
భారతీయ కళాఖండాలు స్వాధీనం
న్యూయార్క్: అమెరికాలో క్రిస్టీస్ హౌస్ వేలం వేయాలనుకున్న వెయ్యేళ్ల క్రితం నాటి రెండు భారతీయ కళాఖండాలను విచారణాధికారులు స్వాధీనం చేసుకున్నారు. ‘లహరి కలెక్షన్: ప్రాచీన, మధ్యయుగపు భారతీయ, హిమాలయ కళ’ పేరిట ప్రాచీన కళాఖండాలను వచ్చే వారం వేలం వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు కళాఖండాలను అక్రమంగా న్యూయార్క్కు తరలించినట్లు అధికారులు తెలిపారు.
10వ శతాబ్దానికి చెందిన తొలి జైన తీర్థంకరుడి విగ్రహం విలువ సుమారు లక్షా 50 వేల డాలర్లు (సుమారు రూ. కోటి) ఉంటుంది. ఎనిమిదో శతాబ్దానికి చెందిన రేవంత విగ్రహం విలువ సుమారు మూడు లక్షల డాలర్లు (సుమారు రూ. రెండు కోట్లు) ఉంటుంది. భారత్లో స్మగ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి నుంచి ఈ పురాతన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. చోరీకి గురైన వస్తువులను వేలం వేయబోమని క్రిస్టీస్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.