
రామ్గోపాల్ వర్మకు నోటీసులు
బెంగళూరు: భూ కబ్జాలు, బెదిరించి డబ్బు వసూలు చేయడం తదితర అభియోగాలతో కర్ణాటకలోని ధార్వాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న యూసఫ్ బచ్చాఖాన్.. సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మకు నోటీసులు పంపారు. గతంలో డాన్గా ముద్రపడి ప్రస్తుతం జయ కర్ణాటక సంఘం అధ్యక్షుడిగా ఉన్న ముత్తప్ప రై జీవిత కథను ఆధారంగా చేసుకొని రామ్గోపాల్ వర్మ ‘రై’ పేరుతో సినిమా తీస్తున్నారు. గతంలో ముత్తప్ప రైకు స్నేహితుడిగా ఉన్న యూసఫ్ బచ్చాఖాన్ తన లాయర్ ద్వారా వర్మకు నోటీసులు పంపించారు.
‘రై సినిమాలో నా పాత్రను విలన్ (నెగిటివ్ రోల్)గా చిత్రీకరిస్తున్నావు. మొత్తం కథను నాకు వినిపించిన తర్వాతే సినిమా తీయాల’ని అందులో పేర్కొన్నాడు. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా బెదిరించినట్లు సమాచారం. కాగా, ఈ విషయమై రామ్గోపాల్ వర్మ న్యాయస్థానం ద్వారానే సమాధానమివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.