Online Education
-
ఆన్లైన్ కోచింగ్లకు బీఐఎస్?
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి అనంతరం డిజిటల్ ఎడ్యుకేషన్పై ఆధారపడటం బాగా పెరిగింది. హోం ట్యూషన్లు మొదలు సివిల్స్ కోచింగ్ వరకు అంతా వెబ్సైట్లు, మొబైల్ యాప్లలో ఆన్లైన్ కోచింగ్లు సర్వసాధారణంగా మారాయి. అయితే, ఒక్కో కోచింగ్ సెంటర్ ఒక్కో తరహా మెటీరియల్ను తమ ఇష్టానుసారంగా తయారు చేసి వినియోగదారులకు అందిస్తోంది. ఆన్లైన్లో కోచింగ్ క్లాస్లు తీసుకునే ఫ్యాకల్టీ విద్యార్హతలపైనా ఎక్కడా పెద్దగా పట్టింపు లేదు.దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ కోచింగ్ సెంటర్లకు, వారు ఇచ్చే మెటీరియల్ నాణ్యత, ఫ్యాకల్టీ నిపుణత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)ను రంగంలోకి దించేందుకు కేంద్ర విద్యాశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆన్లైన్ కోచింగ్ తీసుకునే విద్యార్థులను సైతం వినియోగదారులుగా పరిగణిస్తూ బోధనతోపాటు ప్రొఫెషనల్ కంటెంట్ తయారీలోనూ నాణ్యత పెంచడమే ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. బీఐఎస్ మార్క్ తీసుకురావడం వల్ల ఆన్లైన్లో విద్యాప్రమాణాలు మెరుగయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.విద్యార్థులు సైతం ఆన్లైన్ కోచింగ్ సెంటర్ల ద్వారా పొందే స్టడీ మెటీరియల్ తగిన విధంగా ఉండేలా యాజమాన్యం సైతం జాగ్రత్తలు తీసుకుంటుందని పేర్కొంటున్నారు. నానాటికీ ఆన్లైన్ కోచింగ్ సెంటర్లు, క్లాసుల ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో వెబ్సైట్లతోపాటు మొబైల్ యాప్లకు ఇది వర్తింపజేయనున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల కోచింగ్ వెబ్సైట్లు, మొబైల్ యాప్ల యాజమాన్యాల్లో జవాబుదారీతనం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆన్లైన్ విద్యలో ప్రమాణాలు పెంచాల్సిన అవసరం చాలా ఉందని విద్యావేత్త, ఎన్సీఈఆర్టీ మాజీ డైరెక్టర్ జేఎస్ రాజ్పుత్ అభిప్రాయపడ్డారు. మార్గదర్శకాలు కావాలి నాణ్యత లేని కంటెంట్, బలహీనమైన డెలివరీ ప్లాట్ఫామ్లు విద్యార్థులకు సరైన విద్యను అందించలేవు. అందుకే ఆన్లైన్ విద్యలో నాణ్యతను పెంచడానికి స్పష్టమైన మార్గదర్శకాలు అవసరం. –అభాష్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఢిల్లీ యూనివర్సిటీభారత ఇ–లెర్నింగ్ మార్కెట్ విలువ (రూ.లలో) 2023లో : 88 వేల కోట్లు 2029 నాటికి: 2.46 లక్షల కోట్లు (అంచనా) (అరిజ్టన్ అడ్వైజరీ సంస్థ నివేదిక) -
Telangana: బడి.. ఇక త్రీడీ!
సాక్షి, హైదరాబాద్: క్లాస్ రూంలో తాజ్మహల్ పాఠం చెప్పడం కాదు.. తాజ్మహల్ పక్కనే ఉండి వివరిస్తున్నట్టుగా ఉంటే.. విత్తనం మొలకెత్తే దగ్గర్నుంచి.. చెట్టుగా మారి.. పూలు, కాయడం మొత్తాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి వస్తే.. విద్యార్థులకు ఈ థ్రిల్లే వేరు. సబ్జెక్ట్పై మంచి అవగాహన రావడమేకాదు, చదువుకోవడం, నేర్చుకోవడంపై మరింత ఆసక్తి కలగడమూ ఖాయమే. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలోనే ఈ తరహా డిజిటల్ బోధన అందుబాటులోకి రానుంది. విద్యార్థులకు వర్చువల్ రియాలిటీ (వీఆర్), త్రీడీ విధానాల్లో పాఠాలు బోధించే ఏర్పాట్లపై రాష్ట్ర సర్కారు దృష్టిసారించింది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లపై పరిశీలన జరుపుతోంది. నూతన విద్యా విధానంలో భాగంగా దీనిని అమల్లోకి తీసుకురానుంది. ఇటీవల రాష్ట్రంలో డిజిటల్ విద్యా బోధనపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సందర్భంగా.. అధికారుల నుంచి ప్రభుత్వం నివేదిక కోరింది. విద్యాశాఖ అధికారులు డిజిటల్ బోధనకు గల అవకాశాలు, అవసరమైన ఏర్పాట్ల వివరాలను సేకరిస్తున్నారు. నిపుణులతో చర్చించి నివేదిక రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. రెండేళ్ల కిందటి నుంచే ప్రయత్నాలు వర్చువల్ రియాలిటీ, త్రీడీ వంటి డిజిటల్ బోధన వల్ల విద్యలో నాణ్యత పెరుగుతుందని కేంద్ర అధ్యయనాలు తేల్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు సర్కారీ బడుల్లో అత్యాధునిక సాంకేతికత సమకూర్చుకుని, డిజటల్ బోధనను అమలు చేయాలని కేంద్రం కోరింది. ఇందుకోసం అయ్యే వ్యయంలో 60శాతం భరిస్తామని ప్రకటించింది. వాస్తవానికి ఈ ప్రయత్నం 2022లోనే మొదలైంది. అవసరమైన మౌలిక వసతులనూ గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వ బడుల్లో డిజిటల్ విద్యపై రెండేళ్ల క్రితం కొంత కసరత్తు జరిగింది. త్రీడీ విద్యను రెండు స్కూళ్లలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. కానీ ప్రతిపాదనల దశలోనే అది ఆగిపోయింది. ఆధునిక విద్యకు ఎన్నో అవసరాలు! స్కూళ్లలో డిజిటల్ బోధనకు 75 అంగుళాల మానిటర్లు అవసరం. కంప్యూటర్లు, వర్చువల్ రియాలిటీ, త్రీడీ పరికరాలతో కూడిన స్మార్ట్ క్లాస్రూంలు, మెటల్ ఫ్రేమ్ కూడిన బోర్డ్, పాఠ్యాంశాల బోధన కోసం యాప్లు, ట్యూబ్లైట్లు, గ్రీన్బోర్డ్లు, విద్యుత్ అంతరాయంతో ఇబ్బంది రాకుండా యూపీఎస్లు వంటివి అవసరం. దీనికితోడు వేగవంతమైన ఇంటర్నెట్, వైఫై తప్పనిసరి. విద్యార్థులకు కావాల్సిన ఆడియో, వీడియో, త్రీడీ చిత్రాలు, గ్రాఫ్లు, మ్యాప్లు, వీడియోలను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉండాలి. యానిమేషన్, త్రీడీ చిత్రాలను ఉపయోగించే సాంకేతికత ఉండాలి. కొత్త టెక్నాలజీలతో సులువుగా.. ఇప్పుడు డిజిటల్, త్రీడీ, వర్చువల్ విద్యా బోధన సులువుగా మారిందని నిపుణులు తెలిపారు. గతంలో ప్రొథీయమ్ బోర్డ్ వాడాల్సి వచ్చేదని.. దానితో ఒక్కో బడికి రూ.25 లక్షల దాకా వెచ్చించాల్సి వచ్చేదని.. ఇప్పుడు తక్కువ ఖర్చయ్యే కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం ప్రొజెక్టర్, స్మార్ట్ టచ్ స్క్రీన్ టీవీలను వాడుతున్నారని.. బోధనకోసం వాడే కంటెంట్ను బడిలోని కంప్యూటర్లోనే ఇన్స్టాల్ చేయడానికి వీలుందని వెల్లడించారు. బోధన కంటెంట్ ఉచితంగా కూడా దొరుకుతుందని.. కాకపోతే స్థానికతను దృష్టిలో ఉంచుకుని కంటెంట్ రూపొందించుకుంటే సరిపోతుందని స్పష్టం చేశారు. కంటెంట్ను తగిన మెళకువలతో అందిస్తే విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుందని తెలిపారు. సూచనలు, అంచనాలివీ.. – 6 నుంచి 10 తరగతుల వరకు రికార్డు చేసిన డిజిటల్ కంటెంట్ను ఇంటర్నెట్ సాయంతో వినేలా చేయవచ్చు. టీచర్లు చెప్పే లైవ్ పాఠాలు ఇంటివద్దే వినే, చూసే వీలుంటుంది. – ప్రతి పాఠశాలలో రెండు డిజిటల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేయాలి. ఇందులో ప్రొజెక్టర్, కంప్యూటర్లు, డిజిటల్ తెర, ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు.. ఇలా మొత్తం 25 ఎల్రక్టానిక్ పరికరాలు అమర్చాల్సి ఉంటుంది. – ప్రయోగాత్మక పరిశీలన కోసం రాష్ట్రంలో 3 వేల స్మార్ట్ క్లాస్రూమ్ల అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులోనే వర్చువల్, డిజిటల్, త్రీడీ పాఠాలు చెప్పవచ్చు. ఒక్కో స్కూల్కు రూ.10 లక్షల వరకూ ఖర్చు అవుతుందని అంచనా. ఇలా మొత్తంగా 300 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని విద్యాశాఖ అంచనా వేసింది. ఇంటర్నెట్, ఇతర వసతులు కల్పించాలి మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టడం స్వాగతించాల్సిన అంశం. ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన ముఖ్యం. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్లకు ఇంటర్నెట్ నెట్ సదుపాయం లేదు. కొన్నిచోట్ల వేగం సరిగారాదు. ఇలాంటి సమస్యలను పరిష్కరించాలి. డిజిటల్ విద్యా బోధన వల్ల ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. – పింగిలి శ్రీపాల్రెడ్డి, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు లోకల్ కంటెంట్ అవసరం డిజిటల్, త్రీడీ విద్యా బోధన ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలనే మారుస్తుంది. అయితే ఎక్కడి నుంచో పాఠాలు దిగుమతి చేసుకుంటే లాభం లేదు. జాతీయ స్థాయిలో రూపొందించిన పాఠాలు. స్థానిక పరిస్థితులను ప్రతిబింబించేలా వీడియోలు, యానిమేషన్ ఉండాలి. దీనిపై రాష్ట్రంలో కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. వాటి భాగస్వామ్యాన్ని తీసుకోవాలి. విద్యార్థులకు పాఠం చెప్పే సమయంలోనే డిజిటల్, త్రీడీ విధానాలను వినియోగించాలి. కేవలం రివిజన్ సమయంలో వాడితే ప్రయోజనం ఉండదు. – పన్నీరు భానుప్రసాద్, సూపర్ టీచర్ ఎడ్యు రీఫారŠమ్స్ సీఈవో -
రూ.4,419 కోట్ల నిధుల మళ్లింపు.. ఇన్వెస్టర్ల ఆరోపణ
ప్రస్తుతం ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటూ బైజూస్ సంస్థ మూలధనం కోసం రైట్స్ ఇష్యూకు వెళ్తుండడం తెలిసిందే. అయితే బైజూస్ అమెరికాలోని ఒక రహస్య హెడ్జ్ ఫండ్లోకి 533 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.4,419 కోట్ల)మళ్లించిందని ఆ సంస్థ ఇన్వెస్టర్లు ఆరోపించారు. సంస్థ ఇప్పటికే 200 మిలియన్ డాలర్లు రైట్స్ ఇష్యూ కోసం నమోదు చేసుకున్నందుకు దీనిపై స్టే ఇవ్వాలని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను కోరారు. ఇన్వెస్టర్ల విజ్ఞప్తిపై మూడు రోజుల్లోగా రాతపూర్వక సమాధానం ఇవ్వాలంటూ బైజూస్కు ఎన్సీఎల్టీ ఆదేశాలు జారీ చేసింది. దాంతో తీర్పును రిజర్వ్ చేసింది. రైట్స్ ఇష్యూ ద్వారా వచ్చిన నిధులను కంపెనీలోకి జొప్పించాలని ప్రమోటర్లు భావిస్తున్నారు. బుధవారంతో ఈ రైట్స్ ఇష్యూ ముగియనుంది. ఈ నేపథ్యంలో రైట్స్ ఇష్యూను కొనసాగించాలా వద్దా అనే అంశంపై చర్చలు జరుతున్నట్లు తెలిసింది. అయితే కంపెనీ అధీకృత మూలధనాన్ని పెంచితేనే రైట్స్ ఇష్యూ జరుగుతుందని, అందుకు అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్)లో వాటాదార్లు 51% మెజారిటీతో అంగీకారం తెలపాల్సి ఉంటుందని.. ఇవన్నీ ఇంకా జరగలేదని వాటాదార్లు వాదిస్తున్నారు. ఇదీ చదవండి: ‘డ్యూడ్.. కాస్త రెస్ట్ తీసుకోండి’ నితిన్ కామత్ను కోరిన వ్యాపారవేత్త కంపెనీ రైట్స్ ఇష్యూకు వెళ్లడం చట్టవ్యతిరేకమని.. అందుకే స్టే కోరుతున్నామని ఇన్వెస్టర్లు ఎన్సీఎల్టీ విచారణలో తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కంపెనీకి ఇన్వెస్టర్లు అవాంతరాలు సృష్టిస్తున్నారని బైజూస్ యాజమాన్యం వాదించిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
బైజూస్లో 3,500 మందికి ఉద్వాసన
న్యూఢిల్లీ: ప్రముఖ ఎడ్టెక్ సంస్థ (విద్యా సంబంధిత) బైజూస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,500 మంది ఉద్యోగులను తొలగించనుంది. సంస్థలోని వివిధ స్థాయిల్లో బృందాల క్రమబదీ్ధకరణకు తోడు ప్రాంతాల వారీ ప్రత్యేక దృష్టిని విస్తృతం చేయనుందని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. కరోనా సమయంలో ఆన్లైన్ విద్యకు డిమాండ్ పెరగడంతో, దీనికి అనుగుణంగా బైజూస్ తన ఉద్యోగులను గణనీయంగా పెంచుకుంది. ఇప్పుడు ఆన్లైన్ విద్యకు డిమాండ్ గణనీయంగా తగ్గిపోవడంతో దిద్దుబాటు చర్యలను చేపడుతున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. ‘‘ఇప్పటికైతే తొలగింపులు లేవు. వివిధ యూనిట్ల పునర్నిర్మాణం, డిమాండ్పై అంచనా వేయడం కొనసాగుతోంది. ఇప్పటికి 1,000 మంది నోటీసు పీరియడ్లో ఉన్నారు. మరో 1,000 మంది పనితీరు మెరుగుపరుచుకునే లక్ష్యా లను ఇంకా చేరుకోలేదు. ఈ అంచనా ఇంకా కొనసాగుతోంది. మొత్తం మీద ఈ ప్రక్రియతో 3,500 మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుంది’’అని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. బైజూస్లో ఇదే చివరి తొలగింపులు అని, ఈ ప్రక్రియ అక్టోబర్ చివరికి పూర్తవుతుందని పేర్కొన్నాయి. వ్యాపారాన్ని మరింత చురుగ్గా, అనుకూలంగా మార్చడం ఈ ప్రక్రియ వెనుక లక్ష్యమని తెలిపాయి. స్పష్టమైన జవాబుదారీ తనంతో నడిచే నిర్మాణం ఏర్పాటు చేయడంగా పేర్కొన్నాయి. వ్యాపార పునర్నిర్మాణం.. బైజూస్ అధికార ప్రతినిధి దీన్ని ధ్రువీకరించారు. ‘‘వ్యాపార పునర్నిర్మాణ ప్రక్రియ తుది దశలో ఉంది. నిర్వహణ తీరును మరింత సులభతరం చేయడం, వ్యయాలను తగ్గించుకోవడం, మెరుగైన నగదు ప్రవాహాల కోసం దీన్ని చేపట్టాం. బైజూస్ కొత్త భారత సీఈవో అర్జున్ మోహన్ వచ్చే కొన్ని వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. పునరుద్ధరించిన, స్థిరమైన కార్యకలాపాలను ముందుకు తీసుకెళతారు’’అని వెల్లడించారు. కరోనా సమయంలో ఏర్పాటు చేసిన కొన్ని ఉత్పత్తులు పెద్దగా ఫలితం ఇవ్వలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇకపై కే12 విద్య, ఇతర పోటీ పరీక్షల మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉంటుందని పేర్కొన్నాయి. ప్రాంతీయ బృందాలు మరింత జవాబుదారీగా పని చేయాల్సి ఉంటుందని, హైబ్రిడ్ మోడల్, ట్యూషన్ సెంటర్లపై అధిక దృష్టి సారించాల్సి ఉంటుందని తెలిపాయి. 2022 అక్టోబర్ నాటికి బైజూస్లో 50,000 మంది ఉండగా, తాజా ప్రక్రియ ముగిస్తే వీరి సంఖ్య 31,000–33,000కు తగ్గనుంది. -
Shradha Khapra: సలహాల అక్క
శ్రద్ధా కాప్రాను అందరూ ‘మైక్రోసాఫ్ట్ వాలీ దీదీ’ అని పిలుస్తారు. శ్రద్ధ బంగారంలాంటి మైక్రోసాఫ్ట్ ఉద్యోగాన్ని వదిలేసింది. ‘యువత కెరీర్ కోసం గైడెన్స్ అవసరం’ అని ‘అప్నా కాలేజ్’ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది. రెండేళ్లలో 40 లక్షల మంది సబ్స్క్రయిబర్స్ అయ్యారు. మైక్రోసాఫ్ట్ జీతం కన్నా ఎన్నో రెట్ల ఆదాయం శ్రద్ధకు వస్తోంది. ఏ కోర్సు చదవాలి, ఏ ఉద్యోగం చేయాలి లాంటి సలహాలు ఎప్పటికప్పుడు ట్రెండ్కు తగినట్టు ఇవ్వడమే శ్రద్ధ సక్సెస్కు కారణం. ‘హరియాణలోని చిన్న పల్లెటూరు మాది. మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగైనా నేను ఏం చదవాలో గైడ్ చేయడం ఆయనకు తెలియదు. టీచర్లు కూడా గైడ్ చేస్తారనుకోవడం అంత కరెక్ట్ కాదు. ఇప్పటికీ కాలేజీ స్థాయి నుంచి యువతకు తమ కెరీర్ పట్ల ఎన్నో డౌట్లు ఉంటాయి. వారికి గైడెన్స్ అవసరం. ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుని గైడ్ చేయాలి. నేను కొద్దోగొప్పో చేయగలుగుతున్నాను కాబట్టే ఈ ఆదరణ’ అంటుంది శ్రద్ధా కాప్రా. ఈమెకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు ఈనాటి కాలేజీ విద్యార్థుల్లో. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో. వీరంతా శ్రద్ధను ‘శద్ధ్రా దీదీ’ అని,‘మైక్రోసాఫ్ట్ వాలీ దీదీ’ అని పిలుస్తారు. ఆమె చేసే వీడియోలను వారు విపరీతంగా ఫాలో అవుతారు. ఆ వీడియోల్లో ఆమె చెప్పే సలహాలను వింటారు. డాక్టర్ కాబోయి... శ్రద్ధ తన బాల్యంలో టీవీలో ఒక షో చూసేది. అందులో డాక్టర్లు తాము ఎలా క్లిష్టమైన కేసులు పరిష్కరించారో చెప్పేవారు. ఆ షో చూసి తాను డాక్టర్ కావాలనుకుని ఇంటర్లో ‘పిసిఎంబి’ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్, బయాలజీ) తీసుకుంది. కాని జూనియర్ ఇంటర్ పూర్తయ్యే సరికి డాక్టర్ కావడం చాలా కష్టమని అర్థమైంది. అందుకే మేథ్స్వైపు దృష్టి సారించింది. ‘చిన్నప్పటి నుంచి రకరకాల పోటీ పరీక్షలు ఎక్కడ జరిగినా రాసేదాన్ని. ఇంటర్ అయ్యాక ఎంట్రన్స్లు రాస్తే ర్యాంక్ వచ్చింది. కాని ఏ బ్రాంచ్ ఎన్నుకోవాలో తెలియలేదు. వరంగల్ ఎన్.ఐ.ఐ.టి.లో సివిల్కు అప్లై చేస్తే సీట్ వచ్చింది. సివిల్ ఎందుకు అప్లై చేశానో నాకే తెలియదు. అయితే దాంతో పాటు ఎన్.ఎస్.ఐ.టి. (నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, ద్వారకా)లో కంప్యూటర్ సైన్స్ అప్లై చేస్తే ఆ సీటు కూడా వచ్చింది. దీనికంటే అదే మెరుగనిపించి కంప్యూటర్ సైన్స్ చదివాను’ అని తెలిపింది శ్రద్ధ. ఉద్యోగం, టీచింగ్ చదువు చివరలో ఉండగానే హైదరాబాద్ మైక్రోసాఫ్ట్లో ఇన్టెర్న్ వచ్చింది శ్రద్ధకు. అది పూర్తయ్యాక ఉద్యోగమూ వచ్చింది. అయితే శ్రద్ధ ఇన్టెర్న్ చేస్తున్నప్పటి నుంచే గచ్చిబౌలిలో కంప్యూటర్ కోర్సులను బోధించసాగింది. ఉద్యోగం వచ్చాక కూడా కంప్యూటర్ కోర్సులకు ఫ్యాకల్టీగా పని చేసింది. ‘ఉద్యోగంలో కంటే ఎవరి జీవితాన్నయినా తీర్చిదిద్దే బోధనే నాకు సరైందనిపించింది. అదే సమయంలో యూట్యూబ్ ద్వారా ఎక్కడెక్కడో ఉన్న విద్యార్థులకు పాఠాలు చెప్పడం, కోర్సులు తెలియచేయడం, వారి స్కిల్స్ పెరిగేలా గైడ్ చేయడం అవసరం అనుకున్నాను. మైక్రోసాఫ్ట్లో నాది మంచి ఉద్యోగం. కాని ఏదైనా కొత్తగా చేయాలనుకోవడం కూడా మంచిదే అని జాబ్కు రిజైన్ చేశాను’ అంది శ్రద్ధ. అప్నా కాలేజ్ శ్రద్ధ ‘అప్నా కాలేజ్’ పేరుతో యూట్యూబ్ చానల్ తెరిచింది. ఇంటర్ స్థాయి నుంచి విద్యార్థులకు ఏయే కోర్సులు చదివితే ఏం ఉపయోగమో, ఏ ఉద్యోగాలకు ఇప్పుడు మార్కెట్ ఉందో, ఆ ఉద్యోగాలు రావాలంటే ఏ కోర్సులు చదవాలో తెలిపే వీడియోలు చేసి విడుదల చేయసాగింది. 2020లో ఈ చానల్ మొదలుపెడితే ఇప్పుడు 40 లక్షల మంది సబ్స్క్రయిబర్లు తయారయ్యారు. కోట్లాది వ్యూస్ ఉంటాయి. అందుకు తగ్గట్టుగా లక్షల్లో శ్రద్ధ ఆదాయం ఉంది. ‘ముప్పై ఏళ్ల క్రితం డిగ్రీల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేవారు. ఎందుకంటే డిగ్రీలు తక్కువ ఉండేవి. ఇవాళ డిగ్రీలు అందరి దగ్గరా ఉన్నాయి. కావాల్సింది స్కిల్స్. ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించిన స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడు ముందుకు దూసుకెళ్లవచ్చు. నా వీడియోలు ఆ మార్గంలో ఉంటాయి’ అని తెలిపింది శ్రద్ధ అలియాస్ సలహాల అక్క. -
ఫిజిక్స్ వాలా దూకుడు! రూ. 120 కోట్ల పెట్టుడులు
న్యూఢిల్లీ: ఎడ్టెక్ దిగ్గజం ఫిజిక్స్ వాలా వచ్చే రెండు, మూడేళ్లలో రూ. 120 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. టెక్నాలజీని, ప్లాట్ఫాంను అభివృద్ధి చేసుకోవడంతో పాటు ప్రాంతీయ భాషల్లో కంటెంట్ను రూపొందించడం, పరిశ్రమ నిపుణులను నియమించుకోవడం తదితర అంశాలపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ మహేశ్వరి తెలిపారు. సాధారణంగా కోర్సుల్లో ప్రాక్టికల్ శిక్షణకు అంతగా ప్రాధాన్యం ఉండటం లేదని ఆయన వివరించారు. ప్రాంతీయ భాషల్లో శిక్షణ చాలా తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పరిశ్రమ నిపుణులు ప్రాథమికాంశాల నుంచి బోధించేలా నాణ్యమైన కంటెంట్ను పోటీ సంస్థలతో పోలిస్తే చౌకగా అందించడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు. ఫిజిక్స్ వాలా ప్రస్తుతం డేటా సైన్స్, జావా, సీప్లస్ప్లస్ వంటి వాటిల్లో హైబ్రిడ్ కోర్సులను రూ. 3,500 నుంచి అందిస్తోంది. ఇదీ చదవండి: Friendship Recession: మరో కొత్త మాంద్యం! ఏంటది.. నిఖిల్ కామత్ ఏమన్నారు? -
ఆన్లైన్ చదువులపైనే ఆసక్తి
సాక్షి, అమరావతి: ఇప్పుడు అంతా ఆన్లైన్మయం. ప్రతి రంగంలోనూ టెక్నాలజీ తన హవాను ప్రదర్శిస్తోంది. ఇందుకు విద్యా రంగం మినహాయింపు కాదు. ముఖ్యంగా కోవిడ్ కల్లోల పరిస్థితుల్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్స్, వెబ్సైట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. స్కూళ్లు, కళాశాలలు లేకపోవడంతో విద్యార్థులంతా ఇళ్లకే అతుక్కుపోయారు. దీంతో ఆయా విద్యా సంస్థలు తమ విద్యార్థులకు ఆన్లైన్ వేదికగా పాఠాలు బోధించాయి. అభ్యసనం మొదలుకుని.. పరీక్షల వరకు అన్నీ ఆన్లైన్ వేదికగానే సాగాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఆన్లైన్ చదువులపై ఆసక్తి చూపేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేరుగా కాలేజీల్లో చదివే అవకాశాల్లేనివారితో పాటు ఉద్యోగాల్లో ఉన్నవారు, అదనపు విద్యార్హతలను సంపాదించుకోవాలనుకొనే వారు ఈ ఆన్లైన్ కోర్సులను ఆశ్రయిస్తున్నారు. సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతూ అన్ని రంగాల్లోనూ డిజిటలైజేషన్ వేగంగా విస్తరిస్తుండడంతో ఆన్లైన్ విద్య అందరికీ మరింత అందుబాటులోకి వచ్చింది. ‘స్వయం’.. వందలాది కోర్సులు.. ఆన్లైన్ కోర్సులకు భారీగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు ఎడ్టెక్ సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ విద్యాసంస్థలు, వర్సిటీలు కూడా ఆన్లైన్ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ‘స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్’ (స్వయం – https://swayam.gov.in/) ఏర్పాటు చేసి వందలాది కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ కోర్సులకు సంబంధించి ఇదివరకు ఉన్న నిబంధనలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఒకింత సడలించింది. నిర్ణీత ప్రమాణాలతో ఆన్లైన్ కోర్సులను అందించేందుకు పలు సంస్థలకు అనుమతులు కూడా మంజూరు చేస్తోంది. యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికే యూజీసీ మార్గదర్శకాల మేరకు ఆన్లైన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి. మరోవైపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (ఐఐటీలు) కూడా https://nptel.ac.in/ ద్వారా ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నాయి. విద్యార్థులే కాకుండా ఆసక్తి ఉన్న వారెవరైనా ఈ కోర్సులను అభ్యసించేలా చర్యలు చేపట్టాయి. ఆన్లైన్లోనే కాకుండా ఓడీఎల్ విధానంలోనూ.. కరోనాకు ముందు ఆన్లైన్ చదువులవైపు ఆసక్తి చూపినవారి సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది. కరోనా తర్వాత వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2021–2022లో ఆన్లైన్ కోర్సుల్లో చేరినవారి సంఖ్య 170 శాతం మేర పెరిగినట్లు యూజీసీ సహా పలు సంస్థల అధ్యయనాలు వెల్లడించాయి. ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్) విధానంలోనూ ఆన్లైన్ కోర్సుల్లో చేరుతున్నారు. ఆన్లైన్, ఓడీఎల్ మార్గాల్లో చదువులు కొనసాగిస్తున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతుండడంతో ఆ మేరకు సంస్థలు కూడా అవసరాలకు తగ్గ కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. బిజినెస్ మేనేజ్మెంట్పైనే మోజు.. వివిధ వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు అందిస్తున్న ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సులు, వాటిలో చేరే వారి సంఖ్య గణనీయంగా ఉంది. ఆన్లైన్, ఓడీఎల్ కోర్సులను అభ్యసించే వారిలో ఎక్కువగా పురుషులే ఉంటున్నారు. ఉన్నత విద్య విభాగం సర్వే గణాంకాలు పరిశీలిస్తే.. పురుషుల సంఖ్యలో సగం మంది మహిళలు మాత్రమే ఈ ఆన్లైన్, ఓడీఎల్ కోర్సుల్లో చేరుతున్నారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరేవారిలో ఎక్కువ మంది బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరుతున్నట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సెంట్రల్, స్టేట్, డీమ్డ్, ప్రైవేటు వర్సిటీలు ఈ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. టెక్నాలజీ అంశాలకు సంబంధించి ఐఐటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఎప్పటికప్పుడు కొత్త సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. ఐఐటీలు వంటి జాతీయస్థాయి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఆన్లైన్, ఓడీఎల్ కోర్సులు అందిస్తున్న నేపథ్యంలో విదేశీ విద్యార్థులు కూడా వీటిని అభ్యసించేందుకు ముందుకు వస్తుండటం విశేషం. -
అమ్మకాల ప్రక్రియను మార్చుకున్న బైజూస్
హైదరాబాద్: బైజూస్ తన వ్యాపార విక్రయ విధానంలో కీలక మార్పులు చేసింది. ప్రస్తుత డైరెక్ట్ విక్రయాల స్థానంలో నాలుగు అంచెల టెక్నాలజీ ఆధారితిత విక్రయాల ప్రక్రియను ప్రవేశపెట్టింది. తప్పుడు మార్గాల్లో ఉత్పత్తులను విక్రయించకుండా నూతన విధానం అడు్డకుంటుందని బైజూస్ తెలిపింది. చిన్నారులు, వారి తల్లిదండ్రులతో తన కోర్సులను కొనుగోలు చేయించేందుకు బైజూస్ తప్పుడు మార్గాలను అనుసరిస్తోందన్న ఆరోపణలపై.. బాలల హక్కుల జాతీయ కమిషన్ (ఎన్సీపీసీఆర్) సమన్లు జారీ చేసిన నేపథ్యంలో.. ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. నూతన విక్రయ నమూనా కింద.. బైజూస్ కోర్సులను కొనుగోలు చేయాలంటే నెలవారీ కనీసం ఆదాయం రూ.25,000 ఉండాలి. కోర్సు కొనుగోలుకు ముందు తల్లిదండ్రులు సమ్మతి తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే, నూతన విక్రయ విధానంలో ఉత్పత్తికి సంబంధించి, రిఫండ్ పాలసీ (వద్దనుకుంటే తిరిగి చెల్లింపులు) గురించి వివరంగా కస్టమర్కు జూమ్ లైవ్ సెషన్లో బైజూస్ తెలియజేస్తుంది. దీన్ని భవిష్యత్తులో ఆధారం కోసం రికార్డు రూపంలో ఉంచుతుంది. చదవండి: ర్యాపిడోకి గట్టి షాకిచ్చిన కోర్టు.. అన్ని సర్వీసులు నిలిపివేయాలని ఆదేశాలు! -
బైజూస్ ప్రమోటర్ల వాటా పెంపు!
న్యూఢిల్లీ: ఎడ్టెక్ కంపెనీ బైజూస్ వ్యవస్థాపకులు వాటాను పెంచుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. బైజు రవీంద్రన్, దివ్య గోకుల్నాథ్కు సంయుక్తంగా బైజూస్లో 25 శాతం వాటా ఉంది. ఈ వాటాను 40 శాతానికి పెంచుకునే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు సంబంధి వర్గాలు తెలియజేశాయి. ఇందుకు ఇన్వెస్టర్లతో చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించాయి. కాగా.. గతేడాది(2022) మే నెలలో బైజూస్ వ్యవస్థాపకులు తమ వాటాను 23 శాతం నుంచి 25 శాతానికి పెంచుకున్నారు. బైజు రవీంద్రన్ 80 కోట్ల డాలర్ల నిధులు చేకూర్చడం ద్వారా వాటా పెంపునకు తెరతీశారు. మార్చికల్లా కంపెనీ నష్టాలను వీడీ లాభాల బాటలోకి ప్రవేశించనున్నట్లు బైజూస్ పేర్కొంటోంది. 2020–21లో కంపెనీ రూ. 4,588 కోట్ల నష్టం ప్రకటించింది. అంతక్రితం 2019–20లో రూ. 232 కోట్ల నష్టం నమోదైంది. 2020లో సాధించిన రూ. 2,511 కోట్ల నుంచి ఆదాయం సైతం 2021లో రూ. 2,428 కోట్లకు నీరసించింది. చదవండి: ఫోన్పే, గూగుల్పే నుంచి పొరపాటున వేరే ఖాతాకు.. ఇలా చేస్తే మీ పైసలు వెనక్కి! -
అమెజాన్ సంచలన ప్రకటన.. భారత్లో ఆ ప్లాట్ఫాం బంద్!
ఇటీవల జరుగుతున్న అంతర్జాతీయ పరిణామాలును పరిశీలన, ఆపై వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగుల తొలగింపులు చేపడుతున్నట్లు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రకటించిన రెండు వారాల లోపే తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది. దేశంలోని హైస్కూల్ విద్యార్థుల కోసం ప్రారంభించిన తన ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫాంను మూసివేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ప్రస్తుత అకాడమిక్ సెషన్లో నమోదు చేసుకున్న వారికి పూర్తి రుసుమును రీఫండ్ చేస్తామని ఈకామర్స్ దిగ్గజం తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి సమయంలో వర్చువల్ లెర్నింగ్ డిమాండ్ పెరగడంతో ఈ ప్లాట్ఫాంను గత ఏడాది జనవరిలో ప్రారంభించింది. ఇందులో జేఈఈ (JEE)తో సహా పోటీ పరీక్షలకు కోచింగ్ను అందిస్తోంది. ఒక అంచనా ఆధారంగా.. ప్రస్తుత కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా అమెజాన్ అకాడమీని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. అయితే, కస్టమర్లు అక్టోబర్ 2024 వరకు పొడిగించిన సంవత్సరం పాటు పూర్తి కోర్సు మెటీరియల్ని ఆన్లైన్లో యాక్సెస్ చేయగలరని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడంతో విద్యాసంస్థలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఆన్లైన్ విద్యను అందిస్తోన్న పలు సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. దీని ఫలితమే.. ప్రముఖ ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్ ఇటీవలే 2,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపింది. ఇదే దారిలో అన్అకాడమీ, టాపర్, వైట్ హ్యాట్ జూ, వేదాంతు వంటి ఇతర కంపెనీలు కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో తొలగింపులను ప్రకటించాయి. చదవండి: Amazon Layoffs అమెజాన్ కొత్త ఎత్తుగడ, కేంద్రం భారీ షాక్! -
బైజూస్కు రూ.2,000 కోట్లు
న్యూఢిల్లీ: ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ తాజాగా రూ.2,000 కోట్ల నిధులను సమీకరించింది. ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీతోసహా ప్రస్తుత ఇన్వెస్టర్ల నుంచి ఈ మొత్తాన్ని అందుకున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. ఆదాయం, వృద్ధి, లాభదాయకత పరంగా 2022–23 ఉత్తమ సంవత్సరంగా నిలుస్తుందని బైజూస్ ఫౌండర్, సీఈవో బైజు రవీంద్రన్ ఈ సందర్భంగా తెలిపారు. గౌరవప్రద పెట్టుబడిదారుల నుండి నిరంతర మద్దతు సంస్థ ఇప్పటివరకు సృష్టించిన ప్రభావాన్ని, లాభదాయకతకు మార్గాన్ని ధృవీకరిస్తుందని చెప్పారు. 120కిపైగా దేశాల్లో 15 కోట్ల మంది బైజూస్ ఉత్పత్తులు, సేవలను వినియోగిస్తున్నారు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
అదే టార్గెట్, త్వరలో 10,000 మంది టీచర్లను నియమించుకుంటాం: బైజూస్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి లాభాల్లోకి వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఎడ్టెక్ కంపెనీ బైజూస్ వెల్లడించింది. 2020– 21లో కంపెనీ రూ.2,428 కోట్ల టర్నోవర్పై రూ.4,588 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. 2021– 22లో రూ.10,000 కోట్ల టర్నోవర్ సాధించింది. అయితే లాభం/నష్టాన్ని మాత్రం వెల్లడించలేదు. వచ్చే ఆరు నెలల్లో 2,500 మంది ఉద్యోగులను తీసివేస్తున్నట్టు బైజూస్ కో–ఫౌండర్ దివ్య గోకుల్నాథ్ తెలిపారు. అలాగే భారత్తోపాటు విదేశీ మార్కెట్ల కోసం 10,000 మంది టీచర్లను నియమించుకోనున్నట్టు పేర్కొన్నారు. ‘వీరిలో సగం మందిని భారత్ నుంచి ఎంచుకుంటాం. ఇంగ్లీష్, స్పానిష్ మాట్లాడే వారికి అవకాశాలు ఉంటాయి. టీచర్లను భారత్, యూఎస్ నుంచి ఎంపిక చేస్తాం’ అని వివరించారు. ప్రస్తుతం కంపెనీలో 50,000 మంది పనిచేస్తున్నారు. చదవండి: యూజర్లకు బంపరాఫర్.. రూ.10కే మూడు నెలల సబ్స్క్రిప్షన్! -
భారీగా ఉద్యోగాల కోత.. 2500 మందిని ఇంటికి పంపుతున్న స్టార్టప్ కంపెనీ!
