అటు యమదొంగ... ఇటు మగధీర... దర్శకధీరుడి మల్టీస్టారర్‌! | SSR’s Next Shocking And Sensational Project? | Sakshi
Sakshi News home page

అటు యమదొంగ... ఇటు మగధీర... దర్శకధీరుడి మల్టీస్టారర్‌!

Published Mon, Nov 20 2017 12:15 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

SSR’s Next Shocking And Sensational Project? - Sakshi - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి సరదాగా కన్ను కొట్టారు... ఓ పక్క ఎన్టీఆర్, మరోపక్క రామ్‌చరణ్‌ను పెట్టుకుని మధ్యలో ఆయన కూర్చున్న ఫొటోను ట్వీట్‌ చేస్తూ! కన్ను కొట్టడానికి ముందు కొంత ఖాళీ స్పేస్‌ (డాష్‌)ను వదిలారు... ‘ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌’ (మీ ఊహకు వదిలేస్తున్నా) అన్నట్టు! ఇంతకీ, ఈ ముగ్గురూ ఎప్పుడు కలిశారు? అంటే... శనివారం రాత్రి! బహుశా... వీకెండ్‌ పార్టీ ఏమో! ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. మొన్న ‘జై లవకుశ’ హిటై్టనప్పుడు ఎన్టీఆర్‌ని ఇంటికి పిలిచిన చరణ్‌ స్పెషల్‌ పార్టీ ఇచ్చారు.

ఈ ఇద్దరితోనూ రాజమౌళి సినిమాలు తీశారు. ఎన్టీఆర్‌–రాజమౌళి కలయికలో ‘స్టూడెంట్‌ నెం1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’ వంటి హిట్స్‌ వస్తే... చరణ్‌–రాజమౌళి కలయికలో ‘మగధీర’ వచ్చింది. ఇప్పుడీ ముగ్గురూ కలిసిన ఈ ఫొటోను రాజమౌళి ట్వీట్‌ చేయడానికి కారణం ఏంటి? అని ఆరా తీయగా... ఓ మల్టీస్టారర్‌ ప్లాన్‌ చేస్తున్నారట! రాజమౌళి కన్ను కొట్టడానికి కారణమదేనని ఫిల్మ్‌నగర్‌ టాక్‌! మొన్నామధ్య రాజమౌళి ‘రంగస్థలం’ సెట్స్‌కి వెళ్లడానికి కారణం కూడా కొత్త సినిమా కథా చర్చలేనట! ‘బాహుబలి–2’ తర్వాత ఏ సినిమా చేసేదీ ఇప్పటివరకూ రాజమౌళి వెల్లడించలేదు.

కానీ, కథపై కసరత్తులు చేస్తున్నారట. అదో మల్టీస్టారర్‌ కథనీ, అందులో ఎన్టీఆర్‌–చరణ్‌ హీరోలుగా నటించడానికి అంగీకరించారనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌! డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. ప్రస్తుతం ‘రంగస్థలం’లో నటిస్తున్న చరణ్, ఆ సినిమా తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించబోయే సినిమా, చరణ్‌–బోయపాటి సినిమా ఇంచుమించు ఒకేసారి పూర్తవుతాయి. అప్పుడు ఎన్టీఆర్, చరణ్‌ హీరోలుగా రాజమౌళి తీయబోయే మల్టీస్టారర్‌ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్‌!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement