
అనుమానాస్పద స్థితిలో నటి మృతి
మలయాళ సినీ, టీవీ నటి రేఖా మోహన్ అనుమానస్పద స్థితిలో మరణించారు.
త్రివేండ్రం: మలయాళ సినీ, టీవీ నటి రేఖా మోహన్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. శనివారం కేరళలో త్రిసూర్లోని రేఖ అపార్ట్మెంట్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. రేఖ మృతికి కారణమేంటన్నది తెలియరాలేదు. పోలీసులు ఈ కోణంలో విచారణ చేస్తున్నారు. ఆమె పలు మలయాళీ సినిమాలు, టీవీ సీరియల్లో నటించింది.
ఇంటికి దూరంగా ఉన్న రేఖ భర్త గత రెండు రోజులుగా ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. ఆయనకు సందేహం వచ్చి త్రిసూర్ పోలీసుల సాయం కోరాడు. పోలీసులు రేఖ అపార్ట్మెంట్కు వెళ్లి తలుపులు పగలకొట్టి చూడగా ఆమె మృతదేహం కనిపించింది. అపార్ట్మెంట్ లోపల లాక్ చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం త్రిసూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తమిళ సినీ పరిశ్రమలోనూ రెండు రోజుల క్రితం ఇలాగే విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నటి సబర్ణ చైన్నైలోని తన ఫ్లాట్లో మరణించినట్టు పోలీసులు కనుగొన్నారు. మూడు రోజుల క్రితం చనిపోయినట్టు తెలిపారు. ఆమె లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు.