ప్రేమలోకంలో విహారించే ‘మనసును మాయ సేయకే’
ఆ ఇద్దరి చూపులు కలిశాయి. మనసులు కూడా కలిశాయి. ఇంకేముంది? ప్రేమలోకంలో విహరించడం మొదలుపెట్టారు. ఆ ప్రేమను మూడు ముళ్ల బంధంతో సఫలం చేసుకోవాలనుకున్నారు. కానీ, కథ వేరే మలుపు తిరిగింది. ఆ మలుపు ఎలాంటిది? దానివల్ల ఆ యువతీయువకుల జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘మనసును మాయ సేయకే’.
ప్రిన్స్, రిచా పనయ్, దిశా పాండే, సేతు ముఖ్య తారలుగా ఫుల్హౌస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సురేష్ పి. కుమార్ దర్శకుడు. జైసన్ పులికొట్టిల్, విన్స్ మాంగడన్ నిర్మాతలు. మణికాంత్ కద్రి స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 14న విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘పగ, ప్రతీకారాల నేపథ్యంలో సాగే కథ ఇది. ఇప్పటివరకు ప్రిన్స్ నటించిన అన్ని సినిమాల్లోకల్లా ఈ చిత్రానికి శాటిలైట్ హక్కులను మంచి ఆఫర్ రావడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: సవ్యసాచి శ్రీనివాస్, కెమెరా: వెంకట్ హనుమ.