ్వడానికి ఇష్టం లేక హిస్టరీ విభాగాన్ని గత ఏడాది రద్దు చేశారు. – డాక్టర్ ఎస్.అంబేడ్కర్ అశోక్, కార్యదర్శి, మాన్సాస్ పీజీకాలేజీ టీచింగ్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్. -
అర్హతలున్నా అలక్ష్యం!
పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా 30 శాతం సిలబస్ను మార్చుకుని కోర్సులు నిర్వహించుకునేలా అర్హతలున్న కాలేజీలకు అటానమస్ హోదా ఇవ్వడంలో యూనివర్సిటీలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. అర్హతలున్న కాలేజీలు అటానమస్ హోదా తీసుకునేలా ప్రోత్సహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పదేపదే చెబుతున్నా వర్సిటీలు పట్టించుకోవట్లేదు. తమిళనాడు మినహా మిగతా రాష్ట్రాలు అటానమస్ హోదా ఇచ్చే విషయంలో ఘోరంగా విఫలమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ అర్హత కలిగిన కాలేజీలు అనేకం ఉన్నా అటానమస్ హోదా కోసం ప్రయత్నిస్తున్న కాలేజీలు పెద్దగా లేవు. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల పరిధిలో దాదాపు 3 వేల ఉన్నత విద్యాసంస్థలు ఉంటే కేవలం 59 కాలేజీలకే అటానమస్ హోదా ఉండటం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. – సాక్షి, హైదరాబాద్ పెత్తనం పోతుందనే... విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు అనేక చర్యలు చేపడుతున్న కేంద్రం... న్యాక్ గుర్తింపు ఉంటేనే రూసా నిధులను ఇస్తామన్న నిబంధనను విధించింది. అంతేకాదు న్యాక్ గుర్తింపు ఇచ్చే నిబంధనలను మార్చింది. విద్యార్థుల అభిప్రాయాలను, ఆ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్లను కూడా పరిగణనలోకి తీసుకున్నాకే న్యాక్ గుర్తింపు ఇచ్చేలా నిబంధనలను సవరించింది. మరోవైపు న్యాక్ గుర్తింపు ఉన్న కాలేజీలన్నీ అటానమస్ కోసం చర్యలు చేపట్టేలా అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది. కానీ రాష్ట్రాల్లోని యూనివర్సిటీల అధికారులు తమ పరిధిలోని కాలేజీలపై పెత్తనం పోతుందని, తమకు వచ్చే ముడుపులకు గండి పడుతుందన్న ఆలోచనలతో ప్రమాణాలుగల కాలేజీలు అటానమస్ హోదా కోసం దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు కొన్ని కా>లేజీలు దరఖాస్తు చేసుకున్నా ఎన్వోసీ ఇవ్వకుండా యూజీసీకి ఆ దరఖాస్తులను పంపట్లేదన్న విమర్శలు ఉన్నాయి. అటానమస్తో ఎన్నెన్నో ప్రయోజనాలు.. .అటానమస్ హోదా వల్ల కాలేజీలకే అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. కాలేజీలు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా 30% సిలబస్ను మార్పు చేసుకోవచ్చు. తద్వారా విద్యార్థులు ఎక్కువగా తమ కాలేజీ ల్లో చేరేలా ఆకర్షించవచ్చు. సొంత పరీక్షల విధానం అమలు చేసుకోవచ్చు. పారిశ్రామిక అవసరాలకు తగిన ట్లు సిలబస్ రూపొందించుకుని అమలు చేస్తారు కనుక పరిశ్రమలు కూడా అటానమస్ కాలేజీల నుంచే ఎక్కు వ మంది విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా పొందేందుకు అటానమస్ హోదా తప్పనిసరి. అటానమస్ హోదాకు దరఖాస్తు చేసే కాలేజీల్లోని కోర్సులకు ఎన్బీఏ 675 పాయింట్లకంటే ఎక్కువ స్కోర్ ఉండాలని లేదా కనీసం న్యాక్ ఏ గ్రేడ్ కలిగి ఉండాలి. రాష్ట్రంలో పరిస్థితి ఇలా.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల పరిధిలోని 3 వేల వరకు కాలేజీలు ఉంటే వాటిలో కేవలం 59 కాలేజీలకే అటానమస్ హోదా ఉంది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ, కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీల పరిధిలోని 42 ఇంజనీరింగ్ కాలేజీలకు అటానమస్ హోదా ఉండగా మిగతావి డిగ్రీ, పీజీ, బీఎడ్ కాలేజీలు. 658 కాలేజీలకే అటానమస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 900 వరకు యూనివర్సిటీలు, 40 వేల వరకు ఉన్నతవిద్య కాలేజీలు ఉన్నాయి. యూజీసీ ఇటీవల జారీ చేసిన లెక్కల ప్రకారం 25 రాష్ట్రాల్లోని 106 వర్సిటీల పరిధిలోని 658 కాలేజీలకే అటానమస్ హోదా ఉంది. ఈ పరిస్థితుల్లో కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచడం తోపాటు అటానమస్ హోదా తీసుకునేలా కాలేజీలను ప్రోత్సహించాలని కేంద్రం తెలి పింది. దీనిలో భాగంగా అటానమస్కు దరఖాస్తు చేసేలా కాలేజీలను ప్రోత్సహించేం దుకు ఫిబ్రవరి 4న యూజీసీ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో దేశవ్యాప్త సదస్సు నిర్వహించనుంది. మార్పులు తెచ్చుకోవాలి.. యూనివర్సిటీలు తమ విధానాల్లో మార్పులు తెచ్చుకోవాలి. కాలేజీలపై పెత్తనం కోసం పాకులాడవద్దు. అర్హత కలిగిన కాలేజీలు అటానమస్ హోదా కోసం దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలి. అప్పుడే నాణ్యత ప్రమాణాలు పెరుగుతాయి. – తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
అర్హతలున్నా అలక్ష్యం!
పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా 30 శాతం సిలబస్ను మార్చుకుని కోర్సులు నిర్వహించుకునేలా అర్హతలున్న కాలేజీలకు అటానమస్ హోదా ఇవ్వడంలో యూనివర్సిటీలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. అర్హతలున్న కాలేజీలు అటానమస్ హోదా తీసుకునేలా ప్రోత్సహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పదేపదే చెబుతున్నా వర్సిటీలు పట్టించుకోవట్లేదు. తమిళనాడు మినహా మిగతా రాష్ట్రాలు అటానమస్ హోదా ఇచ్చే విషయంలో ఘోరంగా విఫలమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ అర్హత కలిగిన కాలేజీలు అనేకం ఉన్నా అటానమస్ హోదా కోసం ప్రయత్నిస్తున్న కాలేజీలు పెద్దగా లేవు. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల పరిధిలో దాదాపు 3 వేల ఉన్నత విద్యాసంస్థలు ఉంటే కేవలం 59 కాలేజీలకే అటానమస్ హోదా ఉండటం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. – సాక్షి, హైదరాబాద్ పెత్తనం పోతుందనే... విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు అనేక చర్యలు చేపడుతున్న కేంద్రం... న్యాక్ గుర్తింపు ఉంటేనే రూసా నిధులను ఇస్తామన్న నిబంధనను విధించింది. అంతేకాదు న్యాక్ గుర్తింపు ఇచ్చే నిబంధనలను మార్చింది. విద్యార్థుల అభిప్రాయాలను, ఆ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్లను కూడా పరిగణనలోకి తీసుకున్నాకే న్యాక్ గుర్తింపు ఇచ్చేలా నిబంధనలను సవరించింది. మరోవైపు న్యాక్ గుర్తింపు ఉన్న కాలేజీలన్నీ అటానమస్ కోసం చర్యలు చేపట్టేలా అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది. కానీ రాష్ట్రాల్లోని యూనివర్సిటీల అధికారులు తమ పరిధిలోని కాలేజీలపై పెత్తనం పోతుందని, తమకు వచ్చే ముడుపులకు గండి పడుతుందన్న ఆలోచనలతో ప్రమాణాలుగల కాలేజీలు అటానమస్ హోదా కోసం దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు కొన్ని కా>లేజీలు దరఖాస్తు చేసుకున్నా ఎన్వోసీ ఇవ్వకుండా యూజీసీకి ఆ దరఖాస్తులను పంపట్లేదన్న విమర్శలు ఉన్నాయి. అటానమస్తో ఎన్నెన్నో ప్రయోజనాలు.. .అటానమస్ హోదా వల్ల కాలేజీలకే అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. కాలేజీలు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా 30% సిలబస్ను మార్పు చేసుకోవచ్చు. తద్వారా విద్యార్థులు ఎక్కువగా తమ కాలేజీ ల్లో చేరేలా ఆకర్షించవచ్చు. సొంత పరీక్షల విధానం అమలు చేసుకోవచ్చు. పారిశ్రామిక అవసరాలకు తగిన ట్లు సిలబస్ రూపొందించుకుని అమలు చేస్తారు కనుక పరిశ్రమలు కూడా అటానమస్ కాలేజీల నుంచే ఎక్కు వ మంది విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా పొందేందుకు అటానమస్ హోదా తప్పనిసరి. అటానమస్ హోదాకు దరఖాస్తు చేసే కాలేజీల్లోని కోర్సులకు ఎన్బీఏ 675 పాయింట్లకంటే ఎక్కువ స్కోర్ ఉండాలని లేదా కనీసం న్యాక్ ఏ గ్రేడ్ కలిగి ఉండాలి. రాష్ట్రంలో పరిస్థితి ఇలా.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల పరిధిలోని 3 వేల వరకు కాలేజీలు ఉంటే వాటిలో కేవలం 59 కాలేజీలకే అటానమస్ హోదా ఉంది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ, కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీల పరిధిలోని 42 ఇంజనీరింగ్ కాలేజీలకు అటానమస్ హోదా ఉండగా మిగతావి డిగ్రీ, పీజీ, బీఎడ్ కాలేజీలు. 658 కాలేజీలకే అటానమస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 900 వరకు యూనివర్సిటీలు, 40 వేల వరకు ఉన్నతవిద్య కాలేజీలు ఉన్నాయి. యూజీసీ ఇటీవల జారీ చేసిన లెక్కల ప్రకారం 25 రాష్ట్రాల్లోని 106 వర్సిటీల పరిధిలోని 658 కాలేజీలకే అటానమస్ హోదా ఉంది. ఈ పరిస్థితుల్లో కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచడం తోపాటు అటానమస్ హోదా తీసుకునేలా కాలేజీలను ప్రోత్సహించాలని కేంద్రం తెలి పింది. దీనిలో భాగంగా అటానమస్కు దరఖాస్తు చేసేలా కాలేజీలను ప్రోత్సహించేం దుకు ఫిబ్రవరి 4న యూజీసీ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో దేశవ్యాప్త సదస్సు నిర్వహించనుంది. మార్పులు తెచ్చుకోవాలి.. యూనివర్సిటీలు తమ విధానాల్లో మార్పులు తెచ్చుకోవాలి. కాలేజీలపై పెత్తనం కోసం పాకులాడవద్దు. అర్హత కలిగిన కాలేజీలు అటానమస్ హోదా కోసం దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలి. అప్పుడే నాణ్యత ప్రమాణాలు పెరుగుతాయి. – తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
విదేశీ పీహెచ్డీలకూ అసిస్టెంట్ ప్రొఫెసర్
న్యూఢిల్లీ: టాప్–500 విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ పూర్తిచేసిన వారు కూడా భారత వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ప్రత్యక్ష నియామకానికి అర్హులేనని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వెల్లడించింది. ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. క్వాకరెలి సైమండ్స్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ర్యాంకింగ్స్, షాంఘై జియావో టోంగ్ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్న వర్సిటీల్లో విద్యనభ్యసించిన అభ్యర్థులనే పరిగణనలోకి తీసుకుంటారు. ఆర్ట్స్, కామర్స్, హ్యుమానిటీస్, లా, సోషల్ సైన్సెస్, లాంగ్వెజేస్, లైబ్రరీ సైన్స్, జర్నలిజం–మాస్ కమ్యూనికేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర కోర్సుల్లో నియామకాలకు తాజా నిబంధనలు వర్తిస్తాయని యూజీసీ తెలిపింది. ప్రస్తుతం, అసిస్టెంట్ ప్రొఫెసర్కు అర్హత సాధించాలంటే అభ్యర్థులు భారతీయ విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత కోర్సులో 55 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసి ఉండాలి. నెట్, సెట్, స్లెట్ లాంటి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అర్హత సాధించడం ద్వారా రాత పరీక్ష నుంచి మినహాయింపు పొందినా, ఇంటర్వ్యూలో చూపే ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరుగుతాయని యూజీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఒరిజినల్స్, ఫీజు తిరిగి ఇచ్చేయాల్సిందే
న్యూఢిల్లీ: నెలలోపు అడ్మిషన్లు ఉపసంహరించుకున్న విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఫీజును తిరిగి ఇవ్వకపోవడం పట్ల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) అన్ని వర్సిటీలు, కళాశాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము జారీచేసిన మార్గదర్శకాలను పాటించకపోతే కళాశాలలు, వర్సిటీలు.. అఫిలియేషన్, డీమ్డ్ హోదాతో పాటు యూజీసీ సాయం కోల్పోతా యని హెచ్చరించింది. ప్రవేశాల సమయంలో విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లు సమర్పించాల్సిన అవసరంలేదని మానవ వనరుల మంత్రి జవడేకర్ చెప్పారు. ఏ విద్యా సంస్థ కూడా విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లను తమ వద్దే అట్టిపెట్టుకోకూడదన్నారు. స్వీయ ధ్రువీ కరణ నకలు పత్రాలు ఇస్తే సరిపోతుందని తెలిపారు. అడ్మిషన్ల గడువు ముగియడానికి 15 రోజుల ముందు విద్యార్థి ప్రవేశాన్ని ఉపసంహరించుకుంటే మొత్తం ఫీజు తిరిగి చెల్లించాలి. -
యూజీసీ ఉండాల్సిందే
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ను (యూజీసీ) కొనసాగిస్తూనే దాని బలోపేతానికి చర్యలు చేపట్టాలని నిపుణులు, వైస్చాన్స్లర్లు అభిప్రాయపడ్డారు. యూజీసీని రద్దు చేసి ఆ స్థానంలో ప్రతిపాదిత హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెకీ) ఏర్పాటును వ్యతిరేకించారు. యూజీసీ స్థానంలో హెకీ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టిన కేంద్రం దీనిపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. ఇందులో భాగంగా సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో హెకీపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి తల్లిదండ్రులు, విద్యావేత్తలు, పారిశ్రామికవర్గాలు, వీసీలు, రిటైర్డ్ వీసీలతో సమావేశం నిర్వహించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, కె.కేశవరావు, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ పాల్గొన్నారు. ఈ భేటీ లో హెకీ ముసాయిదా బిల్లులోని పలు అంశాలపై చర్చించారు. ఆయా అంశాలతో నివేదికను రూపొం దించి ఈ నెల 20లోగా కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. ప్రస్తుతం హెకీ అవసరమే లేదని, అయి నా కేంద్రం హెకీని అమల్లోకి తేవాలనుకుంటే పలు సవరణలు చేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. సంస్కరణలు సామాన్యులకు విద్య అందించేలా ఉండాలి: కడియం కేంద్రం తీసుకొచ్చే సంస్కరణలు సామాన్యులకు నాణ్యమైన విద్యనందించేలా, పేదల జీవన ప్రమాణాలు పెంచేలా ఉండాలని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రతిపాదిత హెకీ విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉందన్నారు. వర్సిటీలకు నిధుల పెంపుతోపాటు, నేరుగా వర్సిటీలకు అవి వచ్చేలా, ఇన్సెంటివ్లు ఇచ్చేలా సవరణలు చేయాలన్నారు. డ్రాఫ్ట్ బిల్లుపై అభిప్రాయాలు చెప్పేందుకు మూడు వారాలే ఇవ్వడం సరికాదని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ కమిషన్ ఏర్పాటు వల్ల ఫీజులు పెరుగుతాయని, గ్రాంట్స్ తగ్గుతాయన్నారు. ఈ బిల్లును వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎంపీ కేకే మాట్లాడుతూ ఈ ముసాయిదా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాల్సి వస్తుందేమోనన్నారు. -
ఇక ఆన్లైన్ ఎడ్యుకేషన్
డ్రాఫ్టు రెగ్యులేషన్స్ రూపొందించిన యూజీసీ సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా విద్యా సంస్థల్లో ఇక ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ను రూపొందించింది. వాటిపై వచ్చే నెల 18 వరకు ఈ మెయిల్ ugc.online2017@gmail.com ద్వారా అభిప్రాయాలు తెలియజేయాలని పేర్కొంది. ఈ రెగ్యులేషన్స్ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (ఆన్లైన్ ఎడ్యుకేషన్) రెగ్యులేషన్స్– 2017గా పిలుస్తామని తెలిపింది. గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యాక ఈ రెగ్యులేషన్స్ అమల్లోకి వస్తాయని పేర్కొంది. రెగ్యులేషన్స్లోని ప్రధాన అంశాలు.. ► ఐదేళ్లుగా పనిచేస్తున్న చేస్తున్న యూనివర్సిటీ ఆన్లైన్ కోర్సులు నిర్వహించవచ్చు. ► 3.25 నుంచి 4 పాయింట్లతో న్యాక్ అక్రెడిటేషన్ కలిగిన ఉన్నత విద్యా సంస్థలు నిర్వహించవచ్చు. ► ఆయా విద్యా సంస్థలు రెగ్యులర్గా నిర్వహిస్తున్న కోర్సులను మాత్రమే ఆన్లైన్ ద్వారా నిర్వహించవచ్చు. ► విద్యా సంస్థలు ప్రోగ్రాం ప్రాజెక్టు రిపోర్టు (పీపీపీ) సిద్ధం చేసి తమ అకడమిక్ కౌన్సెళ్లలో ఆమోదం తీసుకున్నాకే ఆన్లైన్ ఎడ్యుకేషన్ నిర్వహణకు దరఖాస్తు చేసుకోవాలి. ► ప్రోగ్రాం నిర్వహణకు ఒక డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్/డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ డైరెక్టర్/అసిస్టెంట్ రిజిస్ట్రార్, ప్రోగ్రాం కోఆర్డినేటర్, కోర్సు కోఆర్డినేటర్, ఒక టీచింగ్ అసిస్టెంట్ ఉండాలి. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలను యూజీసీ వెబ్సైట్లో పొందవచ్చు. -
రద్దు కానున్న యూజీసీ, ఏఐసీటీఈ!
న్యూఢిల్లీ: విద్యా రంగంలో నియంత్రణ సంస్థలైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ), ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ)లు త్వరలో రద్దు కానున్నాయి. వీటి స్థానంలో ఉన్నత విద్యకు సంబంధించి ఏకైక నియంత్రణ సంస్థను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ రెగ్యులేషన్ ఏజెన్సీ(హెచ్ఈఈఆర్ఏ–హీరా) పేరిట నూతన వ్యవస్థను ప్రతిపాదించింది. వేర్వేరు నియంత్రణ సంస్థల అధికార పరిధిపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడంతో పాటు, అనవసర నియంత్రణ నిబంధనలను తగ్గించడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. సాంకేతిక, సాంకేతికేతర విద్యా సంస్థలను ఒకే గొడుగు కిందికి తీసుకురావడానికి మానవ వనరుల శాఖ, నీతి ఆయోగ్తో కలిసి పనిచేస్తోంది. ప్రతిపాదిత నియంత్రణ సంస్థ, దాని బిల్లుకు సంబంధించిన నమూనాపై కసరత్తు జరుగుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ కష్టమే!
యూజీసీ నిబంధనల ప్రకారం అది కుదరదు: కడియం ఏం చేయాలన్నది తరువాత నిర్ణయిస్తాం అన్ని వర్సిటీల్లో కామన్ అకడమిక్ కేలండర్ అమలు డిగ్రీలో 6 నెలల ప్రాజెక్టు వర్క్.. పూర్తికాగానే ఉపాధి లభించేలా చర్యలు వర్సిటీలకు రూ.1,000 కోట్ల బడ్జెట్ ఇచ్చేందుకు సిద్ధమని వెల్లడి సాక్షి, హైదరాబాద్: ‘‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ సాధ్యం కాదు. యూజీసీ జారీ చేసిన జీవో 14 ప్రకారం ఇది కష్టం. అయితే దీనిపై ఏం చేయాలన్నది త్వరలో నిర్ణయిస్తాం. ప్రభుత్వపరంగా విధాన నిర్ణ యం తీసుకోవాల్సి ఉంది..’’ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో స్థితిగతులు, నియామ కాలు, భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలపై బుధవారం సచివాలయంలో ఆయా వర్సిటీ ల వీసీలతో కడియం సమీక్ష సమావేశం నిర్వ హించారు. యూజీసీ నిబంధనల ప్రకారం జాతీయ స్థాయిలో నియామక నోటి ఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని, సర్వీసుకు వెయిటేజీ మాత్రమే ఉందని కడియం స్పష్టం చేశారు. నియామకాల సమయంలో దీనిపై చర్చిస్తా మని తెలిపారు. అయితే వర్సిటీల్లో ప్రస్తుతం ఎంత మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు, వారి నియామక ప్రక్రియ ఏమిటి, నిబంధ నలు ఏం చెబుతున్నాయి, క్రమబద్ధీ కరణ విషయంలో ఏం చేయాలన్న దానిని వీసీలు సమీక్షించి నివేదిక ఇవ్వాలని సూచించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టు వర్క్ వర్సిటీల్లో సంప్రదాయ కోర్సులే కాకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సు ల ను రూపొందించాలని వీసీలకు కడియం సూచించారు. సాధారణ డిగ్రీ కోర్సుల్లోనూ 6 నెలల పాటు ప్రాజెక్టు వర్క్/శిక్షణ ఇచ్చేలా సర్టి ఫికెట్ కోర్సును ప్రవేశపెట్టాలని.. తద్వారా విద్యార్థి కోర్సు పూర్తి చేయ గానే ఉపాధి లభిం చేలా చర్యలు చేప ట్టాలని చెప్పారు. ప్రభుత్వం వన్టైమ్ గ్రాంటు ఇస్తుందని, భవిష్యత్తులో నిధుల కోసం ప్రభుత్వంపై ఆధార పడకుండా సొంత వనరులను సమకూర్చుకోవాలని సూచించారు. కానిస్టేబుల్, ఇంజనీర్ల పరీక్షలు నిర్వహించడం ద్వారా జేఎన్టీయూ హెచ్ వనరులను సమకూర్చుకున్నట్లు ఇతర యూనివర్సిటీలు చేయాలని చెప్పారు. ఒక్కో యూనివర్సిటీ ఒక్కోలా కాకుండా అన్నింటిలో కామన్ అకడమిక్ కేలండర్ అమలు చేయాలని... యూనివర్సిటీల్లో అన్ని సర్వీసులను ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. బీఎడ్ రెండో దశ కౌన్సెలింగ్పై ప్రశ్నించగా.. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించామని, 11 కొత్త కాలేజీలు తమకు ప్రవేశాలు వద్దని రాసిస్తే, కౌన్సెలింగ్ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. వర్సిటీలకు రూ.1,000 కోట్లు రాష్ట్రంలోని యూనివర్సిటీలకు పూర్వ వైభవం తీసుకురావాలని, ఇందుకోసం వర్సిటీలకు రూ.1,000 కోట్ల బడ్జెట్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని కడియం వెల్లడించారు. వర్సిటీల అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదనలు అందజేయాలని సూచించారు. పాత యూనివర్సిటీల్లో మరమ్మతులు, పెయిం టింగ్, కొత్త యూనివర్సిటీలకు అదనపు గదులు, మౌలిక సదుపాయాలు కల్పించేం దుకు చర్యలు చేపట్టాలని వీసీలను ఆదేశిం చారు. వర్సిటీల్లో రిటైర్మెంట్ వయసు పెంపుపైనా చర్చించామని, అంతకంటే ముందు వర్సిటీల్లో పదోన్నతులు కల్పించా లని వీసీలను ఆదేశించారు. తర్వాత ఏర్పడే ఖాళీల భర్తీపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అయితే గతంలో యూని వర్సిటీల్లో ఇష్టారాజ్యంగా నియామకాలు చేపట్టినందున... ప్రస్తుతమున్న విద్యార్థుల సంఖ్యతో బోధన–బేధనేతర సిబ్బందిని హేతుబద్ధీకరణ చేయాలని ఆదేశించారు. -
యూజీసీ సభ్యుడిగా గోపాల్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సభ్యుడిగా సీనియర్ విద్యావేత్త ప్రొఫెసర్ జి.గోపాల్రెడ్డిని నియ మించాలని కేంద్ర మానవ వనరుల అభి వృద్ధి శాఖ నిర్ణయించింది. రెండు మూడ్రో జుల్లో ఉత్తర్వులు వెలువడుతా యని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. గోపాల్రెడ్డితో పాటు ప్రొఫెసర్ సుష్మా యాదవ్ను కూడా యూజీసీ సభ్యురాలిగా నియమించాలని నిర్ణయించింది. ఉస్మానియా వర్సిటీతో అనుబంధమున్న గోపాల్ రెడ్డికి పొలిటికల్ సైన్స్లో 30ఏళ్లకు పైగా బోధనా అనుభవం ఉంది. -
దేశంలో 22 నకిలీ వర్సిటీలు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. ఆయా యూనివర్సిటీలు ఇచ్చే డిగ్రీలు చెల్లవని పేర్కొంది. వాటిల్లో విద్యార్థులెవరూ చేరొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు యూజీసీ సెక్రటరీ జస్పాల్ సింగ్ సంధూ ఉత్తర్వులు జారీ చే శారు. ఇవీ నకిలీ యూనివర్సిటీలు 1. మైథిలీ యూనివర్సిటీ, దర్భంగ, బిహార్; 2. వారణాసేయ సంస్కృత విశ్వ విద్యాలయం, వారణాసి, యూపీ/జగత్పురి, ఢిల్లీ; 3. కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దర్యాగంజ్, ఢిల్లీ; 4. యునెటైడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఢిల్లీ; 5. వొకేషనల్ యూనివర్సిటీ, ఢిల్లీ; 6. ఏడీఆర్-సెంట్రిక్ జ్యుడీషియరీ, ఏడీఆర్ హౌజ్, ఢిల్లీ 7. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, న్యూఢిల్లీ,; 8. బడాగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, గోకక్, బెల్గాం (కర్ణాటక); 9. సెయింట్ జాన్స్ యూనివర్సిటీ, కిషణట్టం, కేరళ; 10. రాజా అరబిక్ యూనివర్సిటీ, నాగ్పూర్; 11. డి.