ఇటీవల టెక్ కంపెనీలతో పాటు స్టార్టప్లు కూడా పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లు కనిపిస్తోంది. దేశంలో ప్రముఖ సంస్థల నుంచి చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు సైతం భారీగా తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. తాజాగా ప్రముఖ ఆన్లైన్ లెర్నింగ్ దిగ్గజం బైజూస్ కూడా భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కొత విధించేందుకు సిద్ధమైంది. ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్ సంస్థలోనూ కోతల పరంపర కొనసాగతోంది. ఇటీవల ఆలస్యంగా జరిపిన ఆడిట్ తర్వాత ఖర్చను తగ్గించుకోవాలని బైజూస్ భావిస్తోంది. ఈ క్రమంలో కంపెనీలో దాదాపు 5% ఉద్యోగులను తీసివేయాలిని నిర్ణయించుకుంది. ప్రాడెక్ట్, కంటెంట్, మీడియా, టెక్నాలజీ సాంకేతికత వంటి విభాగాలలో దశలవారీగా ఉద్యోగాలను తగ్గించనున్నట్లు తెలిపింది. దేశంలోని విద్యాసంస్థల్లో తరగతులు ప్రారంభం కావడంతో, ఆన్లైన్ బోధన జరిపే ఎడ్టెక్ సంస్థలకు ఆదరణ తగ్గుతోంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల కోతలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల దాదాపు 2,500 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఇప్పటికీ వరకు బైజూస్ ఈ స్థాయిలో తొలగింపులలో జరగలేదు. మీషో, కార్స్ 24, అనాకాడెమీతో సహా ఇతర స్టార్టప్లు ప్రపంచవ్యాప్తంగా మందగమనం, ఇన్వెస్టర్ల నుంచి పెరుగుతున్న ఒత్తిడి మధ్య కేపిటల్ ధనాన్ని ఆదా చేయడంతో పాటు పొదుపు మంత్రాన్ని పాటిస్తూ వర్క్ఫోర్స్ను తగ్గిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: దీపావళి షాపింగ్: ఈ స్పెషల్ ఆఫర్స్ తెలుసుకుంటే బోలెడు డబ్బు ఆదా! -
ఫోన్ బాధలు పడలేక: పన్నెండేళ్ల బుడతడి అరుదైన రికార్డు!
హరియాణాకు చెందిన బాలుడు అతి పిన్న వయస్కుడైన యాప్ డెవలపర్గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నాడు. పట్టుదల ఉండాలేగానీ, ఏదైనా సాధించవచ్చు అనడానికి నిదర్శనంగా 12 ఏళ్లకే ఈ ఘనతను సాధించాడు కార్తికేయ జఖర్. కేవలం యూట్యూబ్ ద్వారా మూడు లెర్నింగ్ యాప్లను స్వయంగా అభివృద్ధి చేయడం విశేషం. దీంతో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన యాప్ డెవలపర్గా రికార్డ్ సృష్టించాడు. ఝజ్జర్లోనికార్తికేయ జఖర్ జవవహర్ నవోదయ విద్యాలయంలో 8వ తరగతి చదువు కున్నాడు. ఎలాంటి శిక్షణ లేకుండానే మూడు లెర్నింగ్ అప్లికేషన్లను రూపొందించాడు. అంతేకాదు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీ కంప్యూటర్ సైన్స్లో BSc ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, స్కాలర్షిప్ కూడా గెలుచుకున్నాడు. ఇప్పుడు వర్సిటీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. దీనిపై కార్తికేయ జఖర్ మాట్లాడుతూ కోడింగ్ ప్రక్రియలో మొబైల్ ఫోన్ హ్యాంగ్ అయి పోవడం, ఇలా చాలా సమస్యలు ఫేస్ చేశాను. అయితే యూట్యూబ్ సాయంతో ఫోన్ని ఫిక్స్ చేసుకుని మరీ చదువు కొనసాగించానని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే జనరల్ నాలెడ్జ్ కోసం ఒకటి లూసెంట్ జి.కె. ఆన్లైన్, రెండోదిగా కోడింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ కోసం రామ్ కార్తీక్ లెర్నింగ్ సెంటర్, శ్రీరామ్ కార్తీక్ డిజిటల్ ఎడ్యుకేషన్ అనే మూడు యాప్లు రూపొందించానని తెలిపాడు ప్రస్తుతం 45,000 మందికి పైగా విద్యార్థులకు ఉచిత శిక్షణను అందిస్తున్నాడు. खेल, पढ़ाई व कला के बाद अब म्हारे बच्चे टेक्नोलॉजी में भी पूरे विश्व में हरियाणा का नाम रोशन कर रहे हैं। झज्जर के 12 वर्षीय छात्र कार्तिकेय ने लर्निंग ऐप विकसित कर सबसे कम उम्र के ऐप डेवलपर के रूप में गिनीज वर्ल्ड रिकॉर्ड बनाया है। उनके पूरे परिवार को बधाई एवं शुभकामनाएं। pic.twitter.com/1Twk0ZTW0o — Manohar Lal (@mlkhattar) August 5, 2022 (ఆగస్టు 15న ఓలా మరో సంచలనం: బీ రెడీ అంటున్న సీఈవో) కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆన్లైన్ తరగతులకు సుమారు రూ. 10వేల ఖరీదు చేసే మొబైల్ ఫోన్ కొనిచ్చారట కార్తికేయ తండ్రి. ఈ సమయంలో ఫోన్ స్క్రీన్ పాడై పోవడంతోపాటు, పలు సమస్యలొచ్చాయట. దీంతో తన మేధకు పదును పెట్టి మూడు యాప్స్ అభివృద్ధికి తెరతీశాడని జఖర్ తండ్రి అజిత్ జఖర్ చెప్పారు. తమ గ్రామంలో కరెంటు కోతలు, ఇంటర్నెట్, ఇతర సమస్యల సంక్షోభంలో కూడా అ మరోవైపు అతి పిన్న వయస్కుడైన యాప్ డెవలపర్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన జఖర్పై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ట్విటర్లో ప్రశంసించారు కేవలం క్రీడలు, సంస్కృతి , కళలు మాత్రమే కాదు, హర్యానా యువత ప్రపంచ స్థాయిలో సాంకేతికతలో ప్రశంసనీయమైన పని చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. -
అప్గ్రేడ్ చేతికి హరప్పా ఎడ్యుకేషన్
ముంబై: ఎడ్యుటెక్ సంస్థ హరప్పా ఎడ్యుకేషన్ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసినట్లు ఆన్లైన్ శిక్షణ ప్లాట్ఫాం అప్గ్రేడ్ వెల్లడించింది. ఇకపై వ్యవస్థాపకులతో పాటు హరప్పాలోని 180 మంది ఉద్యోగులు తమ సంస్థలో చేరతారని పేర్కొంది. ఈ కొనుగోలుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయం 65 శాతం వృద్ధి చెందగలదని, రూ. 4,000 కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపక చైర్మన్ రోనీ స్క్రూవాలా వివరించారు. హరప్పా ఎడ్యుకేషన్ను అప్గ్రేడ్ రూ. 300 కోట్లకు దక్కించుకుంది. 2015లో ఏర్పాటైన అప్గ్రేడ్ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,400 కోట్ల ఆదాయం నమోదు చేసింది. మరోవైపు, న్యూఢిల్లీకి చెందిన హరప్పా ఎడ్యుకేషన్కు ప్రమథ్ రాజ్ సిన్హా (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వ్యవస్థాపక డీన్) సహవ్యవస్థాపకులుగా ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 75 కోట్ల ఆదాయం ఆర్జించిన హరప్పా ఎడ్యుకేషన్ ఈసారి రూ. 250 కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకుంది. చదవండి: 5G Spectrum Auction: కంపెనీలు తగ్గేదేలే.. రికార్డ్ బ్రేక్, తొలి రోజు రూ.1.45లక్షల కోట్లు! -
హైబ్రిడ్ విద్యా విధానమే ఉత్తమం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థులు టెక్నాలజీకి విపరీతంగా అలవాటు పడకుండా హైబ్రిడ్ విద్యా విధానాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు రకాల పద్ధతుల ద్వారా బోధన జరగాలన్నారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలుపై ప్రధాని శనివారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఆన్లైన్ విధానం ఎక్కువ కావడంతో పిల్లలు టెక్నాలజీకి ఎక్కువగా అలవాటు పడుతున్నారని ప్రధాని హెచ్చరించారు. సమానత్వం, సమగ్రత, అనుసంధానం, నాణ్యమైన విద్య వంటి లక్ష్యాలతో జాతీయ విద్యా విధానాన్ని రూపొందించి , అమలు చేస్తున్నట్టు మోదీ చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో డేటాబేస్లన్నింటినీ, పాఠశాలల్లోని రికార్డులతో అనుసంధించాలని చెప్పారు. ఈ పరిజ్ఞాన సహకారంతో పాఠశాలల్లోనే పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించివచ్చునని ప్రధాని చెప్పినట్టుగా అధికారిక ప్రకటన వెల్లడించింది. డ్రాపవుట్ విద్యార్థుల్ని గుర్తించి బడి బాట పట్టించడానికి ఈ విధానం దృష్టి సారిస్తోందని ప్రధాని వివరించారు. -
AP: కొలువులు పట్టాలి
సాక్షి, అమరావతి: కర్నూలుకు చెందిన రాము ఎమ్మెస్సీ చదివాడు. నాలుగేళ్లుగా ఉద్యోగం కోసం పలు విధాలా ప్రయత్నించాడు. పలు సంస్థల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. వారడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాడు. త్వరలో ఇంటిమేట్ చేస్తామనేవారు. ఆ తర్వాత వారి నుంచి కాల్ వస్తుందని రోజుల తరబడి ఎదురు చూసినా ఫలితం ఉండేది కాదు. ఇటీవల మార్కెట్ ఓరియంటెడ్ కోర్సు పూర్తి చేయడంతో వెంటనే ఓ మంచి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇదే పని నాలుగేళ్ల క్రితమే చేసి ఉంటే ఈ పాటికి మంచి పొజిషన్లో ఉండేవాడినని చెబుతున్నాడు. ఇదే రీతిలో రాష్ట్రంలో ఎంతో మంది పోస్టు గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి వారందరికీ ఆయా డిగ్రీ కోర్సులు చదువుతున్నప్పుడే సంబంధిత రంగానికి సంబంధించి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉంటే ఇలా ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సి వచ్చేది కాదు. ఇకపై ఏ ఒక్క విద్యార్థికీ ఉన్నత చదువు తర్వాత ఉపాధి సమస్య ఎదురవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా నైపుణ్యంతో కూడిన విద్యను అందించేలా విద్యా విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ ► నేటి పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా విద్యార్థులకు మేలు చేసేలా క్లౌడ్ కంప్యూటింగ్, ఆక్వాకల్చర్ తదితర మార్కెట్ ఓరియెంటెడ్ కోర్సులకు శ్రీకారం చుట్టారు. ఆన్లైన్ ఆధారిత పరిజ్ఞానాన్ని అందించేందుకు లెర్నింగ్ మేనేజ్మెంటు సిస్టమ్ (ఎల్ఎంఎస్) ఏర్పాటు చేశారు. వివిధ సబ్జెక్టులకు సంబంధించిన వీడియో పాఠాలను దీనిద్వారా విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ► విద్యార్థుల కెరీర్ మరింత ఉజ్వలంగా ఉండేందుకు వారికి అవసరమైన శిక్షణ, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించేలా ఇంగ్లిష్ లాంగ్వేజ్ ల్యాబ్స్ వంటివి నెలకొల్పారు. ► విద్యార్థులు కేవలం సబ్జెక్టు అంశాలకే పరిమితం కాకుండా వారికి సామాజిక, నైతిక విలువలపై అవగాహన కలిపించేలా హ్యూమన్ వాల్యూస్, ప్రొఫెషనల్ ఎథిక్స్ (హెచ్వీపీఈ) అంశాలనూ బోధిస్తున్నారు. ► 144 కాలేజీల్లో వర్చువల్ క్లాస్ రూములను ఏర్పాటు చేయించి, అధునాతన విధానాల్లో బోధిస్తున్నారు. ఐసీటీ ఆధారిత బోధన, అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు 56 కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూములను నెలకొల్పారు. ► విద్యార్థుల్లో చైతన్యం నింపేందుకు 13 జిల్లాల్లో జిల్లా వనరుల కేంద్రాలను ఏర్పాటు చేయించారు. అధ్యాపకులు సరైన రీతిలో బోధన సాగిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి విద్యార్థులతోనే విద్యార్థి సంతృప్తి సర్వేలను నిర్వహిస్తూ లెక్చరర్ల పనితీరును బేరీజు వేస్తున్నారు. అధ్యాపకుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ ఆడిట్ను ఏర్పాటు చేశారు. ► జవహర్ నాలెడ్జి సెంటర్ల ద్వారా కూడా ఉపాధి నైపుణ్యాలలో శిక్షణ ఇస్తున్నారు. జాబ్ మేళాలు, క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లను నిర్వహిస్తూ లక్షలాది మంది విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. నాణ్యమైన విద్యే లక్ష్యం ► రాష్ట్రంలో నాన్ ప్రొఫెషనల్ కోర్సులు అందించే అన్ని డిగ్రీ కాలేజీలకూ నేషనల్ అసెస్మెంటు అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్), నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) సంస్థల నుంచి అత్యున్నత స్థాయి ర్యాంకుల గుర్తింపు ఉండాలని సీఎం వైఎస్ జగన్ నిర్ధేశించారు. ► ఉన్నత ప్రమాణాలతో అటానమస్ సంస్థలుగా వాటిని తీర్చిదిద్దాలన్న సీఎం ఆదేశాల మేరకు.. ఆ దిశగా కాలేజీ విద్యకు కొత్త రూపునిస్తూ అధికారులు అనేక చర్యలు చేపట్టారు. ఇవన్నీ ఇప్పుడు విద్యార్థులకు అందుబాటులోకి రావడంతోపాటు కాలేజీల రూపురేఖలు మారేందుకు దోహద పడుతున్నాయి. ► నాక్, ఎన్బీఏ గుర్తింపుతోపాటు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)లోనూ కాలేజీలు నిలిచేలా చర్యలు చేపడుతున్నారు. ఉపాధికి ఊతమిచ్చేలా కోర్సులు ► విద్యార్థులకు అండగా ఉండేలా వారికి భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా ప్రభుత్వం కాలేజీ విద్యలో అనేక కొత్త కోర్సులను ప్రారంభించింది. రాష్ట్రంలో 152 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 111 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, 1,022 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 3,65,563 సీట్లుండగా.. 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు మాత్రమే సీట్లు భర్తీ అవుతున్నాయి. ► కాలేజీ విద్యను పటిష్ట పరచడంలో భాగంగా ప్రమాణాలు పాటించని సంస్థల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా.. 30 మంది కన్నా తక్కువ చేరికలు ఉన్న కాలేజీలకు ముందుగా నోటీసులిచ్చి ఆ తర్వాత మూసివేతకు, కోర్సుల రద్దుకు ఆదేశాలిచ్చింది. ► ప్రభుత్వ కాలేజీల విషయంలో కూడా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే వారిని వేరే కాలేజీలకు తరలించేలా ఏర్పాట్లు చేసింది. అన్ని డిగ్రీ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలని నిర్ణయించి అమల్లోకి తెచ్చింది. పిల్లల చేరికలు లేనందున కొన్ని కాలేజీలు తెలుగు మాధ్యమ కోర్సులను రద్దు చేసుకున్నాయి. ► ఈ చర్యలన్నింటి వల్ల డిగ్రీతో పాటు నైపుణ్య శిక్షణ తప్పనిసరిగా ఇచ్చేందుకు పలు కాలేజీలు శ్రీకారం చుట్టాయి. తద్వారా రానున్న రోజుల్లో విద్యార్థులకు డిగ్రీ పూర్తి కాగానే ఉపాధి దొరికే అవకాశాలు బాగా పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ప్రతి విద్యార్థిని ఉన్నత ప్రమాణాలు, నైపుణ్యాలతో తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా అన్ని కాలేజీల్లో ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ‘కాలేజీ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్స్లెన్స్’ (సీపీఈ)గా అభివృద్ధి పరుస్తున్నాం. జిల్లాకొక కాలేజీని సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్గా ఉండేలా చూస్తున్నాం. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశాం. సిస్కో అకాడమీస్ ద్వారా విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు ఏర్పాట్లు చేయించాం. సీమెన్స్ సంస్థ ద్వారా టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లు ఏర్పాటయ్యాయి. పాలిటెక్నిక్ కాలేజీల్లో విద్యార్థులకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం, 500 డిజిటల్ తరగతులను సిద్ధం చేయించాం. డిగ్రీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కోర్సుల్లో ఇంటర్న్షిప్ను ప్రవేశపెట్టాం. – డాక్టర్ ఆదిమూలపు సురేష్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి -
ఆన్లైన్ క్లాసులూ నిర్వహించాలి..
సాక్షి, హైదరాబాద్: విద్యా సంస్థల్లో ఈ నెల 28 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్లైన్ బోధన కొనసాగించాలని ఆన్లైన్ బోధన కూడా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్రశర్మ, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్కుమార్ షావిలిలతో కూడిన ధర్మాస నం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కరో నాపై దాఖలైన పలు వేర్వేరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను గురువారం ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. వారాంతపు సంతల కంటే బార్లు, రెస్టారెంట్ల వల్లే ఎక్కువ ప్రమాదం ఉంటుందని వ్యాఖ్యానించింది. వీటి వద్దే ఎక్కువ మంది జనం ఉంటారని, ఇక్కడ కూడా కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవా లని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో రెండు వారా ల్లోగా నివేదించాలని కోరింది. అక్కడా అమలు చేయండి..: అన్ని మతపర మైన కార్యక్రమాల్లోనూ కోవిడ్ మార్గదర్శకాలు అమలు చేయాలని ఆదేశించింది. సమ్మక్క జాతరలో, సమతామూర్తి సహ స్రాబ్ది వేడుకల్లో కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడా లని ఏజీకి సూచిం చింది. నిర్లక్ష్యం వహిస్తే కరోనా ప్రబలే ప్రమాదం ఉంటుందని, అందుకే ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించగా.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్తో పాటు న్యాయ వాదులు పవన్, చిక్కుడు ప్రభాకర్ ఇతరులు వాదించారు. విచారణకు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు హాజరయ్యారు. పిల్లలకు చికిత్స కోసం ఏర్పాట్లు: పిల్లలకు చికిత్స కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆస్ప త్రుల్లో ఏర్పాట్లు చేసినట్లు శ్రీనివాసరావు వివరిం చారు. మేడారం జాతరలో ప్రభుత్వం కోవిడ్ జాగ్రత్తలన్నీ తీసుకుంటుందని చెప్పారు. కరోనా తీవ్రత ఎక్కువగా లేనందునే విద్యా సంస్థలను తెరిచా మని, విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని విద్యా సంవత్సరం నష్టపో కుండా చర్యలు తీసుకున్నామంటూ విద్యా శాఖ విడిగా నివేదిక అందజేసింది. కాగా ప్రభుత్వం తీసుకున్న చర్యల నివేదికను ఈ నెల 28న జరిగే విచారణ నాటికి అందించాలని ధర్మాసనం ఆదేశించింది. -
ఎక్కడి వాళ్లక్కడే..మళ్లీ మొదలైన ఆన్లైన్ బోధన..! వాళ్లకి తప్పని తిప్పలు..
సాక్షి, హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతున్నాయని రాష్ట్ర సర్కారు విద్యార్థుల సెలవులను పొడిగించడంతో సంక్రాంతికి ఊళ్లకెళ్లిన విద్యార్థులు ఎక్కడివాళ్లు అక్కడే ఆగిపోయారు. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఇతర ఉన్నత విద్యా కోర్సులను ఆన్లైన్లో నిర్వహించాలనే స్పష్టత వచ్చినా పాఠశాల విద్యపై ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంది. అప్పటి వరకూ పదవ తరగతిలోపు విద్యార్థులకు బోధన దూరమయ్యే వాతావరణం నెలకొంది. అయితే ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్లైన్లో క్లాసులు చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. నెట్కు అందుబాటులో ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్వాహకులు ఫోన్లు చేస్తున్నారు. మరోవైపు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యా సంస్థలను కొనసాగించాలనే డిమాండ్ వస్తుండగా దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు భిన్నంగా స్పందిస్తున్నా రు. ‘స్కూళ్లు తెరిచినా పిల్లలను ఎలా పంపుతాం’అని కొంతమంది, ‘ఇప్పటికే రెండేళ్లుగా క్లాసులు నడవక విద్యార్థులు నష్టపోయారు. అన్నీ మరిచిపోతున్నారు’అని మరికొంతమంది అంటు న్నారు. కోవిడ్ వల్ల సరైన బోధన లేక పిల్లలు నష్టపోతున్నారని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. దీంతో విద్యా వ్యవస్థలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఆన్లైన్ క్లాసులకు ఇంకా సమయం పట్టొచ్చని అధికారులు అంటున్నారు. పల్లెల్లో తిప్పలు: ఆన్లైన్ బోధన పట్ల మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులు విముఖత చూపుతున్నారు. తమ ప్రాం తాల్లో నెట్ సౌకర్యం లేదని, మొబైల్ ద్వారా క్లాసు లు వింటుంటే అంతరాయం కలుగుతోందని చెబుతున్నారు. మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులే ఇటీవలి ఇంటర్ ఫస్టియర్లో ఎక్కువగా ఫెయిల్ అయ్యారు. ఫస్టియర్లో 49% మందే పాసవడానికి ఆన్లైన్ క్లాసుల్లో అంతరాయం, నెట్ సౌక ర్యం లేకపోవడమే కారణమని అధ్యాపకులూ అంగీకరిస్తున్నారు. కోవిడ్ కారణంగా సంక్షేమ హాస్టళ్లు కూడా ఓపెన్ చేసే వీలుండదని, ఈ నేపథ్యంలో ఊళ్లకు వెళ్లి పాఠాలు వినడం సమస్యేనని వాళ్లు చెబుతున్నారు. ఇలా నెట్ సౌకర్యానికి దూరంగా ఉన్న విద్యార్థులు దాదాపు 2.5 లక్షల వరకూ ఉం టారని ఓ అధికారి అంచనా వేశారు. ఇంటర్, పైస్థాయి విద్యార్థులైతే బంధువుల ఇళ్లకు వెళ్లి చదువుకునే వీలుందని, చిన్న క్లాసుల విద్యార్థులకు తల్లిదండ్రులు ఈ వెసులుబాటు ఇచ్చే వీలుండదని చెబుతున్నారు. వేచి చూసే ఆలోచనలో ప్రైవేటు యాజమాన్యాలు సంక్రాంతి సెలవుల కోసం ఊరెళ్లిన విద్యార్థులు పట్టణాలకు తిరిగి రావడంపై పునరాలోచన చేస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థులు తాముండే ప్రాంతాలకు వచ్చేందుకు సమయం కోరుతున్నారని ఓ ప్రైవేటు కాలేజీ ప్రిన్సిపాల్ తెలిపారు. పరిస్థితి తీవ్రమైతే హాస్టళ్లు మూసివేసే ప్రమాదం ఉందనే ఆందోళన వారిలో కన్పిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులకు కొంత సమయం ఇవ్వాలని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఇవన్నీ ఎంసెట్, జేఈఈ, నీట్ సహా ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఇలా చేస్తే ప్రమాణాలు పాతర కరోనా పేరుతో స్కూళ్లు మూసేస్తే విద్యా ప్రమాణాలు ఘోరంగా దెబ్బతింటాయని తెలంగాణ గుర్తింపు పొందిన స్కూళ్ల యాజమాన్య సంఘం నేతలు కందాల పాపిరెడ్డి, ఎన్రెడ్డి అన్నారు. కేసులు ఎక్కువ ఉన్న అమెరికాలోనే మూసేయలేదని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్కూళ్లు నడపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విద్యా మంత్రి సబితారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. సెలవులపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. స్కూళ్లు తెరిచినా పంపగలమా? నా కొడుకు అంబర్పేట వివేకానంద ప్రభుత్వ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. నేనుండే ప్రాంతంలో కోవిడ్ కేసులు ఎక్కు వగా వస్తున్నాయి. పండగకు భీమవరం వెళ్లిన నా కొడుకును రావొద్దని, అమ్మమ్మ ఇంటి వద్దే ఉండమని చెప్పా. స్కూలు తెరిచినా ఈ పరిస్థితుల్లో ఎలా పంపుతాం? – ముత్యాలరావు, హైదరాబాద్ (విద్యార్థి తండ్రి) ఇప్పుడే హైదరాబాద్ వద్దంటున్నారు నేను హైదరాబాద్లో ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్నాను. నీట్కు ప్రిపేరవుతున్నా. సంక్రాంతికి మహబూబాబాద్ దగ్గర ఉండే మా ఊరికి వెళ్లాను. తిరిగి హైదరాబాద్ వద్దామంటే మా వాళ్లు పంపట్లేదు. సెలవులు పొడి గించారుగా.. నీట్కు ఇంటి వద్దే ప్రిపేరవ్వు అంటున్నారు. పుస్తకాలన్నీ హైదరాబాద్ హాస్టల్లో ఉన్నాయి. –శ్రావణి (ఇంటర్ విద్యార్థిని) -
ఆన్లైన్.. కొత్త సారు.. ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ
ఆన్లైన్ క్లాస్ జరుగుతోంది.. టీచర్ సౌర కుటుంబం గురించి పాఠం చెప్తున్నారు.. గ్రహాలు, ఇతర అంశాల గురించి టీచర్ వివరిస్తున్న కొద్దీ.. స్క్రీన్పై ఒక్కొక్కటిగా స్పష్టంగా అర్థమయ్యేలా కనిపిస్తున్నాయి. కిడ్నీ పాఠం చెప్తున్నప్పుడు కిడ్నీ లోపలి భాగాలు, కణాల తీరు.. విత్తనం మొక్కగా మారే పాఠం వివరిస్తున్నప్పుడు విత్తనంలో జరిగే మార్పుల నుంచి మొక్క ఎదిగేదాకా.. స్పష్టంగా ఫోన్ తెరపై కనిపిస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరంలో మన ముందుకు కొత్త టీచర్లు వస్తున్నారు. ఆన్లైన్ పాఠాలైనా సరే.. తరగతి గదిలో కన్నా మెరుగ్గా నేర్పించనున్నారు. విద్యార్థుల నైపుణ్యాలను, అవగాహనను మరింత పెంచేలా అద్భుతంగా బోధించనున్నారు. వారే ‘డిజిటల్ టీచర్లు..’ వారికి తోడ్పడే సరికొత్త విధానాలే అగుమెంటెడ్, వర్చువల్ రియాలిటీలు. పాఠశాలల్లో కాస్త మౌలిక సదుపాయాలు, విద్యార్థుల దగ్గర ఇంటర్నెట్తో కూడిన స్మార్ట్ఫోన్/ట్యాబ్లెట్ ఉంటే చాలు. తక్కువ ఖర్చుతోనే అత్యుత్తమ విద్య అందించేందుకు వీలయ్యే అద్భుతమైన యాప్లు, వెబ్సైట్లు, సాంకేతిక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్లు, ఆంక్షలతో విద్యా బోధనపై ప్రభావం పడింది. దానితో ఆన్లైన్ విద్యా విధానంపై విస్తృతంగా పరిశోధనలు జరిగి.. మెరుగైన బోధనా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే పలు పాఠశాలల్లో ఈ విధానాలపై చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలను ఇచ్చాయి కూడా. రెండు సాంకేతికతలతో.. ఆన్లైన్ బోధన అంటే ఇప్పటిదాకా చాలా మందికి తెలిసినది ఏమిటంటే.. తరగతి గదిలో టీచర్ పాఠం చెబుతుంటే, విద్యార్థులు సెల్ఫోన్లోనో, కంప్యూటర్లోనో చూస్తూ వినడమే. విద్యార్థికి పాఠం అర్థమవుతోందా? అసలు వింటున్నారా? లేదా? ఏదైనా సందేహం తీర్చుకోవాలనుకుంటున్నారా? అనేది తెలియడం కష్టమే. అంతేకాదు విద్యార్థులకు ఎంతమేర అర్థమైందన్నది బేరీజు వేసేందుకు పరీక్షలు లేకపోవడం మరో సమస్య. కానీ కొత్తగా అందుబాటులోకి వచ్చిన యాప్స్, వెబ్సైట్లు, ఇతర ఆన్లైన్ విధానాలతో ఈ పరిస్థితి సమూలంగా మారబోతోంది. ఈ క్రమంలో ప్రధానంగా అగుమెంటేషన్, వర్చువల్ రియాలిటీ అనే రెండు పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ► అగుమెంటేషన్ విధానంలో టీచర్ పాఠం చెప్తుండగానే.. విద్యార్థులు ఆయా అంశాలను అనుభవ పూర్వకంగా పరిశీలించగలిగే అవకాశం ఉం టుంది. ఉదాహరణకు మొక్క ఎదుగుదల పా ఠం చెబుతుంటే.. విత్తనం నుంచి మొక్కగా, చెట్టుగా ఎలా మారుతుందనే దృశ్యాలు స్క్రీన్పై కనిపిస్తాయి. టీచర్ నేరుగా మొక్కల మధ్య ఉండి పాఠం చెప్పినట్టుగా అనుభూతి కలుగుతుంది. ► వర్చువల్ రియాలిటీ విధానంలో కీలక అంశాలను అత్యంత సులువగా అర్థమయ్యేలా బోధించవచ్చు. ఉదాహరణకు టీచర్ సౌర కుటుంబం గురించి పాఠం చెప్తున్నప్పుడు.. టీచర్ ఒక్కో అంశాన్ని వివరిస్తున్న కొద్దీ దానికి సంబంధించిన చిత్రాలు కనిపిస్తుంటాయి. ప్రాక్టికల్గా ఆ అంశం తెలుసుకునే అనుభూతి వస్తుంది. సైన్స్ సబ్జెక్టుల్లో దీని ప్రాధాన్యత ఎక్కువ. కిడ్నీ గురించి చదివేటప్పుడు కిడ్నీని లోపలి నుంచి పరిశీలిస్తున్న అనుభూతి ఉంటుంది. అందుబాటులో ఎన్నో యాప్స్, వెబ్సైట్స్.. ► విద్యార్థులకు సులువైన రీతిలో విద్యా బోధన కోసం ఎన్నో యాప్స్, వెబ్సైట్స్ అందుబాటులోకి వచ్చాయి. పాఠశాలల్లో టీచర్లు ఆ యాప్స్/వెబ్సైట్స్లో తాము బోధించే పాఠాలను ముందే రూపొందించుకోవచ్చు. బోధిస్తున్న సమయంలో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా కాన్సెప్టులను, గ్రాఫిక్స్ను, చిత్రాలను.. త్రీడీ, అగుమెంటెడ్, వర్చువల్ రియాలిటీ పద్ధతుల్లో సిద్ధం చేసుకోవచ్చు. ► ఎడ్ పజిల్ యాప్ ద్వారా టీచర్ పాఠం చెప్తున్నప్పుడు విద్యార్థులను మధ్యలో ప్రశ్నలు అడిగే సాంకేతికత ఉంటుంది. అందులో ఎంత మంది అలర్ట్గా ఉన్నారనేది టీచర్ పసిగట్టవచ్చు. వారి సామర్థ్యాలను అంచనా వేయవచ్చు. ► ఆన్లైన్ వీడియో పాఠాలు వినే సమయంలో ఎడ్మోడో యాప్ ద్వారా.. విద్యార్థి ఏమేర విన్నాడనేది అంచనా వేయవచ్చు. ఇందుకోసం మధ్యలో కొన్ని ప్రశ్నలు వేస్తారు. సమాధానం చెబితేనే వీడియో ముందుకు కదులుతుంది. ► ప్లిప్గ్రిడ్ అనే మరో సాంకేతికత ద్వారా టీచర్ ఒక ప్రశ్న వేస్తే ఎవరెవరు ఏమేం సమాధానాలు చెప్పారనేది విడివిడిగా నమోదవుతుంది. టీచర్ వాటిని విశ్లేషించుకునే అవకాశం ఉంటుంది. ► నియర్పాడ్ యాప్/వెబ్సైట్ అద్భుతమైన విద్యా బోధనకు తోడ్పడుతుంది. బ్లాక్బోర్డ్ అవసరమే లేకుండా.. దాదాపు బోధన అంతా పూర్తిచేసేందుకు వీలు కల్పిస్తుంది. టీచర్ బోధించడంతోపాటు ఏదైనా రాసినా, ప్రశ్న వేసినా విద్యార్థులు తరగతి గదిలోనే ఉండి నేర్చుకున్న అనుభూతిని కలిగించగలుగుతుంది. అదే విధంగా విద్యార్థుల అవగాహన, నైపుణ్యాలను, వారు ఎంత అప్రమత్తంగా ఉంటున్నారన్నది ఎప్పటికప్పుడు గమనించే వీలుంటుంది. ► వీటితోపాటు పాఠాలపై విద్యార్థుల ఒపీనియన్ పోల్స్, వీకెండ్ ఎగ్జామ్స్, నెలవారీ అసెస్మెంట్ వంటివీ యాప్ల ద్వారా సాధ్యమవుతాయి. ► ఇక విద్యార్థుల మానసికోల్లాసాన్ని పెంచే మ్యూజికల్, ఏరోబిక్స్ మిక్స్, నృత్యం, ఆర్ట్స్ అండ్ క్రాప్ట్ట్, చిత్ర లేఖనం, పజిల్స్ అండ్ రిడిల్స్, మ్యాప్ పాయింటింగ్, ఫ్యాక్ట్స్ ఆఫ్ ది వరల్డ్, ఫోనిక్స్, కథలు చెప్పడం వంటివాటికీ ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. పాఠాలు ఆసక్తిగా ఉన్నాయి కరోనా సమయంలో హైదరాబాద్లో పెద్దమ్మ వాళ్ల ఇంటికి వచ్చాను. వారి అబ్బాయి, నేను ఇద్దరం ఒకే తరగతికావడంతో.. అతడి ఆన్లైన్ క్లాసుల పాఠాలన్నీ నేను కూడా విన్నాను. మా దగ్గర చెప్పే పాఠాల కంటే ఇక్కడ సులువుగా అర్థమయ్యాయి. సైన్స్ క్లాసులు చాలా బాగున్నాయి. నిజంగా నేను మొక్కల దగ్గరే ఉండి తెలుసుకున్నాననే ఫీలింగ్ వచ్చింది. – సాయి ప్రణీత్, పదో తరగతి విద్యార్థి, వరంగల్ విద్యార్థుల్లో నైపుణ్యం పెరిగింది.. హైదరాబాద్లోని బ్రూక్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్లో కరోనా సమయంలో అత్యాధునిక సాంకేతికత, కొత్త యాప్స్తో ఆన్లైన్ బోధన నిర్వహించారు. విద్యార్థుల్లో 83శాతం మంది గతం కన్నా మెరుగైన రీతిలో విద్యా ప్రమాణాలు కనబర్చినట్టు తేల్చారు. ‘‘తొలుత 64 శాతం మంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసులను శ్రద్ధగా వినకపోవడం గమనించాం. దీనిని యాప్ ద్వారా పసిగట్టి వారిని ప్రోత్సహించాం. 53 శాతం మందిలో మార్పు వచ్చింది. చాలా మంది లెర్నింగ్ లాస్ లేకుండా ప్రతిభ చూపుతున్నారు’’ అని బ్రూక్ఫీల్డ్ స్కూల్ డైరెక్టర్ రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఉచితంగా అందించగల సాంకేతికతతో విదేశాల్లో విద్యకు సంబంధించిన ఆన్లైన్ సాంకేతికతను అందరికీ అందుబాటులో ఉండేలా (ఓపెన్ ప్లాట్ఫాంపై) అందుబాటులోకి తెచ్చా రు. ఆ యాప్స్ అన్నీ మనం వాడుకోవచ్చు. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 550 పాఠశాలల్లో టీచర్లకు దీనిపై శిక్షణ ఇచ్చాం. వీటిద్వారా బోధించినప్పుడు మంచి ఫలితాలు వస్తున్నాయని పాఠశాలల యాజమాన్యాలు చెప్తు న్నాయి. ఇందులో శిక్షణ, మౌలిక సదుపాయాల కోసం తప్ప పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. విద్యార్థులను పరిశోధన స్థాయికి తీసుకెళ్లే సరికొత్త బోధనగా దీన్ని చూడాలి. – పన్నేరు భానుప్రసాద్, సీఈవో, సూపర్ టీచర్ ఎడ్యు రిఫామ్స్ బోధనలో సరికొత్త విప్లవం.. మా విద్యాసంస్థల్లో 4 వేల మంది చదువుతున్నారు. వారందరికీ కొత్త టెక్నాలజీతో ఆన్లైన్ బోధన నిర్వహించాం. చాలా మంది విద్యార్థులు ప్రత్యక్ష బోధనకన్నా ఈ క్లాసులు బాగున్నాయని అంటున్నారు. పిల్లల్లో నైపుణ్యాలు గతంలో కన్నా ఎక్కువగా కన్పిస్తున్నాయి. ముఖ్యంగా సైన్స్, గణితం వంటి సబ్జెక్టుల్లో త్రీడీ టెక్నాలజీ సరికొత్త విప్లవం సృష్టిస్తోంది. కరోనా కాలమనే కాదు.. భవిష్యత్లో దీనిని కొనసాగించాలని భావిస్తున్నాం. – ఆర్.పార్వతీరెడ్డి, హార్వెస్ట్ స్కూల్ ప్రిన్సిపాల్, ఖమ్మం -
పల్లెల్లో డిజి‘డల్’!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ విద్య పల్లెల వరకు చేరనట్టు కనిపిస్తోంది. గ్రామీణ విద్యార్థులు ఇంటర్నెట్ వేగాన్ని అందుకోనట్టు తెలుస్తోంది. ఆన్లైన్ చదువుకు కావాల్సిన వస్తువుల కోసం ఖర్చు చేసే స్థోమత పల్లె విద్యార్థులకు లేకపోవడం, ఎలాగో కష్టపడి తెచ్చుకున్నా అరకొర ఇంటర్నెట్తో చదువుకునేందుకు ఇబ్బంది పడినట్టు అనిపిస్తోంది. తాజా ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు ఈ సందేహా లను లేవనెత్తాయి. కరోనా లాక్డౌన్తో.. 2020లో కరోనా లాక్డౌన్ పెట్టడంతో సాధారణ ప్రజలతో పాటు విద్యార్థులూ మారుమూల గ్రామా లకు వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో ఆన్లైన్ బోధన తెరమీదికొచ్చింది. కానీ అప్పటికప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడం పల్లె విద్యార్థులకు సాధ్యం కాలేదు. ఆన్లైన్ విద్యకు ఉపకరణాలు సమకూర్చుకోవడంలో వెనుక బడ్డారు. ఎలాగోలా కష్టపడి తెచ్చుకున్నా అరకొర ఇంటర్నెట్, అంతరాయాలతో ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వ కాలేజీల అధ్యాపకులు కూడా ఆన్లైన్కు అంతగా ఆసక్తి చూపలేదు. కాలేజీల్లో మౌలిక సదుపాయాలు లేవన్నారు. సంక్షేమ హాస్టళ్లను మూసేయడంతో పేద విద్యార్థులు ఇళ్లకు వెళ్లారు. అప్పటికీ ఇంటర్ సిలబస్ 30 శాతం తగ్గించినా గ్రామీణ విద్యార్థులు వేగంగా ముందుకెళ్లలేక పోయారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఎక్కు వుండే సూర్యాపేట, మహబూబాబాద్, వనపర్తి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఇంటర్ ఉత్తీర్ణత 45 శాతం కన్నా తక్కువే నమోదైంది. అరకొరగా పాసైనా వాళ్ల మార్కుల గ్రేడ్ సగటున 50 శాతం దాటలేదు. దాదాపు లక్ష మందికి పైగా విద్యార్థులు ఆన్లైన్ స్పీడ్ను అందుకోలేదని ఫలితాలను బట్టి తెలుస్తోంది. పట్టణాలకే పరిమితమైందా? సాధారణంగా ఇంటర్ విద్యకు ఎక్కువ మంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీలకే ప్రాధాన్యమిస్తున్నారు. హాస్టళ్లలో ఉండి చదువుకుం టున్నారు. కరోనా వల్ల ప్రైవేటు కాలేజీల్లో ఆన్లైన్ విద్యాబోధనకు ప్రాధాన్యమిచ్చారు. విద్యార్థులూ పట్టణాల్లో ఉండటంతో నెట్ సమస్యలు రాలేదు. ఆ సమయంలో వచ్చిన కొత్త యాప్లూ పట్టణ విద్యార్థులకు ఉపయోగపడ్డాయి. ఫలితంగా పట్టణాల్లో ఉత్తీర్ణత ఎక్కువగా కన్పిస్తోంది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్లలో 50 నుంచి 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీళ్లలో ఎక్కువ మంది 75 శాతం మార్కులతో ‘ఏ’ గ్రేడ్ సాధించారు. దీన్ని బట్టి ఆన్లైన్ విద్య పట్టణాలకే పరిమితమైందని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. ఎవరిదీ వైఫల్యం? 220 రోజులు జరగాల్సిన ప్రత్యక్ష బోధన 60 రోజులే సాగింది. 60 శాతం వరకూ వచ్చే ఫలి తాలు 49 శాతం దగ్గరే ఆగాయి. దీన్నిబట్టి ఆన్ లైన్ బోధన గ్రామీణ విద్యార్థులను చేరుకోలే దని గుర్తించాలి. ఈ వైఫల్యంపై ఆత్మ పరిశీలన జరగాలి. నష్టపోయేది ఊళ్లల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలేనని తెలుసుకోవాలి. – డాక్టర్ పి. మధుసూదన్ రెడ్డి ,(ఇంటర్ విద్యార్థి జేఏసీ చైర్మన్) పాఠం వినే అవకాశమేది? ప్రభుత్వ హాస్టల్లో సీటొచ్చింది. కానీ కరోనా వల్ల మూసేశారు. మా ఊర్లో టీవీ కనెక్షన్లు లేవు. మొబైల్ సిగ్నల్ సరిగా రాదు. ఊరికి దూరంగా వెళ్తేనే సిగ్నల్ వచ్చేది. దీంతో ఆన్ లైన్ క్లాసులకు కష్టమైంది. ఈ మధ్యే కాలేజీలు తెరిచారు. హాస్టళ్లు ఆలస్యమయ్యాయి. దీంతో ఫస్టియర్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాను. – ఎ. శంకర్ (అడవి ముత్తారం,కరీంనగర్ జిల్లా) -
ఆన్లైన్లోనూ అత్యుత్తమ బోధన
Sushma Boppana About Infinity Learn: కోవిడ్ తర్వాత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆన్లైన్ అభ్యసనానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీచైతన్య విద్యాసంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ఇన్ఫినిటీ లెర్న్’ అనే ఎడ్యుటెక్ సంస్థను ప్రారంభించింది. నీట్, జేఈఈ విద్యార్థులకు ఆన్లైన్ కోర్సులు అందిస్తోంది. మూడు దశాబ్దాలకు పైగా బోధనానునుభవంతో ఆన్లైన్లోనూ అత్యుత్తమ శిక్షణ అందించి విద్యార్థుల సమగ్ర అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని ‘ఇన్ఫినిటీ లెర్న్’ సహ వ్యవస్థాపకురాలు సుష్మ బొప్పన పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ఇన్ఫినిటీ లెర్న్’ గురించి ఆమె మాటల్లోనే... నాణ్యమైన కంటెంట్ ఇతర సంస్థలకు భిన్నంగా నాణ్యమైన కంటెంట్ అందించే ప్రధాన లక్ష్యంగా ‘ఇన్ఫినిటీ లెర్న్’ను తీర్చిదిద్దాం. ఆఫ్లైన్లో బోధిస్తున్న విధానానికి దీటుగా డిజిటల్లోనూ అత్యుత్తమ శిక్షణ అందించే ఏర్పాటు చేశాం. విద్యార్థులకు కేవలం ఆన్లైన్లో పాఠాలు చెప్పడం, హోమ్వర్క్లు కేటాయించడమే కాకుండా ఆ విద్యార్థికి సబ్జెక్టుపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాం. గత 36 ఏళ్లుగా శ్రీచైతన్య విద్యాసంస్థల ద్వారా సాధించిన అనుభవం ఈ వ్యూహాలు అమలు చేయడానికి ఉపయోగపడుతున్నాయి. నీట్, జేఈఈపై దృష్టి మొదటగా నీట్, జేఈఈపై దృష్టి సారించాం. నీట్ లాంగ్టర్మ్ శిక్షణకు దేశవ్యాప్తంగా విద్యార్థులు చేరుతున్నారు. టెస్ట్ సిరీస్కూ ఆదరణ లభిస్తోంది. 2023 నాటికి జాతీయ స్థాయి పోటీ పరీక్షలతోపాటు సివిల్ సర్వీసెస్ కోచింగ్, ఇంగ్లీషు లాంగ్వేజ్ పాఠాలు, కంప్యూటర్ కోర్సులు అందించే ఆలోచన ఉంది. 2024 నాటికి శ్రీచైతన్య విద్యార్థులు కాకుండా మరో 10 లక్షల మంది విద్యార్థులు నేరుగా ‘ఇన్ఫినిటీ లెర్న్’ ప్రయోజనాలు పొందేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ‘అమెజాన్ అకాడమీ’తోనూ ఒప్పందం కుదుర్చుకుని నీట్, జేఈఈ పరీక్షల పూర్తి కోర్సులను అందిస్తున్నాం. నీట్–2021లో రికార్డుస్థాయి ఫలితాలు సాధించాం. వచ్చే ఏడాది మరిన్ని ర్యాంకులు సాధించే అవకాశం ఉంది. ప్రణాళిక, పర్యవేక్షణ ఇన్ఫినిటీ లెర్న్లో విద్యార్థి స్థాయికనుగుణంగా బోధన ఉంటుంది. అప్పుడే విద్యార్థుల్లో విశ్వాసం పెరుగుతుందనేది మా నమ్మకం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కాన్సెప్ట్ ఓరియెంటెడ్, ప్రాబ్లమ్ ఓరియెంటెడ్, న్యూమరికల్ అంశాలుగా విద్యార్థుల అవసరాల మేరకు కంటెంట్ అందిస్తున్నాం. ఆన్ౖలñ న్లో విద్యార్థి ఏ విధంగా నేర్చుకుంటున్నారో తెలుసుకునే విధంగా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. తరగతిలో నేర్చుకున్న అంశాలను హోమ్ వర్క్ ద్వారా సాధన చేయడం, అందులో విద్యార్థులకు ఎదురైన అనుభవాలు, సందేహాలు నివేదికల రూపంలో అధ్యాపకుడికి చే రతాయి. వాటిని తర్వాత తరగతిలో ఉపాధ్యాయుడు విశ్లేషించి సందేహాలుంటే నివృత్తి చేస్తారు. దీంతో ఎప్పటికప్పుడు అంశాలపై పట్టు పెంచుకునే అవకాశం ఉంటుంది. అప్పుడే వారు పరీక్షల్లోనూ రాణించగలుగుతారు. టెక్నాలజీ వినియోగం తరగతి గదిలో స్మార్ట్ బోర్డులను ఏర్పాటు చేసి ‘హైబ్రిడ్ ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ ప్రోగ్రామ్’ను రూపొందించాం. నీట్ లాంగ్టర్మ్ విద్యార్థులందరికీ దీన్ని అమలు చేస్తున్నాం. తద్వారా ఆన్లైన్ ప్లాట్ఫాంను మరింత మెరుగుపరుస్తున్నాం. ఉపాధ్యాయ ఆధారిత బోధన కంటే విషయ ఆధారిత బోధనకు ప్రాధాన్యతనిస్తున్నాం. విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు వినేటపుడు టెక్నాలజీ సమస్యలు తలెత్తకుండా అప్లికేషన్ తయారుచేశాం. పాఠాలు, స్టడీమెటీరియల్, యానిమేషన్ అంశాలను జోడించి బోధన సాగిస్తున్నాం. స్కాలర్షిప్ టెస్ట్ శ్రీచైతన్య విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులతోపాటు ఇతర విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల అవసరాలు తీర్చేలా దీన్ని రూపొందించాం. ముఖ్యంగా గ్రామీణప్రాంతాల్లో నిపుణులైన అధ్యాపకులు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులోలేనిచోట విద్యార్థులకు ప్రయోజనం కలగాలని భావించాం. నామమాత్రపు ధర నిర్ణయించి కోర్సులను అందిస్తున్నాం. రూ.99 నుంచి కోర్సు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ‘స్కోర్’ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా దీర్ఘకాలిక శిక్షణ అందిస్తున్నాం. -
చదువుతోనే సంపూర్ణత్వం
‘చదువు మనిషిని పూర్తి మానవుడిగా తీర్చిదిద్దుతుంది; చర్చ సంసిద్ధ మానవుడిగా తీర్చిదిద్దుతుంది; రాత కచ్చితమైన మానవునిగా తీర్చిదిద్దుతుంది’ అని పదహారో శతాబ్దినాటి బ్రిటిష్ రాజనీతిజ్ఞుడు ఫ్రాన్సిస్ బేకన్ అన్నాడు. సమాజంలో మనిషి తలరాతను మార్చేది చదువు మాత్రమే! చదువుకు బాల్యంలోనే బలమైన పునాదులు పడాలి. అలా జరిగినప్పుడే భావిపౌరులు దేశానికి భాగ్యవిధాతలు కాగలుగుతారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గడచిన ఏడున్నర దశాబ్దాలలో ఊరూరా వీధిబడులు మొదలుకొని ప్రధాన పట్టణాల్లో విశ్వవిద్యాలయాల వరకు సంఖ్యాపరంగా చదువుల నెలవులు పెరిగాయి. చదువుల ధోరణిలో పెనుమార్పులే వచ్చాయి. గడచిన మూడు దశాబ్దాల కాలంలో ప్రైవేటు విద్యాసంస్థల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. వీటి ప్రభావంతో విద్యార్థుల మీద ర్యాంకుల కోసం ఒత్తిడి విపరీతంగా పెరిగింది. సిలబస్ను పూర్తిచేయడం, పరీక్షలకు సిద్ధం కావడం వరకే విద్యార్థుల జీవితాలు పరిమితమైనాయి. సిలబస్కు వెలుపల ఏమున్నదో పిల్లలను కన్నెత్తి చూడనివ్వని కట్టుదిట్టమైన కాపలాతో వర్ధిల్లే ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూళ్ల ఘనత చెప్పాలంటే, ఒక గ్రంథమే అవుతుంది. సిలబస్ ఒత్తిడిలో నలిగిపోయిన పిల్లలు విజ్ఞాన వినోదాలను పంచిపెట్టే పుస్తకాలకు క్రమంగా దూరమయ్యే ధోరణి మొదలైంది. దేశవ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి! తెలుగునాట ఈ పరిస్థితికి పర్యవసానమే పిల్లల పత్రికలు మూతబడటం. కొన్నితరాల పాటు ఆబాల గోపాలాన్నీ ఉర్రూతలూగించిన ‘చందమామ’ వంటి పత్రికలు చరిత్రలో కలిసిపోయాయి. కొన ఊపిరితో మనుగడ సాగించిన ఒకటీ అరా పిల్లల పత్రికలు సైతం ‘కోవిడ్’ మహమ్మారి దెబ్బకు మూతబడ్డాయి. టీవీలు, స్మార్ట్ఫోన్లు పిల్లలను చదువులకు దూరం చేస్తున్నాయనే వాదనలో నిజం లేకపోలేదు. ‘కరోనా’ లాక్డౌన్ కాలంలోనైతే, దాదాపు 65 శాతం పిల్లలు పూర్తిగా స్మార్ట్ఫోన్లకు, ట్యాబ్లకు బానిసలుగా మారినట్లు జైపూర్ వైద్యనిపుణులు నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు వంటి పరికరాల్లో తెరపై ఆడే ఆటలకు బానిసలుగా మారిన పిల్లలు కనీసం అరగంటసేపైనా ఈ పరికరాలను విడిచిపెట్టి ఉండలేకపోతున్నారనీ, ఈ అలవాటును మాన్పించేందుకు తల్లిదండ్రులు వీటిని దూరంగా ఉంచినా, పిల్లలు హఠం చేసి సాధించుకునే పరిస్థితికి చేరుకున్నారనీ ఈ అధ్యయనంలో వెలుగులోకి రావడం ఆందోళనకరమైన పరిణామం. ఇలాంటి పరిణామాలకు పెద్దల పొరపాట్లే కారణం. పిల్లలను ఓపికగా దగ్గర కూర్చోబెట్టుకుని కథలు చదివి వినిపించడం, వాళ్ల చేత చిన్ని చిన్ని పాటలు పాడించడం వంటి పనులు చేస్తున్న తల్లిదండ్రులు ఎందరు ఉంటున్నారు? దేశంలో ఎన్ని పాఠశాలలు లైబ్రరీ పీరియడ్ను నిర్వహిస్తున్నాయి? అసలు ఎన్ని పాఠశాలల్లో పిల్లలకు తగిన పుస్తకాలతో కూడిన లైబ్రరీలు ఉంటున్నాయి? ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలు నామమాత్రంగానైనా ఉన్నాయేమో గాని, ప్రైవేటు పాఠశాలల్లో అవి మచ్చుకైనా కనిపించవు. చదువుకోదగ్గ వాతావరణమే అందుబాటులో లేని స్థితిలో పిల్లలు మాత్రమేం చేస్తారు? కంటికి ఎదురుగా కనిపించే టీవీలకే అతుక్కుపోతారు. చేతికి చిక్కిన స్మార్ట్ఫోన్ల ద్వారానే తమ జిజ్ఞాసను తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. టీవీలు, స్మార్ట్ఫోన్లకు బానిసలుగా మారిన పిల్లలకు స్కూళ్లలో బోధించే సిలబస్ మాత్రం ఏమంత బాగా తలకెక్కుతుంది? పిల్లల చదువుల తీరుతెన్నులపై జరిపిన సర్వేల్లో బయటపడిన వాస్తవాలను తెలుసుకుంటే, పిల్లల భవితవ్యంపై తల్లిదండ్రుల్లో ఆందోళన కలగక మానదు. ఇందుకు ఉదాహరణగా ఒక సర్వే గురించి చెప్పుకుందాం. ఐదేళ్ల కిందట ‘స్కాలస్టిక్’, ‘యూ గావ్’ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో దేశంలో 6–17 ఏళ్ల వయసు వరకు గల పిల్లల్లో కేవలం 32 శాతం మందికి మాత్రమే సిలబస్కు వెలుపలి పుస్తకాలను చదివే అలవాటు ఉంది. పిల్లల్లో చదివే అలవాటు తగ్గుముఖం పడుతుండటానికి ముఖ్యంగా పాఠశాలల నిర్వాహకులనే తప్పుపట్టాలని ముంబైకి చెందిన స్కూల్ ప్రిన్సిపాల్ ఫ్రాన్సిస్ స్వామి అభిప్రాయపడుతున్నారు. పిల్లల్లో చదివే అలవాటును ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది ‘వియ్ లవ్ రీడింగ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాఠశాలల లైబ్రరీలను పటిష్ఠపరచడం, పఠనోత్సవాలను నిర్వహించడం వంటి చర్య ద్వారా పిల్లల్లో చదివే అలవాటును ప్రోత్సహించడానికి చేపట్టిన ఈ మంచి కార్యక్రమం సత్ఫలితాలను ఇవ్వాలంటే ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు. ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించిన వెనువెంటనే సత్వర ఫలితాల కోసం ఆత్రపడకుండా, మొక్కవోని దీక్షతో కొనసాగిస్తే, తప్పకుండా సత్ఫలితాలే లభిస్తాయి. దేశంలోని మిగిలిన రాష్ట్రాలు కూడా పిల్లల్లో పఠనాభిలాషను, చదివే అలవాటును పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలను చిత్తశుద్ధితో చేపడితే, కొన్నేళ్ల తర్వాతనైనా సంపూర్ణ విద్యావంతులైన తరం తయారవుతుంది. పిల్లల్లో పఠనాభిలాష పెంచేందుకు రాష్ట్రాలు చేపట్టే కార్యక్రమాలకు చేయూతనివ్వడానికి కేంద్రప్రభుత్వం కూడా ముందుకు రావాలి. బాలసాహిత్య సృజనను, ప్రచురణను ప్రోత్సహించాలి. ఈ–తరం పిల్లలకు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనివార్యంగా మారిన విషయం వాస్తవమే అయినా, పుస్తకాలను మింగేసేంతగా వీటి వినియోగం పెరిగిపోయే పరిస్థితులను నిరోధించవలసిన బాధ్యత పూర్తిగా పెద్దల మీదే ఉంది. ఈ విషయంలో ప్రభుత్వాల కంటే ఎక్కువగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే గురుతర పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఎందుకంటే, భావిపౌరుల భవితవ్యాన్ని తీర్చిదిద్దాల్సింది వాళ్లే! -
Andhra Pradesh: 6.53 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే సాంకేతిక పరిజ్ఞానం అందించడం, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఇంటి నుంచే ఆన్లైన్ అభ్యసనం కొనసాగించడానికి వీలుగా ప్రభుత్వం వారికి ఉచిత ల్యాప్టాప్లు అందించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ద్వారా టెండర్లను ఆహ్వానించింది. ఇప్పటికే టెండర్లపై జ్యుడీషియల్ ప్రివ్యూ పరిశీలన కూడా పూర్తయ్యింది. 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతూ జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన కింద లబ్ధి పొందుతున్న విద్యార్థులకు ఆ పథకాలకు ప్రత్యామ్నాయంగా ల్యాప్టాప్లను అందించనుంది. విద్యార్థుల అభీష్టం మేరకు ఆ పథకాల కింద నగదుకు బదులుగా ల్యాప్టాప్లను పంపిణీ చేయనుంది. తమకు ల్యాప్టాప్లు కావాలని 6.53 లక్షల మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు. 2021–22 విద్యా సంవత్సరంలో 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనున్న 6,53,144 ల్యాప్టాప్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏపీటీఎస్కు నోడల్ ఏజెన్సీగా బాధ్యతలు అప్పగించింది. జగనన్న అమ్మఒడి కింద 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు 5,42,365 బేసిక్ వెర్షన్ ల్యాప్టాప్లు అందిస్తారు. ఇక ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ చదివే విద్యార్థులకు జగనన్న వసతి దీవెన కింద ఇస్తారు. వీరికోసం ఒక రకం కాన్ఫిగరేషన్తో 19,853 ల్యాప్టాప్లను, వేరే కాన్ఫిగరేషన్తో మరో 90,926 ల్యాప్టాప్లను అందిస్తారు. చదవండి: (తిరుపతి కేంద్రంగా ‘జియో నెక్ట్స్’.. ఇప్పుడేమంటారు తమ్ముళ్లూ..) బ్రాండెడ్ కంపెనీల ల్యాప్టాప్లు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి జగనన్న అమ్మఒడి కింద 44.48 లక్షల మంది తల్లులు లబ్ధి పొందుతున్నారు. వీరికి ఏటా రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. వారిలో 5.42 లక్షల మందికిపైగా నగదుకు బదులు తమ పిల్లలకు ల్యాప్టాప్లు కావాలని ఆప్షన్ ఇచ్చారు. ఇక జగనన్న వసతి దీవెన కింద ఏటా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ.15 వేలు, డిగ్రీ విద్యార్థులకు రూ.20 వేలు ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం కింద 15.50 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ల్యాప్టాప్ల్లో సమస్యలు వస్తే కంపెనీలు వారంలో వాటిని పరిష్కరించేలా ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు విధించింది. విద్యార్థులు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులు అందించాలి. లెనోవో, హెచ్పీ, డెల్, ఏసర్ వంటి బ్రాండెడ్ ల్యాప్టాప్లను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ప్రభుత్వం అందించనుంది. హైస్కూల్ విద్యార్థులకు అందించే ల్యాప్టాప్ల ప్రత్యేకతలు.. 4జీబీ రామ్, 500 జీబీ హార్డ్ డిస్క్, 14 అంగుళాల స్క్రీన్, విండోస్ 10 (ఎస్డీఎఫ్ మైక్రోసాఫ్ట్), ఓపెన్ ఆఫీస్ (ఎక్సెల్ వర్డ్, పవర్ పాయింట్) కాన్ఫిగరేషన్లతో మూడేళ్ల వారెంటీతో అందిస్తారు. గ్రామీణ విద్యార్థులకు ఎంతో మేలు 9వ తరగతి నుంచే ల్యాప్టాప్లు అందించడం వల్ల విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సులువుగా పొందొచ్చు. ప్రపంచ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది ఎంతో మేలు. – ఇమంది పైడిరాజు, హెచ్ఎం, జెడ్పీ హైస్కూల్, అడవివరం, విశాఖపట్నం జిల్లా కరోనా వంటి సమయాల్లో చదువులకు ఇబ్బంది ఉండదు కరోనా సమయంలో స్కూళ్లు ఆన్లైన్ పాఠాలను అందించినా ల్యాప్టాప్లు లేక వాటిని అందిపుచ్చుకోలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం ల్యాప్టాప్లు ఇస్తుండడంతో ఇబ్బందులు తప్పుతాయి. – వి.సునీత, పేరెంట్, జెడ్పీ హైస్కూల్, చంద్రంపాలెం, చినగదిలి, విశాఖపట్నం జిల్లా డిజిటల్ పాఠాలు అందుబాటులోకి వస్తాయి ల్యాప్టాప్ల వల్ల మాకు డిజిటల్ పాఠాలు అందుబాటులోకి వస్తాయి. ఆన్లైన్లో పాఠాలను అందించినప్పుడు ఫోన్లలో కంటే ల్యాప్టాప్లే అనువుగా ఉంటాయి. – సీహెచ్ జ్యోత్స్న, జెడ్పీహెచ్ఎస్ అనంతవరం డిగ్రీ విద్యార్థులకు అందించే రెండు రకాల మోడళ్ల ప్రత్యేకతలు.. మోడల్–1.. ప్రాసెసర్: ఇంటెల్ పెంటియమ్ సిల్వర్ సిరీస్, ఏఏండీ అథ్లాన్ (3000 సిరీస్) లేదా సమానమైన 4 జీబీ డీడీఆర్ రామ్ ►500 జీబీ హార్డ్ డ్రైవ్ ►14 అంగుళాల హై–డెఫ్ డిస్ప్లే (1366 గీ 768) ►వై–ఫై, బ్లూటూత్ ►వెబ్క్యామ్ (0.3 ఎంపీ/వీజీఏ సమానమైనది) ►విండోస్ 10 ఓఎస్ ►ఆఫీస్ 365 స్టూడెంట్ ప్యాక్ ►మూడేళ్ల వారంటీ (ల్యాప్టాప్, బ్యాటరీ, అడాప్టర్, యాంటీ వైరస్ రక్షణ) ►ఎండీఎం సాఫ్ట్వేర్ ►బ్యాక్ప్యాక్/క్యారీ బ్యాగ్ మోడల్–2.. ప్రాసెసర్: ఇంటెల్ కోర్ ఐ3, ఏఏండీ రైజెన్ 3 (3250) లేదా సమానమైనది. ►8 జీబీ డీడీఆర్ ర్యామ్ ►500 జీబీ లేదా అంతకంటే ఎక్కువ హార్డ్ డ్రైవ్ ►14 అంగుళాల హై–డెఫ్ డిస్ప్లే (1366 గీ 768) ►వై–ఫై, బ్లూటూత్ ►వెబ్క్యామ్ (0.3 ఎంపీ/వీజీఏ సమానమైనది) ►విండోస్10 ఓఎస్ ►ఆఫీస్ 365 స్టూడెంట్ ప్యాక్ ►మూడేళ్ల సమగ్ర వారంటీ (ల్యాప్టాప్, బ్యాటరీ అడాప్టర్, యాంటీ వైరస్ రక్షణ) ►ఎండీఎం సాఫ్ట్వేర్ ►బ్యాక్ప్యాక్/క్యారీ బ్యాగ్ -
పేద వర్గాల పిల్లలకు ఆన్లైన్ విద్య
న్యూఢిల్లీ: దేశంలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్), అణగారిన వర్గాల పిల్లలకు ఆన్లైన్ విద్య అందుబాటులో ఉండడం లేదని, ఫలితంగా వారు ఎంతో నష్టపోతున్నారని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో విద్యా హక్కు చట్టాన్ని (ఆర్టీఈ) కచ్చితంగా అమలు చేసే దిశగా ఒక వాస్తవిక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని కేంద్ర, ప్రభుత్వాలకు శుక్రవారం సూచించింది. ఆన్లైన్ తరగతులు వినడానికి వీలుగా పేద విద్యార్థులకు పరికరాలు(స్మార్ట్ ఫోన్లు లేదా ల్యాప్ట్యాప్లు) అందజేయాలని, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ఢిల్లీ హైకోర్టు 2020 సెప్టెంబర్ 18న ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ గుర్తింపు పొందిన అన్–ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ల యాక్షన్ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్, బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏను నిజం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అది జరగాలంటే పేద, అణగారిన వర్గాల పిల్లలకు ఆన్లైన్ విద్యను నిరాకరించరాదని స్పష్టం చేసింది. వారికి ఆన్లైన్ విద్య అందకపోతే సంపన్న కుటుంబాల పిల్లల కంటే వెనుకబడే ప్రమాదం ఉందని, ఇరు వర్గాల మధ్య అంతరం పెరిగిపోతుందని తెలిపింది. మంచి తీర్పు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టును సుప్రీంకోర్టు ధర్మాసనం అభినందించింది. -
యూనికార్న్ క్లబ్లోకి వేదాంతు ఆన్లైన్ ట్యూటరింగ్ కంపెనీ..!
