
సాఫ్ట్వేర్ కంపెనీలపై‘ర్యాన్సమ్వేర్’ వల!
సైబర్ దాడులకు దిగిన పాకిస్తాన్ హ్యాకర్లు
- ఈ-మెయిళ్లు, యాడ్ల ద్వారా వైరస్లు
- కంప్యూటర్లలోని డేటాను లాక్ చేస్తూ సొమ్ము కోసం డిమాండ్లు
- ఇటీవలే ఓ సంస్థ కంప్యూటర్లు హ్యాక్
- రూ. 420 కోట్లు ఇవ్వాలన్న హ్యాకర్లు!
- రంగంలోకి దిగిన సైబరాబాద్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్
సాక్షి, హైదరాబాద్: భారత్ సర్జికల్ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్కు చెందిన సైబర్ నేరగాళ్లు (హ్యాకర్లు) భారతదేశంలోని సంస్థలపై సైబర్ దాడులకు దిగుతున్నారు. ‘ర్యాన్సమ్ వేర్’గా పిలిచే వైరస్లను ప్రముఖ సంస్థల కంప్యూటర్లలో చొప్పించి, లాక్ చేస్తున్నారు. తిరిగి అన్లాక్ చేసేం దుకు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సైబరాబాద్లోని ఓ ప్రముఖ సంస్థపై ఇటీవల ‘ర్యాన్సమ్ ఎటాక్’ చేసిన పాకిస్తాన్ నేరగాళ్లు రూ.420 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఇటీవల ఈ తరహా దాడులు పెరిగిపోవడంతో సైబరాబాద్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ రంగంలోకి దిగింది.
ఈ-మెయిళ్లు, ప్రకటనల ద్వారా..
పాకిస్తాన్ హ్యాకర్లు ‘సైబర్ ఎక్స్టార్షన్, బ్రౌజర్ లాకర్, రాన్సమ్వేర్’ వంటి వైరస్లను వినియోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసిన సంస్థల్లోని కంప్యూటర్లకు ఈ-మెయిల్స్, యాడ్స్ రూపంలో ఈ వైరస్లను పంపిస్తున్నారు. వాటిలోని లింక్లపై క్లిక్ చేస్తే చాలు వైరస్ కంప్యూటర్లోకి చొరబడుతుంది. వెంటనే కంప్యూటర్లోని డేటా మొత్తాన్ని ‘ఎన్క్రిప్ట్’ చేసి, లాక్ చేస్తుంది. మానిటర్పై ‘మీ కంప్యూటర్ను లాక్ చేశాం’ అనే సందేశం కనిపిస్తుంది. డేటాను అన్లాక్ చేసే పాస్వర్డ్ తమ వద్ద ఉందని చెబుతూ, అన్లాక్ చేయాలంటే భారీగా సొమ్ము ఇవ్వాలంటూ సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేస్తున్నా రు. ఈ కంప్యూటర్ల స్క్రీన్పై నిర్దేశిత గడువుకు సంబంధిం చిన కౌంట్డౌన్ సమయం కూడా కనిపిస్తుంది. సొమ్ము చెల్లించకపోతే తాము పాస్వర్డ్ను నిర్వీర్యం చేస్తామని, దాంతో డేటాను శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుందని హ్యాక ర్లు బెదిరిస్తున్నారు. ఎవరైనా ఆ టైమర్ను, వైరస్ ప్రోగ్రామ్ను మార్చాలని ప్రయత్నించినా, నగదు డిపాజిట్ చేసిన ట్లు తప్పుడు వివరాలు పొందుపరిచినా కౌంట్డౌన్ సమ యం మరింత తగ్గిపోవడం ఈ వైరస్కు ఉన్న మరో లక్షణం.
నాన్-సెమెట్రిక్ విధానంలో..
కంప్యూటర్లోని డేటా ఎన్క్రిప్షన్ (లాక్ చేయడం)లో సెమెట్రిక్, నాన్ సెమెట్రిక్ అని రెండు రకాలు ఉంటాయి. సెమెట్రిక్ విధానంలో లాకింగ్, అన్లాకింగ్కు ఉపకరించే పబ్లిక్, ప్రైవేట్ ‘కీ’లు ఒకటే ఉంటాయి. నాన్-సెమెట్రిక్ విధానంలో మాత్రం వేర్వేరుగా ఉంటాయి. ర్యాన్సమ్వేర్ పంపే హ్యాకర్లు ఈ విధానంలోనే కంప్యూటర్లను లాక్ చేస్తారు. అంటే వారి వద్ద ఉన్న ప్రైవేట్ ‘కీ’ తెలిస్తే తప్ప డేటాను అన్లాక్ చేయడం సాధ్యం కాదు. ఫార్మాట్ చేస్తే అందులో డేటా మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. దీంతో కంపెనీలు విలువైన, అత్యవసరమైన డేటాను పోగొట్టుకోలేక.. మనీప్యాక్, ఓచర్స్, ఈ-మనీ, బిట్కాయిన్ రూపాల్లో హ్యాకర్లు డిమాండ్ చేసిన సొమ్మును చెల్లించాల్సి వస్తోంది. హ్యాకర్లు సొమ్ము అందాక వైరస్ ప్రోగ్రామ్ ద్వారానే అన్లాక్ ‘కీ’ పంపుతున్నారు. దాన్ని వినియోగిస్తే కంప్యూటర్ యథాప్రకారం పనిచేసి, అందులోని డేటా భద్రంగా అందుబాటులోకి వస్తుంది.
