కౌన్‌ బనేగా డిఐజీ | The film with the theme of the DIG Rupa of Karnataka | Sakshi
Sakshi News home page

కౌన్‌ బనేగా డిఐజీ

Published Wed, Aug 30 2017 1:42 AM | Last Updated on Sun, Sep 17 2017 6:06 PM

కౌన్‌ బనేగా డిఐజీ

కౌన్‌ బనేగా డిఐజీ

దక్షిణాదిలో అగ్ర కథానాయికలుగా రాణిస్తున్న తారలిద్దరే అని చెప్పవచ్చు.

తమిళసినిమా: దక్షిణాదిలో అగ్ర కథానాయికలుగా రాణిస్తున్న తారలిద్దరే అని చెప్పవచ్చు. అందులో ఒకరు నయనతార, మరొకరు అనుష్క అని గంటాపథంగా చెప్పవచ్చు. చిత్ర కథను తమ భుజాలపై వేసుకుని విజయతీరానికి చేర్చగల సత్తా ఉన్న భామలు వీరు. నయనతార మాయ చిత్రంతో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ నాయకిగా మారినా, అనుష్క మాత్రం అంతకు ముందే అరుంధతి చిత్రంలో అద్భుత నటనను ప్రదర్శించి ఆ చిత్ర సంచలన విజయానికి ప్రధాన కారణంగా నిలిచారు. ఈ తరువాత ఈ ఇద్దరు బ్యూటీస్‌కు హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాల అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం నయనతార చేతిలో ఆ తరహా చిత్రాలు నాలుగైదు ఉన్నాయి. అనుష్క భాగమతి అనే చిత్రంలో నటిస్తున్నారు. కాగా ఇప్పుడీ ఇద్దరిలో కౌన్‌ బనేగా డీఐజీ అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.


విషయం ఏమిటంటే  యథార్థ సంఘటనల ఇతివృత్తాలతో చిత్రాలు చేసే దర్శకుడిగా పేరొందిన వ్యక్తి ఏఎంఆర్‌.రమేశ్‌. ఆ మధ్య రాజీవ్‌గాంధీ హత్య నేపథ్యంలో చిత్రం, బాబ్రీమసీద్‌ ఇతి వృత్తంతో మరో చిత్రం తెరకెక్కించి సంచలన దర్శకుడిగా వాసికెక్కారు. తాజాగా కర్ణాటక డీఐజీ రూప ఇతివృత్తంతో చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. డీఐజీ రూప అనగానే అన్నాడీఎంకే పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తున్న శశికళ ఖైదీ జీవితం గుర్తుకు వస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రస్తుతం కర్ణాటకలో జైలు జీవితాన్ని గడుపుతున్న శశికళ ఆక్కడి జైల్లో  ఆడంబర జీవితాన్ని అనుభవిస్తున్న విషయాన్ని డీఐజీ రూప ఆధారాలు సహా బట్టబయలు చేసి పెద్ద కలకలానికే దారి తీసిన విషయం తెలిసిందే.

 జైలు అధికారి సత్యనారాయణ రూ.2 కోట్ల లంచం తీసుకుని శశికళకు వీఐపీ వసతులు కల్పించారని ఆరోపణలు చేశారు. ఫలితంగా రూప బదిలీకి గురయ్యారు. అయితే డీఐజీ రూప విధి నిర్వహణకు, కర్తవ్య దక్షణకు ఈ సంఘటన ఒక్కటే కాదు అంతకు ముందు కూడా చాలా అంశాలు ఉన్నాయి. రాష్ట్రపతి నుంచి మెడల్‌ను అందుకున్న రూప జీవిత సంఘటనలతో దర్శకుడు ఏఎంఆర్‌.రమేశ్‌ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు డీఐజీ రూప కూడా అనుమతి ఇచ్చారట.ఇక ఆమె పాత్రలో నటించే నటీమణులు ఎవరన్న అంశంలో ఆయన కళ్ల ముందు కదలాడిన తారలు నయనతార, అనుష్కలేనట. వారిలో ఒకరిని ఈ చిత్రంలో నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు దర్శకుడు రమేశ్‌ వర్గాల సమాచారం. మరి నయనతార, అనుష్కలలో కౌన్‌ బనేగా డీఐజీ అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement