సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : వింటే సునీత పాటే వినాలి... ఔను.. 20కే జనరేషన్లో ఆమె గానం సుమధురమైనదే అనాలి. తేనె తరంగాల వంటి స్వర మధురిమలతో... ఎంత విన్నా తనివితీరని తీయని గాత్రంతో.. భక్తిపాటలైనా.. మూడీ సాంగ్స్ అయినా.. కిర్రెక్కించే హుషారైన జాలీ సాంగ్స్ అయినా.. ఏ పాటైనా సరే.. గుర్తుకు వచ్చే ఒకే ఒక్క పేరు సునీత. టీవీ రియాల్టీ షోలతో ఎంతోమంది ప్రతిభావంతులైన గాయనీమణులు పుట్టుకొస్తున్నా.. సునీత ప్రస్థానం, వర్తమాన సంగీత సామ్రాజ్యంలో ఆమె స్థానం ప్రత్యేకం.. ఆదివారం సాయంత్రం విశాఖ నగరంలోని ఏయూ సీఆర్రెడ్డి కాన్వొకేషన్ హాల్లో జరిగే ‘‘మెలోడియస్ మూమెంట్స్ విత్ సునీత’’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అచ్చమైన ఆంధ్రావని గాయని ఉపద్రష్ట సునీత ముచ్చట్లు ఆమె మాటల్లోనే...
ఎనిమిదేళ్ల వయస్సులోనే..
మాది గుంటూరు.. తల్లిదండ్రులు సుమతి, ఉపద్రష్ట నరసింహారావు. చిరుప్రాయం నుంచే కర్ణాటక సంగీతంలోనూ, లలిత సంగీతంలోనూ శిక్షణ పొందాను. ఐదేళ్ల వయస్సులోనే త్యాగరాయ సంగీత ఆరాధనోత్సవాలకు హాజరయ్యా ను. సరిగ్గా ఎనిమిదో ఏటే ఢిల్లీలోని జానపద పోటీల్లో పాల్గొని స్కాలర్షిప్ సాధించాను..
అనుకోకుండానే సినీరంగంలోకి...
నిజంగా ఇది నా అదృష్టమే అనుకోవాలి... భగవంతుని ఆశీస్సులతో పెద్దగా ప్రయత్నం లేకుండానే సినిమాల్లో పాట పాడే అవకాశం వచ్చింది. దూరదర్శన్లో ప్రసారమైన నా పాట విని...1995లో గులాబీ సినిమాలో హీరోయిన్ సోలో సాంగ్ పాడేందుకు అవకాశం ఇచ్చారు. అప్పట్లో సినీరంగంలో ఎవ్వరూ నాకు తెలియదు... కేవలం నా పాట విని.. సంగీత దర్శకుడు శశిప్రీతం నన్ను పిలిపించి పాట పాడించారు. అప్పుడు నిండా 15 ఏళ్లు కూడా లేవు.. ఇప్పుడంటే టీవీల్లో సంగీత ఆధారిత రియాల్టీ షోలతో వర్థమాన గాయకులు, ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు కానీ అప్పుడా పరిస్థితి లేదు.
తొలిపాటతోనే సంచలనం
‘ఈవేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో’... అని గులాబీ సినిమాలో నేను పాడిన తొలిపాట ఎంత సంచలనమైందో మీకు తెలిసిందే. సంగీతప్రియులను ఆ పాట స్వర తరంగాలలో ఓలలాడించేసింది. ఒక్కపాటతోనే నేను సడెన్ సెలబ్రిటీ అయ్యానంటే అతిశయోక్తి కాదు.. ఆ పాటతోనే అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక నేను వెనుతిరిగి చూసే అవకాశం లేకుండా పోయింది.
అన్నీ నాకిష్టమైన పాటలే..
పాటల్లో నచ్చినవి.. బాగా నచ్చినవి... నచ్చనవి.. అలాంటి క్యాటగిరీ నాకు లేదు.. నేను పాడిన అన్ని పాటలూ నాకు ఇష్టమే.. కవులు, రచయితలు ఎంతో కష్టపడి పాట రాస్తే.. సంగీత దర్శకులు ఎంతో శ్రమించి అందుకు అనుగుణమైన సంగీతం అందిస్తే.. గాయకులు అంతే కష్టంతో ఇష్టంతో పాట పాడతారు.. అందుకని నేను పాడిన ప్రతి పాటా నాకు ఇష్టమే. తమిళ్లో 15, కన్నడలో 40 పాటలు పాడాను.. అవి కూడా నాకిష్టమే..
డబ్బింగ్ ఆర్టిస్ట్గా రికార్డ్
వాస్తవానికి గాయనీమణులు గాత్రదానం చేసిన సందర్భాలు గతంలో చాలా తక్కువ. ఎస్పీ శైలజ గారు కూడా పాటలు పాడుతూ డబ్బింగ్ చెప్పేవారు. అయితే గాయనిగా 3వేల పాటల మైలు రాయి దాటిన నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా గౌతమీ పుత్ర శాతకర్ణితో 750 సినిమాలు పూర్తి చేశాను. ఆ సినిమాలో శ్రేయ పాత్రకు గాత్రదానం చేశాను. సౌందర్య మొదలు వర్ధమాన హీరోయిన్లలో దాదాపు అందరికీ డబ్బింగ్ చెప్పాను..
భావోద్వేగానికి గురయ్యాను
డబ్బింగ్ ఆర్టిస్ట్లు ఒకింత కృతకంగానే డైలాగులు చెప్పేస్తారని చాలామంది అనుకుంటారు. కానీ డబ్బింగ్ చాలా కష్టం. పాత్రను ఆకళింపు చేసుకుని.. ఫీల్ అయి గొంతు విప్పాలి. శ్రీరామరాజ్యంలో సీతమ్మ పాత్రధారి నయనతారకు డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను భావోద్వేగానికి లోనయ్యాను. ఆ పాత్రకు డబ్బింగ్ ఓ విధంగా ఛాలెంజ్ అని చెప్పాలి.. అదేవిదంగా శ్రీరామదాసులో స్నేహ పాత్రకు, నువ్వునేను.. జయం.. సినిమాల్లో హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎమోషన్కు లోనయ్యాను.
సింగర్స్ పెరిగినా ఎవరి పాట వాళ్లదే..
సింగర్స్ పెరుగుతున్నారు.. కానీ ఎవరి పాట వాళ్లదే.. ఎవరి టాలెంట్ వాళ్లదే.. అందరూ చాలా గొప్పగా ప్రూవ్ చేసుకుంటున్నారు.. యంగ్ జనరేషన్ టాలెంట్ ఎప్పుడూ బాగుంటుంది.. నేను ఈ మధ్యకాలంలో జాతీయస్థాయి అవార్డులు గెలుచుకున్న మహానటిలో పాట పాడాను.. అదేవిధంగా కధానాయకుడు చిత్రంలో మంచిపాటలు పాడే అవకాశం వచ్చింది.. ఒకప్పుడు ఎన్ని పాటలు పాడేవారో లెక్కలు వేసుకునే వారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఎన్ని మంచిపాటలు పాడారన్నదే చూస్తున్నారు.. ఆ విధంగా నేను చాలా అదృష్టవంతురాలినే అని చెప్పాలి
సుశీలంటే చాలా ఇష్టం
ఎస్ జానకి గారు, సుశీల గారు.. చిత్రగారు.. ముగ్గురూ ముగ్గురే.. వారి నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను. కానీ ఆ ముగ్గురిలో సుశీలగారంటే విపరీతమైన అభిమానం.. ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారంటే ఇష్టముండని, స్ఫూర్తి పొందని గాయకులు ఎవరుంటారు చెప్పండి.. బాలూ గారితో పాటు మహమ్మద్ రఫీ పాటలంటే చాలా ఇష్టం. అబ్బాయి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. నాకు ఇద్దరు పిల్లలు..మా బాబు ఆకాష్ డిగ్రీ పూర్తి కాగానే ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది కుమార్తె ప్లస్ టూ చదువుకుంటోంది. ఈమధ్యనే నా కూతురు సవ్యసాచి సినిమాలో ఓ పాట పాడింది.
సినిమా పాట కష్టం
చాలామంది సినిమా పాటలు పాడటం ఈజీ అనుకుంటారు. వాస్తవానికి ప్లే బ్యాక్ సింగింగ్ చాలా కష్టమైనది.. సిట్యుయేషన్, ఎక్స్ప్రెషన్ స్ఫురించేలా ప్రతిబింబించేలా గాత్రం బయటకు రావాలి.. భావం అర్థం చేసుకుని పాట పాడాలి.. అందుకే సినిమా పాట అవుట్పుట్ విషయంలో సింగర్ మీదే ఎక్కువ బాధ్యత ఉంటుంది.
వైజాగ్ అద్భుతం
అందమైన విశాఖ నగరం ఎవరి మనస్సుకైనా హత్తుకుంటుంది. మా అమ్మ తరఫు బంధువులు ఇక్కడే ఉన్నారు. చిన్నప్పుడు వస్తుండే దాన్ని. దూరదర్శన్లో సూపర్హిట్ అయిన రుతురాగాలు సీరియల్ టైటిల్ సాంగ్ ఇక్కడే రికార్డ్ చేశాం. ఆ పాటకు జాతీయస్థాయి అవార్డు కూడా వచ్చింది. వైజాగ్ బీచ్ వ్యూ.. సిటీ లుక్.. సూపర్బ్..
19దేశాల్లో లైవ్ షోలు
ప్రపంచ వ్యాప్తంగా 19 దేశాల్లో పర్యటించి లైవ్ షోల్లో పాటలు పాడే అవకాశం వచ్చింది. అమెరికా, యూకే, సింగపూర్... ఇలా తెలుగు ప్రజలు, భారతీయులున్న 19దేశాల్లో పాటలు పాడాను. 1999లో తొలిసారి నంది అవార్డు అందుకున్న నేను.. 2002 నుంచి 2006 వరకు వరుసగా, అటు తర్వాత 2010 నుంచి 2012 వరకు వరుసగా నంది అవార్డులు పొందాను. 2011లో రాష్ట్ర ప్రభుత్వం బహూకరించిన లతా మంగేష్కర్ అవార్డు స్వీకరించాను.
Comments
Please login to add a commentAdd a comment