కరోనా రాకతో విద్యారంగంలో భారీ మార్పులే వచ్చాయి. పాఠశాలలు విద్యార్ధులకు పూర్తిగా ఆన్లైన్ క్లాసులనే నిర్వహించాయి. ఆన్లైన్ ట్యూటరింగ్ సర్వీసులు భారీ వృద్దినే నమోదు చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఆన్లైన్ ట్యూటరింగ్ సర్వీస్ సంస్ధ వేదాంతు యునికార్న్ స్టార్టప్గా అవతరించింది. సింగపూర్కు చెందిన ఏబీసీ వరల్డ్ ఆసియా కంపెనీ నుంచి సుమారు 100 మిలియన్ డాలర్లను సేకరించడంతో వేదాంతు స్టార్టప్ వాల్యూయేషన్ ఒక బిలియన్ డాలర్లకు చేరుకుంది. వేదాంతుకు టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, కోట్ మేనేజ్మెంట్, జీజీవీ క్యాపిటల్ వంటి ఇన్వెస్టర్లుగా నిలిచాయి. చదవండి: బంగారాన్ని బట్టి ఎన్ని రకాల ట్యాక్స్ కట్టాలో తెలుసా? బైజూస్, ఆన్అకాడమీ, అప్గ్రేడ్, ఏరుడిటస్ తరువాత ఐదో భారతీయ ఎడ్టెక్ యునికార్న్ సంస్థగా వేదాంతు నిలిచింది. వేదాంతు ఏడు సంవత్సరాల క్రితం తన లైవ్-ట్యూటరింగ్ సేవలను ప్రారంభించింది.2022 మార్చి నాటికి 500,000 యూజర్లను లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రెండు లక్షల మంది విద్యార్థులు వేదాంతులో ఎన్రోల్ చేసుకున్నట్లు కంపెనీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వంశీ కృష్ణ అన్నారు. కరోనా రాకతో పలు ప్రైవేటు టీచర్ల దుస్థితి దయనీయంగా మారింది. వేదాంతు సహాయంతో పలువురు ప్రైవేటు టీచర్లు వేదాంతులో ట్యూటర్గా జాయిన్ అయ్యారని కృష్ణ వెల్లడించారు. చదవండి: ఒక్క నెలలో రూ.900 కోట్లు సంపాదించిన బిగ్ బుల్! -
జేఈఈ, నీట్ కోర్సులు: అమెజాన్తో చేతులు కలిపిన శ్రీ చైతన్య
న్యూఢిల్లీ: అమెజాన్ అకాడెమీ, విద్యాసంస్థల గ్రూప్ శ్రీ చైతన్య తాజాగా చేతులు కలిపాయి. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ), నేషనల్ ఎలిజిబిలిటీ–కమ్–ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) రాసేవారి కోసం పూర్తి స్థాయి సిలబస్ కోర్సులను ఆవిష్కరించనున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం అమెజాన్ అకాడెమీలో శ్రీ చైతన్య అధ్యాపకులు లైవ్ ఆన్లైన్ తరగతులు బోధిస్తారు. అమెజాన్ అకాడెమీ రూపొందించిన బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ స్థాయి దాకా కంటెం ట్ విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని అమెజాన్ ఇండియా డైరెక్టర్ అమోల్ గుర్వారా, ఇన్ఫినిటీ లెర్న్ (శ్రీ చైతన్య గ్రూప్) డైరెక్టర్ సుష్మ బొప్పన తెలిపారు. చదవండి : సిద్ధాంత్కు సీటివ్వండి! -
అత్యున్నత విద్యతోనే మహిళా సాధికారత
సాక్షి, అమరావతి/యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): అత్యున్నత విద్యా ప్రమాణాలు అందించడం ద్వారానే మహిళా సాధికారికత సాధ్యమని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. జాతీయ విద్యా విధానంతో మన విశ్వవిద్యాలయాలు ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రాలుగా ఆవిర్భవిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. తిరుపతిలో బుధవారం నిర్వహించిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ 18వ స్నాతకోత్సవంలో విజయవాడ నుంచి ఆయన వెబినార్ ద్వారా పాల్గొన్నారు. విద్యావేత్తలు, సమాజం మధ్య అవగాహనతోనే భవిష్యత్ సవాళ్లను అధిగమించగలమన్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో సంప్రదాయబద్ధమైన విద్యాబోధన విధానం స్థానంలో ఆధునిక ఆన్లైన్ విద్యాబోధనకు ప్రాధాన్యమివ్వాల్సి ఉందన్నారు. ఉన్నత విద్యా సంస్థలు విజ్ఞానం, నైపుణ్యం, పారిశ్రామిక అనుసంధానంపై ప్రధానంగా దృష్టి సారించాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సూచించారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వీసీ డి.జమున, చిత్తూరు ఎమ్మెల్యే ఎ.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత్రి పోపూరి లలితకుమారి(ఓల్గా)కి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయగా, మరో 3,054 మంది యూజీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ డిగ్రీలను అందుకున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువగా వసూలు చేసే ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తప్పవని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. స్నాతకోత్సవం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ విద్యా సంస్థలకు ఫీజు రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ నిర్ణయించిన ఫీజులను వర్తింపజేస్తూ జీవో నంబర్ 53, 54 విడుదల చేసినట్టు చెప్పారు. నిర్ణయించిన ఫీజు కంటే అధికంగా వసూలు చేస్తే.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. జాయింట్ కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారని తెలిపారు. 95 శాతం మంది ఉపాధ్యాయులు వ్యాక్సిన్ వేసుకున్నట్టు చెప్పారు. చిత్తూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పాఠశాలల్లో అక్కడక్కడా కోవిడ్ కేసులు నమోదైనట్టు తమ దృష్టికి వచ్చిందని, 10 కన్నా ఎక్కువ కేసులు నమోదైన పాఠశాలల మూసివేతకు ఆదేశాలిచ్చినట్టు మంత్రి వెల్లడించారు. పాఠశాల స్థాయిలో ఆన్లైన్ తరగతుల నిర్వహణ సాధ్యం కాదని, ప్రైవేట్ పాఠశాలలు, విద్యాసంస్థలు ఆన్లైన్ తరగతుల పేరిట ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని మంత్రి సురేష్ హెచ్చరించారు. -
మాట్లాడండి పిల్లలతో
స్కూలుకు వెళ్లడం మొదలెట్టిన పిల్లలతో మాట్లాడండి అంతా సరిగ్గా ఉందా అని. స్కూలుకు వెళ్లబోతున్న పిల్లలతో మాట్లాడండి... అంతా సరిగ్గా ఉండబోతోందని. చాన్నాళ్ల తర్వాత స్కూలుకు వచ్చిన పిల్లలతో టీచర్లు మాట్లాడండి ఇంట్లో ఎలాంటి వొత్తిళ్ల మధ్య రోజులు గడిచాయోనని. పిల్లలకు ఇప్పుడు మాటలు అవసరం. ఏ మాటలు లేక వాళ్లు ఇళ్లల్లో చాలా కాలంగా మూగబోయి ఉన్నారు. భయాలు సందేహాలు మూటగట్టుకుని ఉన్నారు. తల్లిదండ్రులు, టీచర్లు వారితో ఎంత మాట్లాడితే అంత మంచిది ఇప్పుడు. కొందరు పిల్లలకు కోవిడ్ అంటే భయం లేదు. కొందరు పిల్లలకు కోవిడ్ అంటే ఇంకా భయం పోలేదు. వీరు రోజంతా మాస్క్లు పెట్టుకుని క్లాసుల్లో కూచోవడం ఎంత సాధ్యమో ఈ పిల్లలకే తెలియదు. క్లాసులో దూరం కూచున్నా బ్రేక్ టైమ్లో లంచ్ టైమ్లో ఒకరితో ఒకరు దగ్గరగా కూడకుండా ఈ పిల్లలు ఉండలేరు. ఆడుకోవడానికి పరిగెత్తకుండా ఉండలేరు. అయితే ఆ రోజులు మళ్లీ వస్తాయి. మరి కొన్నాళ్లు మాత్రం జాగ్రత్తగా ఉండాలని ఈ పిల్లలతో పదే పదే మాట్లాడాల్సి ఉంది. టీవీలు, స్మార్ట్ఫోన్లు లేకపోవడం వల్ల ఆన్లైన్ క్లాసులు మిస్సయిన పిల్లలు చదువులో వెనకబడినా, ఇప్పటికిప్పుడు పుంజుకోకపోయినా ‘మరేం పర్వాలేదు. మెల్ల మెల్లగా అన్నీ చదువుకో’ అని తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టనని హామీ ఇవ్వాల్సి ఉంది. టీచర్లు కూడా పరీక్షలు, మార్కులు అంటూ వారిని న్యూనత పరచమని చెప్పాల్సి ఉంది. చాలా మంది పిల్లలు ఒక సంవత్సర కాలంగా తమ మనసులో గూడు కట్టుకుపోయిన విషయాలను తమ స్నేహితులతో పంచుకోవాలనుకుంటారు. హైపర్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. వారిని అర్థం చేసుకునే విధంగా తమ తీరు ఉంటుందని టీచర్లు వారికి చెప్పాల్సి ఉంది. అన్నింటి కంటే ముఖ్యంగా కోవిడ్ పట్ల ఎక్కువ భయం కాని తక్కువ భయం కాని కల్పించకుండా ఇది అందరు కలిసి సమర్థంగా ఎదుర్కొనగలిగిన మహమ్మారి అని వారిలో ధైర్యం నింప గలగాలి. అందుకూ మాట్లాడాలి. ఇప్పుడు పిల్లలు మొదలెడుతున్నది కొత్త చదువు. టీచర్లు చెప్పాల్సింది తల్లిదండ్రులు ఆశించాల్సింది కూడా కొత్త చదువే. మార్కులు, గ్రేడ్లు కన్నా పాఠాలు, స్నేహాలు, నవ్వులు, దూరం దూరంగా ఆడదగ్గ ఆటలు, వొత్తిడి లేని క్లాస్రూమ్లు, ఊరడించే కథలు ... ఇవి ఇప్పటి అవసరమని, స్కూలు అలాగే ఉంటుందని టీచర్లు, తల్లిదండ్రులు పిల్లలకు భరోసా ఇవ్వాలి. ప్రమాదం గడిచిపోయే వరకు పిల్లలకు స్కూలు ఒక సురక్షితమైన ప్రేమ పూర్వక అమ్మ ఒడి అని అర్థం చేయించ గలిగితే పిల్లలు నిజమైన వికాసం పొందుతారు. కేస్ 1 ఆంధ్రప్రదేశ్లోని ఒక పల్లెటూరులో ఎనిమిదవ తరగతి విద్యార్థి వేణు (అసలు పేరు కాదు) లాక్డౌన్ కాలంలో ఇంట్లో ఉండిపోయాడు. లాక్డౌన్ ఎత్తేశాక స్కూలు తెరిచే పరిస్థితి రానందున తండ్రి పని చేసే చోటుకు ఆయనతో వెళ్లి కాలక్షేపం చేసేవాడు. తండ్రికి సాయం చేసేవాడు. మధ్యలో పుస్తకాలు చూడటం, టీవీ క్లాసులు వినడం అంతగా చేయలేదు. ఇప్పుడు స్కూళ్లు తెరిచారు. కాని స్కూలుకు రావాలంటే జంకు. పాఠాలు ఏమాత్రం చదవగలననే జంకు. మళ్లీ ఒక క్రమశిక్షణకు రావడం పట్ల జంకు. కాని తల్లిదండ్రులు వేణును తప్పనిసరిగా చదువులో పెట్టాలనుకున్నారు. స్కూలుకు తీసుకొచ్చి ‘నాడు నేడు’ వల్ల వచ్చిన కొత్త హంగులను చూపించారు. పుస్తకాలు యూనిఫామ్లు బూట్లు స్కూల్ నుంచి ఇప్పించి ఉత్సాహపరిచారు. టీచర్లతో మాట్లాడించారు. సిలబస్ తక్కువగా ఉంటుందని, మళ్లీ కొన్ని బేసిక్స్ చెప్పి పాఠాలు చెప్తామని టీచర్లు చెప్పారు. వేణుకు మెల్లగా ధైర్యం పుంజుకుంది. స్కూలుకు రావడం మొదలెట్టాడు. తల్లిదండ్రులు, టీచర్లు ఇలాంటి శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఇంకా స్కూలుకు రావాల్సిన ‘వేణు’లు అక్కడక్కడా కొద్దిమంది ఉన్నారు. వారితో మాట్లాడాల్సి ఉంది. కేస్ 2 ఆంధ్రప్రదేశ్లోని ఒక పెద్ద టౌన్లో ప్రయివేటు స్కూల్లో లత (పేరు మార్పు) ఇప్పుడు తొమ్మిదో తరగతికి హాజరు కావాలి. లతకు స్కూలుకు వెళ్లాలంటే భయంగా ఉంది. ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. ఆ సమయంలో ఆమె భయపడింది. అదీగాక రోజూ న్యూస్లో థర్డ్ వేవ్ గురించి వింటోంది. అదీ ఒక భయమే. కాని ఇన్నాళ్లూ స్కూల్ లేక ఇంట్లోనే ఉండిపోతున్న లత మెల్లగా డల్ అయిపోవడం గమనించిన తల్లిదండ్రులు కోవిడ్ జాగ్రత్తలతో లతను స్కూలు పంపించాలని నిశ్చయించుకున్నారు. ఆమెకు ధైర్యం చెప్పారు. టీచర్లతోనూ చెప్పించారు. కాని లత తొలి రోజు స్కూల్కు వెళ్లి తిరిగి వచ్చేసింది. ఆమెకు ఆ స్కూల్లో ఇష్టమైన ఇద్దరు ముగ్గురు టీచర్లు ఇప్పుడు లేరు. మానేశారు. క్లాస్లో కూడా మునపటిలా ఫ్రెండ్స్తో దగ్గర దగ్గరగా కూచునే వీలు లేదు. ఇదంతా లతకు నచ్చలేదు. కాని ఈ పరిస్థితి కొన్నాళ్లే ఉంటుందని, క్లాస్రూమ్లో ఫ్రెండ్స్ను దూరం నుంచైనా చూసి మాట్లాడటం మంచిదని, పాత టీచర్లు వెళ్లి కొత్త టీచర్లు వచ్చినా వారు కూడా మెల్లగా నచ్చుతారని లతకు చెప్పాల్సి ఉంది. ఆ అమ్మాయితో ఇంకా మాట్లాడాల్సి ఉంది. కేస్ 3 హైదరాబాద్లో ఒక పేరున్న ప్రయివేట్ స్కూల్లో చదువుతున్న కౌశిక్ (పేరు మార్పు) సెవన్త్ క్లాస్ పాఠాలను ఆ స్కూల్ టంచన్గా నడిపిన ఆన్లైన్ క్లాసుల ద్వారా వింటూ వచ్చాడు. ఇప్పుడు ఆఫ్లైన్లో సెప్టెంబర్ 1 నుంచి స్కూల్కు హాజరయ్యి వినాలనే సరికి డల్ అయిపోయాడు. ‘నేను స్కూల్కి పోను. కోవిడ్ ఉంది’ అంటున్నాడు తల్లిదండ్రులతో. అసలు కారణం వేరే ఉంది. కౌశిక్ కెమెరా ఆఫ్లో పెట్టి మధ్య మధ్యలో యూ ట్యూబ్ చూసుకోవడం, గేమ్స్ ఆడుకోవడం, ఎగ్జామ్స్ కూడా తల్లిదండ్రులను అడిగి రాయడం, ఒక్కోసారి సోఫాలో పడుకుని హెడ్ఫోన్స్ ద్వారా పాఠాలు వినడం... వీటికి అలవాటు పడ్డాడు. ఇవన్నీ స్కూల్కు వెళితే ఉండవు. టీచర్లు కెమెరాలో కనపడితే పెద్ద భయం ఉండదు. నేరుగా కనపడితే వారిని నిజంగా ఫేస్ చేయాలి. గతంలో లేని భయం ఇప్పుడు కొత్తగా పట్టుకుంది. కౌశిక్తో తల్లిదండ్రులు ఇంకా ఏం మాట్లాడలేదు. ‘ఏయ్.. నువ్వు స్కూల్కు వెళ్లాల్సిందే’ అంటున్నారు. టీచర్లు కూడా స్కూల్కు రావాల్సిందే అంటున్నారు. కౌశిక్ను ఆన్లైన్ విద్యార్థి నుంచి ఆఫ్లైన్ విద్యార్థిగా మార్చడానికి మాట్లాల్సింది. మాట్లాడాల్సిన అవసరాన్నే ఇరుపక్షాలు ఇంకా గుర్తించడం లేదు. ‘స్కూల్ ఫోబియా’ పోగొట్టాలి గతంలో ‘ఎగ్జామినేషన్ ఫోబియా’ వినేవాళ్లం. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత స్కూల్కు వెళ్లాల్సి రావడం వల్ల పిల్లల్లో స్కూల్ ఫోబియా కనిపించవచ్చు. వాళ్లు ఇన్నాళ్లు హాయిగా హాలిడేస్ గడిపి స్కూల్కు వెళుతున్నారనే ఆలోచన పేరెంట్స్ తీసేయాలి. వారి స్ట్రెస్ వారు అనుభవించి మళ్లీ కొత్తగా స్కూల్లో అడుగుపెడుతున్నారు. 6 నుంచి 8 వారాల కాలం వారు అడ్జస్ట్ కావడానికి పడుతుంది. ఈ కోవిడ్ సందర్భంలో తేలిక వాతావరణం లో ఉంచుతూ పాఠాల్లోకి తీసుకెళ్లాలి. ఏ సమస్య వచ్చినా మనసు విప్పి చెప్పుకోమని తల్లిదండ్రులు, టీచర్లు భరోసా ఇవ్వాల్సిన అసలైన సమయం ఇది. టీచర్లు కాని తల్లిదండ్రులు కాని స్నేహపూర్వకంగా ఉంటామని హామీ ఇస్తేనే ఈ కాలంలో పిల్లలు మునుపటి ఉత్సాహం నింపుకుంటారు. – డా. కళ్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్. -
పర్సనల్ కంప్యూటర్లు ప్రియం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిప్సెట్ కొరత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తోంది. దీని ప్రభావం పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) విభాగంపై స్పష్టంగా కనపడుతోంది. ఆన్లైన్ తరగతులు, ఇంటి నుంచి పని విధానం కారణంగా డిమాండ్ విపరీతంగా ఉన్నప్పటికీ సరఫరా ఆ స్థాయిలో జరగడం లేదు. ఇదే అదనుగా తయారీ కంపెనీలు ధరలను 50 శాతంపైగా పెంచాయి. లో ఎండ్ మోడళ్ల ఉత్పత్తిని దాదాపు నిలిపివేశాయి. రూ.50,000లోపు ధరలో ల్యాప్టాప్లు దొరకట్లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వినియోగదార్లు తప్పనిసరి పరిస్థితుల్లో ల్యాప్టాప్, డెస్క్టాప్, ఆల్ ఇన్ వన్స్ కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఏప్రిల్–జూన్ కాలంలో దేశవ్యాప్తంగా 32 లక్షల యూనిట్ల పీసీలు అమ్ముడైనట్టు సమాచారం. నిలిచిపోయిన సరఫరా.. ల్యాప్టాప్స్లో కొన్ని నెలల క్రితం వరకు రూ.17–25 వేల ధరల శ్రేణి వాటా 70 శాతం దాకా ఉండేది. రూ.26–40 వేల ధరల విభాగం 20 శాతం, రూ.40 వేలపైన ధరల్లో లభించే హై ఎండ్ మోడళ్ల వాటా 10 శాతం నమోదయ్యేది. ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది. మార్కెట్ అంతా హై ఎండ్ మోడళ్లతోనే నిండిపోయింది. వీటికి కూడా 40–50 శాతం కొరత ఉంది. ఇక లో ఎండ్ మోడళ్లు అయితే కానరావడం లేదు. 100 శాతం నగదు ఇచ్చి కొనేందుకు వినియోగదార్లు సిద్ధపడ్డా పీసీ దొరకడం లేదు. ఇటువంటి పరిస్థితి పరిశ్రమలో ఇదే తొలిసారి అని ఐటీ మాల్ ఎండీ అహ్మద్ తెలిపారు. లో ఎండ్ ల్యాప్టాప్స్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని చెప్పారు. పేరుతోపాటు ధర కూడా.. కంపెనీలు ఎప్పటికప్పుడు మోడళ్ల పేరు మారుస్తున్నాయి. కొత్త స్టాక్ వచ్చిందంటే మోడల్ పేరు మారుతోంది. అంతేకాదు ఫీచర్లు మారకపోయినా ధరలను సవరిస్తున్నాయి. చిప్సెట్ కొరతను అడ్డుపెట్టుకుని పూర్తిగా హై ఎండ్ మోడళ్లవైపే మొగ్గు చూపుతున్నాయంటే కంపెనీలు ఏ స్థాయిలో వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాయో అవగతమవుతోంది. కనీస ధరలు ల్యాప్టాప్ రూ.18 వేలది కాస్తా రూ.30 వేలకు చేరింది. హై ఎండ్లోనూ ధర 20 శాతంపైగా అధికమైంది. డెస్క్టాప్ రూ.25 వేల నుంచి రూ.38 వేలకు, ఆల్ ఇన్ వన్ రూ.30 వేల నుంచి రూ.43 వేలు అయింది. ప్రింటర్ల విషయంలో ఇంక్జెట్ రూ.2 వేల నుంచి రూ.4,500లు, లేజర్జెట్ రూ.9 వేలది కాస్తా రూ.16 వేలపైమాటే ఉంది. ధర పెరిగినా ప్రింటర్లు దొరకడం లేదు. -
సందేహాలు తీరేదెలా?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఆన్లైన్ విద్యా విధానంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సబ్జెక్టుపై బోధన వ్యవధిని ప్రభుత్వ కాలేజీలు కేవలం అరగంటకే పరిమితం చేశాయి. దీంతో అరకొరగా పాఠం వినడానికే సమయం సరిపోతోందని విద్యార్థులు అంటున్నారు. ప్రత్యక్ష బోధనలోనైతే పాఠం చెప్పిన వెంటనే ప్రశ్నలు అడిగే వీలుంటుంది. లెక్చరర్లు ప్రధానంగా దీనికే ప్రాధాన్యం ఇస్తారు. విద్యార్థి సృజనాత్మకత ఇక్కడే గుర్తిస్తామని లెక్చరర్లు అంటున్నారు. ఆన్లైన్ క్లాసుల్లో ఎవరి సత్తా ఏంటనేది తెలుసుకునే వీల్లేకుండా పోతోందని కరీంనగర్కు చెందిన శేషుకుమార్ అనే లెక్చరర్ చెప్పారు. ‘సందేహాలు, సమాధానాలు’లేకపోతే బోధన అసంపూర్తిగానే ఉన్నట్టు అని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థుల నుంచీ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గణితంలో కఠినమైన ఫార్ములాల గురించి లెక్చరర్లతో సంభాషించే అవకాశం ఉండటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. సవాలక్ష డౌట్లతో పాఠాలు సరిగా అర్థం కావడంలేదని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల్లో చదివే విద్యార్థుల నుంచి ఈ ఫిర్యాదులు తక్కువగా వస్తున్నాయి. పుస్తకాలు మారినా... వాస్తవానికి ఇంటర్ ద్వితీయ సంవత్సరం తెలుగు, మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పుస్తకాలు మారాయి. విద్యాశాఖ మంత్రి ఈ మధ్యే వీటిని విడుదల చేసినా ప్రభుత్వ కాలేజీలకు పూర్తిస్థాయిలో చేరలేదు. కోవిడ్ కారణంగా ప్రింటింగ్ ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. నిజానికి మారిన పుస్తకాలను ముందుగా లెక్చరర్లు చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత విద్యార్థులకు చెప్పాలి. వారి నుంచి అనేక సందేహాలు వస్తుంటాయి. వీటిని మళ్లీ అధ్యయనం చేసి నివృత్తి చేయాల్సి ఉంటుందని అధ్యాపకులు అంటున్నారు. విద్యా సంవత్సరం మొదలై రెండు నెలలైనా ఇంత వరకూ కొత్త పుస్తకాల మొఖమే చూడలేదని, ఇలాంటప్పుడు బోధనలో నాణ్యత ఎలా ఉంటుందని ప్రభుత్వ కాలేజీలు అంటున్నాయి. ఇతర సబ్జెక్టుల విషయంలోనూ ఇదే గందరగోళం కన్పిస్తోంది. పోటీ పరీక్షల కోణంలో విద్యార్థులకు లోతుగా చెప్పేందుకు ముందుగా వారికి ఉన్న సందేహాలను గుర్తించాల్సి ఉంటుందని అధ్యాపకులు చెబుతున్నారు. బుర్రకెక్కడం లేదు – అన్విత్ (విద్యార్థి), భద్రాద్రి కొత్తగూడెం ఇంటర్ ఫస్టియర్ ఆన్లైన్ క్లాసులు వింటున్నా. మేథ్స్ విన్నాక అనేక డౌట్స్ వస్తున్నాయి. కొత్త ప్రాబ్లమ్స్ చేయాలంటే కష్టంగా ఉంది. ఎంత ప్రయత్నించినా రావడం లేదు. కాలేజీలో అయితే లెక్చరర్ను అడిగి తెలుసుకునే వీలుంటుంది. ఇంత వరకూ ఇంగ్లిష్ బుక్ చూడలేదు – పల్లవి (విద్యార్థి), హన్మకొండ ఇంగ్లిష్ పాత పుస్తకాలు చూశాం. కానీ బుక్ మారింది. కొత్త పుస్తకం చూడలేదు. పాఠాలూ జరగడం లేదు. పుస్తకాలూ అందుబాటులులో లేవు. ఇతర సబ్జెక్టుల్లోనూ డౌట్స్ వస్తున్నాయి. ఎవరిని అడగాలో తెలియడం లేదు. ఆన్లైన్ క్లాస్ తర్వాత లైన్ కట్ అవుతోంది. బోధకులేరీ? ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈసారి ప్రవేశాలు పెరిగాయి. మునుపెన్నడూ లేనివిధంగా లక్షకు పైగా అడ్మిషన్లు వచ్చాయి. అయితే లెక్చరర్ల కొరత వేధిస్తోందని అధికారులు సైతం ఒప్పుకుంటున్నారు. రాష్ట్రంలో 405 కాలేజీలుంటే... రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నది కేవలం 751 మంది మాత్రమే. 3,599 మంది కాంట్రాక్టు లెక్చరర్లు, 1,658 మంది గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ప్రతీ అకడమిక్ సంవత్సరానికి గెస్ట్ లెక్చరర్స్ సర్వీసును పొడిగిస్తారు. ఈసారి కొన్ని కోర్టు వివాదాల నేపధ్యంలో ఇంతవరకూ వారికి పొడిగింపు ఇవ్వలేదు. దీంతో 25 శాతం వరకూ లెక్చరర్ల కొరత ప్రభుత్వ కాలేజీల్లో ఉంది. ఇన్ని సమస్యలుంటే విద్యాబోధన సాఫీగా ఎలా సాగుతుందని అన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
ప్రాణం తీసిన నెట్వర్క్ సమస్య
భువనేశ్వర్: ఆన్లైన్ పాఠాలు వినేందుకు కొండ మీదకు వెళ్లిన విద్యార్థి తిరిగి కిందకు రాలేదు. ప్రమాదవశాత్తు కొండపై నుంచి జారిపడి విద్యార్థి ప్రాణాలు విడిచిన ఘటన రాయగడ జిల్లా, పద్మపూర్ సమితి, పండరగుడలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పండగరగుడలో నివశిస్తున్న ఆంధ్రయ జగరంగ(13).. జగరంగ కటక్ గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. కోవిడ్ కారణంగా వీరికి కేవలం ఆన్లైన్లోనే పాఠాలు చెబుతున్నారు. గ్రామంలో నెట్వర్క్ సదుపాయం లేకపోవడంతో విద్యార్థులు జగరంగ కొండపైకి వెళ్లి, పాఠాలు వింటుంటారు. ఎప్పటిలాగే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆంధ్రయ కొండపైకి వెళ్లాడు. వానలు కురుస్తున్న కారణంగా ఆ దారంతా జారుడుగా ఉండడంతో ప్రమాదవశాత్తు అక్కడి కొండపై నుంచి కిందికి జారిపడిపోయాడు. దీంతో అతడి తలకు బలమైన గాయమైంది. ఈ విషయంపై తోటి విద్యార్థులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో అతడిని వైద్యసేవల కోసం పద్మపూర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఉన్నత వైద్యం కోసం అక్కడి నుంచి బరంపురం ఎంకేసీజీ మెడికల్కి తరలిస్తుండగా, మార్గం మధ్యంలో ఆ విద్యార్థి చనిపోయాడు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. -
తస్మాత్ జాగ్రత్త.. చిన్న పిల్లల్లో ఆ వ్యాధులు పెరుగుతున్నాయ్
చెన్నై: ప్రస్తుత కాలంలో ఎక్కువ సమయం కంప్యూటర్ స్క్రీన్, మొబైల్ ఫోన్ ముందు గడపడం వల్ల చిన్న పిల్లలలో కంటి వ్యాధులు పెరుగుతున్నట్లు చెన్నైలోని డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి సీనియర్ పీడియాట్రిక్ ఆప్తల్మాలజిస్ట్ డాక్టర్ మంజులా జయకుమార్ తెలిపారు. గత ఐదేళ్లలో ఈ వ్యాధులు రోజు రోజుకు అధికమవుతున్నాయని ఆమె వెల్లడించారు. బుధవారం ఉదయం జరిగిన ప్రెస్మీట్లో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం కోవిడ్–19 కారణంగా పిల్లలు ఆన్లైన్ తరగతులకు పరిమితం కావడం, ఎక్కువసేపు కంప్యూటర్ గేమ్స్కు అలవాటు పడుతున్నారన్నారు. దీంతో కంటి రెప్పలు తరచుగా మూతపడడం జరుగుతోందన్నారు. అంతేకాకుండా సూర్యరశ్మికి దూరం కావడం, తగిన వ్యాయామం లేకుండా పోవటం వల్ల కంటి వ్యాధులు పెరుగుతున్నాయని చెప్పారు. నేత్ర సంరక్షణ అవగాహన మాసంగా ఆగస్టు నెలను పాటిస్తున్నట్లు వెల్లడించారు. తగిన సమయంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందితే కంటి వ్యాధుల నుంచి దూరం కావచ్చునని అన్నారు. తల్లిదండ్రులు తగిన రీతిలో ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తూ చిన్న పిల్లల కంటి సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని ఆమె హితవు పలికారు. -
అప్గ్రేడ్ సంస్థకు యూనికార్న్ హోదా
ముంబై: ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థ అప్గ్రేడ్ మూడోసారి భారీగా నిధులను సమీకరించింది. ఐఐఎఫ్ఎల్ గ్రూప్ నుంచి తాజాగా 185 మిలియన్ డాలర్లు(రూ.1,376 కోట్లు) సమీకరించింది. దీంతో కంపెనీ విలువ 1.2 బిలియన్ డాలర్లకు(రూ.8,912 కోట్లు) చేరింది. ఈ ఏడాది ఏప్రిల్లో తొలిసారి టెమాసెక్ హోల్దింగ్స్ నుంచి 12 కోట్ల డాలర్లు సమకూర్చుకుంది. తదుపరి ఇదే నెలలో వరల్డ్ బ్యాంక్ గ్రూప్ సంస్థ ఐఎఫ్సీ నుంచి 4 కోట్ల డాలర్లు లభించాయి. దీంతో కంపెనీ విలువ 85 కోట్ల డాలర్లను తాకింది. స్టార్టప్ల రంగంలో 100 కోట్ల డాలర్ల విలువను చేరిన కంపెనీలను యూనికార్న్గా వ్యవహరించే సంగతి తెలిసిందే. కాగా... ఈ కేలండర్ ఏడాది(2021)లో ఆగస్ట్ 2 వరకూ 17 స్టార్టప్లు యూనికార్న్లుగా ఆవిర్భవించాయి. 60 సంస్థలకు యూనికార్న్ హోదా ఈ బాటలో సాఫ్ట్ బ్యాంక్కు చెందిన విజన్ ఫండ్-2 నుంచి 10 కోట్ల డాలర్ల పెట్టుబడులు సమకూర్చుకున్న మైండ్టికిల్తో కలిపి మొత్తం 60 సంస్థలు ఈ స్థాయికి చేరువకోవడం ప్రస్తావించదగ్గ విషయం!. ఈ ఏడాది యూనికార్న్ జాబితాలో చేరిన సంస్థలలో షేర్చాట్, గ్రో, గప్ షుప్, మీషో, ఫార్మ్ఈజీ, బ్లాక్బక్, డ్రూమ్, 'ఆఫ్బిజినెస్, క్రైడ్, మాగ్లిక్స్, జెటా, బ్రౌజర్స్టాక్ తదిర సంస్థలు చేరాయి. క్రెడిట్ స్వీస్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశీయంగా 100కు మించిన స్టార్దప్లు యూనికార్న్ హోదాను పొందాయి. -
నిష్టాగరిష్టులుగా గురువులు
సాక్షి, అమరావతి: ప్రస్తుత విద్యా వ్యవస్థలో బోధనాభ్యసన ప్రమాణాలు పడిపోతున్నాయి. మరోవైపు కరోనా పరిస్థితుల్లో స్కూళ్లు మూతపడి బోధన పూర్తిగా నిలిచిపోయింది. విద్యార్థులకు డిజిటల్ సాధనాల ద్వారా ఆన్లైన్ బోధన చేయించాలంటే అందుకు తగ్గట్టుగా టీచర్లను సిద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఉత్తమ బోధన అందించేలా గురువులను తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్ వరకు గల ఉపాధ్యాయులందరికీ నూతన విద్యాబోధన విధానాలు, సబ్జెక్టుల వారీ పరిజ్ఞానం పెంపొందించేలా ప్రత్యేక ఆన్లైన్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. గతేడాది చివరిలో ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ను పూర్తిచేయించిన విద్యా శాఖ ప్రస్తుతం సెకండరీ టీచర్ ట్రైనింగ్ కోర్సులకు శ్రీకారం చుట్టింది. నేషనల్ ఇనీషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ (నిష్టా), నేషనల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ టీచర్స్ (దీక్షా) వెబ్ ప్లాట్ఫామ్ల ద్వారా వీటిని అందిస్తున్నాయి. ఎలిమెంటరీ స్థాయిలో 1 నుంచి 8వ తరగతి వరకు బోధించే టీచర్లకు 18 కోర్సుల్లో శిక్షణ నిర్వహించగా.. సెకండరీ స్థాయిలో 9 నుంచి 12వ తరగతి వరకు బోధించే టీచర్లకు 13 కోర్సుల్లో శిక్షణకు శ్రీకారం చుట్టాయి. ప్రతి టీచర్ విధిగా ఈ శిక్షణ కోర్సులను పూర్తి చేయాలి. నేటి నుంచే శ్రీకారం దేశంలో 15 లక్షల పాఠశాలలు, 85 లక్షల మంది టీచర్లు, 26 కోట్ల మంది విద్యార్థులున్నారు. కరోనా వల్ల విద్యా వ్యవస్థ గతేడాది నుంచి పూర్తిగా స్తంభించింది. ఈ పరిస్థితిని కొంతైనా అధిగమించడానికి ప్రభుత్వాలు వెబ్పోర్టల్, యాప్స్, టెలికాస్ట్, బ్రాడ్కాస్ట్, ఐవీఆర్ఎస్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా ఆన్లైన్ బోధనను సాగించేందుకు ఏర్పాట్లు చేయించాయి. పీఎం–ఈ–విద్య, దీక్షా, ఈ–పాఠశాల, నిష్టా, స్వయం, దీక్షా వంటి ప్లాట్ఫామ్ల ద్వారా టీచర్లకు శిక్షణ ఇస్తున్నాయి. 2021 ఆగస్టు 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు తరగతులు నిర్వహిస్తున్నాయి. ఈ శిక్షణలో 9 నుంచి 12వ తరగతి వరకు బోధించే ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా పాల్గొనేలా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల డీఈవోలు, ఇతర అధికారులకు సూచనలు జారీ చేసినట్టు సీమ్యాట్ డైరెక్టర్ మస్తానయ్య తెలిపారు. ఈ కోర్సుల్లో బోధనకు సంబంధించి.. 12 ప్రాథమిక, సాధారణ అంశాలు ఉంటాయి. మరో 7 కోర్సులు ఆయా ప్రత్యేక సబ్జెక్టుల్లో ఉంటాయి. పాఠ్య ప్రణాళిక, సమ్మిళిత విద్య, వ్యక్తిగత, సామాజిక నైపుణ్యాల పెంపు, విద్యార్థుల్లో సమగ్రాభివృద్ధి, సెకండరీ స్థాయి అభ్యాసకుల స్థాయిని అవగాహన చేసుకుని వారికి మార్గదర్శనం ఇవ్వడం, పాఠశాల అభివృద్ధికి వీలైన నాయకత్వ లక్షణాలు అలవర్చడం, పాఠశాల స్థాయి మూల్యాంకన విధానం, నూతన ఆవిష్కరణలు, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, వృత్తి విద్యలతో పాటు ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, సంస్కృతం, మేథ్స్, సైన్స్, సోషల్ అంశాల్లో శిక్షణ ఇస్తారు. లక్ష్యాలివీ.. ► విద్యార్థుల్లో బోధనాభ్యసన ఫలితాలను రాబట్టడం. కరోనా వంటి పరిస్థితుల్లోనూ విద్యార్థులకు తరగతి గది వాతావరణాన్ని సృష్టించి బోధన సాగించడం. ► విద్యార్థుల భావోద్వేగాలను, వారి మానసిక పరిస్థితిని అంచనా వేస్తూ ప్రతిస్పందించడం. ► సృజనాత్మకత పెంపు, బోధనను కళాత్మకంగా ఆకర్షణీయంగా నిర్వహించడం. ► విద్యార్థుల వ్యక్తిగత సామాజిక నాయకత్వ లక్షణాలను పెంపొందించేలా శిక్షణ. ► విద్యార్థులపై ఒత్తిడి లేని పాఠశాల స్థాయి మూల్యాంకన విధానాలను రూపొందించడం ► సామర్థ్య ఆధారిత అభ్యసనాలను పెంపొందించడం, పాఠశాల విద్యలో నూతన ఆవిష్కరణలు గురించి తెలుసుకోవడం -
ఆన్లైన్ చదువులు ప్రత్యామ్నాయం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: విద్యాబోధన అనేది విద్యార్థులకు విషయాన్ని చేరవేయడంగానే కాకుండా, వారిలో సృజనాత్మకత, పరిశోధనాసక్తిని పెంపొందించేదిగా ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. తరగతి గదుల్లో బోధించే విద్యకు ఆన్లైన్ విద్యాబోధన సరైన ప్రత్యామ్నాయం కాదని అన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆఫ్లైన్, ఆన్లైన్ విద్యాభ్యాసాన్ని సమన్వయం చేస్తూ.. అందరికీ ఆమోదయోగ్యమైన మిశ్రమ విద్యావిధానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచ విశ్వవిద్యాలయాల సదస్సు’ను ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణం నుంచి బుధవారం వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యను అందించడం మాత్రమే కాకుండా, వివిధ రంగాల్లో నాయకులుగా ఎదిగేలా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యతను విశ్వవిద్యాలయాలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా దేశంలో కరోనా మహమ్మారి కారణంగా విద్యారంగంలో మరింత క్రమశిక్షణను పెంపొందించుకునేందుకు అవకాశం కలిగిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా గ్రామీణ, పట్టణ అంతరాలను తగ్గించుకుంటూ సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమానస్థాయిలో విద్యాబోధన అందించేందుకు మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, పేదరికం, అసమానతలు, అటవీ సంపద విధ్వంసం, కాలుష్యం తదితర అంశాలతో ఏర్పడ్డ సవాళ్లు, సమస్యల పరిష్కారానికి సుస్థిరాభివృద్ధి ఒక్కటే సరైన మార్గమని అన్నారు. ఈ దిశలో విశ్వవిద్యాలయాలు పరిష్కార మార్గాలు, కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చి కీలక భూమిక పోషించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. అంతే గా క వేదాలు, ఉపనిషత్తుల ఘనమైన వారసత్వాన్ని వాటిలోని జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరోసారి భారతదేశాన్ని విశ్వగురువుగా, విజ్ఞాన కేంద్రంగా నిలబెట్టాల్సిన సరైన తరుణమిదేనని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
చిల్డ్రన్–సోషల్ మీడియా.. చూస్తున్నారా... ఏం చూస్తున్నారో!
పిల్లలు ఫోన్ తీసుకుని ఏం చూస్తున్నారు? పిల్లల్ని టార్గెట్ చేసుకొని సోషల్ మీడియాలో ఏమేమి వస్తోంది? ఎవరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నారు? ఏ గేమ్కు బానిసవుతున్నారు? తెలియక ఏ పోర్నోగ్రఫీ కంటెంట్కు ఎక్స్పోజ్ అవుతున్నారు? అశ్లీల చిత్రాలను సోషల్ మీడియా యాప్స్లో పెడుతున్నందుకు ఇటీవల జరిగిన బాలీవుడ్ అరెస్ట్ నేర విచారణ గురించి కంటే అలాంటి కంటెంట్ పిల్లల వరకూ చేరుతున్నదా అనే ఆందోళనే ఎక్కువ కలిగిస్తోంది. తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. లోకంలో చాలా పనులు జరుగుతున్నాయి. మనం మాత్రం పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చి మన పనుల్లో పడుతున్నాం. ఆన్లైన్ క్లాసుల కోసమో, తల్లిదండ్రులు ఉద్యోగస్తులైతే పిల్లలతో మాట్లాడటం కోసమో, పిల్లలతో టైమ్ స్పెండ్ చేసే వీలు లేక వారిని ఎంగేజ్ చేయడం కోసమో, స్టేటస్ కోసమో, గారాబం కోసమో ఇవాళ చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల చేతికి ఫోన్లు ఇస్తున్నారు. ఇవ్వక తప్పడం లేదు. కాని వారి చేతిలో ఉన్న ఆ ఫోన్ వారికి చాలా మేలు చేయగలదు. చాలానే కీడు కూడా చేయగలదు. ఆ విషయం వారికి తెలిసే వరకు స్నేహంగా వారిని అలెర్ట్ చేస్తున్నామా? చెక్ చేస్తున్నామా? అంతా అయ్యాక ‘నువ్వు గేమ్స్కు బానిసయ్యావు.. నిన్నూ’.. అని ఫోన్లు పగలగొడితే ఆ పిల్లలు అలిగి ఆత్మహత్యలు చేసుకునేవరకు తీసుకువెళుతున్నాం. ఇప్పుడు ఫోన్ అనేది ఇద్దరి బాధ్యతతో ముడిపడి ఉన్న వస్తువు... తల్లిదండ్రులూ... పిల్లలూ... ఢిల్లీలో వినూత్న కేసు రెండు రోజుల క్రితం ఢిల్లీ మహిళా కమిషన్ అక్కడి పోలీసులకు ఒక మహిళ మీద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయమని ఆదేశాలు ఇచ్చింది. దానికి కారణం ‘ఇన్స్టాగ్రామ్’ అకౌంట్లో ఆ మహిళ పెట్టే వీడియోల్లో కుమారుణ్ణి నటింపచేయడమే. సాధారణంగా తగిన ఆపోజిట్ పార్టనర్ ఉంటేనే కొన్ని వీడియోలు చేయాలి. ఆ వీలు లేనివారు చిన్న పిల్లలతో పాటలకు డాన్సులు చేయడం చేస్తున్నారు. ఆ మహిళ తన కొడుకుతో కలిసి చేసిన డాన్సు ‘అశ్లీలంగా’ ఉందని మహిళా కమిషన్ గుర్తించింది. వెంటనే ఆ మహిళను అరెస్ట్ చేయమంది. పిల్లాడ్ని కౌన్సిలింగ్కి తీసుకువెళ్లమని చెప్పింది. పిల్లల్ని ఇవాళ విపరీతంగా ప్రభావితం చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఇన్స్టాగ్రామ్’. ఇందులో ‘రీల్స్ మేకర్లు’గా పిల్లలు డాన్సులు చేస్తూ పాపులారిటీ సంపాదిస్తున్నారు. కాని అవి ఒక్కోసారి శృతి మించి ఫాలోయెర్స్ను పెంచుకోవడానికి శరీరం కనిపించే లేదా పెద్దల్లా శరీర కదలికలు చేసే విధంగా ఉండటం ప్రమాదంగా పరిణమించింది. కొందరు తల్లిదండ్రులు పిల్లలతో ఇలాంటి వీడియోలను చేసి మరీ పెడుతున్నారు. 30 సెకన్ల సేపు ఉండే ఇన్స్టా రీల్స్ ఇవాళ చాలామంది పిల్లలను తప్పు దోవ పట్టించడమే కాక ఇతర ‘ఉద్రేకపరిచే’ డాన్సులను, డమ్మీ సంభాషణలను వారు చూసేలా చేస్తోంది. ఫొటోల ప్రమాదం ఫేస్బుక్లో 18 ఏళ్ల లోపు పిల్లలు అకౌంట్లు కలిగి ఉంటున్నారు. వీరు అకౌంట్స్ ఓపెన్ చేసేలా కొంతమంది తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. ఒకసారి అకౌంట్ ఓపెన్ చేశాక ఇక ఎవరెవరు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెడతారో చెప్పలేం. మెసెంజర్లో ఎవరు చాట్కు ఆహ్వానిస్తారో తెలియదు. అలాంటివి ఏమీ లేకపోయినా చీటికి మాటికి పిల్లల ఫొటోలు పిల్లలుగాని పెద్దలు కాని పోస్ట్ చేయడం క్షేమం కాదు. వాటిని సేవ్ చేసుకుని మార్ఫింగ్ చేసే వీలు ఉంటుంది. ఫేస్బుక్లో రకరకాల భావజాలాలు, వీడియోలు, యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. అవన్నీ పిల్లల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో మనకు తెలిసే అవకాశం లేదు. అడిక్షన్ అంటే పిల్లలు ఫోన్కు అడిక్ట్ అయితే వారు కేవలం గేమ్స్ ఆడుతూ మాత్రమే అడిక్ట్ కారు. ఇవాళ వస్తున్న కామెడీ స్కిట్లు, డాన్స్ షోలు, ఓటిటి ప్లాట్ఫామ్స్లో ఉన్న సిరీస్లు... వీటన్నింటిని చూస్తూ ఫోన్కు అడిక్ట్ అవుతారు. కొన్ని రకాల గేమ్స్ వారిని పదే పదే ఫోన్ చేతిలో పట్టుకునే విధంగా ఎప్పుడెప్పుడు క్లాస్/తల్లిదండ్రులు చెప్పిన పని పూర్తవుతుందా ఎప్పుడు ఫోన్ చేతిలోకి తీసుకుందామా అని అస్థిమితం చేస్తాయి. కామెడీ పేరుతో సాగే అశ్లీల సంభాషణలు వేస్తున్న ప్రభావం తక్కువ ఏమీ కాదు. ఓటిటి ప్లాట్ఫామ్స్లో చాలా సిరీస్ ‘18 ప్లస్’గా ఉంటాయి. కాని వాటిని కూడా 10–13 ఏళ్ల మధ్య పిల్లలు చూస్తున్నారు. మార్కెట్ మార్కెట్ కూడా పిల్లల వెంట పడుతుంది. సోషల్ మీడియాలో ఉండే పిల్లలు వారు బ్రౌజ్ చేసే సైట్లు, ప్రొడక్ట్స్ను బట్టి వారికి యాడ్స్ ప్రత్యక్షమవుతాయి. స్లిమ్ కావాలంటే ఈ ఫుడ్ తినండి, అందంగా కనిపించాలంటే ఈ బట్టలు వాడండి, ఫలానా యాప్ ద్వారా ట్యూషన్ క్లాసులు వినండి, ఫలానా చోటుకు ప్రయాణాలు కట్టండి అని వారిని ఆకర్షిస్తూ ఉంటాయి. పిల్లలు అవి చూసి కావాలని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. పుస్తకం బెటర్ పిల్లలు ఏ పుస్తకం చదువుతున్నారో దాని కవర్ మనకు కనపడుతూ ఉండటం వల్ల తెలుస్తుంది. కాని వారు ఫోన్ చూస్తూ ఉంటే అందులో ఏం చూస్తున్నారో ఎదురుగా ఉన్న మనకు తెలియదు. ఎదిగే వయసులో ఉన్న పిల్లలను ఒక మాయా ప్రపంచంలో దించినట్టే... వారి చేతికి సెల్ ఇవ్వడం అంటే. వారిని కనిపెట్టే సమయం లేదని ఇప్పుడు ఊరుకుంటే భవిష్యత్తు సమయమంతా వారి కోసం బెంగపడాల్సి వస్తుంది. జాగ్రత్త పడదాం. ఫోన్ తగ్గించి పుస్తకం ఎక్కువగా పెడదాం. -
చదువు కోసం సమాధిపైకి.. అక్కడైతేనే ఆన్లైన్కు ఓకే
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోయగూడెం గ్రామంలో సెల్ నెట్వర్క్ సిగ్నల్స్ సరిగ్గా రావు. ఊరిబయట పంట చేల వద్ద ఉన్న సమాధుల వద్ద మాత్రం నెట్వర్క్ బాగుంటుంది. దీంతో విద్యార్థులు సమాధుల వద్ద కూర్చుని ఆన్లైన్ పాఠాలు వినాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ముగ్గురు విద్యార్థినులు గురువారం సమాధిపై కూర్చొని ఆన్లైన్ పాఠాలు వింటున్న దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్మనిపించింది. – బయ్యారం ఈ ఏడాది పాతవే! సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రతిఏటా పాఠశాలలు ప్రారంభం రోజునే అందజేసే ఉచిత రెండు జతల స్కూల్ యూనిఫామ్స్ ఈ ఏడాది విద్యార్థులకు ఇంకా ఇవ్వలేదు. నిరుపేదల విద్యార్థులు ఈ బట్టలనే వేసుకొని సంతోషంగా ఉండేవారు. అయితే గత ఏడాది కరోనా భయంతో పాఠశాలలు మూసి వేసినా యూనిఫామ్స్ మాత్రం ఇవ్వడం ఆపలేదు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బట్టలను ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా క్లాత్ కూడా కొనుగోలు చేయలేదని, ఈ ఏడాది బట్టలు రావడం ఇబ్బందే అని అధికారులు చెబుతున్నారు. అసలే కరోనా కష్టకాలంలో కుటుంబాలు పోషించుకోవడమే ఇబ్బందిగా ఉంది. ఇటువంటి పరిస్థితిలో పిల్లలకు బట్టలు కొనలేని దుస్థితిలో తల్లిదండ్రులు ఉండటంతో పేద పిల్లలు పాత బట్టలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. గత ఏడాది ముందుగానే.. ప్రతీ సంవత్సరం మాదిరిగానే గత ఏడాది కూడా పిల్లలకు కొత్త బట్టలు కుట్టించారు. కరోనాతో పాఠశాలలు తెరుచుకోక పోవడంతో, ఆన్లైన్ ద్వారానే క్లాసులు నిర్వహించారు. అయినా యూనిఫామ్స్ మాత్రం ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మరీ పంపిణీ చేశారు. గత ఏడాది జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలతో పాటు, మోడల్ స్కూల్స్, కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో మొత్తంగా 50,474 మంది విద్యార్థులు, విద్యార్థినులు చదివారు. వీరికి ఒక్కొక్కరికి రూ. 600 విలువ చేసే క్లాత్, మగవారికి షర్ట్, ప్యాయింట్, నెక్కర్, ఆడ పిల్లలకు చిన్న వారికి షర్ట్, పర్కిన్ క్లాత్, పెద్దవారికి పంజాబీ డ్రస్ క్లాత్ చున్నీల క్లాత్ ఇచ్చారు. అదే విధంగా జతకు రూ. 50 చొప్పున రెండు జతలకు రూ. 100 ఖర్చుతో యూనిఫామ్స్ కొనుగోలు చేసి అందజేశారు. ఇలా సర్వశిక్ష అభియాన్ నిధుల నుంచి రూ. 354.683 లక్షలు విడుదల చేశారు. ఈ నిధులతో కొనుగోలు చేసిన క్లాత్ జిల్లా విద్యాశాఖ అధికారికి, అక్కడి నుంచి ఎమ్మార్సీకి అక్కడి నుంచి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపించారు. ఈ ప్రక్రియ అంతా గత ఏడాది ఏప్రిల్ నెల చివరలోనే పూర్తి చేయగా జూన్ మొదటి వారంలో కుట్టించి విద్యార్థుల ఇంటికి వెళ్లి బట్టలు పంపిణీ చేశారు. ఈ ఏడాది ఊసే లేదు... గత ఏడాది మాదిరిగా ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ చేసి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించిన విద్యాశాఖ పిల్లలకు అందజేసే యూనిఫామ్ మాత్రం ఇవ్వడం లేదు. వేసవి కాలంలోనే పాఠశాలలకు రావాల్సిన క్లాత్ రాలేదు. అసలు ఈ ఏడాది యూనిఫామ్స్కు బడ్జెట్ కేటాయించకపోవడం గమనార్హం. కరోనాతో ప్రైవేట్ పాఠశాలలు వదిలి ప్రభుత్వ పాఠశాలల బాటపడుతున్న విద్యార్థులకు ఉచిత బట్టలు ఇవ్వడం లేదని తెలియడంతో నిరుత్సాహ పడుతున్నారు. ప్రభుత్వం అందజేసే ఉచిత యూనిఫామ్స్తో పిల్లలకు బట్టలు కుట్టించే భారం తగ్గిందని, ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కష్టకాలంలో అప్పులు చేసి బట్టలు కుట్టించాల్సి వస్తుందని తల్లిదండ్రులు అంటున్నారు. పాతబట్టలే వేసుకుంటున్నా.. ప్రతీ సంవత్సరం బడి తెరవగానే రెండు జతల కొత్త బట్టలు ఇచ్చేవారు. ఈ బట్టలు వేసుకొని బడికి పోయేదాన్ని.. బతుకమ్మ పండుగకు అమ్మానాన్నలు కొత్త బట్టలు కుట్టిస్తారు.. ఇప్పుడు సార్లు బట్టలు ఇవ్వలేదు. ఇటు అమ్మానాన్న కొత్త బట్టలు కుట్టివ్వలేదు. దీంతో పాత బట్టలే వేసుకుంటున్నా.. నేనే కాదు.. అందరూ ఇలాగే చేస్తున్నారు. చినిగినవి కుట్టుకుంటూ వేసుకుంటున్నాం. – గద్దల పూజిత, పదో తరగతి విద్యార్థిని,జెడ్పీహెచ్ఎస్ పెద్దవంగర కష్టకాలంలో బట్టలు ఇవ్వలేదు ఒక వైపు కరోనా కష్టకాలంలో బతకటమే ఇబ్బందికరంగా మారింది. అంతకముందు ప్రతీ సంవత్సరం పిల్లలకు రెండు జతల యూనిఫామ్స్ ఇచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది యూనిఫామ్ ఇవ్వటం మరిచిపోయింది. పోయిన సంవత్సరం కరోనా ఎఫెక్ట్తో పాఠశాల ప్రారంభం అయిన సమయంలోనే పుస్తకాలతో పాటు యూనిఫామ్ ఇచ్చారు. ఈ సంవత్సరం యూనిఫామ్ ఇస్తారో ఇవ్వరో తెలియని పరిస్థితి ఉంది. – మేర్గు సంధ్య(బయ్యారం) ఈ ఏడాది బడ్జెట్ రాలేదు.. ఈ ఏడాది బడ్జెట్లో యూనిఫామ్కు డబ్బులు కేటాయించలేదు. దీంతో ప్రతీ ఏడాది మాదిరిగా జిల్లాకు క్లాత్ రాలేదు. దీంతో పిల్లలకు యూనిఫామ్స్ ఇవ్వలేదు. ప్రతీ విద్యార్థి ఆన్లైన్ క్లాసులు వినేలా చర్యలు తీసుకుంటున్నాం.. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే యూనిఫామ్ కుట్టించి ఇస్తాం. – సోమశేఖర శర్మ, జిల్లా విద్యాశాఖ అధికారి -
పాఠాలు సరే.. ప్రణాళికేది?
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో బడులు తెరుచుకోకున్నా ఆన్లైన్, వీడియో పద్ధతిలో బోధనతో విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఇప్పటివరకు పాఠశాల విద్యా వార్షిక ప్రణాళిక (అకడమిక్ క్యాలెండర్) జాడలేదు. వాస్తవానికి విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే ఏడాదిలో చేపట్టే అన్ని బోధన కార్యక్రమాలు, పరీక్షలు, సెలవులు, వాటి కాలపట్టికతో అడకమిక్ క్యాలెండర్ను విడుదల చేయడం విద్యాశాఖకు ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ సారి క్యాలెండర్ లేకపోవడంతో అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది. పరీక్షలెప్పుడు... సెలవులెప్పుడు...? సాధారణంగా జూన్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైతే... ఆగస్టులో సమ్మేటివ్–1 పరీక్షలు, నిర్ణీత వ్యవధిలో ఫార్మేటివ్–1 పరీక్షలను నిర్వహించేవారు. కోవిడ్ నేపథ్యంలో ఈ సారి ఆన్లైన్ తరగతులు నెలరోజులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. 2021–22 విద్యా సంవత్సరం ప్రారంభ, ముగింపు తేదీలను కూడా అధికారులు స్పష్టం చేయలేదు. పైగా అకడమిక్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో పరీక్షల నిర్వహణపైనా స్పష్టత కరువైంది. పాఠ్యాంశ బోధన ఏ ప్రాతిపదికన నిర్వహించాలి, ఏయే చాప్టర్లను ఏయే సమయంలో పూర్తిచేయాలో ఉపాధ్యాయులకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులిస్తారు? పాఠశాలల చివరిరోజు ఎప్పుడనే దానిపైనా గందరగోళం ఏర్పడింది. క్యాలెండర్ ఊసేది? పాఠశాల విద్యా వార్షిక ప్రణాళిక రూపకల్పనలో ఎస్సీఈఆర్టీ అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. పాఠశాల విద్యాశాఖ సూచనలకు అనుగుణంగా కాలపట్టిక ఖరారు చేస్తారు. కానీ 2021–22 విద్యా వార్షిక ప్రణాళిక రూపకల్పనపై అటు పాఠశాల విద్యాశాఖ అధికారులు, ఇటు ఎస్సీఈఆర్టీ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి కసరత్తు చేయలేదని తెలు స్తోంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో ఆ ప్రక్రియ ప్రారంభించలేదనే అభిప్రాయాన్ని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో వ్యక్తం చేయడం గమనార్హం. -
ఆన్లైన్ కష్టాలు.. చదవాలంటే చెట్టెక్కాల్సిందే
సాక్షి, పర్లాకిమిడి( భువనేశ్వర్): ఆన్లైన్ విద్యా బోధనతో గజపతి జిల్లా విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో ఇంటర్నెట్ సిగ్నల్స్ సక్రమంగా అందకపోవడంతో ఆన్లైన్ బోధన విద్యార్థులకు అందని ద్రాక్షలా తయారైంది. దేశంలోని అన్ని చోట్లా 4జీ సేవలు అందుబాటులో ఉండగా మెట్రో సిటీల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కానీ స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు కావొస్తున్నా జిల్లాలో మొబైల్ సేవలకు ప్రజలు నోచుకోవడం లేదు. ప్రతి పంచాయతీకి ఫైబర్ నెట్ వర్క్ అందిస్తామని కేంద్రం చెబుతున్నా గజపతి జిల్లాలో ఆ సేవల జాడే లేదు. జిల్లాలో విద్యార్థులకు కనీసం 2జీ సేవలు కూడా అందకపోవడంతో చెట్లు, కొండలు ఎక్కుత సిగ్నల్స్ కోసం వెతుక్కుంటూ క్లాసులు వింటున్నారు. ఈ కష్టాలపై జిల్లా ప్రజలు పలుమార్లు కలెక్టర్ దృష్టికి తెచ్చినా ఫలితం లేకపోయింది. పట్టించుకోని బీఎస్ఎన్ఎల్ అధికారులు ప్రతిసారీ జరుగుతున్న జిల్లా సమీక్షలో ఇంటర్నెట్ సేవల కోసం బీఎస్ఎన్ఎల్ టవర్స్తో పాటు నెట్వర్క్ స్పీడ్ పెంచాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నా పట్టించుకునే వారే కరువయయ్యారు. జిల్లాలో ఇతర ప్రైవేటు నెట్వర్క్ కనెక్షన్లు పనిచేయవు. బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్పైనే ఉద్యోగులు, విద్యార్ధులు ఆధారపడుతున్నారు. ఆధార్, ఈ–సేవా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఆన్లైన్లోనే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశిస్తుంటే నెట్వర్క్ అందకుండా పనిచేయడం ఎలా అని పశ్నిస్తున్నారు. జిల్లా కేంద్రం పర్లాకిమిడిలోనే నెట్వర్క్ సిగ్నల్స్ అందడం లేదంటే మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇన్ని అవస్థలు పడుతున్నా బీఎస్ఎన్ఎల్ అధికారులకు చీమ కుట్టినట్లయినా లేకపోతోందని జిల్లా ప్రజలు వాపోతున్నారు. -
12 నుంచి ఇంటర్ సెకండియర్ ఆన్లైన్ తరగతులు
సాక్షి, అమరావతి: ఏపీలో ఇంటర్ సెకండియర్ ఆన్లైన్ తరగతులు ఈ నెల 12 నుంచి ఆరంభం కానున్నాయి. ఇంటర్ సెకండియర్ 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక అకడమిక్ క్యాలెండర్ను ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించింది. ఏపీలోని అన్ని కాలేజీలకు ఈ మేరకు సమాచారాన్ని పంపింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 213 పని దినాలు ఉండనున్నాయి. ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో బోధన, బోధనేతర సిబ్బంది ఈ నెల 12 నుంచి కాలేజీలకు హాజరు కావాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అకడమిక్ క్యాలెండర్ వివరాలు.. ► ఈ నెల 12 నుంచి అక్టోబర్ 16 వరకు అకడమిక్ ఇయర్ ఫస్ట్ టర్మ్ ► ఆగస్టులో మొదటి యూనిట్ టెస్టు ► సెప్టెంబర్లో రెండో యూనిట్ టెస్టు అక్టోబర్ 1 నుంచి 8 వరకు అర్థ సంవత్సర పరీక్షలు ► అక్టోబర్ 9 నుంచి 17 వరకు ఫస్ట్ టర్మ్ సెలవులు ► అక్టోబర్ 18 నుంచి కాలేజీల పునఃప్రారంభం ► అక్టోబర్ 18 నుంచి 2022 ఏప్రిల్ 23 వరకు అకడమిక్ ఇయర్ సెకండ్ టర్మ్ ► నవంబర్లో 3వ యూనిట్ టెస్టు ► డిసెంబర్లో 4వ యూనిట్ టెస్టు ► 2022 జనవరి 8 నుంచి 16 వరకు సెకండ్ టర్మ్ సెలవులు ► జనవరి 17న కాలేజీల పునఃప్రారంభం ► ఫిబ్రవరి మొదటి వారంలో ప్రీ ఫైనల్ పరీక్షలు ► ఫిబ్రవరి చివరి వారం నుంచి ప్రాక్టికల్స్ ► మార్చి మొదటి వారంలో థియరీ పరీక్షలు ఆరంభం ఏప్రిల్ 23వ తేదీ చివరి పనిదినం ► ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ► మే చివరిలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ► జూన్ 1 నుంచి 2022–23 విద్యా సంవత్సరానికి కాలేజీల పునఃప్రారంభం ► అన్ని ఆదివారాలు, రెండో శనివారాలు సెలవు దినాలు. -
మహమ్మారి కాలంలో చదువు సమస్య
మహమ్మారి మూలాన, విద్యార్థులు, ఉపాధ్యాయులు భౌతికంగా తరగతి గదిలో కలుసుకొనే అవకాశమే లేకుండా పోయింది. అయినప్పటికీ విద్యాబోధన ఏదోలా ఆన్లైన్లో కొనసాగుతోంది. అయితే ఈ విషయంలో ఇందులో భాగ స్వాములైన అన్ని పక్షాలూ తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నాయి. భౌతిక తరగతి గదిలో విద్యార్థులు ప్రాథమిక పాఠశాల నుండి మధ్యస్థ పాఠశాలకు వచ్చేసరికి రాయడం, మాట్లాడటం, చదవడం, వినడం వంటి నైపుణ్యా లను ఒంటబట్టించుకొనే వారు. విద్యతో పాటు శారీరక శ్రమ, ఆటల పోటీలు, సాంస్కృతిక ఉత్సవాలు, విహార యాత్రలు విద్యార్థులలో జీవిత నైపుణ్యాలను పెంపొందించేవి. వీటికి ఇప్పుడు ఎంతమాత్రమూ వీలు లేకుండా పోయింది. ఆన్లైన్ విద్య అందరికీ అందుబాటులో లేకపోయినా కొంత వరకు విద్యను కొనసాగించడానికి వెసులుబాటు కల్పించింది. దీని మూలంగా ఇళ్లే పాఠశాలగా, తల్లిదండ్రులే ఉపాధ్యా యులుగా అవతారం ఎత్తారు. అయినప్పటికీ విద్యార్థి నైపుణ్య శిక్షణలో అవాంతరాలు తలెత్తుతున్నాయి. ఐదు నుండి పద కొండేళ్ల వయసు గల పిల్లలు నీలిరంగు తెరలకు అతుక్కు పోతూ వివిధ ఆరోగ్య రుగ్మతలను కొనితెచ్చుకొంటున్నారు. కౌమార వయసు విద్యార్థులు కూడా పాఠాలను అర్థం చేసుకోవడంలో తీవ్రంగా కష్టపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సాధారణ తరగతులు నిర్వహించడానికే కనీస సౌకర్యాలు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఫోన్లు, ట్యాబ్లు, ఇంటర్నెట్ కనెక్షన్లు వంటి స్మార్ట్ గాడ్జెట్లను కొనుగోలు చేయలేని దయ నీయ స్థితి. ఇంకా కొందరు విద్యార్థులు మిడ్–డే భోజన కార్య క్రమంలో భాగంగా పెట్టే ఒక్క పూట భోజనం కోల్పోయారు. తరగతి గదిలో విద్యార్థుల వైఖరులు, ప్రవర్తనలను గమ నిస్తూ వారిని సక్రమమైన దారిలో మార్గనిర్దేశం చేసి విద్యార్థు లను సామాజిక బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు ముఖ్య భూమిక పోషిస్తారు. వాస్తవానికి, చాలా మంది టీచర్లు నల్లబల్ల, సుద్దముక్కను ఉపయోగించి బోధించే నైపుణ్యం గలవారు. ఆన్లైన్ టీచింగ్ మోడ్ చాలా మంది ఉపాద్యాయులకు కొత్తది. ప్రత్యేకించి కంటెంట్ను సిద్ధం చేయడానికి, కంటెంట్ను పంచుకోవడానికి, ఉపన్యాసం ఇవ్వడానికి, మదిం పులను, మూల్యాంకనాలను రూపొందించడానికి సీనియర్ ఉపాధ్యాయులు చాలా కష్టపడుతున్నారు. ఆన్లైన్ బోధనలో విద్యార్థి పనితీరును అంచనా వేయడం వంటి వాటికి మాత్రమే టీచర్ల పాత్ర పరిమితమైంది. మెంటర్స్, గైడ్స్ మొదలైన ఇతర ముఖ్య పాత్రలను నిర్వర్తించలేకపోతున్నారు. తల్లిదండ్రులు ఆన్లైన్ పాఠశాలల కంటే సంప్రదాయ పాఠ శాల విద్యావిధానంలో సంతోషంగా ఉండేవారు. పిల్లలు రోజుకు ఎనిమిది గంటలు ఇంటి నుండి దూరంగా ఉండేవారు. దీనికి తోడుగా, కొంతమంది తల్లిదండ్రులు వారిని స్పోర్ట్స్, ఫిజికల్ ఫిట్నెస్, డ్రాయింగ్, సంగీతం మొదలైన క్లాసులలో చేర్పించే వారు. ఈ మహమ్మారి ప్రతి విద్యార్థినీ ఇళ్ళలోనే ఉండేలా కట్టడి చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగం చేసే తల్లిదండ్రులు పిల్లల ఆన్లైన్ తరగతులు, హోంవర్క్, అసైన్మెంట్లు, కనెక్టివిటీ సమస్యలతో సతమతమవుతున్నారు. లాక్డౌన్ కారణంగా, చాలామంది తల్లిదండ్రులు తమ ఉద్యోగాలను, ఉపాధిని కోల్పో యారు. ఫలితంగా అనేక మంది పిల్లల విద్య కొనసాగింపు ప్రశ్నార్థకమైంది. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఫార్మసీ షాపులు, కూరగాయల మార్కెట్లు, కిరాణా షాపులు, గాజు దుకాణాలు మొదలైన వ్యాపారాలలో సహాయం కోసం తీసుకువెళ్తున్నారు. మిగులు నగదులో ఉన్న పాఠశాలలు మహమ్మారి సంక్షో భాన్ని ఎదుర్కొన్నాయి. బడ్జెట్ పాఠశాలలను నిర్వహించే నిర్వా హకులు మాత్రం అనేక ఆటుపోటులను ఎదుర్కోవడం వలన పాఠశాల నిర్వహణ కష్టసాధ్యం అవుతోంది. ముఖ్యంగా ఈ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు రుసుములు చెల్లించడంలో విఫలమవ్వటం వలన నగదు సంక్షోభానికి దారితీసింది. బోధన, బోధనేతర సిబ్బంది జీతాలను చెల్లించలేక పోయారు. బడ్జెట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు సగం జీతాలు లేదా జీతాలు లేకుండా పనిచేస్తున్నారు. వారిలో కొందరు బోధనా వృత్తిని వదిలి వేరొక వృత్తిని చేపట్టారు. అను భవజ్ఞులైన ఉపాధ్యాయులు తిరిగి విద్యారంగంలోకి రాకపో వచ్చు. ఇది విద్యావ్యవస్థకు భారీ నష్టాన్ని కలిగించే అవకాశం లేకపోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించి ఒక బ్లూప్రింట్ రూపకల్పన చేయాలి. అధికారిక తర గతి గది విద్యను పొందకుండా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును మహమ్మారి నాశనం చేసింది. ఇది వారి నైపుణ్యాలు, వైఖరులు, సామాజిక ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తుంది. ఒక ప్రధాన, బాధ్యతాయుతమైన వాటాదారుగా ప్రభుత్వం దేశంలోని ప్రతి బిడ్డకు సమాన విద్యను పొందే ప్రణాళికను రూపొందించాలి. డాక్టర్ మైలవరం చంద్రశేఖర్ గౌడ్ వ్యాసకర్త సహాయ ఆచార్యులు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఇంటర్ప్రైజ్, హైదరాబాద్ ‘ 81870 56918 -
ఫీజు చెల్లించలేదని ఆన్లైన్ క్లాసులు ఎలా ఆపుతారు?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజలు వసూలు చేస్తున్నారంటూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్పై పబ్లిక్ స్కూల్ యాక్టివ్ పేరెంట్స్ ఫోరం చేసిన అప్పీల్పై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణచేపట్టింది. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని పిటిషన్దారు కోర్టుకు తెలిపారు. ఫీజులు చెల్లించని 219 మందికి ఆన్లైన్ తరగతులు బోధించడం లేదన్నారు. పిటిషనర్ వాదనలకు బదులిస్తూ.. 10 శాతం ఫీజు పెంపును వెనక్కి తీసుకోవడంతోపాటు.. ఇప్పటికే 10వేల రూపాయల ఫీజు తగ్గించామని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఫీజు చెల్లించలేదని ఆన్లైన్ తరగతులు ఎలా ఆపుతారని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. అలా ఆపితే పిల్లల చదువుకునే హక్కును కాలరాయడమేనని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా విపత్తు వేళ మానవీయంగా వ్యవహరించాలని కోర్టు సూచించింది. ఫీజుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఫీజులతో ముడి పెట్టకుండా ఆన్లైన్ బోధన కొనసాగించాలన్న హైకోర్టు.. తదుపరి విచారణ జూలై 13కి వాయిదా వేసింది. -
‘ఈ’ చదువులు సాగేదెట్టా?
చేతిలో మొబైల్ ఫోనుతో సిగ్నల్స్ సరిగ్గా వచ్చే గుట్టల మీద కూర్చున్న పిల్లలు... ఫుట్పాత్ మీద అమ్మ వ్యాపారం చూసుకుంటుంటే రోడ్డు వారగా చిన్న ఫోనుతో కుస్తీ పడుతున్న అమ్మాయిలు... కరోనా కష్టకాలంలో సాయంత్రాలు పనిచేసుకుంటూ, పగలు వీలున్నప్పుడు పాఠాలు వింటున్న అబ్బాయిలు... ఇవి దేశమంతటా కనిపిస్తున్న దృశ్యాలు. మారిన పరిస్థితుల్లో మారిపోయిన విద్యాభ్యాసపు విషాద ముఖచిత్రాలు. కరోనా అనంతర కొత్త కాలంలో బడి చదువులు పోయి, ఈ–చదువులు తప్పనిసరయ్యాక విద్యారంగం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్ళకు ఇవి ఆనవాళ్ళు. గణాంకాలు అసలుకథను మరింత స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో సగటున 37 శాతం స్కూళ్ళలోనే పనిచేసే కంప్యూటర్లున్నాయి. 22 శాతం బడుల్లోనే ఇంటర్నెట్ వసతి ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ కలిపితేనే ఈ లెక్క. ప్రభుత్వ స్కూళ్ళ లెక్కతీస్తే 11 శాతం బడుల్లోనే ఇంటర్నెట్, 28.5 శాతం విద్యాలయాల్లోనే కంప్యూటర్లు ఉన్నాయనేది చేదు నిజం. దేశంలోని దాదాపు 15 లక్షలకు పైగా పాఠశాలలు, 8.5 కోట్ల మంది అధ్యాపకులు, 26 కోట్ల మందికి పైగా బడి పిల్లల నుంచి సేకరించిన డేటా ఇది. కరోనా రాక ముందు 2019–20 విద్యాసంవత్సరపు ఈ డేటా ఇప్పుడు కీలకమైంది. ఎందు కంటే, కరోనా వేళ పాఠశాల ముఖం చూసే పరిస్థితి లేని దేశంలోని 26 కోట్ల మందికి పైగా ఈ బడి పిల్లలకు ఈ–చదువులే శరణ్యం. ఇప్పటికీ ఎప్పుడు ఎన్నో కరోనా ఉద్ధృతి మీద పడుతుందో తెలియని భయాలు. అందుకే, ప్రత్యక్ష తరగతులకు తోడు డిజిటల్ తరగతుల మిశ్రమ అధ్యయన, అభ్యసన విధానం తప్పదు. కానీ, సాంకేతిక వసతులు, భారతీయ భాషల్లో నాణ్యమైన డిజిటల్ పాఠాలు కొరవడిన ఈ బడులలో పాఠాలు చెప్పేదెట్టా? కంప్యూటర్లు, ఇంటర్నెట్ కాదు కదా కనీసం మొబైల్ ఫోన్లు కూడా కరవైన బడుగు పిల్లల చదువులు సాగేదెట్టా? తరాలు మారుతున్నా ఆర్థిక అంతరాలే ఇప్పటికీ సమసిపోని సమాజం మనది. ఇప్పుడు ఈ సాంకేతిక అంతరం సరికొత్త సవాలు. సామాన్య ప్రజానీకంలో సింహభాగం ఆర్థికంగానే కాదు, డిజిటల్ వసతులలోనూ వెనుకబడ్డారు. కులం, ప్రాంతం, ధనిక – పేద వర్గం, లింగ భేదం – ఇలాంటి వ్యవస్థాగతమైన సంక్లిష్ట కోణాలెన్నో ఈ డిజిటల్ అంతరంలో భాగం. కరోనా దెబ్బతో దేశంలోని డిజిటల్ అంతరం బట్టబయలైంది. కేవలం మూడో వంతు మంది పిల్లలే ఇప్పుడు ఆన్లైన్లో చదువు కొనసాగిస్తున్నారు. ఇదీ గత అక్టోబర్లో విడుదలైన వార్షిక స్థాయి విద్యా నివేదిక వెల్లడించిన పరిస్థితి. అంటే, ఎంతోమంది అర్ధంతరంగా బడి చదువుకు స్వస్తి చెబుతున్న దుఃస్థితి. ఫీజుల చెల్లింపులు లేక, ఖర్చులు భరించలేక దేశంలో 15 లక్షల పైగా ప్రైవేట్ స్కూళ్ళు నిరుడు మూతబడ్డాయి. విద్యారంగంలోని ఈ క్లిష్టపరిస్థితుల్లో డిజిటల్ అంతరాన్ని పోగొట్టడం పాలకుల తక్షణ బృహత్ కర్తవ్యమైంది. ఈ–చదువులకు సమకూర్చాల్సిన వసతులు, అందించాల్సిన నైపుణ్యాల మీద దృష్టి పెట్టడం అత్యవసరమైంది. కానీ, ఇక్కడే అసలు సమస్య ఉంది. తినడానికి తిండిగింజలు దొరకని బతుకుల్లో... డిజిటల్ తరగతులతో ప్రాథమిక విద్యా హక్కును సాకారం చేయాలనుకోవడం ఎంత బలమైన పాలకులకైనా భగీరథ ప్రయత్నమే. కానీ, సంకల్పం ముఖ్యం. వివిధ భాషల్లో క్యూఆర్ కోడ్ ఉన్న పాఠ్యపుస్తకాల రూపకల్పన, డిజిటల్ విద్యావేదికల ఏర్పాటు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. కానీ, అవి చాలవు. గ్రామాలన్నిటికీ బ్రాడ్ బ్యాండ్ వసతి కల్పన కోసం సరిగ్గా ఏణ్ణర్ధం కితం 7 లక్షల కోట్లతో కేంద్రం ‘జాతీయ బ్రాడ్ బ్యాండ్ మిషన్’ను ఆర్భాటంగా ఆరంభించింది. వెయ్యి రోజుల్లో 6 లక్షల గ్రామాలను ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్తో అనుసంధానిస్తామన్నది క్రితం నిరుడు ఆగస్టులో సాక్షాత్తూ ప్రధాని ఇచ్చిన హామీ. ఇప్పుడు వాగ్దానాల అమలులో వేగం పెంచాలి. అలాగే చిరకాలంగా ఉన్న బి.ఎస్. ఎన్.ఎల్. లాంటి విస్తృత నెట్వర్క్ను సమర్థంగా వాడుకోవాలి. అప్పుడు పాఠశాలలకు నెట్ వసతి అందించడం కేంద్రానికి అసాధ్యం కాదు. మరోపక్క కార్పొరేట్ సామాజిక బాధ్యత మొదలు పౌరసమాజ విరాళాలతో పాఠశాలకు కంప్యూటర్లు సమకూర్చవచ్చు. ఇలాంటి చర్యలు డిజిటల్ చదువుల అవసరాలను తీరుస్తాయి. ఈ ప్రాథమిక వసతుల కల్పన దీర్ఘకాలం పడుతుంది గనక, తక్షణమే చదువుల్లో అంతరాలు తొలగించడానికి ఉచిత యూనిఫామ్, ఉచిత భోజనం లానే చిన్నపాటి స్మార్ట్ పరికరాలను అందిస్తే బాగుంటుందని విశ్లేషకుల మాట. ఏమైనా, ఒక రకంగా కరోనా మనకు ఓ మేలుకొలుపు. అనేక ప్రాథమిక రంగాల్లో మన వ్యవస్థాగత లోపాలను అది నగ్నంగా నిలబెట్టింది. ఇవాళ్టికీ విద్య, వైద్యం, ఆరోగ్యం లాంటి అనేక కీలక అంశాల్లో... మన అవసరాలకూ, అందుబాటులో ఉన్న వస తులకూ అగాధమంత లోటు ఉందని తేల్చిచెప్పింది. ఏలికల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది. ఇప్పుడిక ఈ ఉదాసీనతను వదిలించుకోవడమే మిగిలింది. కరోనా అనంతర న్యూ నార్మల్లో ఈ–చదువులు ఇక జీవితంలో అనివార్యం. అవిభాజ్యం. పాలకులు అది గుర్తెరగాలి, పాఠశాలలన్నిటికీ అత్యవసర సేవల కింద ఇంటర్నెట్ వసతులు కల్పించాలి. వాటితో పిల్లలకు చేరువయ్యేలా అధ్యాపకులకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించాలి. డిజిటల్ ఇండియా లాంటి బృహత్తర ఆశయాలకు ఇది తొలి అడుగు అయితేనే, భావి పౌరులకు విద్యోదయం! భారతావనికి అసలైన ఉషోదయం!! -
ఆన్లైన్ పాఠాలకు 1.12 లక్షల మంది దూరం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసులు ప్రారంభమైనా.. లక్ష మందికిపైగా విద్యార్థులు వాటిని అందుకోలేని పరిస్థితిలో ఉన్నారని విద్యాశాఖ గుర్తించింది. దూరదర్శన్, టీశాట్, ఇతర టీవీ చానళ్లు, ఆన్లైన్ మాధ్యమాల ద్వారా డిజిటల్ పాఠాలకు ఏర్పాట్లు చేశామని.. ఈ పాఠాలను చూడాలంటే టీవీ, కంప్యూటర్, ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్ వంటి డిజిటల్ డివైజ్లలో ఏదో ఒకటైనా ఉండాలని తెలిపింది. కానీ వీటిలో ఏ ఒక్కటీ అందుబాటులో లేని విద్యార్థులు 1,12,559 మంది ఉన్నారని.. మొత్తం విద్యార్థుల్లో వీరు 6.06 శాతమని వెల్లడించింది. గురువారం నుంచి ఆన్లైన్/డిజిటల్ తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన పరిస్థితిపై విద్యాశాఖ శుక్రవారం సమీక్షించింది. దీనిపై ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించింది. మొత్తం విద్యార్థుల్లో 12,68,291 మంది అంటే.. 68.29 శాతం మంది ఆన్లైన్/డిజిటల్ పాఠాలు విన్నారని పేర్కొంది. ఇంకా 31.71 శాతం మంది పాఠాలకు దూరంగా ఉన్నారని తెలిపింది. -
ఆన్లైన్ అవస్థలు; ఓసారూ.. సిగ్నలత్తలేదు!
