
ఆరేళ్ల తర్వాత మేకప్ వేసుకోనున్న నటి
తిరువనంతపురం: వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద తిరిగి మరోసారి తెరంగేట్రం చేయనున్నారు. దాదాపుగా ఆరేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఓ మలయాళ చిత్రం ద్వారా తిరిగి మేకప్ వేసుకోబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకోసం ఆమె కేరళ రాజధానికి కూడా చేరుకున్నారు. దర్శకుడు ఎంఏ నిషాద్ తీయబోతున్న కిన్నారు(మంచి) అనే మలయాళ చిత్రంలో జయప్రద ప్రస్తుతం నటించబోతున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలయాళ చిత్రం ద్వారా తిరిగి నటనను ప్రారంభించడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. తాను నటించబోతున్న ఈ సినిమాలో సామాజిక సమస్య అయిన నీటి సమస్య, రైతుల సమస్యలు ఇతివృత్తంగా ఉండబోతుందని చెప్పారు. 2011లో ఆమె మలయాళంలో ప్రణయం అనే చిత్రం చేశారు. ఆ చిత్రంలో ఆమెతోపాటు మోహన్లాల్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా నటించారు.