డి.బి. సంస్కృత యూనివర్సిటీ, పుతూర్, తిరుచి, తమిళనాడు; 12. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడి సిన్, చౌరింఘీరోడ్, కోల్కతా; 13. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసర్చ్, కోల్కతా 14. మహిళ గ్రామ్ విద్యాపీఠ్/విశ్వవిద్యాలయ (ఉమెన్స్ యూనివర్సిటీ) ప్రయాగ్, ఉత్తరప్రదేశ్; 15. గాంధీ హిందీ విద్యాపీఠ్, ప్రయాగ్, ఉత్తరప్రదేశ్ 16. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి కాన్పూర్ 17. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ (ఓపెన్ యూనివర్సిటీ) అలీగఢ్, ఉత్తరప్రదేశ్; 18. ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయ, కోసికలన్, మధుర, ఉత్తరప్రదేశ్ 19. మహా రాణాప్రతాప్ శిక్షానికేతన్ విశ్వ విద్యాలయం, ప్రతాప్గ ఢ్, ఉత్తరప్రదేశ్ 20. ఇంద్రప్రస్త శిక్షా పరిషత్, మకన్పూర్, నోయిడా ఫేస్-2, ఉత్తరప్రదేశ్ 21. గురుకుల్ విశ్వ విద్యాలయ బృందావనం, మధుర, ఉత్తరప్రదేశ్ 22. నవభారత్ శిక్షా పరిషత్ శక్తినగర్, రూర్కేలా -
కేంద్రీయ వర్సిటీల్లో కోటా తప్పనిసరి
సాక్షి, న్యూఢిల్లీ: అడ్మిషన్లు, ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్ విధానం తప్పనిసరిగా అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. అన్ని కోర్సులలో అడ్మిషన్లకు కేంద్రీయ విద్యా సంస్థలు(అడ్మిషన్లలో రిజర్వేషన్లు) చట్టం-2006 అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాలని వర్సిటీల రిజిస్ట్రార్లకు లేఖలు రాసింది. బోధనేతర సిబ్బంది నియామకాల్లో గ్రూప్ ‘ఏ’, గ్రూప్ ‘బి’ పోస్ట్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రత్యక్ష నియామకాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టం చేసింది. అలాగే, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అయితే బోధనా సిబ్బంది నియామకాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మాత్రమే అమలు చేయాలని పేర్కొంది. -
అతిపెద్ద భాషా పోర్టల్ భారత్వాణి
న్యూఢిల్లీ: భారతీయ భాషల్లోని విజ్ఞానంతోపాటు వాటికి సంబంధించిన సకల సమాచారాన్ని మల్టీమీడియా(టెక్స్ట్, ఆడియో, వీడియో, ఫొటోలు) ద్వారా ఇంటర్నెట్ ప్రపంచం ముందుంచేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్వాణి ప్రాజెక్టు పేరిట ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద భాషా వెబ్సైట్ ఏర్పాటుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కసరత్తు చేస్తోంది. వివిధ భాషలకు సంబంధించి కంప్యూటరీకరించిన/కంప్యూటరీకరించని సమాచారాన్ని పంచుకోవాల్సిందిగా అన్ని వర్సిటీలు, కాలేజీలను యూజీసీ కార్యదర్శి జస్పాల్సింగ్ సంధూ కోరారు. దేశ భాషా వైవిధ్యాన్ని సైబర్స్పేస్లో చాటేందుకు, ఈ-కంటెంట్ను అభివృద్ధి చేసేందుకు, వివిధ భాషల్లోని దేశీయ సంప్రదాయ సాహిత్యాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించేందుకు కేంద్రం ఈ కార్యక్రమం చేపడుతోందని సంధూ పేర్కొన్నారు. 2001 జనాభా గణాంకాల ప్రకారం దేశంలో 122 షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ భాషలతోపాటు మరో 234 మాతృ భాషలు ఉన్నాయన్నారు. -
ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు?
వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం, వర్సిటీలకు హైకోర్టు నోటీసులు విచారణ ఆరు వారాలకు వాయిదా సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంపై హైకోర్టు స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, పలు యూనివర్సిటీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవికుమార్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉత్తర్వుల ప్రకారం అన్ని వర్సిటీలు, కాలేజీల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, ఆ దిశగా ప్రభుత్వంగానీ, వర్సిటీలుగానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ హైదరాబాద్కు చెందిన సయ్యద్ వలీలుల్లా ఖాప్రీతోపాటు మరో నలుగురు వ్యక్తులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. -
పరిశ్రమలకు ‘పని’కొచ్చే చదువు
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో పరిశ్రమల అనుసంధాన కేంద్రాలు ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిర్ణయించింది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచడమే ధ్యేయంగా కసరత్తు చేస్తోంది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను ఖరారు చేసింది. దేశీయ ఉత్పత్తి రంగాల్లో నైపుణ్యాలు కలిగిన యువత అవసరం ఎక్కువగా ఉన్నందున, దానికి అనుగుణంగా విద్యలో మార్పులు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ తదితర కోర్సుల సిలబస్ను మార్చాలని నిర్ణయించింది. నైపుణ్యాలు కలిగిన మానవ నవరులను అందించాలంటే యూనివర్సిటీలు, పరిశ్రమల మధ్య అనుసంధానం అవసరమని గుర్తించింది. ఇందుకోసం విశ్వ విద్యాలయాల్లో యూనివర్సిటీ-పరిశ్రమల అంతర్గత అనుసంధాన కేంద్రాలను(యూనివర్సిటీ-ఇండస్ట్రీ ఇంటర్-లింకేజీ సెంటర్స్) ఏర్పాటు చేయాలని భావించింది. ఈ మేరకు జూలై 27న జరిగిన కమిషన్ సమావేశంలో మార్గదర్శకాలను ఆమోదించింది. మార్గదర్శకాల్లోని వివిధ అంశాలు, విశ్వవిద్యాలయాల్లో యూఐఎల్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలపై మరిన్ని సలహాలు, సూచన లను స్వీకరిస్తోంది. త్వరలోనే ఈ పథకాన్ని అమల్లోకి తెస్తామని ప్రకటించింది. ఈ పథకాన్ని అమలు చేసే యూనివర్సిటీలకు యూజీసీ నిధులను ఇవ్వనుంది. రెండేళ్లపాటు(12వ పంచవర్ష ప్రణాళిక ముగిసే వరకు) యూజీసీ సహకారం అందిస్తామని పేర్కొంది. ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకునే యూనివర్సిటీలు యూజీసీకి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను యూజీసీ నిపుణుల కమిటీ పరిశీలించి యూఐఎల్ కేంద్రాలను మంజూరు చేస్తుంది. పరిశ్రమలు ఏం చేస్తాయంటే.. పరిశ్రమలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలి. నైపుణ్యాల పెంపునకు సహకరించాలి. పరిశ్రమలకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాలు పెంపొందించేందుకు శిక్షణ ఇవ్వాలి. ప్రత్యేక విభాగాలు, నిర్వహణలో సహకారం అందించాలి. పరిశోధనల్లో భాగస్వామ్యం కల్పించాలి. స్కాలర్షిప్లు అందజేయాలి. యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సహకారం అందించాలి. యూఐఎల్ కేంద్రాలు ఏం చేయాలంటే... విద్యార్థుల్లో విజ్ఞానం, నైపుణ్యాల అభివృద్ధికి పక్కా చర్యలు చేపట్టేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలి. అకడమిక్ కార్యక్రమాలను నిర్ణయించాలి. అత్యున్నత విద్యార్హత లు కలిగిన ఫ్యాకల్టీని నియమించాలి. నాణ్యమైన పరిశోధనలకు పెద్దపీట వేయాలి. నైపుణ్యాల అభివృద్ధికి, ఉపాధి అవకాశాల కల్పనకు పరిశ్రమలతో సంప్రదించి ఒప్పందాలు చేసుకోవాలి. పరిశ్రమల అవసరాల మేరకు సిలబస్, బోధనలో మార్పులు చేయాలి. ఉపాధి అవకాశాలు లభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. పరిశ్రమల సందర్శన, శిక్షణలు, స్టైపెండ్తో కూడిన ఇంటర్న్షిప్ నిర్వహించాలి. సాఫ్ట్ స్కిల్స్ పెంపొందించే చర్యలు చేపట్టాలి. -
సీఎస్ఐఆర్ నెట్
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సంయుక్తంగా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) నిర్వహిస్తున్నాయి. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థుల పరిశోధనలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తారు. తాజాగా ఈ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది... నెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సీఎస్ఐఆర్, యూజీసీలు సంయుక్తంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) పేరిట ఆర్థిక సహకారం అందిస్తున్నాయి. పీహెచ్డీకి రిజిస్టర్ చేసుకున్న తర్వాత సంవత్సరానికి రూ.20,000 కంటింజెన్సీ ఫండ్తోపాటు నెలకు రూ.25 వేలు జేఆర్ఎఫ్ లభిస్తుంది. అర్హత: జనరల్, ఓబీసీ అభ్యర్థులు కనీసం 55శాతం మార్కులతో ఎంఎస్సీ/ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్/ బీఎస్-లుగేళ్లు/బీఈ/బీటెక్/బీఫార్మా/ఎంబీబీఎస్ (ఎస్సీ, ఎస్టీ, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు 50 శాతం). వయసు: 2015, జూలై 1 నాటికి గరిష్టంగా 28 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ప్రత్యేక కేటగిరీ, మహిళా అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. రఖాస్తు రుసుం: జనరల్ అభ్యర్థులకు రూ.1000, నాన్ క్రీమీలేయర్ ఓబీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.250. ఓబీసీ అభ్యర్థులు క్రీమీలేయర్ పరిధిలోకి వస్తే వారిని జనరల్ అభ్యర్థులుగానే పరిగణిస్తారు. పరీక్షా విధానం: ప్రశ్నపత్రం 200 మార్కులకు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. పరీక్ష కాల వ్యవధి మూడు గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ప్రశ్నపత్రం 3 విభాగాలుగా ఉంటుంది. సబ్జెక్టులు: కెమికల్ సెన్సైస్; ఎర్త్, అట్మాస్పియరిక్, ఓషన్, ప్లానెటరీ సెన్సైస్; లైఫ్ సెన్సైస్; మ్యాథమెటికల్ సెన్సైస్; ఫిజికల్ సెన్సైస్ పార్ట్-ఎ: ఇది అన్ని సబ్జెక్టుల అభ్యర్థులకు కామన్గా ఉంటుంది. ఇందులో 20 ప్రశ్నలు ఉంటాయి. ఏవైనా 15 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున 30 మార్కులు ఉంటాయి . ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్ ముఖ్యంగా లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలిసిస్, న్యూమరికల్ ఎబిలిలీ, క్వాంటిటేటివ్ కంపారిజన్ వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. పార్ట్-బి: ఈ విభాగంలో అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టు సంబంధించి 50 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 35 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 70 మార్కులు. పార్ట్-సి: ఇందులో మొత్తం 75 ప్రశ్నలుంటాయి. ఏవైనా 25 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులు. పరిశోధనాత్మక అంశాలపై అభ్యర్థికి ఉన్న అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. సైంటిఫిక్ నాలెడ్జ్తో ఏదైనా సమస్య వస్తే ఎలా పరిష్కరిస్తారనే కోణంలో ప్రశ్నలుంటాయి. ముఖ్య సమాచారం: ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 25, 2015. దరఖాస్తు రుసుం చెల్లించేందుకు చివరి తేదీ: ఆగస్టు 24, 2015. ఆన్లైన్ దరఖాస్తు హార్డ్కాపీ పోస్ట్ ద్వారా సీఎస్ఐఆర్ ఎగ్జామినేషన్ యూనిట్కు చేరేందుకు చివరి తేదీ: సెప్టెంబరు 3, 2015. పరీక్ష తేదీ: డిసెంబర్ 20, 2015. పరీక్షా కేంద్రాలు: గుంటూరు, హైదరాబాద్. వెబ్సైట్: www.csirhrdg.res.in -
దేశంలో నకిలీ యూనివర్సిటీలు ఇవే!
