
ట్రంప్తో తొలి డిన్నర్ మన ప్రధానిదే
వాషింగ్టన్: ప్రధాని నరేంద్రమోదీ మరో ఖ్యాతిని గడించబోతున్నారు. అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్తో కలిసి డిన్నర్ చేయనున్నారు. ఇలా ట్రంప్తో డిన్నర్ చేయనున్న తొలి విదేశీ నేతగా ప్రధాని మోదీ పేరు గడించనున్నారు. దాదాపు ఐదు గంటలపాటు ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ అవనున్నారు. ఒక నేతతో ఇంత పెద్ద మొత్తం సమయం భేటీ అవడం కూడా ట్రంప్కు ఇదే తొలిసారి. ఈ ఐదుగంటలు కూడా ఎంతో సానుకూలంగా, స్నేహభావంతో ఉంటాయని, ఒకే కుటుంబాన్ని తలపిస్తాయని వైట్హౌస్ మీడియా వర్గాలు చెబుతున్నాయి.
దౌత్యపరమైన విషయాలతోపాటు ద్వైపాక్షిక సంబంధాల విషయంలో చర్చ జరగనుంది. సోమవారం మధ్యాహ్నం తర్వాత 3.30గంటల ప్రాంతంలో వీరిద్దరి మధ్య భేటీ జరగనుంది. అందులో భాగంగా కొద్ది సేపు మీడియా ముందు ఫొటో సెషన్, తర్వాత ఇరు దేశాల సంబంధాలపై ట్రంప్, మోదీ మధ్య చర్చలు అనంతరం కాక్టెయిల్ రిసెప్షన్ ఉంటుంది. ఈ సమావేశం తమ శ్వేత సౌదం చాలా ప్రాముఖ్యమైనదిగా భావిస్తోందని, రెడ్ కార్పెట్తో స్వాగతం సిద్ధం చేయాలని ఆదేశాలు ఉన్నట్లు తెలిపారు. ఇదిలాఉండగా.. ఇప్పటికే విదేశీ పర్యటనకు ప్రధాని నరేంద్రమోదీ బయల్దేరారు. తొలుత పోర్చుగల్లో పర్యటించనున్నారు. అనంతరం అమెరికాలో రెండు రోజులు పర్యటించి ట్రంప్తోపాటు వివిధ సంస్థల సీఈవోలతో భేటీ అవనున్నారు. ఆ తర్వాత నెదర్లాండ్ పర్యటనకు వెళతారు.