ముంబై: పోలీసుల నిర్లక్ష్యం ఓ బాలుడి ఉసురు తీసింది. క్రైం బ్రాంచ్ అధికారులు సీజ్ చేసిన ఒక స్పోర్ట్స్ యుటిలిటీ (ఎస్యూవీ) లో వాహనంలోకి పొరపాటున వెళ్లిన కుర్బాన్ రహీం ఖాన్ (5) ఊపిరాడక చనిపోవడం ఆందోళన రేపింది. ముంబైలోని ఘట్కోపోర లో శనివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక మసీదు దగ్గరున్న పార్క్ లో ఆడుకుంటున్న ఖాన్ సాయంత్రం ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు కారులో పడి ఉన్న బాలుడిని కనుగొన్నారు. హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే బాలుడు చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. ఆడుకుంటూ.. వాహనంలోకి ఎక్కినపుడు ఆటోమేటిగ్గా డోర్ లార్ అయి వుంటుందని , ఊపిరి ఆడక చనిపోయి వుంటాడని పోలీసులు అనుమానించారు. ఊపిరి ఆడక చనిపోయినట్టు పోస్ట్ మార్టం నివేదికలో తేలిందని తెలిపారు. ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు పోలీసులు సంఘటనపై విచారణకు చేపట్టారు.
కాగా ఒక బిల్డర్ చెందిన మురికివాడల పునరావాస ప్రాజెక్టు స్థలంలో ముంబై క్రైం బ్రాంచ్ యూనిట్ సీజ్ చేసిన సుమారు 17 కార్లను అక్కడ ఉంచింది. స్టేషన్ లో జాగా లేకపోవడంతో దామోదర్ పార్క ఆవరణలో పార్క్ చేసినట్టు సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. పిల్లలు ఆడుకునే ప్రదేశంలో ఇలా వాహనాలను నిర్లక్ష్యంగా వదిలివేయడంపై స్థానికంగా విమర్శలు చెలరేగాయి.