దేశంలో నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి.. కాస్త జాగ్రత్త పడాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) హెచ్చరించింది. ఈ జాబితాను కూడా వెల్లడించింది. మొత్తం 21 యూనివర్సిటీలను ఈ జాబితాలో చేర్చారు. వీటిలో అత్యధికంగా 8 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. మరో 6 నకిలీ వర్సిటీలు ఢిల్లీలో ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కోటి చొప్పున నకిలీ యూనివర్సిటీలున్నాయి. తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ ఇవి ఏవీ లేకపోవడం కొంతలో కొంత ఊరట. 1956 నాటి యూజీసీ చట్టం ప్రకారం కేంద్ర/ రాష్ట్ర/ ప్రొవెన్షియల్ చట్టాల ప్రకారం ఏర్పాటైన విశ్వవిద్యాలయాలు లేదా, చట్టంలోని సెక్షన్ 3 కిందకు వచ్చే డీమ్డ్ వర్సిటీలు మాత్రమే తమను తాము యూనివర్సిటీలని చెప్పుకోడానికి అర్హత కలిగి ఉంటాయి. ఈ పరిధిలోకి రానివన్నీ నకిలీ యూనివర్సిటీలే అవుతాయి. అందువల్ల ఈ 21 యూనివర్సిటీలలో పొరపాటున కూడా చదవొద్దని, ఇవి ఇక మీదట డిగ్రీలు ఇవ్వడానికి వీల్లేదని యూజీసీ ఆ నోటీసులో తెలిపింది. నకిలీ యూనివర్సిటీల జాబితా ఇదీ.. 1. మైథిలి యూనివర్సిటీ, దర్భాంగా, బీహార్ 2. వారణాసీయ సంస్కృత్ విశ్వవిద్యాలయ, ఢిల్లీ 3. కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, ఢిల్లీ 4. యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఢిల్లీ 5. వొకేషనల్ యూనివర్సిటీ, ఢిల్లీ 6. ఏడీఆర్- సెంట్రల్ జ్యురిడికల్ యూనివర్సిటీ, ఢిల్లీ 7. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఢిల్లీ 8. బడగ్నవీ సర్కార్ వరల్డ్ ఓపెన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, బెల్గాం, కర్ణాటక 9. సెయింట్ జాన్స్ యూనివర్సిటీ, కిషనట్టం, కేరళ 10. కేసర్వానీ విద్యాపీఠ్, జబల్పూర్, మధ్యప్రదేశ్ 11. రాజా అరబిక్ యూనివర్సిటీ, నాగపూర్, మహారాష్ట్ర 12. డీడీబీ సంస్కృత యూనివర్సిటీ, పుత్తూరు, తిరుచ్చి, తమిళనాడు 13. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోల్కతా, పశ్చిమబెంగాల్ 14. మహిళా గ్రామ్ విద్యాపీఠ్, అలహాబాద్, ఉత్తరప్రదేశ్ 15. గాంధీ హిందీ విద్యాపీఠ్, అలహాబాద్, ఉత్తరప్రదేశ్ 16. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, కాన్పూర్, ఉత్తరప్రదేశ్ 17. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ, అలీగఢ్, ఉత్తరప్రదేశ్ 18. ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయ, ఉత్తరప్రదేశ్ 19. మహా రాణాప్రతాప్ శిక్షా నికేతన్ విద్యాలయ, ప్రతాప్గఢ్, ఉత్తరప్రదేశ్ 20. ఇంద్రప్రస్థ శిక్షా పరిషత్, నోయిడా ఫేజ్ 2, ఉత్తరప్రదేశ్ 21. గురుకుల విశ్వవిద్యాలయ, మథుర, ఉత్తరప్రదేశ్ -
వర్సిటీల్లో ఖాళీలన్నీ భర్తీ చేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: బోధనాసిబ్బంది లేక దెబ్బతింటున్న యూనివర్సిటీలను గాడిలో పెట్టేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నడుం బిగించింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా అన్ని యూనివర్సిటీల్లోని ఖాళీలను భర్తీ చేసి, సిబ్బందికి అవసరమైన శిక్షణలు పూర్తి చేయాలని వైస్-ఛాన్స్లర్లను ఆదేశించింది. నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు యూజీసీ చైర్మన్ వేద్ప్రకాశ్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. అధ్యాకుల్లేక కునారిల్లుతున్న వర్సిటీల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం చాలా వర్సిటీల్లో అనేక ఖాళీలు ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, పార్ట్టైం, కాంట్రాక్ట్వారిని నియమించినా ఆశించిన ప్రయోజనాలు చేకూరడం లేదన్నారు. ఖాళీలభర్తీకి యూనివర్సిటీల వారీగా అర్హులైన వారిని గుర్తించాలని తెలిపారు. అవసరమైతే ఇతర ప్రాంతాలకు చెందిన వారిని అధ్యాపకులను నియమించాలన్నారు. డిగ్రీస్థాయిలో అన్నిబ్రాంచీల్లో పాఠ్యాంశంగా పర్యావరణ విద్య యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో డిగ్రీకోర్సుల్లో పర్యావరణ విద్యను ప్రవేశపెట్టాలని కూడా యూజీసీ ఆదేశించింది. గురువారం యూజీసీ కార్యదర్శి జస్పాల్ సంధు ఈ ఆదేశాలు జారీ చేశారు. ఆరునెలలపాటు సిలబస్ ఉండేలా దీనిని ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభించాలన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. బోధనేతర సిబ్బంది నైపుణ్యాల అభివృద్ధికి కౌన్సిల్ పాఠశాల విద్య, కళాశాల విద్య, యూనివర్సిటీల్లో బోధనేతర సిబ్బందిలో నైపుణ్యాల అభివృద్ధికి కోసం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా నైపుణ్యాల అభివృద్ధి కౌన్సిల్ను ఏర్పాటు చేసింది. -
సైన్స్ ప్రయోగాలకు జంతువులను చంపొద్దు
యూనివర్సిటీలకు యూజీసీ మార్గదర్శకాలు సాక్షి, హైదరాబాద్: గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో జీవశాస్త్ర కోర్సుల్లో ప్రయోగాల కోసం జంతువులను ఉపయోగించవద్దని, వాటిని చంపొద్దని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) స్పష్టం చేసింది. వివిధ ప్రయోగాలకు జంతువుల స్థానంలో కంప్యూటర్ పరిజ్ఞానంతో కూడిన ఐసీటీ ప్రోగ్రాంలను వినియోగించుకోవాలని విద్యాసంస్థలకు సూచించింది. కప్పలు, వానపాముల వంటి జంతువులను కోసి చేసే విచ్ఛేద(డిసెక్షన్) ప్రయోగాలకు సంబంధించిన సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలను తాము అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. INFLIBNET/NMEICT పేరుతో రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది. వీటికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలను ఈ నెల 5వ తేదీన జారీ చేసినట్లు ఈ మేరకు యూజీసీ కార్యదర్శి జస్పాల్ సింగ్ సంధు వెల్లడించారు. దేశంలోని అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యా శాఖలు ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని వివరించారు. -
ఎఫ్వైయూపీ రద్దు
నాలుగు రోజుల ఎడతెగని అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. యూజీసీ ఆదేశాల మేరకు మూడేళ్ల కోర్సులోనే ప్రవేశ ప్రక్రియ చేపడతామని ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) ప్రకటించింది. దీంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బీటెక్ విద్యార్థులు మాత్రం శుక్రవారం కూడా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇక ప్రవేశాలు మూడేళ్ల డిగ్రీ కోర్సులోనే సాక్షి, న్యూఢిల్లీ : నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుపై నెలకొన్న వివాదం సమసిపోయింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాల మేర కు ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంను రద్దుచేసింది. గతంలో బోధించిన మూడేళ్ల డిగ్రీ కోర్సు ప్రకారమే ప్రవేశాలు జరపనున్నట్లు ప్రకటి ంచింది. యూనివర్సిటీ కిందనున్న కళాశాలలన్నింటిలో ప్రవేశ ప్రక్రియను ప్రారంభించాలని డీయూ వైస్చాన్స్లర్ దినేశ్సింగ్... ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశా రు. యూజీసీ ఆదేశాల మేరకు యూనివర్సిటీ నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంను రద్దు చేయాలని నిర్ణయించామని దినేశ్సింగ్ ప్రకటించారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలలు 2012-13 విద్యాసంవత్సరంలో పాటించిన ప్రక్రి య ప్రకారమే ప్రవేశాలు చేపట్టాలని ఆయన సూచించారు. యూజీసీ, డీయూల మధ్య నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంపై వివాదం కారణంగా అడ్మిషన్ ప్రక్రియపై నెలకొన్న అనిశ్చితి వీసీ తాజా ప్రకటనతో తొలగిపోయింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు దినేశ్ ప్రకటించారు. డీయూ పరిధిలోని 64 కళాశాలల్లో 54 వేల సీట్ల కోసం 2.7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో అడ్మిషన్ ప్రక్రియ సోమవారం మొదలవుతుందని భావిస్తున్నారు. అడ్మిషన్ ప్రక్రి య ఇప్పటికే వారం రోజులు ఆలస్యమైంది. నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్ కోర్సును రద్దు చేస్తూ డీయూ తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల కోర్సును వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు జరుపుతున్న విద్యార్థి సంఘాలు సంబరాలు జరుపుకున్నాయి. కాగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సును రద్దు చేయడంతో పాత పదధతి ప్రకారం అడ్మిషన్ ప్రకియను నిర్వహించే మార్గాలను చర్చించడం కోసం డీయూ కాలేజీల ప్రిన్సిపాల్స్ దినేశ్సింగ్ను కలిశారు. అడ్మిషన్ ప్రక్రియను సజావుగా నిర్వహిం చేందుకు తగు సూచనలకోసం 12 కాలేజీల ప్రిన్సిపాల్స్తో కమిటీని నియమించారు. -
అన్ని సర్టిఫికెట్లలో అమ్మ పేరు తప్పనిసరి
' దరఖాస్తు ఫారాల్లోనే అవకాశం కల్పించాలి ' యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లకు యూజీసీ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: విద్యా సంబంధిత డిగ్రీలు, ఇతర అన్ని సర్టిఫికెట్లలో తల్లి పేరును తప్పనిసరిగా చేర్చాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు దేశంలోని అన్ని యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లకు ఆదేశాలు జారీ చేసింది. సర్టిఫికెట్లలోనే కాకుండా వివిధ కోర్సుల దరఖాస్తు ఫారాల్లోనూ తల్లి పేరు రాసే కాలమ్ ఉంచాలని పేర్కొంది. దరఖాస్తు ఫారాలు, సర్టిఫికెట్లలో విద్యార్థి ఇంటి పేరు, విద్యార్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు స్పష్టంగా ఉండేలా చర్యలు చేపట్టాలని యూజీసీ ఇన్చార్జి సెక్రటరీ ఉపమన్యు బసు వీసీలకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త డిగ్రీలకు యూజీసీ అనుమతి ఉండాల్సిందే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తించని డిగ్రీలను ఏ యూనివర్సిటీ కూడా నిర్వహించడానికి వీలులేదని, అలాంటి డిగ్రీలను ఇవ్వరాదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ విషయంలో వర్సిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించరాదని సూచిస్తూ వర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త డిగ్రీని ప్రవేశపెట్టాలనుకుంటే ఆరు నెలల ముందుగా యూజీసీకి దర ఖాస్తు చేసుకుని గుర్తింపు పొందాలని సూచించింది. -
క్రీడల్లో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టాలి
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: విశ్వ విద్యాలయాల్లో క్రీడాకారులను ప్రోత్సహించాలని న్యూఢిల్లీకి చెందిన జాతీయ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వైస్ చైర్మన్ ప్రొఫెసర్ దేవరాజ్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లో రూ. 3 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన స్పోర్ట్స్ హాస్టల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాయామ విద్యా, క్రీడల్లో కొత్త కోర్సులను ప్రవేశ పెట్టాలని చెప్పారు. దేశంలోని 600 విశ్వవిద్యాలయాల్లో యూజీసీ ఇచ్చే నిధుల్లో క్రీడలకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఓయూ క్రీడాకారులకు గురుకుల శిక్షణ శిబిరాల ద్వారా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఈ క్రీడా వసతి గృహం దోహదపడుతుందని ఆయన తెలిపారు. యూజీసీ ఇచ్చిన రూ. రెండు కోట్లతోపాటు ఓయూ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ మరో కోటి రూపాయలు వెచ్చించి ఈ భవనం పూర్తి చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ హాస్టల్లో దాదాపు వంద మంది క్రీడాకారులకు, ఫిజికల్ ఎడ్యుకేషన్లో వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించనున్నట్లు ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఎస్.సత్యనారాయణ, ఎడ్యుకేషన్ డీన్ ప్రొఫెసర్ వెంకట్రెడ్డి, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ జె.ప్రభాకర్రావు, ప్రొఫెసర్ ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ రాజేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
క్రీడల్లో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టాలి
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: విశ్వ విద్యాలయాల్లో క్రీడాకారులను ప్రోత్సహించాలని న్యూఢిల్లీకి చెందిన జాతీయ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వైస్ చైర్మన్ ప్రొఫెసర్ దేవరాజ్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లో రూ. 3 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన స్పోర్ట్స్ హాస్టల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాయామ విద్యా, క్రీడల్లో కొత్త కోర్సులను ప్రవేశ పెట్టాలని చెప్పారు. దేశంలోని 600 విశ్వవిద్యాలయాల్లో యూజీసీ ఇచ్చే నిధుల్లో క్రీడలకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఓయూ క్రీడాకారులకు గురుకుల శిక్షణ శిబిరాల ద్వారా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఈ క్రీడా వసతి గృహం దోహదపడుతుందని ఆయన తెలిపారు. యూజీసీ ఇచ్చిన రూ. రెండు కోట్లతోపాటు ఓయూ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ మరో కోటి రూపాయలు వెచ్చించి ఈ భవనం పూర్తి చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ హాస్టల్లో దాదాపు వంద మంది క్రీడాకారులకు, ఫిజికల్ ఎడ్యుకేషన్లో వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించనున్నట్లు ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఎస్.సత్యనారాయణ, ఎడ్యుకేషన్ డీన్ ప్రొఫెసర్ వెంకట్రెడ్డి, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ జె.ప్రభాకర్రావు, ప్రొఫెసర్ ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ రాజేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.