
వక్కంతం వంశీ కథతో...
పూరీ జగన్నాథ్ మంచి దర్శకుడే కాదు, మంచి రచయిత కూడా. ఆయన కథలు, మాటలు యువతరాన్ని కట్టిపడేస్తాయి. కానీ తొలిసారి ఆయన వేరే రచయిత స్క్రిప్ట్తో సినిమా చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వివరాల్లోకెళ్తే- ‘ఎన్టీఆర్-పూరీ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో పదేళ్ల క్రితం ‘ఆంధ్రా వాలా’ వచ్చింది. ఇంత విరామం తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇది. అయితే... ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలోనే పూరీ కాస్త విభిన్నంగా వెళ్తున్నట్లు తెలిసింది. తొలిసారి వేరే రచయిత స్క్రిప్ట్తో ఆయన ఈ సినిమా చేయనున్నారట. ఆ రచయిత ఎవరో కాదు... వక్కంతం వంశీ. ఈ సినిమాకు ‘కుమ్మేస్తా’ అనే టైటిల్ ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ఆయితే... ఈ సినిమాకు అది టైటిల్ కానేకాదని చిత్రం యూనిట్ సభ్యులు చెబుతున్నారు. బండ్ల గణేశ్ ఈ చిత్రానికి నిర్మాత. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.