ఒకవైపు ఆన్క్లాస్ల భారం.. మరొక వైపు మొబైల్ సిగ్నల్స్ ఏమో ఊరికి దూరం.. ఇది పల్లెల్లో పరిస్థితి. కరోనా కారణంగా ఆన్క్లాస్లు నిర్వహిస్తుంటే అదేమో సగం సగం అన్నట్లే ఉంది. ఆన్లైన్ క్లాస్ల్లో బోధించేది ఎంతవరకూ ఒంట పడుతుందో తెలీదు కానీ, మొబైల్ సిగ్నల్స్ మాత్రం విద్యార్థుల్ని పరేషాన్ చేస్తున్నాయి. సిగ్నల్ దొరక్కపోవడంతో ‘ ఓసారూ.. నో సిగ్నల్’ అనడమే వారి నోట మాట అవుతుంది. ఆ మాట ఆ సారుకి చేరుతుందో లేదో తెలీదు కానీ ఆన్లైన్ క్లాస్లు మాత్రం అటకెక్కిపోతున్నాయనడానికి ఇదొక ఉదాహరణ. సాక్షి, ఆదిలాబాద్ : ఒకచేత పుస్తకాలు.. మరోచేత సెల్ఫోన్లతో కుస్తీపడుతున్న వీరంతా ఆదిలాబాద్ రూరల్ మండలం లోహర గ్రామానికి చెందిన విద్యార్థులు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభమైన విషయం తెలిసిందే. లోహర గ్రామంలో సెల్ఫోన్ సిగ్నల్స్ అందకపోవడంతో.. ఇదిగో ఇలా ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలోని సిగ్నల్ అందే గుట్టపైకి వెళ్లి పాఠాలు వింటూ కనిపించారీ విద్యార్థులు. ఆన్లైన్ అభ్యసనం ఎలా సాగుతుందో శుక్రవారం పరిశీలించడానికి వెళ్లినపుడు ఈ దృశ్యం ‘సాక్షి’ కంటబడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి, ఆదిలాబాద్ రూరల్, సిరికొండ, బోథ్, బజార్హత్నూర్, తలమడుగు, కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్, లింగాపూర్, సిర్పూర్(యు), తిర్యాని, బెజ్జూర్, కౌటాల, పెంబీ, దస్తురాబాద్, కడెం, కోటపెల్లి, వేమన్పెల్లి, దండేపల్లిలోనూ ‘సిగ్నల్ దొరికేనా.. పాఠం వినేనా?’ అన్నట్టు పరిస్థితి ఉంది. -
మునిసిపల్ స్కూళ్లలో ఆన్లైన్ బోధన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మునిసిపల్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు బోధించాలని పురపాలకశాఖ నిర్ణయించింది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు నష్టపోకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సంకల్పించింది. రాష్ట్రంలో 59 పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 2,110 మునిసిపల్ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2 లక్షలమంది విద్యార్థులున్నారు. వీరికి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పాఠాలు చెప్పేందుకు జూమ్ లైసెన్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్లకు పురపాలకశాఖ కమిషనర్–డైరెక్టర్ ఎం.ఎం.నాయక్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. పదో తరగతి విద్యార్థులకు విజయవంతంగా ఆన్లైన్ తరగతులు రాష్ట్రంలో ఐదు పట్టణ స్థానిక సంస్థల్లో మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఆన్లైన్ తరగతులు విజయవంతమయ్యాయి. విజయవాడ, తిరుపతి, ఒంగోలు నగరాలు, శ్రీకాళహస్తి, నరసాపురం మునిసిపాలిటీల్లో పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహించారు. అనంతరం ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో పదో తరగతి విద్యార్థులకు అమలు చేయడంతో 33 వేలమంది విద్యార్థులు లబ్ధిపొందారు. దీంతో అన్ని మునిసిపల్ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు జూమ్ లైసెన్సులు కొనుగోలు చేయమని పురపాలకశాఖ మునిసిపల్ కమిషనర్లను ఆదేశించింది. మొదటి దశలో ఏడాదిపాటు లైసెన్సుల కొనుగోలుకు మునిసిపాలిటీల సాధారణ నిధులు వినియోగిస్తారు. విద్యార్థుల సంఖ్యను బట్టి అవసరమైనన్ని లైసెన్సులను కొనుగోలు చేస్తారు. ప్రతి పాఠశాల కనీసం 5 జూమ్ లైసెన్సులు, మొబైల్ స్టాండ్, బోర్డులు కొనుగోలు చేస్తుంది. వీటి కొనుగోళ్ల ప్రతిపాదనలను ఈ నెల 28లోగా నివేదించాలని, జూన్ 30 నాటికి కొనుగోలు చేయాలని పురపాలకశాఖ సూచించింది. తరువాత ముందుగా బ్రిడ్జ్ కోర్సులు, అనంతరం సిలబస్ను అనుసరించి తరగతులు నిర్వహిస్తారు. ఆన్లైన్ తరగతుల నిర్వహణను పర్యవేక్షించేందుకు రాష్ట్ర, మునిసిపల్ స్థాయిల్లో ప్రత్యేక సెల్లు ఏర్పాటు చేసింది. మునిసిపాలిటీ స్థాయి సెల్లో మునిసిపల్ మేనేజర్, సీనియర్ ప్రధానోపాధ్యాయుడు, విద్యా సూపర్వైజర్లు, వార్డు విద్య–డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ఈ–లెర్నింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర పురపాలకశాఖ కమిషనర్–డైరెక్టర్ ఎం.ఎం.నాయక్ ‘సాక్షి’కి తెలిపారు. -
Divya Gokulnath: ఆన్లైన్ టీచర్
టీచర్ కావాలన్నది ఆమె ఆశయం. అదొక్కటే కాదు, జీవితంలో ఎన్నో సాధించాలనుకున్నారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు వెదుక్కుంటూ వచ్చినా వెళ్లలేదు. తన సొంత దేశస్థులకు ఏదో ఒకటి చేయాలని కలలు కన్నారు. అలా కన్న కలలను సాకారం చేసుకున్నారు. బైజూస్ కో ఫౌండర్ అయ్యారు. ఆన్లైన్ పాఠాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. శక్తిమంతమైన ఎంట్ర్ప్రెన్యూర్గా ఎదిగారు బెంగళూరుకు చెందిన దివ్య గోకుల్నాథ్. భారతదేశంలోనే అతి పెద్ద ఎడ్ – టెక్ కంపెనీ బైజూస్. ఈ యాప్కి ఎన భై మిలియన్ల సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ఏడాదిన్నరగా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి సమయంలో ‘బైజూస్’ టీమ్ కొత్త కొత్త ప్రోడక్ట్స్ని తీసుకు వచ్చింది. ఉద్యోగులంతా వేరు వేరు ప్రాంతాలలో ఉంటూ ఈ ఏడాది కాలంలో పనులు చేస్తూ ఎన్నో విజయాలు సాధించేలా చేశారు ఈ సంస్థ కో ఫౌండర్ దివ్య గోకుల్నాథ్. విద్యార్థిగా చేరి... బైజూస్లో ఒక స్టూడెంట్గా చేరి కో ఫౌండర్ స్థాయికి ఎదిగారు. తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయటం వల్ల ఈ అద్భుత విజయం సాధించగలిగారు. చదువుకునే రోజుల్లోనే దివ్య ఆల్రౌండర్గా ఎదగాలనుకున్నారు. ‘‘నేను బయో టెక్నాలజీ చదువుకునే రోజుల్లో మాకు సరైన అధ్యాపకులు లేకపోవటంతో, చాలా ఇబ్బంది పడ్డాం. ఒకరితో ఒకరు చర్చించుకుంటూ పాఠాలు నేర్చుకునేవాళ్లం. పాఠాలు చెప్పే వారు లేక విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేలా ఏదో ఒకటి చేయాలని అప్పుడే ఒక నిశ్చయానికి వచ్చాను’’ అంటారు దివ్య గోకుల్నాథ్. టీచర్గా మొదటి రోజు.. బైజూలో విద్యార్థిగా చేరి, ఆ తరవాత అక్కడ టీచర్ని అయ్యాను. నేను టీచర్ కావాలనుకున్న నా కల అలా నెరవేరింది. మొదటి రోజు క్లాసు తీసుకున్నప్పుడు క్లాసులో వందమంది విద్యార్థులు ఉన్నారు. వారంతా నా కంటే రెండు మూడు సంవత్సరాలు మాత్రమే చిన్నవారు. నేను టీచర్లా కనిపించటం కోసం ఆ రోజున క్లాసుకి చీర కట్టుకుని వెళ్లాను. అప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. ఆ రోజు పాఠం చెబుతుంటే ఎంతో సంతృప్తిగా అనిపించింది’ అంటారు దివ్య టీచర్గా తన మొదటి అనుభవం గురించి. విదేశాలలో పెద్దపెద్ద విశ్వవిద్యాలయాలలో చదువుకోవటానికి వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారు. ఇంజినీరింగ్ చదివేటప్పుడు బయోటెక్నాలజీ చెప్పడానికి అనుభవజ్ఞులైన అధ్యాపకులు లేకపోవటంతో పడిన ఇబ్బందులను దివ్య గోకుల్నాథ్ మరచిపోలేదు. తనలా ఏ ఒక్క విద్యార్థి ఇబ్బంది పడకూడదనుకున్నారు. ‘ఆఫ్లైన్ టెస్ట్ ప్రిపరేషన్ క్లాసులు మానేసి, ఆన్లైన్ క్లాసులను దేశంలోని మారుమూలలకు సైతం తీసుకువెళ్లాలని మా బైజులో నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. 2015లో యాప్ లాంచ్ చేశాం. ఇందులో ర్యాంకులు, క్లాసులో టాపర్లు వంటివి ఉండవు. ఇందులో విజయం సాధించగలమని, మా ప్రోడక్టు మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. అన్నింటికీ మించి కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్దతు ఉంది’’ అంటారు దివ్య గోకుల్నాథ్. చిత్తశుద్ధి ఉండాలి.. స్టార్టప్లకు కావలసింది చిత్తశుద్ధి. ఏ స్టార్టప్ అయినా, కస్టమర్కి చాలా వేగంగా స్పందించడం ముఖ్యం. తొలిదశలో ఎంతమంది ఆదరిస్తున్నారనేది కాదు. పనిలో శ్రద్ధ చూపిస్తే విజయం దానంతట అదే నడుచుకుంటూ వస్తుంది. ఒక నిర్ణయం తీసుకోవటం, ఆచరణలో పెట్టడం వెంట వెంటనే జరిగి పోవాలి. ఆలస్యం చేస్తే నిరుపయోగం.. అని నమ్ముతారు దివ్య గోకుల్నాథ్. ‘‘నేను, బైజు... మా ఇద్దరి దార్శనికత, ప్రాధాన్యతలు ఒకేలా ఉంటాయి. మా విజయం వెనుక ప్లేబుక్ ఏమీ లేదు. ఈ పాండమిక్ సమయంలో, కేవలం ఆరు మాసాల వ్యవధిలో సుమారు 35 మిలియన్ల మంది మా యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు మా దగ్గర 80 మిలియన్ల మంది లెర్నర్స్ ఉన్నారు. మేం ఒక్కో అడుగు ఎదుగుతున్నాం’’ అంటూ తమ విజయం గురించి చెబుతారు దివ్య గోకుల్నాథ్. ఎన్నో ఆశయాలు, ఆలోచనతో కృషి చేస్తున్న దివ్య గోకుల్నాథ్... భారతదేశంలోనే కాకుండా విదేశాలకు కూడా తమ సేవలు విస్తరించాలనుకుంటున్నారు. -
Byjus: గూగుల్తో బైజూస్ జట్టు
న్యూఢిల్లీ: దేశీయంగా పాఠశాలల్లో ఆన్లైన్ విద్యాభ్యాసానికి తోడ్పడేలా టెక్నాలజీ దిగ్గజం గూగుల్తో దేశీ ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ బైజూస్ చేతులు కలిపింది. ఈ డీల్ ప్రకారం గూగుల్ వర్క్స్పేస్ ఫర్ ఎడ్యుకేషన్, బైజూస్కి చెందిన విద్యార్థి పోర్టల్ను అనుసంధానిస్తారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రాంలో నమోదు చేసుకున్న విద్యాసంస్థలు.. బైజూస్కి చెందిన మ్యాథ్స్, సైన్స్ బోధనా విధానాలతో తమ విద్యార్థులకు రిమోట్గా బోధించవచ్చు. దీనితో పాటు ఉపాధ్యాయులకు గూగుల్ క్లాస్రూమ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్ విద్యాభ్యాసం ప్రయోజనాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు తెలుసుకుంటున్నారని బైజూస్ సీవోవో మృణాల్ మోహిత్ తెలిపారు. గూగుల్తో భాగస్వామ్యం ద్వారా ఉపాధ్యాయులకు అవసరమైన సాంకేతిక తోడ్పాటును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. -
ఖైరతాబాద్: ఆన్లైన్ క్లాసుల్లో అశ్లీల ఫోటోలు షేర్ చేస్తూ..
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ నేపథ్యంలో కొనసాగుతున్న ఆన్లైన్ క్లాసుల్లోకి ఆకతాయిలు జొరబడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా ఉదంతాలు పెరిగిపోయాయి. తాజాగా ఖైరతాబాద్లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఈ తరహా నేరంపై ఫిర్యాదు చేశారు. ఆమె తన విద్యార్థులకు ఆన్లైన్లో ఇంగ్లీషు పాఠం చెప్తుంటారు. ఈ నేపథ్యంలోనే కొందరు ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా ఈ క్లాసులోకి ప్రవేశిస్తున్నారు. అసభ్య, అశ్లీల ఫొటోలను పోస్టు చేసి ఇతర విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. దీనిపై ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఆన్లైన్ క్లాసులో ఉన్న విద్యార్థుల్లో ఎవరో ఒకరి ఈ మెయిల్ ఐడీ, పాస్వర్డ్ సదరు ఆకతాయిలకు తెలిసి ఉంటాయని, అందులో ఆన్లైన్ క్లాస్లోకి జొరబడగలుగుతున్నారని అధికారులు చెబుతున్నారు. జ్యుడీషియల్ రిమాండ్కు ప్రశాంత్ కుమార్.. సోషల్ మీడియా యాప్ టాంటన్లో నగర యువతికి పరిచయమై ఆపై అదును చూసుకుని బ్లాక్మెయిలింగ్కు దిగిన బీదర్ యువకుడు ప్రశాంత్ కుమార్ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. చదవండి: అమెజాన్లో హార్డ్ డిస్క్ ఆర్డర్.. పార్సిల్ విప్పగానే షాక్! -
చెట్టెక్కిన చదువులు
‘‘చెట్టు లెక్కగలవా.. ఓ విద్యార్థి పుట్టలెక్కగలవా.. చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మన సిగ్నల్ చూడగలవా’’.. ఇదీ.. ఆన్లైన్ పాఠాలు వింటున్న విద్యార్థుల పరిస్థితి. ఆన్లైన్ తరగతులు పిల్లలను చెట్లు, పుట్టలు, గడ్డివాములు, మంచెలు, ఎత్తయిన ప్రదేశాలను ఎక్కిస్తున్నాయి. ఆన్లైన్ తరగతులు, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ వివరాలు.. పై ఫొటోను చూశారా.. అందులో ఉన్న చెట్టుమీద పిల్లలను గమనించారా.. వారెక్కింది చిగురు కోసమో, కోతికొమ్మచ్చి ఆట కోసమో కాదు. క్లాస్ కోసం!అదేలా అనుకుంటున్నారా? అవును.. అది అక్షరాలా.. చెట్టుబడి, అది కొమ్మ క్లాస్! ప్రయాణంలో అలసిపోయి సేద తీరుదామని ఓ చెట్టు కిందికి చేరిన ‘సాక్షి’ కంటబడిన దృశ్యమిది. అది ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం సర్వాయి గ్రామపంచాయతీ పరిధిలోని మల్కపల్లి శివారు. అక్కడ ఫోన్ సిగ్నల్ లేక రోజూ ఆన్లైన్ పాఠాలు వినేందుకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు గ్రామానికి అర కిలోమీటరు దూరంలో ఉన్న చింతచెట్టు ఎక్కి ఇలా పాఠాలు వింటున్నారు. ఇదివరకైతే క్లాస్రూంలో పాఠాలు వినేవారు.. ఇప్పుడు చెట్టుకొకరు, పుట్టకొకరైతే తప్ప క్లాస్ వినే పరిస్థితిలేదు. చెట్టుకొమ్మలే పాఠాలకు ‘పట్టు’ గొమ్మలయ్యాయి. చిటారుకొమ్మనకెళ్తే చిగురన్నా దక్కుతుందేమోకానీ, సెల్ఫోన్ సిగ్నల్స్ దొరుకుతుందన్న గ్యారంటీ మాత్రం లేదు. ఫోన్కు సిగ్నల్స్ అందితేనే తరగతి. లేదంటే.. అది గతి తప్పుతుంది. ఇదీ ఊళ్లల్లో ఆన్లైన్ క్లాసుల పరిస్థితి. ఏజెన్సీ ఏరియాల్లో, మారుమూల ప్రాంతాల్లో మరీ దారుణం. ఆన్లైన్ తరగతులు, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు ‘సాక్షి’ప్రతినిధులు వరంగల్ అర్బన్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాంతాలను విజిట్ చేశారు. ఆ విజిట్లో అనేక సమస్యలు వెలుగు చూశాయి. ఆయా ప్రాంతాల నుంచి ‘సాక్షి’అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది. ఈ పిల్లాడి పేరు రవీందర్. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఆన్లైన్ క్లాసులు తరువాతైనా వినొచ్చంటూ తండ్రికి బదులు గొర్రెల్ని మేపడానికి తీసుకెళ్తూ కనిపించాడు. టెన్షన్.. టెన్షన్! పాల్వంచ మండలం సారెకల్లులో కణితి కీర్తన అనే విద్యార్థిని చేతిలో సెల్ఫోన్ పట్టుకొని టెన్షన్గా అటూ, ఇటూ తిరుగుతోంది. ఏమైంది అని ‘సాక్షి’ప్రతినిధి అడగగా.. ‘నేను 9వ తరగతి చదువుతున్నా. ఆన్లైన్ తరగతులు విందామని సిగ్నల్స్ కోసం ట్రై చేస్తున్నా. ఊరులో ఏ దిక్కుకుపోయి చూసినా సిగ్నల్ అందుతలేదు. ఒక్కోసారి బాగానే ఉంటది. సిగ్నల్ సతాయించడంతో పాఠాలు సరిగా వినలేకపోతున్నా’అంటూ వాపోయింది. ఈ సమస్య ఇక్కడే కాదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని గుండాల, ఆళ్లపల్లి, పినపాక, కరకగూడెం, అశ్వాపురం, టేకులపల్లి, పాల్వంచ, ములకలపల్లి, అశ్వారావుపేట, లక్ష్మీదేవిపల్లి, ఇల్లెందు, మణుగూరు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో అంతటా ఉంది. చాలా గ్రామాల్లో టీశాట్, దూరదర్శన్ యదగిరి ఛానల్స్ ప్రసారాలు కూడా సరిగా రావట్లేదు. పత్తి తీస్తూ.. గోలీలు ఆడుతూ.. అది ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం బెజ్జూర్. ‘సాక్షి’ప్రతినిధులు అలా నడుచుకుంటూ ఊరిలోకి వెళ్లగా ఒకచోట బడీడు పిల్లలు సీసం గోలీలు ఆడుకుంటూ కనిపించారు. మరికొందరు పిల్లల చేతుల్లో సద్దిమూటలు కనిపించాయి. వారంతా తల్లిదండ్రులతో కలసి నడుచుకుంటూ పోతున్నారు. వారిని ఆపి, ఎటుపోతున్నారు, ఆన్లైన్ క్లాసులు లేవా.. అని అడిగాం. ‘ఆన్లైన్క్లాసుల్లో పాఠాలు స్పీడ్గా చెబుతుండ్రు. అవి మాకు అర్థమైతలె. ఇంటికాడ ఉండి ఏం జేయాలని పత్తిచేనుకు పోతున్నాం. ఇప్పుడు పత్తి సీజన్. పత్తి ఏరుదామని వెళ్తున్నాం ’అని చెప్పారు. తిర్యాణి మండలంలో మంగీ గ్రామానికి వెళ్లిన ‘సాక్షి’ప్రతినిధులకు ఓ సమస్య వచ్చి పడింది. తమ చేతుల్లోని సెల్ఫోన్లను పరిశీలించగా దేంట్లోనూ సిగ్నల్స్ లేవు. ఈ సమస్య ఒక్క మంగీ గ్రామంలోనే కాదు, మాణిక్యాపూర్, రోంపెల్లి, మెస్రంగూడ, మందగూడ, పంగిడిమాదర, భీంజిగూడ, గోపెర, కౌటగం, మర్కగూడ, ముల్కలమంద, మొర్రిగూడల్లోనూ ఉంది. అయితే, అప్పుడప్పుడూ, మిణుకుమిణుకుమంటూ సిగ్నల్స్ వచ్చిపోతుంటాయని ముల్కలమంద గ్రామస్తులు చెప్పారు. అందుకే చాలామందికి స్మార్ట్ఫోన్లు, డిష్ టీవీ కనెక్షన్ లేవు. కెరమెరిలోనూ సిగ్నల్ కష్టాలు ఉన్నాయి. అయితే, రెబ్బెనలో కాస్తా పరిస్థితి భిన్నంగా ఉంది. రెబ్బెనలో విద్యావంతులైన తల్లిదండ్రులు ఉన్న ఇంట్లో మాత్రమే టీవీలు, మొబైల్ ఫోన్లు ఉన్నా యి. వీరంతా రెగ్యులర్గా పాఠాలు వింటున్నారు. చేపలు పడుతూ..క్రికెట్ ఆడుతూ.. మహబూబ్గర్ మండలం బొక్కలోనిపల్లిలో కొందరు పిల్లలు రోడ్లపై ఆడుతూ, ఇంకొందరు క్రికెట్ అడుకుంటూ గోలగోల చేస్తున్న దృశ్యం మా కంట పడింది. భూత్పూర్ మండలంలోని తాటికొండ, గాజులపేటలో విద్యార్థులు చెరువుగట్ల వద్ద చేపలు పడతూ కనిపించారు. అల్లీపూర్ ఊరి బయట ఓ మిరప తోటలో పని చేస్తున్న విద్యార్థి దగ్గరకు వెళ్లి పలకరించగా.. ‘ప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతున్న. ఇంట్లో టీవీ పాడైపోవడంతో తరగతులు వినలేకపోతున్నా’అని చెప్పాడు. దేవరకద్ర మండలంలోని చాలా తండాల్లో టీవీలు కూడా అందుబాటులో లేని విద్యార్థులు ఉన్నారు. పిల్లలు ఆడుకుంటున్న ఈ ఊరి పేరు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గురిమిళ్ల. గ్రామంలో సరిగ్గా సెల్ సిగ్నల్ అందదు. దీనికి తోడు ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు పిల్లలు.. ఇంట్లో ఉన్నది ఒక్కటే ఫోన్.. దీంతో ఆన్లైన్ క్లాసులు వినే అవకాశం లేని విద్యార్థులిలా ఆడుకుంటూ కనిపించారు. – బయ్యారం పిల్లలతోపాటు పెద్దలకూ క్లాసులే మా ఇద్దరు పిల్లల్ని చెరో గదిలో ఉంచాలి. క్లాసులు వింటూ.. మధ్యలో ఏదైనా ఇబ్బంది వస్తే మమ్మల్ని పిలుస్తున్నారు. మేం బయటకు కదలడానికి వీల్లేకుండాపోయింది. ఆన్లైన్ క్లాసులనేవి పిల్లతోపాటు పెద్దలకు కూడా క్లాస్ల్లా మారాయి. – జి.రమాదేవి, హన్మకొండ డిష్ కొనిచ్చాను.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కిష్టారంపాడు ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిని. ఇక్కడ 22 మంది విద్యార్థులున్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నవారు గ్రామంలో మరో 15 మంది ఉన్నారు. ఇక్కడ కేబుల్ కనెక్షన్ లేదు. విద్యార్థుల ఇళ్లల్లో టీవీలు లేవు. విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని గ్రహించి సొంత ఖర్చులతో ఒక టీవీ, డీటీహెచ్ డిష్ కొని గ్రామంలోని ఒక ఇంట్లో ఏర్పాటు చేశాను. విద్యార్థుల తల్లిదండ్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని నిర్వహణ బాధ్యతను వారికి అప్పగించాను. – అజ్మీరా రాము, హెచ్ఎం, ఎంపీపీఎస్, కిష్టారంపాడు, చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం ఈ విద్యార్థి పేరు శివగంగకృష్ణ. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఆన్లైన్ క్లాస్లు కావడంతో ఎక్కడైనా వినొచ్చని ఇలా పుస్తకాలు పట్టుకుని ఆవును పొలానికి తోలుకెళ్తున్నాడు. – సాక్షి, ఫొటోగ్రాఫర్, సిద్దిపేట ఆన్లైన్ పాఠాలు– సమస్యలు ►ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు గ్రామీణ, వ్యవసాయాధారిత, పేద, మధ్య తరగతి కుటుంబాలు అధికం. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నవారు చాలా తక్కువ. సగం మంది విద్యార్థులు టీవీల మీదే ఆధారపడ్డారు. ►గ్రామాల్లో వీశాట్ ప్రసారాలు సక్రమంగా ఉండడం లేదు. ►మూడు నెలల నుంచి వ్యవసాయ పనులు జోరుగా సాగడంతో చాలామంది విద్యార్థులు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. కొన్నిచోట్ల తల్లిదండ్రులు పనులకు వెళ్తుండటంతో పిల్లలపై పర్యవేక్షణ కొరవడుతోంది. ►ఆన్లైన్ తరగతుల వేళ విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. ► టీవీల్లేని విద్యార్థులు పాఠాలకు దూరమవుతున్నారు. ►ఆర్థిక భారమైనా.. కొందరు తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్ఫోన్లు కొనిచ్చారు. పాల్వంచ మండలం కారెగట్టు గ్రామంలో సిగ్నల్ కోసం చెట్టెక్కిన విద్యార్థులు -
ఆన్లైన్ పాఠాలు అర్థం కావట్లేదు
కరోనా వేళ నాకు ఆన్లైన్ బోధన అందుబాటులో లేదు. పుస్తకాలు కొనుక్కునే పరిస్థితీ లేదు. అందుకే ఇప్పట్లో పరీక్షలు వద్దు. ఆఫ్లైన్ తరగతుల తర్వాతే పరీక్షలు పెట్టండి.’ – కరుణ శర్మ, 12వ తరగతి ఆన్లైన్ బోధన అర్థం కావట్లేదు. అభ్యసనపై సంతృప్తిగా లేదు. ప్రత్యక్ష విద్యా బోధన కావాలి. ఆ తర్వాతే పరీక్షలు పెట్టండి. పరీక్షలన్నీ జూన్ వరకు వాయిదా వేయండి. – అబు అనస్, విద్యార్థి సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్లో ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం, పరీక్షల నిర్వహణ, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలపై విద్యార్థులు నుంచి వ్యక్తమైన అభిప్రా యాలు. ప్రత్యక్ష విద్యా బోధన, సిలబస్ కుదింపుపైనా దేశవ్యాప్తంగా విద్యార్థులు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్కు అనేక విజ్ఞ ప్తులు, సూచనలు చేశారు. జేఈఈ మెయిన్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలు, సీబీఎస్ఈ 11, 12 తరగతుల పరీక్షలకు సంబంధించి విద్యార్థులు తల్లిదండ్రులతో ఈనెల 10న 10 గంటలకు ట్విటర్ వేదికగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ప్రకటించగా వేల మంది స్పందించారు. పరీక్షలు ఇప్పట్లో వద్దని 99 శాతం మంది స్పష్టం చేశారు. ప్రత్యక్ష బోధనపై చర్యలు చేపట్టాకే ముందుకు సాగాలని సూచించారు. మరికొంత మంది విద్యార్థులైతే 12వ తరగతి పరీక్షలు చాలా కీలకమని, అయితే ప్రస్తుతం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యక్ష విద్యా బోధన కంటే ఆన్లైన్ బోధన కొనసాగించాలని, పరీక్షలను కూడా ఆన్లైన్లోనే నిర్వహించాలని కోరారు. ప్రస్తుత ఆందోళనకర పరిస్థితుల్లో సిలబస్ను తగ్గించాలని సూరజ్ అనే విద్యార్థి విజ్ఞప్తి చేశారు. ఇంకొంత మంది విద్యార్థులైతే ప్రాక్టికల్ పరీక్షల ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. నీట్ పరీక్షను కూడా జూన్ వరకు వాయిదా వేయాలని కోరారు. ఆన్లైన్ విద్యా బోధనకు అవసరమైన చాలామంది విద్యార్థులకు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు లేవని, అవి ఉన్నా కొందరు ఇంటర్నెట్ కనెక్షన్ సమస్యలతో విద్యా బోధన ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష విద్యా బోధనతోనే ప్రయోజనం ఉంటుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ఆ తర్వాతే పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 10న జరిగే ఆన్లైన్ చర్చా కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయం వెల్లడించనున్నారు. పరీక్షలకు ఉపయోగపడని ఆన్లైన్ బోధన ఇంటర్మీడియెట్ విద్యలో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆన్లైన్ బోధన.. పరీక్షలకు ఏ మాత్రం ఉపయోగపడేలా లేదు. ఆన్లైన్ విద్యతో పరీక్షలు నిర్వహించడం సరికాదు. నేరుగా తరగతులు నిర్వహించకుండా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు. ప్రత్యక్ష విద్యా బోధన కనీసం 3 నెలలు నిర్వహించాల్సిందే. – ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పి.మధుసూదన్రెడ్డి -
ఆన్‘లైన్’లో పడని చదువులు
సాక్షి, వరంగల్ : కరోనా దెబ్బకు కుదేలవ్వని రంగం లేదు. ఆర్థిక వ్యవస్థ పడకేయగా, చదువులు అటకెక్కాయి. విద్యారంగానికి ఎదురవుతున్న సవాళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఆన్లైన్ పద్ధతిలో విద్యాబోధన జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 1న ప్రారంభించిన ఈ ఆన్లైన్ తరగతులు కొంతవరకు ప్రయోజనం చేకూర్చినా... గ్రామీణ, గిరిజన, మారుమూల, ప్రాంతాల విద్యార్థులను చేరలేకపోయాయి. నెట్వర్క్ సమస్యతో గ్రామీణ విద్యార్థులకు ఆన్లైన్ బోధన అందట్లేదు. తాజాగా ప్రథమ్ సంస్థ దేశవ్యాప్తంగా సర్వేచేసి రూపొందించిన విద్యావార్షిక స్థితి నివేదిక (ఏఎస్ఈఆర్) ఇదే చెబుతోంది. ఈ నివేదిక ఆధారంగా డిజిటల్ విద్య స్థితిగతులెలా ఉన్నాయంటే.. డిజిటల్ బోధనకు భారీ ఖర్చు తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు డిజిటల్ బోధన కోసం టీవీలు, స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లతో పాటు ల్యాప్టాప్ల కొనుగోలుకు అధిక మొత్తంలో ఖర్చు చేశారు. 2018 ఏఎస్ఈఆర్ నివేదిక ప్రకారం 45.8 శాతం మంది విద్యార్థులకు స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉండగా 2020 నివేదిక ప్రకారం ఇది 74 శాతానికి పెరిగింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో స్మార్ట్ఫోన్ల వినియోగం 37.6 నుండి 68.1 శాతానికి పెరిగింది. మొత్తంగా తెలంగాణలో 90.5 శాతం మంది విద్యార్థులకు టీవీలు, 74 శాతం విద్యార్థులకు స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కరోనా కాలంలో డిజిటల్ బోధనలో పాఠాలు వినేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు టీవీలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్ల కొనుగోలుకు రూ.2,500 కోట్లు వెచ్చించినట్లు నివేదిక తెలిపింది. వేధిస్తున్న నెట్వర్క్ సమస్య రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు, టీవీల సంఖ్య గణనీయంగా పెరిగినా గ్రామాలు, తండాలు, మారుమూల ప్రాంతాల్లో విద్యార్థులను నెట్వర్క్ సమస్య వేధిస్తోంది. ఫైబర్ ఆప్టికల్ (భారత్ నెట్) ద్వారా ప్రతీ గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినా.. అదంతా మాట లకే పరిమితమవుతోంది. కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ నెట్వర్క్ సమస్యతో రాష్ట్రంలోని చాలామంది విద్యార్థులకు డిజిటల్ బోధన అందని ద్రాక్షగా మారిందని ఏఎస్ఈఆర్ నివేదిక పేర్కొంటోంది. -
ఫీజు లింక్ క్లాస్ కట్!
వనస్థలిపురంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో హర్షిత్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజు మూడు సబ్జెక్టులను ఆన్లైన్లో బోధిస్తున్నారు. గత వారం నుంచి అకస్మాత్తుగా ఆన్లైన్ తరగతులకు సంబంధించిన లింకు ఫోన్కు రావడం లేదు. ఒకరోజు క్లాస్ టీచర్ ఫోన్లో అందుబాటులోకి వచ్చి హర్షిత్ ఫీజు బకాయి ఉందని, పూర్తి ఫీజు చెల్లిస్తేనే ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే సగం ఫీజు చెల్లించినట్లు హర్షిత్ తండ్రి రఘు చెప్పినప్పటికీ... మిగతా సగం కూడా ఇప్పుడే చెల్లించాలని, అయితేనే ఆన్లైన్ పరీక్షలకు అనుమతిస్తామని సదరు టీచర్ చెప్పారు. సాక్షి, హైదరాబాద్: ఇప్పుడు పాఠాలు వినడం, పరీక్షలు రాయడం అంతా ఆన్లైన్లోనే. దీనికోసం ప్రతి విద్యార్థికి ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ‘లింకు’పంపించాలి. యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇవ్వాలి. సరిగ్గా ఇక్కడే నొక్కుతున్నాయి యాజమాన్యాలు. లింకులు ఆపివేసి.. చిన్నారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఫీజులు కట్టాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని లంకె పెడుతున్నాయి. కోవిడ్ ప్రభావంతో మార్చి నెల రెండో వారం నుంచి విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. అన్లాక్లో భాగంగా పలు రంగాలకు మినహాయింపులు ఇచ్చినప్పటికీ విద్యా సంస్థలను తెరిచేందుకు ప్రభుత్వం ఇంకా అనుమతించలేదు. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో విద్యార్థులకు ఆయా విద్యాసంస్థలు ఆన్లైన్/ వీడియోల ద్వారా పాఠ్యాంశ బోధన సాగిస్తున్నాయి. ఫీజు కడితేనే లింకు కోవిడ్–19 ప్రభావంతో విద్యా సంవత్సరం కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ... ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ముందస్తుగా జూన్ నెలాఖరు నుంచే ఆన్లైన్లో బోధన ప్రారంభించాయి. రాష్ట్రంలో దాదాపు 18 వేల ప్రైవేటు పాఠశాలల పరిధిలో 16 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేటు స్కూళ్లు టీసాట్, దూరదర్శన్లో వచ్చే వీడియో పాఠాలతో సరిపెడుతున్నాయి. కార్పొరేట్ స్కూళ్లు మాత్రం జూమ్ లాంటి యాప్ల ద్వారా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. తొలుత విద్యార్థులందరికీ ఆన్లైన్ క్లాస్ లింకులు చొరవ తీసుకుని పంపిన యాజమాన్యాలు... ఆన్లైన్ తరగతులకు విద్యార్థులు కాస్త అలవాటుపడిన తరుణంలో క్రమంగా ఫీజులు చెల్లించాలని బోధన సిబ్బందితో ఒత్తిడి చేయడం మొదలుపెట్టాయి. దీంతో మెజారిటీ విద్యార్థుల తల్లిదండ్రులు కొంతమేర చెల్లించినప్పటికీ...సమ్మెటివ్ పరీక్షలు ప్రారంభం అవుతుండటంతో పూర్తి ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తీవ్రం చేశారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్ లింకులను నిలుపుదల చేస్తున్నారు. ప్రతి కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం ఇదే తరహా వ్యూహాన్ని అనుసరిస్తూ ఫీజులను ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. వసూలు చేస్తేనే టీచర్లకు జీతం విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసేందుకు పాఠశాల యాజమాన్యాలు బోధన సిబ్బందికి లక్ష్యాలు నిర్దేశించాయి. ప్రతి క్లాస్ టీచర్ విధిగా తరగతిలోని విద్యార్థుల నుంచి పూర్తి ఫీజులు వసూలు చేయాల్సిందే. అలా లక్ష్యాన్ని సాధించిన వారికే వేతనాలు ఇస్తామని, డిసెంబర్ నెలాఖరు కల్లా పూర్తిస్థాయిలో ఫీజులు వసూలు కావాలని యాజమాన్యాలు నిబంధనలు పెట్టడంతో క్లాస్ టీచర్లు తల్లిదండ్రులపై ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నారు. పలు పాఠశాలలు ఈనెల 7వ తేదీనుంచి సమ్మెటివ్–1 పరీక్షల షెడ్యూల్ జారీ చేశాయి. ఫీజులు చెల్లించిన విద్యార్థులకే ఈ పరీక్షలకు సంబంధించిన లింకులను జారీ చేస్తున్నారు. బకాయిపడిన విద్యార్థుల తల్లిదండ్రులకు క్లాస్ టీచర్లు ఫోన్ చేసి ఫీజులు కట్టాలని చెబుతున్నారు. ఫీజులు ఇవ్వకుంటే నిర్వహణ ఎలా? స్కూల్ నిర్వహణ అంతా ఫీజులపైనే ఆధారపడుతుంది. ప్రస్తుతం ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నాం. సిబ్బంది వేతనాలు, బిల్డింగ్ నిర్వహణ కోసం ఒత్తిడితోనే ఫీజులు వసూలు చేస్తున్నాం. చాలా స్కూళ్లలో 35% విద్యార్థులు కూడా ఫీజులు చెల్లించలేదు. ఇలాగైతే స్కూల్ ఎలా నడుస్తుంది. పూర్తి ఫీజు కాకున్నా... కనీస మొత్తాన్నైనా చెల్లించాలి.ఆమేరకే టీచర్లకు బాధ్యతలు అప్పగించాం. –టి.ఎన్.రెడ్డి, సెక్రటరీ, హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ -
ఇంట్లో నుంచే నచ్చిన చదువులు
సాక్షి, అమరావతి : ఇంట్లో ఉంటూనో.. ఉద్యోగం చేసుకుంటూనో డిగ్రీ పట్టాలను అందిపుచ్చుకునే అవకాశం ఆన్లైన్ కోర్సుల వేదికలు కల్పిస్తున్నాయి. కోవిడ్-19 కారణంగా తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ఆన్లైన్ విద్యా వేదికలకు ఎంతో ప్రాధాన్యం పెరగ్గా.. విద్యార్థులకు ప్రయోజనకరంగా మారుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆన్లైన్ కోర్సులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆన్లైన్లో డిగ్రీ కోర్సులు అమలు చేసేందుకు యూనివర్సిటీలకు, వివిధ అంతర్జాతీయ సంస్థల కోర్సులకు అవకాశమిచ్చింది. ‘కోర్సెరా’, ‘ఎడెక్స్’ వంటి సంస్థల ద్వారా పలు కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోని 100 యూనివర్సిటీల ద్వారా ఆన్లైన్ కోర్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం, ఆయా కోర్సులకు గుర్తింపునిస్తూ క్రెడిట్ల కేటాయింపు, వాటి బదిలీకి అవకాశం కల్పించింది. అదే సమయంలో అంతర్జాతీయ సంస్థలు అందించే కోర్సులకు కూడా గుర్తింపునివ్వడంతో విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి వచ్చింది. తక్కువ ఖర్చుతోనే.. తరగతి గదిలో ముఖాముఖి నిర్వహించే డిగ్రీ కోర్సులకు అయ్యే ఫీజుల కన్నా తక్కువ ఖర్చుతో ఆన్లైన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. క్రెడిట్ పాయింట్ల ఆధారంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతుండటంతో క్రమేణా ఆన్లైన్ కోర్సుల వైపు అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయ ఆన్లైన్ విద్యావేదికలైన కోర్సెరా, ఎడెక్స్ æ లక్షలాది మందికి ఆన్లైన్ కోర్సులు అందిస్తున్నాయి. ఖాన్ అకాడమీ, ఉడెమీ, స్టాన్ఫోర్డ్ ఆన్లైన్, ఎంఐటీ ఓపెన్ కోర్సు వేర్, కోడ్ అకాడమీ, టెడ్-ఎడ్, ఓపెన్ కల్చర్ ఆన్లైన్ కోర్సెస్ వంటి సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులకు ఆన్లైన్ కోర్సులు అందిస్తున్నాయి. యూజీసీ ఉచిత ఆన్లైన్ కోర్సులు మరోవైపు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పలు ఆన్లైన్ కోర్సులను ఉచితంగా విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ‘స్వయం’ ఆన్లైన్ కోర్సులు ఇందులో ప్రముఖంగా చెప్పదగ్గవి. విద్యార్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఈ వేదిక ద్వారా పలు కోర్సులను అభ్యసించే అవకాశం కల్పిస్తోంది. స్వయం వేదిక ద్వారా మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ (మూక్స్) సాంకేతికేతర యూజీ, పీజీ కోర్సులను అందిస్తున్నారు. ‘ఈ-పీజీ పాఠశాల’ అనేది అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఇంటరాక్టివ్ ఈ-కంటెంట్తో 23వేల మాడ్యూళ్లతో వివిధ కోర్సులను విద్యార్థులకు అందిస్తోంది. సోషల్ సైన్సెస్, ఆర్ట్స్, ఫైన్ఆర్ట్స్, హ్యుమానిటీస్, నేచురల్, మేథమెటికల్ సైన్సు అంశాల్లో 70 పీజీ కోర్సులు అందిస్తోంది. ఇదే కాకుండా ‘ఈ-కంటెంట్ కోర్స్ వేర్’ ద్వారా వివిధ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను యూజీసీ అందుబాటులో ఉంచింది. 24,110 మాడ్యూళ్లలో 87 యూజీ కోర్సులు విద్యార్థులు నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది. వీఎల్ఎస్ఐ ఇండస్ట్రియల్ కోర్సు నేర్పారు లాక్డౌన్ సమయంలో జేఎన్టీయూ అనంతపురంలో తరగతులు నిర్వహించని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈసీఈ విభాగంలో ప్రత్యేకంగా వీఎల్ఎస్ఐ ఇండస్ట్రియల్ కోర్సును ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. కరోనా, ఇతర ప్రతికూల పరిస్థితుల్లో ఆన్లైన్ విద్యా వేదికల ద్వారా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులు పూర్తిచేసే అవకాశం కలుగుతోంది. అదనపు క్రెడిట్లతో లాభం చేకూరుతుంది. - సాయికుమార్, బీటెక్ ఫైనలియర్, ఈసీఈ విభాగం, జేఎన్టీయూ అనంతపురం (ఏ) ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులూ నిరంతర విద్యార్థులే అధ్యాపకులూ నిరంతర విద్యార్థులే. ఆన్లైన్ కోర్సులు విద్యార్థులతో పాటు అధ్యాపకులకూ ఉపయోగపడుతున్నాయి. - డాక్టర్ జి.మమత, అసిస్టెంట్ ప్రొఫెసర్, జేఎన్టీయూ అనంతపురం ఇంజనీరింగ్ కళాశాల -
30% మందితోనే ట్రిపుల్ ఐటీ తరగతులు
సాక్షి, అమరావతి/నూజివీడు: రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతుల నిర్వహణపై రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ(ఆర్జీయూకేటీ) శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. కోవిడ్–19 నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం బ్లెండెడ్ లెర్నింగ్(ఆన్లైన్, ఆఫ్లైన్) విధానంలో కొనసాగనుంది. తరగతిలో బోధన(ఆఫ్ లైన్)కు 30 శాతం మంది విద్యార్థులను అనుమతిస్తారు. మిగతా 70 శాతం మందికి ఆన్లైన్లో బోధిస్తారు. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఇచ్చింది. కోవిడ్ నేపథ్యంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం క్యాంపస్లను నిర్వహించాల్సి ఉంటుంది. మార్చి చివర్లో మొదటి సెమిస్టర్ పరీక్షలు మొదటి సెమిస్టర్లో బ్లెండెడ్ లెర్నింగ్ విధానాన్ని బోధన–అభ్యాస వ్యూహంగా అనుసరిస్తారు. మొత్తం విద్యార్థుల సంఖ్యలో 30 శాతం మందిని క్యాంపస్లోకి అనుమతిస్తారు. మిగిలిన వారికి ఆన్లైన్ బోధన ఉంటుంది. ఆర్జీయూకేటీ నాలుగు క్యాంపస్లలో నవంబర్ 2 నుంచి పీయూసీ–2, ఈ–2, ఈ–3, ఈ–4కు ఆన్లైన్ తరగతుల నిర్వహణకు షెడ్యూల్ ఇచ్చారు. 2019–20 పీయూసీ–2 బ్యాచ్ ప్రస్తుతం క్యాంపస్లలో జరిగే సెమిస్టర్–2కు సంబంధించిన పరీక్షలకు హాజరవ్వాలి. వీటి ఫలితాల ఆధారంగా ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో వారికి ప్రవేశాలు జరుపుతారు. ఇక 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి సెమిస్టర్ ముగింపు పరీక్షలు 2021 మార్చి చివర్లో జరుగుతాయి. 2వ సెమిస్టర్ ఏప్రిల్లో ప్రారంభమై ఆగస్టు నాటికి పూర్తవుతుంది. కరోనా భయంతో విద్యార్థులను పంపించేందుకు తల్లిదండ్రులు భయపడితే.. డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించే పీయూసీ–2 పరీక్షలకు హాజరయ్యేందుకు వర్సిటీ మరో అవకాశమిస్తుంది. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. పాజిటివ్ ఉన్న విద్యార్థులను క్యాంపస్లోకి అనుమతించరు. కాగా, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఏపీ ఆర్జీయూకేటీ సెట్ ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఈ నెల 13 వరకు పొడిగించినట్లు వర్సిటీ తెలిపింది. రూ.1,000 అపరాధ రుసుంతో ఈనెల 16 వరకు గడువు ఇచ్చింది. ట్రిపుల్ ఐటీల్లో రోబోటిక్స్, మెషిన్లెర్నింగ్ నూతన బ్రాంచిలను ప్రవేశపెట్టనున్నట్లు వర్సిటీ చాన్స్లర్ ఆచార్య కేసీ రెడ్డి చెప్పారు. -
వైద్య విద్య కొన్నాళ్లు ఆన్లైన్లోనే
సాక్షి, అమరావతి: వైద్య విద్యార్థులకు మరికొద్ది రోజులు ఆన్లైన్ తరగతులే జరగనున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలతోపాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, డీమ్డ్ వర్సిటీలు ఆన్లైన్లోనే తరగతులు నిర్వహిస్తున్నాయి. వైద్య విద్యార్థులకు ఆన్లైన్ తరగతులను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు కాగా కరోనా నేపథ్యంలో ఇంతకంటే మార్గం లేదన్న న్యాయస్థానం మరికొద్ది రోజులు ఇదే విధానంలో నిర్వహించాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడే వరకు తరగతి గదుల్లో క్లాసులు నిర్వహించలేని పరిస్థితి ఉందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎగ్జామినర్లు వచ్చి నిర్వహించే ఎక్స్టర్నల్ పరీక్షలను కూడా ఆన్లైన్లోనే చేపట్టాలని నిర్ణయించారు. క్లినికల్ తరగతులకు సంబంధించి కోవిడ్ పరిస్థితులు చక్కబడ్డాక ఆలోచిస్తామని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే హైలెవెల్ కమిటీ నివేదిక ఏటా ఎంబీబీఎస్ అడ్మిషన్ల సమయంలో నెలకొంటున్న వివాదాలను పరిష్కరించి పారదర్శకంగా ప్రవేశాలు నిర్వహించేందుకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ కన్వీనర్గా ఓ కమిటీని నియమించింది. ఇటీవల సమావేశమై పలు అంశాలపై చర్చించిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఫీజులపై కసరత్తు ఈ ఏడాది ఎంబీబీఎస్ అడ్మిషన్ల నాటికి సవరించిన ఫీజులను అమలు చేసేలా ఫీజుల నియంత్రణ కమిటీ కసరత్తు చేసింది. త్వరలోనే ఫీజులు నిర్ణయించి ప్రభుత్వానికి సూచించనుంది. అనంతరం జీవో వెలువడనుంది. జీవో జారీ అయ్యాకే ఎంబీబీఎస్ అడ్మిషన్లు మొదలవుతాయి. ఫీజులు ఓ కొలిక్కి వస్తే, మిగతా ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు వెసులుబాటు లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. గతంలో కంటే ఫీజులు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పారదర్శకంగా ప్రవేశాలు త్వరలో చేపట్టనున్న ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లు అత్యంత పారదర్శకంగా జరుగుతాయి. హైలెవెల్ కమిటీ నివేదిక, ఫీజులపై జీవోలు రాగానే అడ్మిషన్లకు సంబంధించి రూపకల్పన చేస్తాం. ఇందుకోసం అన్ని చర్యలు చేపడుతున్నాం. – డా.శంకర్, రిజిస్ట్రార్, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ -
స్కూళ్లు రీఓపెన్.. కేంద్రం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా దాదాపు ఆరు నెలలుగా సెలవులో ఉన్న విద్యాసంస్థలు ఈ నెల 15 నుంచి తెరుచుకోనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాటించాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని కరోనా పరిస్థితులను బట్టి అక్టోబర్ 15 నుంచి పాఠశాలలు తెరువాలా వద్దా అన్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది. స్కూళ్లు తెరిచిన రెండు వారాల వరకు విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వొద్దని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. ఆన్లైన్ తరగతులు మాత్రం తప్పని సరిగా ప్రారంభం కావాలని పేర్కొన్నారు. స్కూళ్లను పునరుద్ధరించే పక్షంలో తప్పని సరిగా పేర్కొన్న మార్గదర్శకాలను అనుసరించాలని వెల్లడించారు. (పాఠశాలలు ప్రారంభం: వారంలో 70 కేసులు) DoSEL, @EduMinOfIndia has issued SOP/Guidelines for reopening of schools. pic.twitter.com/pwJXZZd40w — Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) October 5, 2020 స్కూలులోని అన్ని చోట్ల పరిశుభ్రత, స్వచ్ఛమైన గాలి, కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు చేపట్టాలి. దీని కోసం పాఠశాలలు తగిన ఏర్పాట్లు చేయాలి. స్కూళ్లు సొంతంగానే నిబంధనలు, ప్రోటోకాల్స్ తయారు చేసుకోవాలి. తరగతి గదుల్లో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు ఉండాలి. విద్యార్థులు, ఉపాధ్యాయులు మాస్కులు తప్పని సరిగా ధరించాలి. విద్యార్థులు, టీచర్లు, పేరెంట్స్, కమ్యూనిటీ సభ్యులు, హాస్టల్ సిబ్బంది శానిటైజ్ పద్ధతులు పాటించాలి. అన్ని తరగతుల విద్యా క్యాలెండర్కు మార్పులు చేయాలి. పాఠశాల ప్రాంగణంలో డాక్టర్, నర్సు, ఆరోగ్య సిబ్బంది అన్ని వేళలా అందుబాటులో ఉండేలా చూడాలి. విద్యార్థులు, స్కూలు సిబ్బందికి సిక్ లీవ్, హాజరులో వెసులుబాటు కల్పించాలి. స్కూళ్లు తెరిచిన రెండు నుంచి మూడు వారాల వరకు విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వకూడదు. ఐసీటీ వినియోగం, ఆన్లైన్ విద్యను తప్పనిసరిగా కొనసాగించాలి. తల్లిదండ్రుల అనుమతితోనే విద్యార్థులు పాఠశాలకు హాజరుకావాలి. భౌతికంగా కన్నా ఆన్లైన్ విద్యను ఎంచుకునే అవకాశం విద్యార్థులకు ఇవ్వాలి. విద్యార్థుల హాజరులో ఈ మేరకు సౌలభ్యం కల్పించాలి. -
భోజనం కోసమే వచ్చేవారికి ఆన్లైన్ క్లాసులా!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక కోవిడ్ వైరస్ను కట్టడి చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలను మూసివేయాల్సి రావడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ మీడియా ద్వారా విద్యా బోధన విధానాన్ని అనసరించాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ప్రైవేటు పాఠశాలలను పక్కన పెట్టి, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యా సంస్థల్లో ఈ విద్యా విధానం ఏ మేరకు విజయవంమైందో తెలుసుకునేందుకు ‘ఆక్స్ఫామ్ ఇండియా’ స్వచ్ఛందంగా ఓ సర్వే నిర్వహించింది. ఈ సంస్థ ప్రతినిధులు సర్వేలో భాగంగా ఇటీవల బిహార్, చత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించి ఉపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకుంది. డిజిటల్ విద్యావిధానం తమ పిల్లలకు అందుబాటులోకి రాలేదని 80 శాతం మంది తల్లిదండ్రులు ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 15 శాతం మంది జనాభాకే ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉంది. ఆ జనాభాలో కూడా దళితులు, ఆదివాసీలు, ముస్లింలకు కూడా నెట్ సదుపాయం అందుబాటులో లేదు. ఆన్లైన్ తరగతులు అందుబాటులో ఉన్న విద్యార్థులకు కూడా పెద్ద ప్రయోజనం కలగలేదని, అందుకు కారణం ఆన్లైన్ క్లాసులకు అనుగుణంగా తగిన పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేకపోవడమేనని 80 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. (చదవండి: ఆన్లైన్ క్లాసుల్లో పరిస్థితి ఇలానే ఉంటుందేమో?) ఆన్లైన్ తరగతులు ప్రారంభానికే ముందే వాటికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని, అలా లేకపోవడం దురదష్టకరమని 71 శాతం మంది టీచర్లు అభిప్రాయపడ్డారు. డిజిటల్ తరగతుల విధానం దేశంలో కొత్త కాకపోయినా, కొన్ని సామాజిక వర్గాలకు నెట్ సదుపాయం అందుబాటులో లేదని ‘ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్’ సీఈవో రుక్మిణి బెనర్జీ తెలిపారు. కఠిన పరిస్థితుల్లో డిజిటల్ తరగతులు ఆయా సామాజిక వర్గాల విద్యార్థులకు అందుబాటులోకి రాలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఇంతకాలం పాటు విద్యా సంస్థలు మూత పడతాయని ఎవరూ ఊహించలేక పోయారని ఆమె చెప్పారు. గత మార్చి నెలలో లాక్డౌన్ కారణంగా పాఠశాలలను మూసివేయగా, జూన్ నెలలో ఆన్లైన్ క్లాసులను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలకు వెనక బడిన వర్గాల పిల్లల్లో ఎక్కువ మంది మధ్యాహ్న భోజన పథకం కోసమే వస్తారు. ఇక వారు ఆన్లైన్ క్లాసులకు హాజరవుతారనుకోవడం కలలోని మాటే. మధ్యాహ్న భోజనంతోపాటు వారికిచ్చే లర్నింగ్ పరికరాలను కూడా పునరుద్ధరించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ 35 శాతానికి మించి పిల్లలకు ఈ సదుపాయం అందడం లేదని సర్వేలో తేలింది. (చదవండి: ఇంటివద్దకే బడి) -
ఇంటివద్దకే బడి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు బడికి వెళ్లి చదువుకోవడం, లాక్డౌన్ కారణంగా ఆన్ లైన్ పాఠాలు, టీవీల్లో వీడియో తరగతులు వినడం చూశాం. కానీ, గిరిజన సంక్షేమ శాఖ బోధన ప్రక్రియలో సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఆ శాఖ పరిధిలోని ఆశ్రమ, ప్రభు త్వప్రాథమికోన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం బడినే ఇంటివద్దకు తీసుకెళ్తోంది. ఆన్లైన్ , వీడియో పాఠాలతో పాటు సంబం ధిత బోధకుడు నేరుగా విద్యార్థి ఇంటికి వెళ్లి 2గంటల పాటు పాఠ్యాంశాన్ని బోధిస్తారు. ఈ మేరకు చర్యలు చేపట్టాల్సిందిగా గిరిజన సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికీ చదువు... గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో దాదాపు 320 ఆశ్రమ పాఠశాలలు, 1,510 ప్రభుత్వ పాథమిక పాఠశాలలు (జీపీఎస్) ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడితో పాటు టీచర్లు, సీఆర్టీ(కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్)లు ఉంటారు. తాజాగా హెచ్ఎంలు, టీచర్లు, సీఆర్టీలు ఏయే రకమైన విధులు నిర్వహించాలనే దానిపై గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రతి ఉపాధ్యాయుడు, సీఆర్టీ ఆయా తరగతిలోని పిల్లల్ని అడాప్ట్ చేసుకుని బోధన, అభ్యసన కార్యక్రమాలు కొనసా గించాలి. గిరిజన ఆవాసాల్లో ఉండే జీపీఎస్లలో ఒక్కో టీచర్ ఉండగా... 10 మందిలోపు పిల్లలున్నారు. ఈ స్కూళ్లలో పనిచేసే టీచర్లు పూర్తిగా అదే ఆవాసానికి చెందిన వారే కావడంతో స్థానికంగా విద్యార్థి ఇంటికి వెళ్లి బోధ న, అభ్యసన కార్యక్రమాలు నిర్వహించడం ఇబ్బందికరమేమీ కాదు. విద్యార్థికి బోధన కార్యక్రమాలను మరింత చేరువ చేసేందుకే ఆ శాఖ ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. -
ఆన్లైన్ క్లాసుల్లో పరిస్థితి ఇలానే ఉంటుందేమో?
న్యూయార్క్ : కొన్నికొన్ని సార్లు క్లాసులో సారు పాఠాలు చెబుతున్నపుడు.. వారు చెప్పేది నచ్చకో.. బుర్రకు ఎక్కకో నిద్రలో మునిగితేలుతుంటారు కొంతమంది. నిద్రను ఆపుకోలేక, పాఠం చెప్పే గురువువైపు పూర్తిగా కళ్లు తెరిచి చూడలేక తెగ ఇబ్బంది పడిపోతుంటారు. లైవ్ పరిస్థితే ఇలా ఉంటే ఇక ఆన్లైన్ క్లాసుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన క్లాస్ రూం నిద్రకు సంబంధించిన జ్ఞాపకాల్ని గుర్తు చేసేలా ఉండే ఓ చిన్నారి వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొద్దిరోజుల క్రితం అమెరికాకు చెందిన ప్రముఖ హాస్య నటుడు టోనీ బేకర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. ( నన్ను సంపేయ్ సారు: ఈ బుడ్డోడు మామూలోడు కాడు ) ఆ వీడియోలో.. ఓ చిన్నారి నిద్రపోతుంటుంది. ఓ వ్యక్తి ఏవో విషయాలు చెబుతుంటాడు. పాప నిద్రపోతుందని గమనించి లేపుతాడు. పాప కళ్లు తెరిచి అతడివైపు చూసి నవ్వుతుంది. కొద్దిసేపటి తర్వాత మళ్లీ నిద్రపోతుంది. ఆ వ్యక్తి మళ్లీ పాపను నిద్రలేపుతాడు. నిద్రలేచిన చిన్నారి ఓ చిరునవ్వు నవ్వి మళ్లీ నిద్రలోకి జారుకుంటుంది. సెప్టెంబర్ 8న పోస్టయిన ఈ వీడియో ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించుకుంది. View this post on Instagram ME IN COLLEGE!!!!!! The struggle was real. Video by @comediantommyblack #tonybakervo 10 NEW VOICEOVERS DAY. A post shared by Tony Baker (@tonybaker) on Sep 7, 2020 at 8:55pm PDT -
కరెన్సీ నోట్లు, కలర్ పెన్సిల్స్తో బోధన
ముంబై: కరోనా కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరానికి తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ నెల ఆరంభం నుంచి పలు రాష్ట్రాల్లో ఆన్లైన్ క్లాస్లు ప్రారంభమయ్యాయి. కానీ నేటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ వంటి అంశాలు చాలా ఖరీదుతో కూడుకున్నవి. ఈ క్రమంలో ఓ పాఠశాల ఉపాధ్యాయుడు తన విద్యార్థుల కోసం ఓ వినూత్న ఆలోచన చేశాడు. కలర్ పెన్సిల్, కరెన్సీ నోట్ల జీరాక్సులతో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు. ఆ వివరాలు. ప్రల్హాద్ కాథోల్ పాల్ఘర్లోని బలివాలిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో అసిస్టెంట్ టీచర్గా పని చేస్తున్నాడు. మూడు, నాల్గవ తరగతి పిల్లలకు గణితం బోధిస్తాడు. అయితే లాక్డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడిన సంగతి తెలిసిందే. అయితే ఆన్లైన్ క్లాస్లు బోధిద్దామంటే.. తన తరగతిలోని 44 మంది విద్యార్థుల్లో కేవలం 2 దగ్గర మాత్రమే స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ ఉంది. దాంతో ప్రల్హాద్ ఓ వినూత్న ఆలోచన చేశాడు. (చదవండి: మంచె ఎక్కిన ‘ఆన్లైన్’ చదువులు) కొన్ని కరెన్సీ నోట్లను జీరాక్స్ తీపించి... వాటిని విద్యార్థులకు పంచి పెట్టాడు ప్రల్హాద్. మరి కొందరికి రంగు పెన్సిల్స్ పంచాడు. ఈ సందర్బంగా అతడు మాట్లాడుతూ.. ‘నా విద్యార్థులు పాఠశాలను మరిచిపోకుడదని భావించాను. అందుకు ఒక వర్క్ షీట్ మీద కొన్ని లెక్కలు వేసి.. కరెన్సీ నోట్ల జీరాక్స్లు ఇచ్చి వాటిని పరిష్కరించాల్సిందిగా చెప్పాను. ఇలా చేయడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లల చదవులో భాగం పంచుకుంటారు. అలానే నేను ప్రతి వారం ఒక గ్రామానికి వెళ్లి నా విద్యార్థులను కలుసుకుని వారి వర్క్షీట్లను పరిశీలిస్తాను. అర్థం కాని సమస్యలను బోధిస్తాను. వారికి కథలు చెప్తాను. కలిసి ఆడుకుంటాం. భోజనం చేస్తాము. తిరిగి పాఠశాలలు తెరిచే వరకు ఇదే పద్దతి కొనసాగిస్తాను’ అన్నాడు ప్రల్హాద్. -
హువావే కిడ్స్ ఫ్రెండ్లీ టాబ్లెట్ : తక్కువ ధరలో
సాక్షి, ముంబై : చైనా టెక్ కంపెనీ హువావే కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ను లాంచ్ చేసింది. మ్యాట్ ప్యాడ్ టీ8 పేరుతో దీన్ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రధానంగా కరోనా కాలంలో ఆన్ లైన్ క్లాసుల కోసం కంప్యూటింగ్ పరికరాన్ని తీసుకొచ్చింది. కొనుగోలుదారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులే లక్ష్యంగా ఈ ట్యాబ్ను ఆవిష్కరించింది. రికార్డర్, కెమెరా, మల్టీమీడియా కిడ్స్ పెయింటింగ్ , పేస్ అన్ లాక్ లాంటి ఫీచర్లతో ఇది కిడ్స్ ఫ్రెండ్లీ టాబ్లెట్గా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అలాగే ఎక్కువ కాలం పాటు టాబ్లెట్ను ఉపయోగిస్తున్నట్లయితే పిల్లల భంగిమను సరిదిద్దేలా హువావే హెచ్చరిక కూడా ఇస్తుందని తెలిపింది. దీంతోపాటు టైమర్ మరియు మల్టీ లేయర్డ్ కంటి రక్షణ ఫీచర్ కూడా ఉందని కంపెనీ పేర్కొంది.12 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని వెల్లడించింది. అన్ని వైపులా పెద్ద బెజెల్స్తో వైఫై, ఎల్టీఈ రెండు వెర్షన్లలో లభ్యం. హువావే మ్యాట్ ప్యాడ్ టీ8 స్పెసిఫికేషన్లు 8 ఇంచుల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే 1280 x 800 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ8768 ప్రాసెసర్ 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 512 జీబీ విస్తరించుకునే అవకాశం. 5 ఎంపీ రియర్ కెమెరా 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ హువావే మ్యాట్ప్యాడ్ టీ8 ధర, లభ్యత వైఫై వేరియెంట్ ధర రూ.9,999 ఎల్టీఈ వేరియెంట్ ధర రూ.10,999 సెప్టెంబర్ 14 వరకు ఫ్లిప్కార్ట్లో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ప్రీ-ఆర్డర్ వ్యవధిలో ఎల్టీఈ వేరియంట్పై వెయ్యి రూపాయల తగ్గింపును అందిస్తోంది. సెప్టెంబర్ 15 నుంచి కొనుగోలుకు లభ్యం. -
మంచె ఎక్కిన ‘ఆన్లైన్’ చదువులు
సాక్షి, ఆదిలాబాద్: పచ్చని పొలంలో చక్కని మంచె... దానిపై ఇద్దరమ్మాయిలు.. ఒకరిచేతిలో ల్యాప్టాప్. మరొకరి చేతిలో పుస్తకం. రైతన్న ఉండాల్సిన మంచెపై వీరికి పనేంటా అనేదేగా మీ డౌట్.. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం చదువులన్నీ ఆన్లైన్లోనే సాగుతున్నాయి కదా. పట్టణాల్లో అయితే నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉండదు. కానీ పల్లెల్లో అలా కాదు కదా.. సెల్ సిగ్నల్స్ కోసం చెట్లు, పుట్టలు పట్టుకుని పోవాల్సిందే. పొలంలో ఎత్తుగా ఉండే మంచె ఎక్కితే సిగ్నల్స్ బాగా వస్తున్నాయని వీరిద్దరూ ఇలా సెటిలై ‘సాక్షి’ కెమెరాకు చిక్కారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సాక్షి ఫోటో జర్నలిస్ట్ దశరథ్ రజువా ఈ దృశ్యాన్ని తన కెమరాలో బంధించారు. ఇక వీరిద్దరితో పాటు మరో విద్యార్థిని ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (చదవండి: ఆన్లైన్ చదువులు సాగేనా ! ) ( మంచెపైకి ఎక్కి చదువుకొంటున్న జరీన్ ) నిర్మల్ జిల్లాలోని రాజారా గ్రామంలో నివసిస్తున్న జరీన్ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ (టీఎంఆర్ఎస్) లో చదువుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఆన్లైన్ క్లాస్లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికి చాలా గ్రామాల్లో సిగ్నల్ ప్రాబ్లమ్. ఫోన్ మాట్లాడాలంటే డాబా పైకి చేరాల్సిందే. అలాంటిది ఇక ఆన్లైన్ క్లాస్లు వినాలంటే ఇదిగో ఇలా మంచెలు ఎక్కాలి. జరీన్ కూడా అదే పని చేస్తోంది. చదువు కోవడం కోసం రెండు కిలోమీటర్ల దూరంలోని పొలానికి వెళ్లి మంచె పైకి చేరి.. చేతిలో మొబైల్ పట్టుకుని ఆన్లైన్లో చేప్తోన్న పాఠాలను శ్రద్ధగా వింటూ నోట్స్ రాసుకుంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరలవుతోంది. -
ఫీజు వసూలు చేస్తేనే వేతనం
నవీన్కుమార్ పదేళ్లుగా ఎల్బీనగర్లోని ఓ కార్పొరేట్ స్కూల్లో మ్యాథ్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ అనంతరం విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు బోధిస్తున్నాడు. విద్యార్థుల నుంచి టర్మ్ఫీజు వసూలు చేస్తేనే వేతనం ఇస్తామని యాజమాన్యం టార్గెట్ పెట్టింది. దీంతో నవీన్కుమార్ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లమీద ఫోన్లు చేస్తున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో పైసా కూడా కట్టలేమని తల్లిదండ్రులు తేల్చి చెబుతున్నారు. ఫలితంగా నవీన్కుమార్కు 3 నెలలుగా యాజమాన్యం వేతనం ఇవ్వట్లేదు. సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లంతా ఇప్పుడిలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. మూడు నెలలుగా వేతనాలందక సతమతమవుతున్నారు. వాస్తవానికి ప్రతి నెలా తొలి వారంలో అందే వేతనం.. జూలై నుంచి అందట్లేదు. జూన్, జూలై, ఆగస్టు నెలల వేతనాల గురించి యాజమాన్యాలను అడిగితే.. నిర్దేశించిన ఫీజు వసూలు టార్గెట్ పూర్తి చేయనందున ఇవ్వబోమని చెబుతున్నాయి. ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు టీచర్లకు ఆన్లైన్ పాఠాల బోధనతో పాటు ఫీజు వసూలు బాధ్యతను కూడా అప్పగించాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తేనే నెలవారీ వేతనం చెల్లిస్తామని అంటున్నాయి. అయితే, కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఇప్పుడు ఫీజులు చెల్లించలేమని అంటున్నాయి. దీంతో టీచర్లకు వేతనాలందడం గగనమైపోయింది. పని పెరిగినా జీతం నిల్ రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు 22 వేల వరకు ఉన్నాయి. ఇందులో దాదాపు 2 లక్షల మంది బోధన సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సమాంతరంగా నడుస్తున్న ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. లాక్డౌన్, ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులతో పాఠశాలలు తెరుచుకోలేదు. దీంతో కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు జూన్ ఒకటి నుంచే పూర్తిస్థాయిలో ఆన్లైన్లో బోధనను ప్రారంభించాయి. ఈ ప్రక్రియలో ఉపాధ్యాయులే కీలకంగా వ్యవహరిస్తూ విద్యార్థులను సమన్వయç ³రుస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ఎక్కువగా పనిచేస్తున్నా.. వేతనానికి మాత్రం నోచుకోవట్లేదు. ప్రతి క్లాస్ టీచర్కు టార్గెట్ ప్రైవేట్ స్కూళ్లలో ప్రతి తరగతికి ఒక టీచర్ను బాధ్యుడిగా ఉంచుతూ తరగతులు నడిపిస్తారు. ఆ తరగతి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసే బాధ్యతను యాజమాన్యాలు ఈ క్లాస్ టీచర్లకే అప్పగించింది. జూన్ నుంచే తరగతులు ప్రారంభం కావడంతో మూడు నెలల ఫీజులు వసూలు చేయాలని, ఫస్ట్ టర్మ్ ఫీజులు వసూలు చేసిన వారికే నెలవారీ వేతనమిస్తామనే నిబంధన పెట్టాయి. ఈ టార్గెట్లో దాదాపు 70శాతం మంది టీచర్లు నూరు శాతం లక్ష్యాన్ని సాధించలేకపోయారు. ప్రస్తుతం బడులన్నీ మూసి ఉన్నాయి. ఈ నెలాఖరు వరకు తెరవరాదని కేంద్రం స్పష్టం చేసింది. ఆన్లైన్ క్లాసులు నిర్వహించుకోవచ్చని సూచించింది. ఈ క్రమంలో ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్చేస్తే.. స్కూళ్లు తెరిచాకే చెల్లిస్తామనే బదులొస్తోంది. లాక్డౌన్ కారణంగా నిరుద్యోగం పెరగడం, చిన్నాచితకా వ్యాపారాలు దెబ్బతినడంతో ఇప్పుడు ఫీజులు చెల్లించలేమని చాలామంది చెబుతున్నారు. దీంతో యాజమాన్యాలు టీచర్ల వేతనాలకు ఎసరు పెడుతున్నాయి. ‘కార్పొరేట్’లో ఇచ్చేది సగం జీతమే.. ఇక, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు లక్ష్యాన్ని పూర్తిచేస్తే సగం జీతంతోనే సరిపెడుతున్నారు. ఆన్లైన్ తరగతులు బోధిస్తూ, ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ సగం జీతం ఇవ్వడంపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల నుంచి పూర్తిస్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు.. సగం జీతం ఇవ్వడాన్ని బోధన, బోధనేతర సిబ్బంది తప్పుబడుతున్నారు. దీనిపై ఇప్పటికే కొందరు కార్మిక శాఖకు ఫిర్యాదు చేసినా.. స్పందన కరువైంది. -
రేపటి నుంచే ఆన్లైన్ పాఠాలు..
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ పద్ధతిలో పాఠాలు బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రేపటి నుంచి(మంగళవారం) తెలంగాణలో ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు స్కూల్ పాఠాలు బోధించనున్నారు. టీశాట్, ఆన్లైన్ ద్వారా ఈ విద్యాబోధన కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ టీ శాట్ టీవీ స్టూడియోలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా టీ శాట్ సీఈఓ శైలేష్ రెడ్డి సాక్షి టీవీతో మాట్లాడుతూ.. రేపటి నుంచి 10 తరగతిలోపు విద్యార్థులకు ఆన్లైన్ , టీవీల ద్వారా పాఠాలు బోధిస్తామని వెల్లడించారు. (ఫస్ట్ నుంచి ఆన్లైన్ పాఠాలు) టీశాట్ తీశాట్, తీశాట్ నిపుణ రెండు చానల్స్, వెబ్ సైట్, ఆన్లైన్ డిజిటల్, మొబైల్ యాప్ ద్వారా పాఠాలు చెప్పనున్నట్లు వెల్లడించారు.విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయడానికి పాఠాలను సాయంత్రం వేళల్లో తిరిగి ప్రసారం చేస్తామని తెలిపారు. ఎక్కడ ఇబ్బందులు అనేవి ఉండవని, పవర్ కట్ ప్రాంతాల్లో మళ్ళీ పాఠ్యంశాలను తిరిగి ప్రసారం చేస్తామని, ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రసారాలు ఉంటాయని శైలేష్ రెడ్డి వెల్లడించారు. -
ఆన్లైన్ చదువులు సాగేనా !
