
ప్రాణభయం వల్లే హెచ్చార్సీకి వెళ్లా
ఈ రెండు రోజుల్లో జరిగిన గొడవల వల్ల తనకు ప్రాణహాని ఉందన్న భయంతోనే తాను మానవ హక్కుల కమిషన్ వద్దకు వెళ్లినట్లు దివంగత సంగీత దర్శకుడు చక్రి భార్య శ్రావణి చెప్పారు. ఇన్నాళ్లుగా తమ కుటుంబాన్ని పట్టించుకోనివాళ్లు ఇప్పుడు ఆయన మరణించిన తర్వాత వచ్చి తనను వేధిస్తున్నారని, అందుకే తనకు ప్రాణభయం ఉందని భావించి మానవ హక్కుల సంఘాన్ని కలిశానని తెలిపారు.
భవిష్యత్తులో ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనన్న భయం వల్ల మాత్రమే తాను హెచ్చార్సీ వద్దకు వెళ్లానని శ్రావణి మీడియాకు చెప్పారు. చక్రి ఆత్మకు శాంతి కలగాలని, ఇప్పట్లో ఎలాంటి వివాదాలకు వెళ్లదలచుకోలేదని అన్నారు. సమస్యలు ఉన్నమాట వాస్తవమేనని, అయితే వాటిని చర్చలతో పరిష్కరించుకుంటామని తెలిపారు. దయచేసి సమస్యను పెద్దది చేయొద్దని ఆమె మీడియాను కోరారు.