ప్రధానంగా సాఫ్ట్వేర్ కంపెనీలపై..
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు ర్యాన్సమ్వేర్ బారినపడినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ కంప్యూటర్లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.420 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్చువల్ కరెన్సీ అయిన ‘బిట్ కాయిన్స్’ రూపంలో ఆ సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ దాడులను ఎలా అడ్డుకోవాలో అర్థంకాక సైబర్ నిపుణులు తల పట్టుకుంటున్నారు. ఇటీవల ర్యాన్సమ్వేర్తో పాటు బ్రౌజర్ లాకర్ వైరస్ ముప్పు పెరిగింది. దానితో కంప్యూటర్ లాక్ కావడంతో పాటు.. ఇలా లాక్ చేసినది అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ, అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్పోల్లుగా స్క్రీన్పై కనిపిస్తుంది. అన్ని దేశాల్లో నేరంగా పరిగణించే చైల్డ్ పోర్న్ వెబ్సైట్లు చూశారనో, మరో ఉల్లంఘనగానో పేర్కొంటూ కంప్యూటర్ను లాక్ చేసినట్లు హ్యాకర్లు పేర్కొంటారు. ఈ వైరస్ల్లోని మరో లక్షణం ఏమిటంటే.. అవి వెబ్క్యామ్ను ఆపరేట్ చేయడంతో పాటు కంప్యూటర్ ఐపీ అడ్రస్, లొకేషన్లను మానిటర్పై డిస్ప్లే చేస్తాయి. అంతేకాదు ‘మీ కదకలను గమనిస్తున్నాం. తదుపరి చర్యలు చేపట్టకూడదంటే చేసిన తప్పుకు జరిమానా చెల్లించండి’ అనే డిమాండ్ కనిపిస్తుంది. దీంతో భయపడిపోయే వినియోగదారులు సొమ్ము చెల్లిస్తున్నారు.
ఫోన్లకూ ఈ వైరస్ ముప్పు
‘‘కేవలం కంప్యూటర్లు మాత్రమే కాదు స్మార్ట్ఫోన్లకూ ర్యాన్సమ్ వేర్ ముప్పు ఉంది. ఫోన్లలో ఉన్న డేటాను సైతం సైబర్ నేరగాళ్లు లాక్ చేస్తున్నారు. ఎక్కువగా వ్యక్తిగత ఫోన్లు, కంప్యూటర్లతో పాటు చిన్న చిన్న కంపెనీలు మాత్రమే దీని బారినపడుతున్నాయి. కార్పొరేట్ సంస్థలు పటిష్టమైన ఫైర్వాల్స్ (రక్షణ సాఫ్ట్వేర్లు) ఏర్పాటు చేసుకోవడంతో వీటి బారినపడట్లేదు. గత పదేళ్లలో భారతదేశంలో 2,400 రెట్లు సైబర్ నేరాలు పెరిగాయి. ఇటీవల ఓ సంస్థను ఎటాక్ చేసిన పాకిస్థాన్ సైబర్ నేరగాళ్లు రూ.420 కోట్లు డిమాండ్ చేశారన్న విషయం మా దృష్టికి రాలేదు. ఆ స్థాయి కార్పొరేట్ సంస్థకు అలా జరుగుతుందని మేం భావించట్లేదు..’’
- ఎ.భరణి, సైబరాబాద్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి
అనుమానాస్పద మెయిల్స్, యాడ్స్ ఓపెన్ చేయొద్దు
ర్యాన్సమ్వేర్, బ్రౌజర్ లాకర్ వైరస్లు ప్రపంచవ్యాప్తంగా పొంచి ఉన్న ముప్పేనని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అపరిచిత ఐడీల నుంచి వచ్చే ఈమెయిల్స్, అనుమానాస్పద యాడ్స్ కు దూరంగా ఉండటం, కంప్యూటర్లో మంచి యాంటీ వైరస్ ఏర్పాటు చేసుకోవడమే వీటిని పరిష్కారమని పేర్కొంటున్నారు. బ్రౌజర్ లాకర్ కొన్ని యాంటీ వైరస్లకు లొంగినా.. ర్యాన్సమ్వేర్కు మాత్రం పరిష్కారం లేదని అంటున్నారు. హ్యాకర్లు ఏ రెండు కంప్యూటర్లకూ ఒకే ప్రైవేట్ ‘కీ’ ఏర్పాటు చేయరని, దాంతో బాధితులంతా సొమ్ము చెల్లించాల్సి వస్తోందని అంటున్నారు. ఈ హ్యాకర్లు బోగస్ సర్వర్లు, ఐపీ అడ్రస్లను వినియోగిస్తారని, అందువల్ల పట్టుకోవడం కష్టసాధ్యమని పేర్కొంటున్నారు.