
దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత అమెరికాలో మళ్లీ మరణ శిక్షలను అమలు చేయనున్నారు.
వాషింగ్టన్: దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత అమెరికాలో మళ్లీ మరణ శిక్షలను అమలు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హీనమైన నేరాలకు పాల్పడిన ఐదుగురికి ఇప్పటికే మరణశిక్షను విధించి, ఎప్పుడు అమలుచేయాలనే తేదీలను కూడా ఖరారు చేసింది.
అమెరికా అటార్నీ జనరల్ విలియం బార్ ఓ ప్రకటన చేస్తూ, ‘నీచమైన నేరాలకు పాల్పడిన వారికి మరణ శిక్ష విధించాలని న్యాయ శాఖ ఎప్పటి నుంచో గత ప్రభుత్వాలను కూడా కోరుతూ వచ్చింది. చట్టాలు సరిగ్గా అమలయ్యేలా న్యాయ విభాగం చూస్తుంది. బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయం చేకూర్చాల్సిన బాధ్యత ఆ విభాగంపై ఉంది’ అని తెలిపారు. మరణ శిక్షలను అమలు చేయాలంటూ జైళ్ల శాఖను విలియం ఇప్పటికే ఆదేశించారు. అమెరికాలో మరణశిక్ష అంటే మన దగ్గరలా ఉరిశిక్ష విధించకుండా, విషపూరిత మందులు ఇచ్చి నేరస్తులు చనిపోయేలా చేస్తారు.