
దుబాయ్: యూఏఈలో మృతిచెందిన ఓ భారతీయుడి మృతదేహం స్వదేశం చేరడానికి 4 నెలలు పట్టింది. యూసఫ్ఖాన్ రషీద్ఖాన్ (50) యూఏఈలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గత ఏప్రిల్ 12న మద్యం మత్తులో అజ్మన్స్ అల్ రషిదియా ప్రాంతంలోని ఓల్డ్ వర్కర్స్ వసతిగృహంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వద్ద సందర్శన వీసా తప్ప ఎలాంటి ధ్రువపత్రాలూ లభించకపోవడంతో కుటుంబ సభ్యులను గుర్తించడం కష్టంగా మారింది. వీసాలో చిరునామా మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీ అని ఉండటంతో అధికారులు ఈ విషయం ఉజ్జయినీలోని ప్రతి మసీద్కు తెలియజేశారు.
అయినా కుటుంబ సభ్యులెవరూ స్పందించలేదు. తుదిగా దౌత్య కార్యాలయంలో పాస్పోర్ట్ వివరాలు వెలికితీయగా అతనిది ఉజ్జయినీకి 49 కి.మీ. దూరంలో ఉన్న నగ్డ గ్రామం అని తేలింది. స్థానిక పోలీసుల ద్వారా ఖాన్ మృతి సంగతి కుటుంబానికి తెలిసింది. అయినా వారు శవాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో ఉన్నతాధికారులు కంగుతిన్నారు. వారు భయంకరమైన పేదరికంలో మగ్గుతుండటమే దీనికి కారణం. చివరికి అధికారులే ఖర్చులు భరిస్తామనడంతో ఆగస్టు 24న మృతదేహం దుబాయ్ నుంచి ఉజ్జయినీ చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment