ఏప్రిల్ నుంచి పండగే...
సినిమా సినిమాకూ జోరు పెంచుకుంటూ పోతున్నారు రామ్. తన గత చిత్రం ‘మసాలా’ ఫలితం ఎలా ఉన్నా, నటుడిగా రామ్కి మాత్రం ఆ సినిమా మంచి గుర్తింపునే తెచ్చింది. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన ఓ చిత్రంలో నటించనున్నారు. పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మించనున్న ఈ చిత్రానికి ‘పండగ చేస్కో’ అనే టైటిల్ని ఖరారు చేశారు. ‘కందిరీగ’ తర్వాత రామ్, హన్సిక కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.
ఈ సినిమా కోసం అమెరికాలో భారీ సెట్ నిర్మించనుండటం మరో విశేషం. ఏప్రిల్లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి గోపిచంద్ మలినేని మాట్లాడుతూ -‘‘‘బలుపు’ తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది. రామ్ శారీరక భాషకు తగ్గట్టుగా పాత్ర చిత్రణ ఉంటుంది. ఈ పూర్తి స్థాయి మాస్ చిత్రానికి ‘పండగ చేస్కో’ అనే టైటిల్ సరిగ్గా యాప్ట్. ‘సింహా’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన యునెటైడ్ మూవీస్ బేనర్లో సినిమా చేయడం ఆనందంగా ఉంది’’అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్.