సాక్షి, ఆదిలాబాద్: కరోనా నేపథ్యంలో విద్యా వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఆన్లైన్ బోధనకు శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆన్లైన్ తరగతులు జరగనున్నాయి. ప్రభుత్వ నిర్ణయం మంచిదే అయినప్పటికీ ఎంతమందికి ఈ విద్య చేరువ అవుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. అక్షరాస్యతతో పాటు ఆర్థికంగా ఆదిలాబాద్ జిల్లా వెనుకంజలో ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని గూడెలు, తండాల్లో నివసించే చాలా మందికి స్మార్ట్ ఫోన్లు, టీవీలు లేకపోవడంతో వీరికి ఆన్లైన్ బోధన ఎలా సాగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే అందరికి ఆన్లైన్ విద్య అందే విధంగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో.. జిల్లాలో మొత్తం 1420 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 139 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. డీఈవో పరిధిలో 677 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 455 ప్రాథమిక పాఠశాలలు, 100 ప్రాథమికోన్నత పాఠశాలలు 102 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అదేవిధంగా 17 కేజీబీవీలు, 6 మోడల్ స్కూళ్లు, ఒక యూఆర్ఎస్ పాఠశాల ఉంది. దాదాపు 65వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఐటీడీఏ పరిధిలో 54 ఆశ్రమ పాఠశాలలు ఉండగా, 12వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువ ఉండడంతో ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు విద్యను చేరువ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఈనెల 27న విధుల్లో చేరిన ఉపాధ్యాయులు ఆన్లైన్ తరగతులకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భిన్న పరిస్థితి.. ఐటీడీఏ పరిధి ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదివే విద్యార్థుల పరిస్థితి భిన్నంగా ఉంది. జిల్లాలో 54 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. 12వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే 1397 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. అదేవిధంగా 3 నుంచి 4వేల మంది విద్యార్థుల ఇళ్లలో మాత్రమే టీవీలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలల్లో చదివే విద్యార్థుల నివాసాలు గూడాలు, తండాల్లో ఉండటం, వారి వద్ద అండ్రాయిడ్ఫోన్లు, టీవీలు లేకపోవడం సమస్యగా మారింది. కొన్ని గ్రామాలకు కనీసం విద్యుత్ సౌకర్యం లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో కొంతమంది విద్యార్థులకు ఆన్లైన్ బోధన పూర్తిస్థాయిలో అందకుండా పోతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఐటీడీఏ అధికారులు వారికోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అధికారుల సర్వే.. ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారులతో పాటు ఐటీడీఏ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు సర్వే చేపడుతున్నారు. డీఈవో పరిధిలోని పాఠశాలలకు సంబంధించి 3 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 43,371 మంది ఉన్నారు. టీవీ, డీటీహెచ్ కనెక్షన్లు ఉన్నవారు 13,321 మంది, టీవీతో పాటు కేబుల్ కనెక్షన్ ఉన్నవారు 20,734 మంది, ఆండ్రైడ్ ఫోన్లు ఉన్నవారు 906 మంది, కంప్యూటర్లు, ల్యాప్టాప్, ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నవారు 153 మంది ఉన్నారు. అయితే జిల్లాలో అండ్రాయిడ్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు లేనివారు 5,818 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఐటీడీఏ పరిధిలో సుమారు 4వేల విద్యార్థులకు పైగా ఇళ్లలో టీవీలు లేవని అధికారులు చెబుతున్నారు. అయితే టీవీలు ఉన్న విద్యార్థుల ఇంట్లో కాని, గ్రామ పంచాయతీ కార్యాలయంలో కాని వీరికి ఆన్లైన్ పాఠాలు వీక్షించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆన్లైన్ విద్య అందేలా చర్యలు ప్రతీ విద్యార్థికి ఆన్లైన్ బోధన అందే విధంగా చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో 5,818 మందికి టీవీలు, కేబుల్ కనెక్షన్, అండ్రాయిడ్ ఫోన్లు లేవు. వీరికి పక్కన ఉన్న విద్యార్థుల ఇంటి వద్ద ఆన్లైన్ తరగతులు అందేలా చూస్తాం. వీరిపై ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉంటుంది. అదేవిధంగా లోకల్ ఛానల్ ద్వారా లైవ్ పాఠాలను విషయ నిపుణులతో బోధించడం జరుగుతుంది. – రవీందర్రెడ్డి, డీఈవో సర్వే కొనసాగుతోంది జిల్లాలో 54 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఆన్లైన్ తరగతులకు సంబంధించి సర్వే కొనసాగుతోంది. దాదాపు 4వేల మంది విద్యార్థులకు టీవీలు లేవు. 1397 మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వీరికి మే నుంచే బోధన జరుగుతుంది. టీవీలు లేని వారికి ఇతర ఏర్పాట్లు చేస్తాం. – చందన, డీడీ, ఐటీడీఏ -
పేద విద్యార్థులకు ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: పేద విద్యార్థులకు ఆన్లైన్ పాఠాల ఫలాలు అందాలంటే వారికి వెంటనే ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు కొనివ్వాలని ప్రభు త్వాన్ని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. వచ్చే నెల 1 నుంచి రాష్ట్రంలో విద్యార్థులకు డిజిటల్ విధానంలో ఆన్లైన్ ద్వారా పాఠాలు బోధించాలని ప్రభుత్వం సిద్ధమవడం మంచి నిర్ణయమన్నారు. అయితే, మారుమూల, గిరిజన గ్రామాలు, పట్టణాల్లోని మురికివాడల్లో ఇప్పటికీ లక్షలాది ఇళ్లలో ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు లేవని గుర్తుచేశారు. అందువల్ల ఇలాంటి ఇళ్లలోని పిల్లలు ఆన్లైన్ పాఠాలు ఆన్లైన్ పాఠాలు వినే అవకాశం కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చొరవ తీసుకొని పేద పిల్లలకు ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే టీవీల ద్వారా పాఠ్యబోధనలో వివరణ కోరడానికి, విద్యార్థుల సందేహాలు తీర్చడానికి వీలుపడదన్నారు. దీనికితోడు కొన్ని ప్రాంతాలలో ‘‘టీశాట్’’ప్రసారాలు రావడం లేదని చెప్పారు. ‘ఒక ఇంట్లో ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉంటే పాఠాలు ఒకరే వింటారు. మిగతావారి సంగతి ఏమిట’ని ప్రశ్నించారు. దీంతో లక్షలాది విద్యార్థుల చదువు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల పేద విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండాలంటే వారికి వెంటనే ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు కొనివ్వాలని ఆ లేఖలో కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. -
ఒకటి నుంచి ఇంటర్ ఆన్లైన్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ ఒకటి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వీరితో పాటు, డిగ్రీ, పీజీ విద్యార్థులకు కూడా అదే రోజు నుంచి ఆన్లైన్ బోధన ప్రారంభం అవుతుందని ఆమె స్పష్టం చేశారు. అలాగే పాఠశాల విద్యార్థులకు కూడా డిజిటల్ బోధన ఉంటుందని తెలిపారు. దీని కోసం అధ్యాపకులు, ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి చేశామని తెలిపారు. అధ్యాపకులు ఈ నెల 27 నుంచే కళాశాలలకు వెళ్ళాలని ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 5న రాధాకృష్ణ జయంతి కార్యక్రమం, ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం కూడా ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా వుండగా వచ్చే నెల 1 నుంచి పాఠశాల విద్యార్థులకు కూడా ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. (చదవండి: ఓపెన్ విద్యార్థులందరూ పాస్) (చదవండి: ఫస్ట్ నుంచి ఆన్లైన్ పాఠాలు) -
సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: కరోనా ఉధృతి నేపథ్యంలో విద్యా సంస్థలు ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేవు. దీంతో తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ బోధన ద్వారా ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో వచ్చే నెల 1 నుంచి పాఠశాలల్లో 2020-2021 విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. విద్యార్థులకు ఆన్లైన్ లేదా టీవీ/టీశాట్ ద్వారా బోధన సదుపాయం కల్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. (24 నుంచే ఇంజనీరింగ్, ఫార్మసీ క్లాసులు ) మూడో తరగతి, ఆపై స్థాయి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ఈ తరగతులు ఉంటాయని పేర్కొంది. అయితే ఈ తరగతుల ప్రారంభానికి ముందే ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయులు స్కూళ్లకు రావాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. కాగా విద్యా సంవత్సరం ప్రారంభంపై మంత్రివర్గ ఉపసంఘం ఈ నెల 5న భేటీ జరిపిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో విద్యా సంవత్సర ప్రారంభం సహా అడ్మిషన్ల ప్రక్రియ, విద్యా బోధన ఎలా జరపాలి అన్న అంశాలపై ప్రభుత్వం చర్చించింది. (జెండా పండుగ : బోసిపోయిన చిన్నారులు) -
స్వప్నాలికి హరీష్ శంకర్ ప్రశంసలు..
పుణె : చదువుకోవాలన్న ఆసక్తిగల ఎంతో మంది ప్రతిభావంతులు వివిధ కారణాలతో తమ చదువుకు దూరమవుతున్నారు. అలా తమ చెల్లి భవిష్యత్తు కావొద్దని ఆలోచించిన సోదరులు తన విద్యను కొనసాగించడం కోసం ఓ వినూత్న ఆలోచన చేశారు. వివరాలు.. సింధుదుర్గ్ జిల్లా కంకవ్లి మండలంలోని డారిస్టే గ్రామానికి చెందిన స్వప్నాలి సుతార్ అనే యువతి ఇంటర్లో 98 శాతం మార్కులు సాధించింది. భవిష్యత్తులో వెటర్నరీ డాక్టర్ కావాలనుకున్న స్వప్నాలి ప్రస్తుతం ఎంబీబీఎస్కు సన్నద్దమవుతోంది. అయితే ఆమె నివసించే ప్రాంతం మారుమూల గ్రామం అయినందున ఇంటర్నెట్ సదుపాయం లేదు. దీంతో తనకు ప్రస్తుతం జరుగుతున్న ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేకపోతుంది. ఇది చూసి చలించి పోయిన యువతి సోదరులు ఇంటర్నెట్ సిగ్నల్స్ కోసం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ పైన ఒక షెడ్ నిర్మించారు. (డిజిటల్ అంతరాలు అధిగమించాలి) స్వప్నాలి తన కుటుంబం అండతో రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొండమీద ఉన్న షెడ్ వద్దకు వెళ్లి చదువుకుంటోంది. అలాగే ఆన్లైన్ క్లాస్లకు హాజరవుతోంది. ఇక దీనిని స్థానిక మీడియా ప్రచురించడంతో ఆమెకు సాయం చేసేందుకు అనేక మంది ముందుకు వచ్చారు. ఓ వ్యక్తి ఈ విషయాన్ని ట్విటర్లో షేర్ చేయగా టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ రీట్వీట్ చేశారు. అంతేగాక ఎమ్మెల్యే నితేష్ రాణే.. ఆమె హాస్టల్ ఫీజు రూ .50 వేలు చెల్లించాడు. దీనిపై స్పందించిన పలువురు ‘తన కలల వైపు ప్రయాణించేందుకు అడ్డంకులు ఆపలేవని స్వప్నాలి పట్టుదలతో నిరూపించింది. ఆమెను చూస్తుంటే..మరో రాజ్యాంగాన్ని రాస్తున్నట్లు కనిపిస్తుంది’ అంటూ యువతిని ప్రశంసిస్తున్నారు. (ఆన్లైన్ విద్య కష్టంగా ఉంది) 12 తరగతిలో 98% స్కోర్ చేసి సునీత ఇప్పుడు ఎంబిబిఎస్ కోసం సిద్ధమవుతోంది. కానీ ఆమె గ్రామానికి ఆన్లైన్ తరగతులకు ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. ఫోన్ లో కూడా ఇంటర్నెట్ సిగ్నల్ రాదు, కాబట్టి ఆమె సోదరులు ఆమె కోసం గ్రామానికి దగ్గరలో ఒక కొండపై ఒక షెడ్ నిర్మించారు 1/2 pic.twitter.com/4CtPQcUvJb — Naga Kishore (@nagakishore981) August 23, 2020 -
డిజిటల్ అంతరాలు అధిగమించాలి
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ విద్యాఫలితాలు అందుకోలేని విద్యార్థులకు చేరువయ్యేందుకు విద్యావేత్త లు, విద్యాసంస్థలు కృషి చేయాలని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సూచించారు. గాడ్జెట్లు, ఇంటర్నె ట్ సౌకర్యం లేని విద్యార్థులను చేరుకోవడంలో విఫలమైతే ‘డిజిటల్ అంతరాలకు’ దారి తీస్తుందని హెచ్చరించారు. ఈ సమస్యను అధిగమించి, అందరికీ డిజిటల్ బోధన సక్రమంగా అందేలా మౌలిక వసతులు మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. వరంగల్ జిల్లా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘ఇన్నోవేషన్స్ ఫర్ ది న్యూ నార్మల్’ వర్చువల్ సదస్సులో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆన్లైన్ విద్యా విధానంలో కీలకమైన ఇంటర్నెట్, స్మార్ట్ ఫో న్లు, ఇతర గాడ్జెట్లు మారుమూల, గిరిజన ప్రాంతా ల విద్యార్థులకు అందుబాటులో ఉండే అవకాశం లేదన్నారు. ఆన్లైన్ విద్యను అందుకునేందుకు మారుమూల ప్రాంత విద్యార్థులు చెట్లు, ఇళ్ల పైకప్పులపైకి ఎక్కుతున్న విషయాన్ని గవర్నర్ ఉదహరించారు. అందువల్ల ఆన్లైన్ విద్యాఫలితాలు అం దరికీ అందేలా మౌలిక వసతులు సమకూర్చాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే నూతన భారత్ నిర్మాణానికి వినూత్న ఆవిష్కరణల అవసరం ఉందని చెప్పారు. ఉద్యోగాల భర్తీలో నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, సదస్సు సమన్వయకర్త డాక్టర్ తిరువెంగళాచారి, ప్రొఫెసర్ జి.శ్రీనివాస్, ప్రొఫెసర్ గిరిజా శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
24 నుంచే ఇంజనీరింగ్, ఫార్మసీ క్లాసులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీ విద్యార్థుల తరగతుల నిర్వహణపై స్పష్టత వచ్చింది. ఈనెల 24 నుంచి ఆన్లైన్ పద్ధతిలో సీనియర్ విద్యార్థులకు క్లాసులు నిర్వహించాలని జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలను ఆదేశించింది. ఏఐసీటీఈ ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి సీనియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించాల్సి ఉన్నా.. రాష్ట్రంలో ఒక వారం ముందే తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇక దసరా, వేసవి సెలవులు, మిడ్ టర్మ్ పరీక్షలు, ప్రయోగ పరీక్షలతో పాటు మొదటి, రెండో సెమిస్టర్ పరీక్షల తేదీలను జేఎన్టీయూహెచ్ ఖరారు చేసింది. ఈమేరకు 2020–21 విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది. యూనివర్సిటీ పోర్టల్లో ఆ క్యాలెండర్ను అందుబాటులో ఉంచింది. రోజుకు 3 గంటల పాటు.. ఇంజనీరింగ్, ఫార్మసీ టెక్నికల్ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల (ఎంఫార్మసీ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ) కు సంబంధించి సీనియర్ విద్యార్థులకు రోజుకు 2 నుంచి 3 గంటల పాటు ఆన్లైన్ పద్ధతిలో తరగతులు నిర్వహించాలని జేఎన్టీయూ స్పష్టం చేసింది. కోవిడ్–19 నిబంధనలకు అనుగుణంగా ఈ తరగతులు నిర్వహించాలి. అయితే తరగతుల నిర్వహణ వెసులుబాటును బట్టి క్లాసులను 4 నుంచి 5 గంటల వరకు నిర్వహించుకోవచ్చని సూచించింది. ప్రతిరోజూ అటెండెన్స్... ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే విద్యార్థుల నుంచి ప్రతిరోజూ అటెండెన్స్ తీసుకోవాలని జేఎన్టీయూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థి ఆన్లైన్ క్లాసులకు తప్పకుండా హాజరు కావాల్సిందే. ఈ తరగతులను రికార్డ్ చేసి యూనివర్సిటీకి ప్రజెంటేషన్ ఇవ్వాలనే నిబంధన పెట్టింది. దీంతో తరగతులు నిర్వహించని కాలేజీలేంటో ఇట్టే తెలిసిపోతుంది. దీంతోపాటు రోజువారీ అటెండెన్స్ను కూడా యూనివర్సిటీకి అప్డేట్ చేయాలి. -
ఆన్లైన్ విద్య కష్టంగా ఉంది
న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విశ్వ విద్యాలయాలు, పాఠశాలలు ఇప్పుడప్పుడే తెరుచుకునే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే చాలా విద్యాసంస్థలు ఆన్లైన్లో విద్యార్థులకు చదువు చెబుతున్నాయి. అయితే ఆన్లైన్ విద్య అన్ని వర్గాల విద్యార్థులకు అందుబాటులో ఉండటం లేదు. దేశంలో దాదాపు 27 శాతం మంది విద్యార్థులు ఆన్లైన్ విద్యకు అవసరమైన స్మార్ట్ఫోన్లు, లాప్టాప్లు కలిగి లేరని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యూకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్( ఎన్సీఈఆర్టీ) సర్వే తేల్చింది. ఈ సర్వేలో మొత్తం 34 వేల మంది పాల్గొన్నారు. వీరిలో కేంద్రీయ విద్యాలయాలు, నవోద్యయ విద్యాలయాలు, సీబీఎస్ఈ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్కూల్ ప్రిన్సిపల్లు ఉన్నారు. ప్రతీ ముగ్గురిలో ఓ విద్యార్థి ఆన్లైన్ విద్య తమకు కష్టంగా ఉందన్నారని వెల్లడించారు. అంతేకాకుండా కరెంట్ కొరత కూడా ఆన్లైన్ విద్యకు ఆటంకంగా మారినట్లు 28 శాతం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ప్రభావవంతమైన విద్య కోసం సెల్ఫోన్లు, లాప్ట్యాప్ ఇతర వస్తువులను వాడటంలో విద్యార్థులకు అవగాహన లేకపోవటం, ఉపాధ్యాయులకు ఆన్లైన్ విద్యను భోదించే పద్దతులు తెలియకపోవటం కూడా ఇందుకు కారణంగా అభిప్రాయపడుతున్నారని సర్వే వెల్లడించింది. ( ఆన్లైన్ పాఠాలా.. జర జాగ్రత్త.. ) దాదాపు 36 శాతం మంది విద్యార్థులు అందుబాటులో ఉన్న పాఠ్యపుస్తకాలు, ఇతర పుస్తకాలను వాడుతున్నారని, ఉపాధ్యాయులకు, ప్రిన్సిపల్లు లాప్ట్యాప్లపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని పేర్కొంది. ఆన్లైన్ విద్య కోసం టీవీలు, రేడియోలను అతి తక్కువగా వాడుతున్నారని వెల్లడించింది. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న ఈ-పాఠ్య పుస్తకాలపై సరైన అవగాహన లేకపోవడం కూడా విద్యార్థులకు ఇబ్బందిగా మారిందని తెలిపింది. ఆన్లైన్ విద్యలోనూ ఫిజికల్ ఎడ్యుకేషన్ బోధన అవసరం ఉన్నట్లు చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఓ గంటపాటు ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఒత్తిడి, విసుగు దూరమవుతుందన్నారని సర్వే వెల్లడించింది. -
భవిష్యత్పై బెంగ.. ఆరోగ్యంపై శ్రద్ధ
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఇప్పుడు అధిక శాతం మందిని ‘భవిష్యత్ భయాలు’ వెంటాడుతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఇది అన్నిచోట్లా విభిన్న రంగాలు, వృత్తుల వారిపై ప్రభావం చూపుతోంది. వృత్తి నిపుణులు మొదలు విద్యార్థులు, సామాన్యుల్లోనూ కోవిడ్ కారణంగా తలెత్తిన అనిశ్చితి, కొనసాగుతున్న సందేహాస్పద పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి సుదీర్ఘకాలం కొనసాగనుండడంతో ఖర్చుల విషయంలో ప్రజలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. కరోనా, సుదీర్ఘ లాక్డౌన్, ఆపై దశలవారీ అన్లాక్ సమయంలో కోవిడ్ కేసుల ఉధృతి పెరగడం వంటివి దేశ ప్రజల జీవితాలను మునుపెన్నడూ లేని విధంగా ప్రభావితం చేశాయని, వినియోగదారుల మనస్తత్వం, కొనుగోళ్ల తీరులో మార్పులు చోటుచేసుకుంటున్నాయని ప్రొఫెషనల్ సర్వీసెస్ నెట్వర్క్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ ఎడ్యుకేషన్ వంటి వాటితో ప్రయోజనాలున్నా, కొన్ని ప్రతికూలతలూ ఉన్నాయని పట్టణ ప్రాంత ప్రజలు ఈ అధ్యయనంలో అభిప్రాయపడ్డారు. (చదవండి: విద్వేషంపై ఉదాసీనత) కరోనా ప్రభావంతో ఉద్యోగం, ఆఫీసు, షాపింగ్, ఫుడ్, రోజువారీ కార్యకలాపాలన్నింటా గణనీయ మార్పులు సంభవించడంతో అందుకు తగ్గట్టు అభిరుచులు, మనస్తత్వాలను మార్చుకునేందుకు, ఈ పరిస్థితికి అలవాటు పడేందుకు వివిధ రంగాల వృత్తి నిపుణులు మొదలు సామాన్యుల వరకు తంటాలు పడుతున్నట్టు సర్వేలో తేలింది. సర్వత్రా అనిశ్చితి కొనసాగుతుండడంతో ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్టు స్పష్టమైంది. -
ఐఐటీలు, ఐఐఎంలపై కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల నూతన విద్యా విధానాన్ని ఆవిష్కరించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉన్నత విద్యా రంగంలోనూ పెనుమార్పులకు శ్రీకారం చుడుతోంది. ఐఐటీలు, ఐఐఎంలను ఆన్లైన్ విద్యా వ్యవస్ధ కిందకు తీసుకురావాలని యోచిస్తోన్న ప్రభుత్వం ఈ దిశగా యూజీసీ, ఏఐసీటీఈ నుంచి సూచనలను కోరుతోంది. విద్యార్ధులకు భౌతికంగా క్లాసులను నిర్వహించే భారాన్ని విద్యా సంస్ధలకు తగ్గించే దిశగా మొత్తం విద్యా వ్యవస్ధను ఆన్లైన్ విద్యా వ్యవస్థగా మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. తొలుత ఉన్నత విద్యాసంస్ధలైన ఐఐటీలు, ఐఐఎంలను ఆన్లైన్ విద్యా వ్యవస్ధ కిందకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి బ్లూప్రింట్ను తయారుచేసేందుకు ఏఐసీటీఈ చీఫ్ అనిల్ సహస్రబుధే, యూజీసీ వైస్ చైర్మన్ డాక్టర్ ఎంపి పునియాల నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. భారత విద్యార్ధులకు నాణ్యతతో కూడిన ఆన్లైన్ విద్యను అందించేందుకు అవసరమైన డిజిటల్ వేదికను ఏర్పాటు చేసే గురుతర బాధ్యతలను ఈ ఇద్దరు దిగ్గజాలకు ప్రభుత్వం కట్టబెట్టింది. ఆన్లైన్ విద్యకు అవసరమైన పటిష్ట మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపైనా వీరు కసరత్తు సాగిస్తారు. మరోవైపు చైనా యాప్లకు దీటుగా యాప్స్ను తయారుచేయాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఇటీవల ఐఐటీలను కోరారు. చదవండి : ఇంట్లోనే కరోనా టెస్టులు -
ఆన్లైన్ పాఠాలా.. జర జాగ్రత్త..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో విద్యారంగం, బోధనా పద్ధతులు, విధానాలు సమూల మార్పులకు లోనవుతున్నాయి. చిన్న తరగతులు మొదలు పీజీ స్థాయి వరకు ఆన్లైన్ చదువు తప్పనిసరైంది. బోధన, పిల్లలు నేర్చుకునే పద్ధతుల్లో ఇదో అనూహ్యమైన మార్పు అని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆన్లైన్ చదువే అన్నింటికీ పరిష్కారం కాదని, ఇందులోనూ మంచి, చెడులున్నాయనే వారూ ఉన్నారు. విద్యాసంవత్సరం కోల్పోకుండా ఇదొక ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో పిల్లలకు ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వూ్యలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు, సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ దశరథరామారెడ్డి వివరించారిలా... సంప్రదాయ, ఆన్లైన్ బోధనకు వ్యత్యాసాలు ‘‘ఆన్లైన్ చదువులతో పిల్లలు ‘రోబో’ల్లాగా తయారవుతారని అనిపిస్తోంది. సంప్రదాయ బోధనకు, ఆన్లైన్ పాఠాలకు ఎన్నో వ్యత్యాసాలున్నాయి. విద్యాసంవత్సరం నష్టపోకుండా ‘ఆన్లైన్ ఎడ్యుకేషన్’తప్పనిసరి కానుంది. ఆన్లైన్ క్లాసుల కారణంగా పిల్లలు వెన్నెముక, కళ్ల సమస్యలతో ఆసుపత్రులకు రావడం మొదలైంది. ఏకబిగిన కొన్ని గంటలపాటు టీవీ స్క్రీన్ లేదా కంప్యూటర్ మానిటర్, మొబైల్ ఫోన్లో పాఠాలు చూడడం, వినడం, వ్యాయామం లేకపోవడం(ఇప్పటికే అలవాటు పడిన జంక్çఫుడ్కు తోడు)తో ఈ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఆన్లైన్ పాఠాలు వినేప్పుడు.. ఆన్లైన్ క్లాసులకు సరైన సీటింగ్, లైటింగ్ ఉండాలి. 90 డిగ్రీల కోణంలో కుషన్ లేని గట్టి కుర్చీని ఏర్పాటు చేసుకోవాలి. మెడ తిప్పడంలో ఇబ్బందుల్లేకుండా కంప్యూటర్ లేదా టీవీని పెట్టుకోవాలి. స్క్రీనుకు తగినంత దూరం పాటించాలి. ప్రతి 45 నిముషాల క్లాస్కు కనీసం 5 నిమిషాల విరామం ఇవ్వాలి. కళ్లను అప్పుడప్పుడు విప్పారించి, తరచూ రెప్ప ఆర్పుతూ చూడాలి. కళ్లు పొడారిపోకూడదు. చేతివేళ్లు బిగుసుకుపోకుండా ఉండేలా మధ్య, మధ్యలో మెటికలు విరవడం, స్ట్రెస్ బస్టర్ స్పాంజ్ బంతులను ఒత్తడం వంటివి చేయాలి. ఆన్లైన్ క్లాస్లకు సెల్ఫోన్లు వాడడం మంచిది కాదు. ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు కూడా ఈ క్లాస్లు పెట్టడం వల్ల ఎదుగుదల సమస్యలు తలెత్తుతాయి. ఆన్లైన్ చదువుతో టీచర్లు– విద్యార్థుల మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం దెబ్బతింటుంది. మొత్తంగా సంప్రదాయ విద్యాబోధనకు ఆన్లైన్ చదువులు ప్రత్యామ్నాయం కాలేవు’ సానుకూల అంశాలు... ► పిల్లలు సమయం వృథా చేయకుండాసద్వినియోగం అవుతుంది ► ఈ సాంకేతికతను ఎలా ఉపయోగిం చాలన్నది తెలియడం భవిష్యత్ అవసరాలకు ఉపయోగం ► విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలోతెలిసొచ్చి ధైర్యంగా ఉండడం అలవాటవుతుంది ► స్కూలు, కాలేజీలకు వెళ్లి వచ్చే సమయం, శ్రమ ఉండవు కాబట్టి ఆ ఖర్చు కూడా ఆదా ప్రతికూల అంశాలు... ► డిజిటల్ స్క్రీన్ టైం గణనీయంగా పెరిగి తలనొప్పి, కంటిచూపు సమస్యలు పెరిగే అవకాశం ► విద్యార్థులందరికీ ఆన్లైన్ క్లాస్ల సౌకర్యం అందుబాటులో ఉండకపోవడం ► శారీరక వ్యాయామం, శిక్షణ లేక పిల్లల్లో చురుకుదనం తగ్గే అవకాశం ► టీచర్లు పిల్లలను ప్రత్యక్షంగా పర్యవేక్షించడం తక్కువ -
పాఠం చెప్పడమే పని..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీచర్లకే పని.. వారే ఎన్నికల విధుల్లో అత్యధిక శాతం మంది ఉంటారు.. అవే కాదు స్కూళ్లో మధ్యాహ్న భోజనం నిర్వహణ పనులు కూడా టీచర్లకే. రాష్ట్రంలో గత అనేక ఏళ్లుగా ఇదే విధానం కొనసాగుతోంది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన కొత్త విద్యా విధానం మాత్రం టీచర్లు అవేవీ చేయకూడదని చెబుతోంది. టీచర్లకు ఆ పనులను అసలే చెప్పవద్దని స్పష్టం చేస్తోంది. అవే కాదు బోధనతో సంబంధం లేని ప్రభుత్వ పనులైనా సరే టీచర్లకు చెప్పవద్దని, పాలనా పరమైన వాటినీ అప్పగించవద్దని స్పష్టం చేస్తున్నా.. ఆచరణలో వాటి అమలే అసలు సమస్యగా మారనుంది. 2010 అమల్లోకి వచ్చిన విద్యా హక్కు చట్టం కూడా బోధనతో సంబంధంలేని పనులను టీచర్లకు అప్పగించవద్దని చెప్పినా.. గత పదేళ్లలో అమలుకు నోచుకున్న దాఖలాలు లేవు. డిప్యుటేషన్ పేరుతో బోధనేతర పనుల్లో ఇప్పటికీ డీఈవో కార్యాలయాల్లో వందలమంది టీచర్లు కొనసాగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. చివరకు విషయం కోర్టు వరకు వెళ్లాకే ఎమ్మెల్యేలు, మంత్రులకు పీఏలుగా ఉన్న వారిని తొలగించింది. ఇక మధ్యాహ్న భోజనం నిర్వహణ పనులు, ఆ లెక్కల బాధ్యతలు తమకు వద్దని టీచర్లు మొత్తుకుంటున్నా రాష్ట్రంలోని 28 వేల జిల్లా పరిషత్తు, ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్లే వాటిని చూడాల్సి వస్తోంది. బోధనకు తోడు అదనపు పనుల వల్ల బోధనకు ఆటంకం కలుగుతోందని టీచర్లు మొత్తుకుంటున్నా వారితోనే ఆ పనులను విద్యాశాఖ చేయిస్తోంది. లెక్కల్లో తేడాలు వచ్చి మెమోలు అందుకున్న టీచర్లు ఉన్నారు. కొత్త విద్యావిధానం నేపథ్యం లో క్షేత్రస్థాయిలో ఆ నిబంధన ఎంతమేరకు విద్యాశాఖ అమలు చేస్తుందనేది తేలాల్సి ఉంది. కేంద్రం ఆశించినట్లుగా నాణ్యమైన విద్యా బోధన ఎంతమేరకు సాధ్యం అవుతుందన్నది కాలమే తేల్చనుంది. నిరంతరం వృత్తి నైపుణ్యాల అభివృద్ధి ప్రధానం.. టీచర్లు తమ వృత్తి పరమైన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు నేర్చుకోవాలని కూడా కొత్త విద్యా విధానం పేర్కొంది. ఇందుకోసం కంటిన్యుయస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ (సీపీడీ) అమలు చేయాలంది. స్థానిక, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సబ్జెక్టు వర్క్షాప్ల్లో పాల్గొనాలని పేర్కొంది. ఆన్లైన్లో అందుబాటులో ఉండే డెవలప్మెంట్ మాడ్యూల్స్ ప్రకారం నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాలని అందులో టీచర్లు తమ అనుభవాలను పంచుకోవాలని, తద్వారా కొత్త విషయాలను నేర్చుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రతీ టీచర్ ఏటా కనీసంగా 50 గంటల సీపీడీ కార్యక్రమాల్లో పాల్గొనాలని వెల్లడించింది. బాగా పనిచేసే టీచర్లకు ప్రోత్సాహకాలు టీచర్ల కెరీర్ మేనేజ్మెంట్లో భాగంగా కీలక సంస్కరణలు చేసింది. బాగా పనిచేసే టీచర్ల పనికి గుర్తింపు ఇవ్వాలంది. అలాంటి వారికి పదోన్నతులివ్వడం, వేతనాలను పెంచడం వంటి చర్యలు చేపట్టాలంది. మిగతా టీచర్లు కూడా బాగా పని చేసేందకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. పదోన్నతులు, వేతన విధానాన్ని అభివృద్ధి చేయాలని స్పష్టం చేసింది. టీచర్ల పని విధానాన్ని అంచనా వేసేందుకు పక్కాగా ఉండే విధానాన్ని రూపొందించాలని వెల్లడించింది. సమీక్ష, విద్యార్థుల అభిప్రాయాలు, హాజరు, కమిట్మెంట్, సీపీడీలో పాల్గొన్న గంటలు, ఇతర సేవ కార్యక్రమాలను కూడా ఇందులో పొందుపరచాలని వివరించింది. బాగా పనిచేసే టీచర్లకు అకడమిక్ లీడర్షిప్ ఇచ్చేందుకు వారికి తగిన శిక్షణ ఇవ్వాలంది. -
ఫీజు వసూలుపై ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల ఇష్టారాజ్యం
దిల్సుఖ్నగర్కు చెందిన మాలతి సమీపంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తోంది. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుండటంతో ఇంటి వద్ద నుంచే బోధన సాగిస్తోంది. కానీ జూలై 27వ తేదీ వచ్చినా ఈనెల వేతనం తన ఖాతాలో జమ కాలేదు. అంతేకాదు, జూన్ నెలలో ఇవ్వా ల్సిన వేతనం కూడా ఇప్పటికీ అందలేదు. కారణం స్కూల్ యాజమాన్యం తనకు నిర్దేశించిన ఫీజు వసూలు లక్ష్యాన్ని సాధించకపోవడమే. దీంతో రెండు నెలలుగా జీతమే లేదు. సాక్షి, హైదరాబాద్: సాధారణంగా టీచర్లకుండే లక్ష్యాలు అత్యుత్తమ బోధన, మెరుగైన ఫలితాలు. కానీ ప్రస్తుతం కార్పొరేట్ స్కూళ్లలో ఉపాధ్యాయుల లక్ష్యాలు మారిపోయాయి. ఆన్లైన్లో ఎలాగోలా బోధనా కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీచర్లకు విద్యార్థుల నుంచి నెలవారీ ఫీజు డబ్బులను వసూలు చేయడాన్ని యాజమాన్యాలు లక్ష్యాలుగా నిర్దేశించాయి. దీంతో ఫీజులు వసూలు చేసిన టీచర్లకు సగం వేతనాలు ఇస్తుండగా... వసూలు చేయని వారికి మొండిచేతులు చూపిస్తున్నారు. దాదాపు అన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో ఉద్యోగుల పరిస్థితి ఇదే విధంగా ఉంది. రాష్ట్రంలో 20 వేలకు పైగా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలున్నాయి. ఇందులో 65 శాతంపైగా స్కూళ్లు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. రోజుకు రెండు లేదా మూడు సబ్జెక్టుల చొప్పున మాత్రమే తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో బోధనా సిబ్బందికి ప్రతిరోజూ తరగతులకు హాజరు కావాల్సిన అవసరం లేదు. వారంలో రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఆన్లైన్ తరగతుల ద్వారా బోధనా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరికి సగం వేతనం చొప్పున ఇవ్వనున్నట్లు యాజమాన్యాలు తొలుత ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం ఆ మేరకు సైతం చెల్లింపులు చేయడం లేదు. ప్రతి క్లాస్ టీచర్కు ఆ తరగతిలోని విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజును వసూలు చేయాలని నిబంధన పెట్టారు. దీంతో ఆన్లైన్ తరగతి పూర్తయిన తర్వాత ఆయా విద్యార్థుల తల్లిదండ్రులకు వ్యక్తిగతంగా ఫోన్లు చేసి ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. లాక్డౌన్ అనంతర పరిణామాలతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. వ్యాపార రంగం సైతం క్షీణించడంతో ఆదాయం పతనమైంది. ఈ క్రమంలో ఫీజులు చెల్లించలేమని తల్లిదండ్రులు చెబుతున్నప్పటికీ టీచర్లు వారికి ఫోన్లు చేసి కొంత మొత్తమైనా చెల్లించాలని ప్రాధేయపడుతున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు గొడవలకు సైతం దారితీస్తుండడం గమనార్హం. వేతన వెతలు... ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది వేతనాల కోసం అల్లాడుతున్నారు. మార్చి నెల నుంచి లాక్డౌన్ మొదలైంది. దీంతో అప్పట్నుంచి వేతన చెల్లింపులు గందరగోళంగా మారిపోయాయి. ఫీజులు వసూలు కావడం లేదనే సాకుతో యాజమాన్యాలు చేతులెత్తేశాయి. కొన్ని సంస్థలు మాత్రం ఏప్రిల్ నెలలో సగం వేతనంతో సరిపెట్టగా మెజార్టీ విద్యా సంస్థలు బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు ఇవ్వలేదు. మే నెలలో 90 శాతం సంస్థలు జీతాలకు మంగళం పాడేశాయి. జూన్, జూలై నుంచి ఆన్లైన్ తరగతులు బోధిస్తున్నప్పటికీ వేతనాలు ఇచ్చేందుకు సంస్థలు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ఫీజు వసూళ్ల బాధ్యతలు టీచర్లపైకి నెట్టేశాయి. నిర్దేశించిన లక్ష్యాలు సాధిస్తేనే వేతనాలిస్తామని చెప్పడంతో వేలాది మంది ఉద్యోగులు వేతనాలందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ఆన్లైన్ చదువు కోసం ఆవు అమ్మకం
పాలంపూర్: తమ ఇద్దరు పిల్లల ఆన్లైన్ పాఠాల కోసం, కుటుంబానికున్న ఏకైక జీవనాధారమైన ఆవుని రూ.6,000కు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది జ్వాలాముఖిలోని గుమ్మర్ గ్రామానికి చెందిన కుల్దీప్ కుమార్కు. కుల్దీప్ పిల్లలు అన్నూ నాల్గవ తరగతి, డిప్పు రెండవ తరగతి చదువుతున్నారు. మార్చి నుంచి లాక్డౌన్ ప్రకటించడంతో పాఠశాలలు మూత పడ్డాయి. ఆన్లైన్ తరగతులు ప్రారంభం అయ్యాయి. చదువు కొనసాగించాలంటే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాల్సిందేనని కుల్దీప్పై స్కూల్ యాజమాన్యం ఒత్తిడి తెచ్చింది. ఎవ్వరూ రుణం ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో విసిగిపోయిన కుల్దీప్ తన బిడ్డల చదువుకోసం తన ఏకైక జీవనాధారమైన ఆవుని ఆరువేల రూపాయలకు అమ్ముకొని, పిల్లలకు స్మార్ట్ ఫోన్ కొనిపెట్టారు. విషయం తెల్సి జ్వాలాముఖి ఎమ్మెల్యే రమేష్ దావ్లా విస్మయం వ్యక్తంచేశారు. తక్షణమే కుల్దీప్కి ఆర్థిక సాయం చేయాల్ సిందిగా స్థానిక బీడీఓ, తహసీల్దార్లను ఆదేశించారు.