
'ఒక పథకాన్ని మూడుసార్లు ప్రారంభిస్తారా?'
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టిసీమ పథకాన్ని చంద్రబాబు ముచ్చటగా మూడోసారి ప్రారంభించారన్నారు. సీఎం స్థాయి వ్యక్తి ఒక పథకాన్ని ఇన్నిసార్లు ఎక్కడైనా ప్రారంభించారా అని వాసిరెడ్డి పద్మ సూటిగా ప్రశ్నించారు. ఓ వైపు ముఖ్యమంత్రి మోటర్లు ఆన్ చేయగానే మరోవైపు ఇంజినీర్లు వెంటనే స్విచ్ ఆఫ్ చేశారని అన్నారు.
60 కిలోమీటర్లు దాటితే నీళ్లు వెళ్లే పరిస్థితి లేదని, అందుకే ఇంజినీర్లు వెంటనే ఆపేశారని ఆమె పేర్కొన్నారు. ఇదే చిత్తశుద్ధి పోలవరంపై చూపితే ప్రాజెక్ట్ సగం పూర్తయ్యేదని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వలేని సీఎం రాయలసీమకు ఎక్కడ నుంచి ఇస్తారన్నారు. ప్రజలను నమ్మించడం కోసం చేస్తున్న ఆర్భాటాల వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు పోతోందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు.